సాక్షి, విశాఖపట్నం: సింహాచలం గిరి ప్రదక్షణ వేళ భక్తుల్లో అయోమయం నెలకొంది. కృత్రిమ తొలి పావంచాలను ప్రభుత్వం ఏర్పాటుచేయగా.. ఇది ఆగమ నియమాలకు విరుద్దమని భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర తొలి పావంచాను కృత్రిమంగా ఏర్పాటు చేయడం దారుణమన్న విశ్వ హిందూ పరిషత్.. ఎన్నో ఏళ్లుగా తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షణ ప్రారంభించడం ఆనవాయితీగా పేర్కొంది.
నచ్చిన కృత్రిమ తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రదక్షణ ప్రారంభించవచ్చని హోం మంత్రి అనిత సెలవిచ్చారు. హోం మంత్రి ప్రకటన, ప్రభుత్వ తీరుతో అప్పన్న భక్తుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సింహాచల గిరి ప్రదక్షిణ సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలోకి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించడంతో పాటు భక్తుల వ్యక్తిగత వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు.
మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు హనుమంతవాక–అడవివరం మార్గంలో సాధారణ వాహనాల రాక పోకలను నిలిపివేస్తారు. అలాగే వేపగుంట జంక్షన్ నుంచి ఓల్డ్ గోశాల వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు మినహా ఇతర వాహనాలకు అనుమతి ఉండదని వెల్లడించారు. భక్తులు తమ వ్యక్తిగత వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి, అక్కడి నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు లేదా కాలినడకన గిరి ప్రదక్షిణ ప్రారంభ స్థలానికి చేరుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఆంక్షలు అమల్లో ఉన్న మార్గాల్లో వ్యక్తిగత వాహనాలతో ప్రయాణించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


