అటు అజయ్‌... ఇటు సర్వేశ్‌ | India wins two silver medals at Commonwealth Games | Sakshi
Sakshi News home page

అటు అజయ్‌... ఇటు సర్వేశ్‌

Jul 29 2026 4:09 AM | Updated on Jul 29 2026 4:09 AM

India wins two silver medals at Commonwealth Games

అజయ్‌ బాబు , సర్వేశ్‌ కుశారే

భారత్‌ ఖాతాలో రెండు రజతాలు

పారా షాట్‌పుట్‌లోస్వర్ణం గెలిచిన షర్మిల

కాంస్యం సాధించిన శిల్ప

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయి వల్లూరి అజయ్‌ బాబు రజతం అందించగా... హైజంప్‌లో తొలిసారి రజతాన్ని అందించిన ఘనతను సర్వేశ్‌ కుశారే సొంతం చేసుకున్నాడు. పారా అథ్లెట్లు కూడా తమ వంతుగా రెండు పతకాలను భారత్‌ ఖాతాలో చేర్చారు. షాట్‌పుట్‌లో షర్మిల స్వర్ణంతో, శిల్ప కాంస్యంతో మెరిశారు.

గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. ఈ క్రీడాంశం ద్వారా భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 79 కేజీల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌ లిఫ్టర్‌ వల్లూరి అజయ్‌ బాబు మొత్తం 330 కేజీల బరువెత్తి  రజతం గెలుచుకున్నాడు.  స్నాచ్‌లో 149 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 181 కేజీల బరువెత్తిన అజయ్‌కు రెండో స్థానం దక్కింది. మలేసియాకు చెందిన హిదాయత్‌ (331 కేజీలు) స్వర్ణం సాధించగా, క్రిస్‌ ముర్రే (ఇంగ్లండ్‌; 325 కేజీలు) కాంస్యం గెలిచాడు. 

పురుషుల హైజంప్‌లో సర్వేశ్‌ కుశారే రజతాన్ని సొంతం చేసుకున్నాడు. 2.25 మీటర్ల ఎత్తుకు ఎగిరిన సర్వేశ్‌ రెండో స్థానంలో నిలిచాడు. జమైకా అథ్లెట్‌ రొమైన్‌బెక్‌ఫోర్డ్‌ (2.25 మీటర్లు) స్వర్ణం దక్కించుకోగా... కిమాని జాక్‌ (ఇంగ్లండ్‌; 2.20 మీటర్లు) కాంస్యం సాధించాడు. సర్వేశ్, బెక్‌ఫోర్డ్‌ ఇద్దరూ 2.25 మీటర్ల ఎత్తే ఎగిరినా... కౌంట్‌బ్యాక్‌లో జమైకా అథ్లెట్‌ పైచేయి సాధించాడు. సర్వేశ్‌తో పోలిస్తే బెక్‌ఫోర్డ్‌ విఫల ప్రయత్నాల సంఖ్య తక్కువ కావడమే అందుకు కారణం. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు ఇది తొలి రజతం కావడం విశేషం. 

హైజంప్‌లో ఇప్పటి వరకు తేజస్విన్‌ శంకర్‌ (2022 బర్మింగ్‌హామ్‌) గెలుచుకున్న కాంస్యమే భారత్‌కు ఏకైక పతకం కాగా... ఇప్పుడు సర్వేశ్‌ దానిని సవరించాడు. మరో భారత హైజంపర్‌ ఆదర్శ్‌రామ్‌ (2.15 మీటర్లు) ఐదో స్థానంతో ముగించాడు. మరోవైపు బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), పురుషుల విభాగంలో జాదుమణి సింగ్‌ (55 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు. 

మరో బాక్సర్‌ పర్విన్‌ 2–3తో సాషా హెకీ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడిపోయింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 63 కేజీల విభాగంలో నిరుపమా దేవి విఫలమైంది. స్నాచ్‌లో 93 కేజీలు బరువెత్తిన నిరుపమా క్లీన్‌ అండ్‌ జెర్క్‌ మూడు ప్రయత్నాల్లోనూ ఫౌల్‌ చేసింది. పారా స్విమ్మింగ్‌ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఫైనల్లో భారత స్విమ్మర్‌ రవి బుడిగిన (ఆంధ్రప్రదేశ్‌; 25.68 సెకన్లు) 6వ స్థానంలో నిలిచాడు.

స్వర్ణ, కాంస్యాలు మనవే...
కామన్వెల్త్‌ పారా క్రీడల అథ్లెటిక్స్‌ పోటీల చరిత్రలో భారత్‌ తొలిసారి స్వర్ణం గెలుచుకుంది. మహిళల షాట్‌పుట్‌ (ఎఫ్‌57)లో హరియాణకు చెందిన షర్మిల ధన్‌కర్‌ పసిడి సొంతం చేసుకుంది. ఆమె తన మూడో ప్రయత్నంలో ఇనుప గుండును 9.81 మీటర్ల దూరం విసిరింది. భారత్‌కే చెందిన కంచుగరకొప్పలు శిల్పా శైలా (కర్ణాటక) కాంస్యం సొంతం చేసుకుంది. ఆమె గుండును 7.26 మీటర్లు విసిరింది.   

గృహ హింసకు గురై... 
హరియాణాలోని చిత్రోలికి చెందిన 40 ఏళ్ల షర్మిల గృహ హింస బాధితురాలు. రెండేళ్ల వయసులోనే పోలియో బారిన పడిన ఆమెకు చిన్నతనంలోనే పెళ్లయింది. అయితే వివాహానంతరం ఆమె తీవ్ర హింసకు గురైంది. దీనిని తట్టుకోలేక చివరకు ఆ బంధం నుంచి తప్పుకున్న ఆమె మరో పెళ్లి చేసుకుంది. భర్త అజిత్‌ సింగ్‌ ఆమెకు అండగా నిలుస్తూ అన్ని విధాలా ప్రోత్సహించాడు. దాంతో ఆరేళ్ల క్రితం ఆమె పారా అథ్లెట్‌ కెరీర్‌ మొదలైంది. ఏడాదిలోపే జాతీయ టైటిల్‌ గెలుచుకోవడంతో పాటు పారా షాట్‌పుట్, పారా డిస్కర్‌త్రోలో భారత అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగింది. ఇంటర్నేషల్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన షర్మిల 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచింది.

ఒక్కో మెట్టు ఎదుగుతూ... 
ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ ఈవెంట్‌లో టాప్‌–3లో నిలిచిన నాలుగో భారత ఆటగాడి గా సర్వేశ్‌ గుర్తింపు పొందాడు. గతంలో జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, లాంగ్‌జంపర్‌ మురళీ శ్రీశంకర్, డిస్కస్‌ త్రోయర్‌ వికాస్‌ గౌడ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇటీవల మొనాకోలో జరిగిన పోటీల్లో సర్వేశ్‌ ఈ ఘనత సాధించాడు. ఆలస్యంగా ఆటలోకి అడుగుపెట్టి సత్తా చాటిన అరుదైన అథ్లెట్‌గా సర్వేశ్‌ అందరి దృష్టిలో పడ్డాడు. 

మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సర్వేశ్‌ తండ్రి ఉల్లిగడ్డలు పండించే రైతు. 20 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో అతను పాల్గొన్నాడు. జాతీయ సీనియర్‌ పోటీల్లో వరుసగా రెండేళ్లు  ఇండియన్‌ ఓపెన్‌లో స్వర్ణం గెలిచిన అతను గత నెలలో ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌షిప్‌లో 2.31 మీటర్ల ఎత్తు ఎగిరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. 2025 వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో ఆరో స్థానంలో నిలిచిన సర్వేశ్‌...ఈ పోటీల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన తొలి భారత హైజంపర్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement