సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రం నుంచి టాటా పవర్ భారీ పెట్టుబడి ప్రాజెక్టు ఒడిశాకు తరలిపోతున్నట్టు ఎకనామిక్ టైమ్స్లో కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రానికి రావాల్సిన రూ.6,675 కోట్ల పెట్టుబడి చేజారిపోవడం పారిశ్రామిక విధానాల్లో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించింది.
నెల్లూరులో ఏర్పాటు చేయాల్సిన టాటా పవర్ ఇంగాట్-వేఫర్ యూనిట్ (10 గిగావాట్ల సామర్థ్యం) కోసం గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఒడిశాకు తరలిపోతున్నట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. అలాగే, పెట్టుబడులు తీసుకురావడంలో గొప్పలు చెప్పుకున్న కూటమి ప్రభుత్వం.. ఇలా వచ్చిన పెట్టుబడులను నిలబెట్టుకోవడంలో విఫలమైందని మండిపడింది.
గతంలో టాటా పవర్ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత టీడీపీదే అంటూ పచ్చ పార్టీ నేతలు ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడు అదే ప్రాజెక్టు ఇతర రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరుస్తామని చెప్పిన ప్రభుత్వం, వాస్తవంగా ఉన్న పరిశ్రమలను నిలబెట్టడంలో విఫలమవుతోందని విమర్శించింది.
ఏపీ కంటే ఒడిశా పారిశ్రామిక విధానాలు మెరుగ్గా ఉండటంతో కంపెనీలు అక్కడికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యలు చేసింది. పారిశ్రామిక విధానాల్లో ఏపీ కంటే ఇతర రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో రాష్ట్ర స్థానం దిగజారడం పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించింది. అయితే, ప్రాజెక్టు మార్పునకు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.


