విశాఖపట్నం : ఆషాడ చతుర్దశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిన సింహగిరి చుట్టూ గిరిప్రదక్షిణ మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది.
ఓ వైపు చిరుచినుకులు..మరోవైపు మంగళవాయిద్యాలు, జానపద కళారూపాల నడుమ నమో నారసింహాయ అంటూ లక్షలాది మంది భక్తులు సర్వాంతర్యామిని స్మరిస్తూ 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు.
గిరి ప్రదక్షిణలో ఈ ఏడాది పెద్ద ఎత్తున యువత పాల్గొంది. దాదాపు ఆరు లక్షల మందికిపైగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నట్లు సింహాచల ఆలయ వర్గాల అంచనా.
ఉదయం 5 గంటల నుంచే భక్తులు కొండదిగువ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ ప్రారంభించారు.
స్వామివారి ఉత్సవమూర్తులు కొలువుదీరిన ప్రచార రథాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు.


