హవానా:క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా క్యూబాని ఆక్రమించాలని యత్నిస్తుందన్నారు. అమెరికా తన దేశంపై అమలు చేస్తున్న ఆంక్షలను 'జాతి విమర్శక విధానం' (జెనోసైడల్ పాలసీ)గా ఆయన అభివర్ణించారు. అమెరికా విధిస్తున్న ఒత్తిడి విధానాలను క్యూబా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో క్యూబాపై మరింత ఒత్తిడిని పెంచారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వాణిజ్య దిగ్బంధంతో పాటు, చమురు సరఫరాను నిలిపివేయడంతో పాటు కఠినమైన ఆంక్షలను విధించారు. దీనికి తోడు, క్యూబాకు ప్రధాన మిత్రదేశంగా ఉన్న వెనిజులాలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుని నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూలదోయడం క్యూబాను మరింత సంక్షోభంలోకి నెట్టింది.
ఈ కఠినమైన చర్యల నేపథ్యంలో క్యూబా అధ్యక్షుడు అమెరికాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా ఆంక్షల కారణంగా క్యూబాలో పర్యాటకం దెబ్బతిన్నదని, విదేశీ కంపెనీలు వెనుదిరిగాయని ,విదేశీ మారకద్రవ్య ప్రవాహం పూర్తిగా నిలిచిపోయిందన్నారు. రష్యా, చైనాలకు మిత్రదేశంగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి భద్రతా ముప్పుగా మారుతోందని, పౌరుల హక్కులను ఉల్లంఘిస్తోందని అమెరికా వాదిస్తున్నప్పటికీ, తమ దేశం ఎవరికీ ముప్పు కాదని ఆయన స్పష్టం చేశారు.
క్యూబా విప్లవానికి నాంది పలికిన 1953 నాటి మొన్కాడా బ్యారెక్స్పై దాడికి గుర్తుగా జరిగిన 73వ వార్షికోత్సవ వేడుకల్లో డియాజ్-కానెల్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్యూబా ప్రజలలో అశాంతిని సృష్టించి, తద్వారా తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దురుద్దేశంతోనే అమెరికా ఈ యుద్ధ తంత్రాలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. దేశంలో తీవ్రమైన ఇంధన సంక్షోభం, కరెంటు కోతలు నెలకొన్న ఈ తరుణంలో ప్రజలంతా ఐక్యంగా ఉండి, తగిన ఆర్థిక, సామాజిక మార్పులతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటామని ఆయన పిలుపునిచ్చారు.


