మంగళవారం ఢిల్లీలోని కృషిభవన్లో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
దానిని ఎవరూ లాక్కోలేరు: ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించి చట్టబద్ధంగా ముందుకెళ్తాం
కోర్టుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం
కబ్జాదారులే కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు
దురుద్దేశపూర్వకంగా ధిక్కరణ కేసులు వేస్తున్నారు
డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు
మేము తీసుకువచ్చిన అతి పెద్ద సంస్కరణ హైడ్రా
రాష్ట్రానికి 11.56 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్తో సీఎం భేటీ
ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారం. దానిని ఎవరూ లాక్కోలేరు. గతంలో సీఎస్గా పనిచేసిన సోమేశ్కుమార్పై 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. న్యాయస్థానాలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించి చట్టబద్ధంగా ముందుకు వెళ్తాం..
– సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత గొప్ప సంస్కరణ ‘హైడ్రా’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. చెరువులు, కుంటలను కాపాడేందుకు చేపట్టిన ఈ వ్యవస్థను కొనసాగించి తీరతామని తేల్చి చెప్పారు. హైడ్రా విషయంలో కోర్టుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ దురుద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్) కేసులు వేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా?
‘చెరువులు, నాలాలను కాపాడటంలో హైడ్రా తన విధులు నిర్వర్తిస్తున్న తీరుపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. ఎన్ కన్వెన్షన్, గండిపేట, బతుకమ్మ కుంటల్లో ఆక్రమణలు తొలగిస్తే అవి పేదలవంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా? బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్లు కబ్జా పెట్టుకున్నారు. దానిపై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేశారు. కబ్జాదారులు డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. చెరువులను ఆక్రమించిన వారు ధనవంతులైనా, పేదలైనా చర్యలు తప్పవు.
గత 12 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు..
‘గడిచిన 12 ఏళ్లలో తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. రాష్ట్రంలోని 11.56 లక్షల మంది అర్హులైన పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై (జీ)2.0) కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, త్వరలోనే ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధి హామీ నిధుల విడుదల, ఎల్ నినో వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి చేశాం..’ అని రేవంత్ తెలిపారు.
విద్యా హక్కులపై కేంద్రం ఆధిపత్యం సరికాదు..
‘పరీక్షల నిర్వహణ, లీకేజీల నిరోధానికి దేశస్థాయిలో పకడ్బందీ విధానం ఉండాలి. నిబంధనలు పట్టించుకోని కోచింగ్ సెంటర్లే ప్రశ్నపత్రాల లీకేజీలకు వేదికలుగా మారుతున్నాయి. విద్యకు సంబంధించి రాష్ట్రాల పరిధిలో ఉన్న అధికారాలను కేంద్రం లాక్కోవాలని చూడటం వల్లే గందరగోళం ఏర్పడుతోంది. నీట్ సహా ఇతర పరీక్షల విషయంలో యూనివర్సిటీలపై ఆధిపత్య ధోరణి వీడాలి. ప్రశ్నపత్రాల లీకేజీలకు కారకులను కఠినంగా శిక్షించాలి. పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవు. ఆఫ్లైన్లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉంది. సభలో చర్చ జరిగితే రాహుల్గాంధీ అన్ని అంశాలపై మాట్లాడతారు..’ అని సీఎం అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై పకడ్బందీ ప్రణాళిక
‘గత కేసీఆర్ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టి పారిపోయింది. ప్రతి ఏటా రూ.2,200 కోట్ల నుంచి రూ.2,400 కోట్లు ఇందుకు అవసరమవుతాయి. ఇకపై ఏ సంవత్సరం బకాయిలు ఆ సంవత్సరమే చెల్లించేలా, అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ప్రణాళికలు రూపొందించాం. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్లో..కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య 100% ఫీజు రీయింబర్స్మెంట్ చేయించిన తర్వాత తెలంగాణలో ఆ మేరకు డిమాండ్ చేస్తే బాగుంటుంది..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, సురేష్ షెట్కార్, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు తదితరులు ఉన్నారు.


