రాంచీ: జార్ఖండ్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన కోబ్రా 209వ బెటాలియన్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో మావోయిస్టు అగ్రనేత మిసిర్ బేస్రాను అరెస్ట్ చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. మిసిర్ బేస్రా నక్సల్స్ సంస్థలో కీలక స్థాయిలో ఉన్న నేతగా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్లో మావోయిస్టు కార్యకలాపాల నిర్వహణ, వ్యూహాల రూపకల్పనలో అతడికి ముఖ్యమైన పాత్ర ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.
బేస్రాతో పాటు మరో ఇద్దరు అరెస్ట్
ఈ ఆపరేషన్లో మిసిర్ బేస్రాతో పాటు మరో ఇద్దరు నక్సల్స్ నేతలు మోచూ, గౌరవ్ హాన్స్దాలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి అరెస్టుతో రాష్ట్రంలోని నక్సల్ నెట్వర్క్కు గట్టి దెబ్బ తగిలిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, మిసిర్ బేస్రా కోసం భద్రతా బలగాలు చాలా కాలంగా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాయి. అతడి కోసం జార్ఖండ్లోని అడవి ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత జిల్లాల్లో గతంలో పలు భారీ ఆపరేషన్లు నిర్వహించారు.
కాగా, అడవుల్లో మావోయిస్టుల కదలికలు, ఆయుధ సరఫరా మార్గాలు, కీలక సమావేశాలపై నిఘా పెట్టి భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ను విజయవంతం చేసినట్లు తెలుస్తోంది. భద్రతా వర్గాల ప్రకారం.. మిసిర్ బేస్రా అరెస్ట్ మావోయిస్టు సంస్థకు వ్యూహాత్మకంగా పెద్ద నష్టంగా భావిస్తున్నారు. సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న నేత అరెస్ట్ కావడంతో సంస్థ నిర్ణయాలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో జార్ఖండ్లో నక్సల్ ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు సంయుక్తంగా పలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిసిర్ బేస్రా అరెస్ట్ను నక్సల్ వ్యతిరేక పోరులో ఒక కీలక విజయంగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. బేస్రాపై పోలీసుల రివార్డులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.


