ప్రభుత్వాస్పత్రుల్లో 'ప్రాణవాయువు' దోపిడీ | Private purchases of oxygen for commissions instead of repairs | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రుల్లో 'ప్రాణవాయువు' దోపిడీ

Jul 29 2026 5:52 AM | Updated on Jul 29 2026 5:52 AM

Private purchases of oxygen for commissions instead of repairs

నిరుపయోగంగా మారిన గాలి నుంచి ఆక్సిజన్‌ తయారీ పీఎస్‌ఏ ప్లాంట్‌లు

మరమ్మతులు చేయకుండా కమీషన్‌ల కోసం ప్రైవేట్‌లో ఆక్సిజన్‌ కొనుగోళ్లు

భారీ కమీషన్‌ల కోసం నిబంధనలకు పాతర

విశాఖ కేజీహెచ్‌లో వెలుగు చూసిన కుంభకోణం

రూ.15 లక్షలలోపు మరమ్మతులు వద్దని రూ.కోట్లతో కొనుగోళ్లకు మొగ్గు

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్న విమర్శలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్‌ స్కామ్‌ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో గాలి నుంచి మెడికల్‌ ఆక్సిజన్‌ తయారు చేసే ప్రెషర్‌ స్వింగ్‌ అబ్జార్షన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఉన్నప్పటికీ వాటిని మూలనపడేసి, కమిషన్‌లే లక్ష్యంగా ప్రైవేట్‌ సంస్థల ద్వారా ఆక్సిజన్‌ కొనుగోళ్లకే కొందరు అధికారులు మొగ్గుచూపుతున్నారని, తద్వారా పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. విశాఖ కేజీహెచ్‌లో  ఈ తరహా కుంభకోణం ఇటీవల వెలుగుచూడడంతో మొత్తం ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది.  కేజీహెచ్‌లో ఆరు పీఎస్‌ఏ ప్లాంట్‌లు ఉండగా, మరమ్మతులు అవసరమైన ఈ ప్లాంట్‌లను పట్టించుకోవడం లేదు. 

144 పీఎస్‌ఏ ప్లాంట్లలో 60 పైగా నిరుపయోగం
ఆక్సిజన్‌ సరఫరా కాంట్రాక్టర్‌లతో కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై ప్లాంట్‌లు రిపేర్లు చేయకుండా ఇబ్బడిముబ్బడిగా ఆక్సిజన్‌ను కొనుగోలు చేస్తున్నారని వైద్యవర్గాల్లోనే చర్చ నడుస్తోంది. విశాఖ, తిరుపతి, విజయవాడ, నంద్యాల, ఏలూరు, కర్నూల్, నెల్లూరు, మరికొన్ని జీజీహెచ్‌లతో పాటు, సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో దాదాపు 144 పీఎస్‌ఏ ప్లాంట్లలో 60కు పైగానే మూలనపడినట్టు వైద్య శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో రూ. కోట్లలో ఆక్సిజన్‌ కొనుగోళ్లు చేపడుతుండగా, కాంట్రాక్టర్‌ల నుంచి కమిషన్‌ల రూపంలో 10 శాతం నుంచి 30 శాతం మేర చేతులు మారుతున్నట్టు సమాచారం. 

చంద్రబాబు సర్కార్‌ ఏర్పాటైన వెంటనే రాయలసీమకు చెందిన ఓ యువ మంత్రి ఆక్సిజన్‌ కాంట్రాక్ట్‌ టీడీపీ నాయకులకు ఇచ్చేయాలని కాంట్రాక్టర్‌ను బెదిరింపులకు గురిచేశారు. దీనికి కాంట్రాక్టర్‌ ససేమిరా అనడంతో సదరు రాష్ట్ర వైద్య శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్ట్‌ను రద్దు చేయించారు. రద్దు ఉత్తర్వులపై కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.  అయితే అటు తర్వాత మంత్రితో కూడా సయోధ్య కుదుర్చుకుని ఎటువంటి  ఇబ్బందులూ లేకుండా ఆక్సిజన్‌ సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

జగన్‌ సర్కార్‌ దార్శనికతకు ఎసరు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వసతులను మెరుగుపరిచింది. ప్రాణవాయువుకు కొరత ఏర్పడకుండా రూ.190 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 81 సామాజిక, జిల్లా, బోధన ఆసుపత్రుల్లో 92 పీఎస్‌ఏ ప్లాంట్‌లను ఏర్పాటు చేసింది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌), ఇతర మార్గాల్లో మరో 42 ఆసుపత్రుల్లో 52 ప్లాంట్‌లను ప్రభుత్వం సిద్ధం చేసింది. 

ఇలా 2021, 2022 సంవత్సరాల్లో 144 పీఎస్‌ఏ ప్లాంట్‌లు అందుబాటులోకి తెచ్చింది. నిమిషానికి 500 నుంచి 1,000 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ప్లాంట్‌లను నెలకొల్పడమే కాకుండా రూ.90.07 కోట్లతో 24,419 పడకలకు ఆక్సిజన్‌ పైప్‌లైన్‌లు సమకూర్చింది. సరైన నిర్వహణ లేక రాష్ట్రంలోని చాలా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రస్తుతం ఈ ప్లాంట్‌లు నిరుపయోగంగా మారిపోయాయి. 

విశాఖ కేజీహెచ్‌లో ఏమి జరిగింది?
» కేజీహెచ్‌లో పాడైన పీఎస్‌ఏ ప్లాంట్‌లను రూ.15 లక్షల లోపు ఖర్చు చేస్తే తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చు. అయితే ఏడాదిన్నరకుపైగా ప్లాంట్‌లకు ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు చేయించలేదు. 
» ఆక్సిజన్‌ కొనుగోళ్లకు ప్రతి నెల రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మేర ఆక్సిజన్‌ కొనుగోళ్లు చేపట్టారు. ఈ కొనుగోళ్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. 
» ప్రైవేట్‌ సంస్థలు సరఫరా చేసే ఆక్సిజన్, మందులు, పరికరాలు ఇలా ఏవైనా సరే తొలుత స్టోర్స్‌లోని ముఖ్య ఫార్మసీ అధికారి ఎంట్రీ చేసుకుంటారు. ఇలా స్టోర్స్‌లో స్టాక్‌ ఎంట్రీ చేసుకున్న ఆక్సిజన్‌ను వివిధ వార్డుల నుంచి వచ్చిన ఇండెంట్‌ ఆధారంగా డిప్యూటీ ఆర్‌ఎంవో, సీఎస్‌ఆర్‌ఎంవో ఆదేశాల మేరకు స్టోర్స్‌ నుంచి డిస్పాచ్‌ చేయాలి. 
»   అనంతరం ఆక్సిజన్‌ వినియోగంపై ఆయా వార్డుల్లో ఇచ్చిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌(యూసీ)ల ఆధారంగా బిల్లింగ్‌ ప్రక్రియ ఉంటుంది. ఈ బిల్లులను సైతం స్టోర్స్‌ మెడికల్‌ ఆఫీసర్, ఆర్‌ఎంవో, ఏడీ సర్టిఫై చేయాలి. 
» అయితే ఈ ప్రక్రియను తుంగలో తొక్కి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేసే బయోమెడికల్‌ ఇంజినీర్‌ సర్టిఫికేషన్‌ ఆధారంగా కేజీహెచ్‌లో ఉన్నతాధికారులు బిల్లులు ప్రాసెస్‌ చేసినట్టు వెల్లడైంది. 
» కాంట్రాక్ట్‌ ఉద్యోగి సర్టిఫికేషన్‌ ఆధారంగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏకంగా రూ.1.40 కోట్ల బిల్లులు ప్రాసెస్‌ చేయడంతో గుట్టు రట్టయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement