సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటనకు సిద్ధమయ్యారు. ఎల్లుండి శ్రీకాకుళం వెళ్లనున్న జగన్.. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు.
సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా జగన్ ఆయనకు సంఘీభావం తెలిపేందుకు జైలుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణులకు ధైర్యం, భరోసా కల్పించడంతో పాటు.. కార్యకర్తలకు తాము అండగా ఉన్నామనే సందేశాన్ని జగన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అప్పలరాజు అరెస్టుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పెట్టిన కేసు రాజకీయ కక్షతోనేనని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందని మండిపడుతున్నారు. యాక్సిడెంట్ కేసును.. హత్య కేసుగా మార్చడం, అందులో సీదిరిని ఏ3గా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం పర్యటనపై ఆసక్తి
జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి అరెస్టు అంశంపై పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడంతో పాటు.. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకర్తలతోనూ ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


