న్యూయార్క్: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధిలో సముద్ర నౌకలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన భారత్.. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నిరంతర నౌకాయానం, వాణిజ్యాన్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ పశ్చిమ ఆసియాను భారత్కు అత్యంత కీలకమైన ప్రాంతంగా అభివర్ణించారు. ఇటీవల కొంతకాలం దాడులు ఆగిపోయిన తర్వాత మళ్లీ ప్రారంభం కావడం ఆందోళనకరమని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ గట్టిగా కోరుతోందని ఆయన స్పష్టం చేశారు.
ఐరాస భద్రతా మండలిలో మంగళవారం జరిగిన చర్చలో హరీశ్ మాట్లాడుతూ, ఈ నెలలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంఎం మొంబాసా సహా పలు నౌకలపై జరిగిన దాడులను ఖండించారు. ఈ దాడుల్లో పలువురు భారతీయులు గాయపడగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు అదృశ్యమయ్యారు. నావికులను టార్గెట్ చేయడం, అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానానికి ఆటంకం కలిగించడాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రాంతీయ శాంతి, భద్రతల కోసం చర్చలు దౌత్య మార్గాల్లో జరగాలని భారత్ వాదించింది. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిపివేయాలని కోరింది. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జూలై 11న ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. కాగా ఈ ప్రాంతంలో భారత్కు భారీగా వాణిజ్య, ఇంధన ప్రయోజనాలు ఉన్నాయని, దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్నారని, వారి భద్రతే తమ అత్యున్నత ప్రాధాన్యమని హరీశ్ ఉద్ఘాటించారు. కేవలం హోర్ముజ్ మీదే కాకుండా గాజాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభాన్ని కూడా విస్మరించకూడదని భారత్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: కోడింగ్ టెస్ట్లు, ఇంటర్వ్యూలు వృథా.. టెకీ ఆవేదన!


