ఆమెకు 95.2 శాతం మార్కులు వచ్చాయి. చాలా మంది విద్యార్థులకు అది కలల ఫలితమే. కుటుంబ సభ్యులు కూడా సంతోషించారు. కానీ ఆ విద్యార్థిని మాత్రం సంతృప్తి చెందలేదు. తన సమాధాన పత్రాల్లో ఎక్కడో పొరపాటు జరిగిందనే నమ్మకంతో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసింది. ఆ తర్వాత వచ్చిన ఫలితం చూసి ఆమె మాత్రమే కాదు.. విద్యా వర్గాలే ఆశ్చర్యపోయాయి.
ఏకంగా 24 మార్కులు పెరిగి.. దేశ టాపర్ల సరసన నిలిచింది. ఈ అద్భుత ఘనత సాధించింది ఝార్ఖండ్లోని రాంచీకి చెందిన అవనీ కేజ్రీవాల్. డీపీఎస్ సేల్ టౌన్షిప్ స్కూల్లో కామర్స్ విద్యార్థినిగా చదివిన ఆమె, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో తొలుత 95.2 శాతం మార్కులు సాధించింది. ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ తన ప్రదర్శనకు వచ్చిన మార్కులు సరిపోవని భావించిన అవనీ, సమాధాన పత్రాల రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసింది. అక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది.
రీవాల్యుయేషన్ అనంతరం ఆమె మార్కులు ఏకంగా 24 పెరిగాయి. దీంతో ఇంగ్లీష్ కోర్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు సాధించి 500కి 500 స్కోర్తో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అదనపు సబ్జెక్ట్గా తీసుకున్న గ్రాఫిక్స్లో కూడా 99 మార్కులు సాధించింది.
ఫలితాలు ప్రకటించిన రోజే తనకు పూర్తి సంతృప్తి కలగలేదని అవనీ చెబుతోంది. ఏడాది పొడవునా తాను పడిన కష్టానికి తగిన ఫలితం రాలేదని భావించానని, అందుకే రీవాల్యుయేషన్కు వెళ్లానని తెలిపింది. తన సమాధానాలపై, తన శ్రమపై ఉన్న నమ్మకమే ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని చెప్పింది.
అవనీ విజయ రహస్యం కూడా ఆసక్తికరంగానే ఉంది. రోజుకు ఎన్ని గంటలు చదివానన్నది కాదు.. ఎన్ని లక్ష్యాలు పూర్తి చేశానన్నదే ముఖ్యమని ఆమె చెబుతోంది. ప్రతిరోజూ రెండు లేదా మూడు టాపిక్లు పూర్తి చేయాలని నిర్ణయించుకుని, అవి పూర్తయ్యే వరకు క్రమశిక్షణతో చదివేదాన్నని తెలిపింది. సోషల్ మీడియా విషయంలోనూ విద్యార్థులకు ఆమె ఒక సందేశం ఇచ్చింది. దాన్ని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని, కానీ చదువుకు ఆటంకం కలిగించకుండా పరిమితంగా ఉపయోగించాలని సూచించింది.

వ్యాపారవేత్త మితేష్ కేజ్రీవాల్, గృహిణి పూనమ్ కేజ్రీవాల్ దంపతుల కుమార్తె అయిన అవనీ.. భవిష్యత్తులో బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యను అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సీయూఈటీ-యూజీ 2026 పరీక్ష కూడా రాసింది. భవిష్యత్తులో సొంత వ్యాపారాన్ని స్థాపించి విజయవంతమైన ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని కలలు కంటోంది.
అవనీ సాధించిన ఈ ఘనతపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఆమె విజయం వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయా చౌహాన్ పేర్కొన్నారు.
ఒక రీవాల్యుయేషన్ అభ్యర్థన.. 24 అదనపు మార్కులు.. 95.2 శాతం నుంచి పర్ఫెక్ట్ 100 శాతం. అవనీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఒక సందేశంగా మారింది. ఫలితంపై సందేహం ఉంటే వదిలేయకుండా.. తమ కృషిపై నమ్మకంతో ముందడుగు వేయాలని ఆమె విజయం చెబుతోంది.


