హైదరాబాద్: ఈ రోజుల్లో పక్కవారు ఏమైపోతే మనకెందుకులే అనే స్వభావం చాలామందిలో ఉంటుంది. కానీ మిధాని డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ శేఖర్, డ్రైవర్ జె.ఎస్.కుమార్లు అలా అనుకోలేదు. బస్సు ఎక్కిన విద్యార్థిని ఆందోళనలో ఉన్న విషయాన్ని గ్రహించి ఆమెపై నిఘా ఉంచారు. వారు అనుకున్నదే జరిగింది. ఆ మైనర్ బాలిక వేగంగా వెళుతున్న బస్సులోంచి దిగిపోవడానికి యత్నించింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన వారు ప్రయాణికుల సాయంతో సదరు బాలికను రక్షించారు.
అసలేం జరిగిందంటే.. పటాన్ చెరువులో తెలంగాణ మైనారిటీ గురుకులం విద్యార్థిని అనూహ్యంగా పటాన్ చెరువు వద్ద ఆర్టీసీ బస్సు (నెం.218) ఎక్కింది. కానీ ఆమె ఏదో ఆందోళనలో ఉంది.. అదే సమయంలో ఆమె చేతిలో పది రూపాయలు తప్ప కాళ్లకు చెప్పులు కూడా లేవు. కండక్టర్ టికెట్ అడిగినప్పుడు దీనంగా అదో రీతిలో చూసింది.
ఆ విద్యార్థిని పట్ల కండక్టర్ శేఖర్కు అనుమానం వచ్చింది. అదే విషయాన్ని డ్రైవర్ కుమార్తో చెప్పాడు. వారిద్దరూ ఆ విద్యార్థిని తీరు పట్ల నిఘా ఉంచారు. ఈలోపు ఆమె పక్కనే ఉన్న ప్యాసింజర్ వద్ద ఫోన్ తీసుకుని ఎవరితోనూ మాట్లాడటాన్ని గమనించారు.ఆ నంబర్ ఆధారంగా ఆఅమ్మాయి మైనారిటీ గురుకులం విద్యార్థిగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పక్కనే ఉన్న ప్రయాణికులకు చెప్పి వారిని కూడా అప్రమత్తం చేశాడు కండక్టర్. ఆ విద్యార్థిని మానసిక ఆందోళనలో ఉందని, కాస్త గమనించమని చెప్పాడు. దాంతో ప్రయాణికుల కూడా అప్రమత్తంగానే ఉన్నారు.
కండక్టర్ ఊహించింది నిజమైంది. ఆ అమ్మాయి కదులుతున్న బస్సు నుంచి దిగిపోవడానికి ప్రయత్నించింది. దాంతో ఆ అమ్మాయిని విషయం తెలిసిన తోటి ప్రయాణికులు ఆమెను వెనక్కి లాగారు. ఆమెకు నచ్చచెప్పి చివరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఈఉదంతంలో తెలంగాణ ఆర్టీసీ అన్నలు చూపిన చొరవ అభినందనీయమని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.


