బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ముఖం లేని సంపన్నుడు (ఫేస్లెస్ బిలియనీర్) అంటూ నీలేకనిపై గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్నారు. గతంలో విమర్శలు చేసిన వ్యక్తికి ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పజెప్పడం మోదీ రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని దుయ్యబట్టారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం మోదీ ఏమైనా చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.
''నందన్ నీలేకనికి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి. మీ రాజకీయాలకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకరిని 'ముఖం లేని బిలియనీర్' అని ముద్ర వేసి, మీ ప్రభుత్వం విఫలమైనప్పుడు అదే వ్యక్తికి భారతదేశ పరీక్షా విధానాన్ని సంస్కరించే బాధ్యతను అప్పగించలేరు. ఇది నందన్ నీలేకని సామర్థ్యాన్ని ప్రశ్నించడం గురించి కాదు, మేము ఎల్లప్పుడూ ఆయన సామర్థ్యాలను గుర్తించాము. ఇది రాజకీయ కపటత్వం, జవాబుదారీతనం గురించిన విషయం. మన నాయకులు స్థిరంగా ఉండాలి, దేశానికి సేవ చేసే వారిని గౌరవించాల''ని ఎక్స్లో హరిప్రసాద్ పేర్కొన్నారు.
నీలేకణికి ముఖం వచ్చిందా?
"ప్రధానిగారూ... ఇప్పుడు నందన్ నీలేకణికి ముఖం వచ్చిందా? లేక అప్పట్లో చేసిన ఆరోపణలే ఇప్పుడు అర్థరహితమయ్యాయా? ఆ ఆరోపణలు నిజమే అయితే కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఆయన చేతుల్లో ఎలా పెడుతున్నారు? అవి అబద్ధమైతే, బహిరంగ వేదికపై ఒక ప్రతిభావంతుడిని అవమానించినందుకు ఎప్పుడు క్షమాపణ చెబుతారు?" అని హరిప్రసాద్ ప్రశ్నించారు.
"ఇది నాయకత్వం కాదు. ప్రతిపక్షంతో ఉన్నారని దేశ ప్రతిభను అవమానించడం, తర్వాత తమ ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అదే ప్రతిభను ఆశ్రయించడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం. నందన్ నీలేకణి సామర్థ్యంపై మాకు ఎలాంటి సందేహం లేదు. ప్రశ్నించాల్సింది ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ నిబద్ధతనే" అని హరిప్రసాద్ విమర్శించారు.
నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం రేపిన కలకలం నేపథ్యంలో పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నందన్ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్ను నియమించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పటిష్ట, పారదర్శక పరీక్ష విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఈ టాస్క్ఫోర్స్ సూచనలు ఇస్తుందని వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పరీక్షల విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపడతామన్నారు.
చదవండి: ప్రధాని మోదీకి మాజీ ఐఏఎస్ వింత విజ్ఞప్తి
నందన్ నీలేకణి యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తొలి ఛైర్మన్గా పనిచేసి, ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ ఆధార్ రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, బీజేపీ నేత హెచ్ఎన్ అనంత్కుమార్ చేతిలో ఓడిపోయారు.


