సాక్షి, కృష్ణాజిల్లా: డిఫాక్టో సీఎం లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టిపెట్టాలంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే చర్చకురండని సవాల్ చేయడం కాదు.. చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్ వస్తారు. లోకేష్ చర్చకు వస్తే నేనే వస్తా’’ అంటూ ఆయన సవాల్ విసిరారు.
‘‘విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెడతాడు. కంపెనీలు తెచ్చా, ఉద్యోగాలు కల్పించా అంటాడు. రెడ్ బుక్ రుచి చూశారా అంటాడు. చీమ చిటుక్కుమన్నా తనవల్లే అంటాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించడానికి వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడాడు. లోకేష్ మాటలు కోటలు దాటుతాయి. దేనికైనా సమవుజ్జీ కావాలి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచావ్. నీకు సత్తా ఉంటే డీఎస్సీ అక్రమాల పై నాతో చర్చకు రా. నీ వెంట తిరిగిన కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.
‘‘పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్లో పాపాలు చేశారు. ఈ డీఎస్సీ దిక్కుమాలిన డీఎస్సీ. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అన్ని పాత్రలు మీరే పోషిస్తారు. జిల్లా కలెక్టరేట్లలో ఎందుకు మెరిట్ లిస్ట్లు పెట్టలేకపోయారు. గోల్డ్ మెడల్ కొట్టినోడికి కాకుండా పాల్గొన్నవారికి పోస్టులు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్పై కోర్టు విచారణ చేయమని చెప్పింది. దమ్ముంటే విచారణ జరిపించండి. మీలో నిజాయితీ ఉంటే రాజీనామా చేయండి. మంత్రి పదవి కోసం బోండా ఉమా ముచ్చట పడుతున్నారు కదా. మీరు రాజీనామా చేసి ఇవ్వండి ఆయనకు మంత్రి పదవి’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.


