పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బెవూర్ జైలు నుంచి విడుదలైన వెంటనే తన తమ్ముడు తేజస్వి యాదవ్ను కలుసుకున్నారు. పట్నాలోని కౌటిల్య నగర్లోని రబ్రీ దేవి నివాసంలో వీరి భేటీ జరిగింది. విద్యార్థి నిరసనలకు సంబంధించిన కేసులో జూలై 25న పోలీసులు తేజ్ ప్రతాప్ను అరెస్టు చేయగా, దీనిపై తేజస్వి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా సుమారు రెండు నెలల తర్వాత ఇద్దరు సోదరులు ముఖాముఖి కలుసుకున్నారు.
గతంలో సోషల్ మీడియా పోస్టుల వివాదం కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ తేజ్ ప్రతాప్ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన 'జనశక్తి జనతాదళ్' (జేజేడీ)అనే కొత్త పార్టీని స్థాపించి, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దించారు. ఆ సమయంలో తేజస్వి సలహాదారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే జైలు నుంచి రాగానే తేజ్ ప్రతాప్ నేరుగా కుటుంబ సభ్యులను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో అన్నదమ్ముల మధ్య ఉన్న రాజకీయ దూరం తగ్గుముఖం పడుతుందనే సంకేతాలను ఇస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రొఫెసర్ కామకోటి ఎవరు?.. ప్రియాంక ఎందుకు ఎద్దేవా చేశారు?


