న్యూఢిల్లీ: వందేమాతరం గేయాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. స్వల్ప చర్చ అనంతరం గందరగోళం మధ్య గురువారం లోక్సభ ఈ చట్టాన్ని ఆమోదించింది.
“జాతీయ గౌరవాలను అవమానించకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026”కు రాజ్యసభ బుధవారమే ఆమోదం తెలిపింది. దిగువ సభ ఆమోదంతో ఇది చట్టంగా మారేందుకు మరో అడుగు ముందుకు వేసింది.
నీట్ ప్రశ్నపత్ర లీక్పై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసు చర్యల అంశంపై చర్చ కోరుతూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టిన సమయంలోనే లోక్సభలో వందేమాతరం బిల్లు మూజువాణి ఓటు (వాయిస్ ఓటు)తో ఆమోదం పొందింది. సభలో గందరగోళం కొనసాగుతున్నప్పటికీ శాసన కార్యక్రమాలు కొనసాగాయి. 1971 జాతీయ గౌరవాలను అవమానించకుండా నిరోధించే చట్టంలో వందే మాతరాన్ని చేర్చే లక్ష్యంతో ఈ సవరణ తీసుకొచ్చారు.
ప్రస్తుతం రాజ్యాంగం, జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాలను అవమానించిన వారికి గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. ఈ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత వందే మాతరం పాడే సమయంలో అవమానించడం, అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం వంటివి చేసినా అదే శిక్ష వర్తిస్తుంది. గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. 1875లో బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన వందే మాతరం 1882లో ఆయన ఆనందమఠ్ నవలలో తొలిసారి ప్రచురితమైంది.
వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఈ బిల్లు భాగం. జూలై 29న రాజ్యసభలో జరిగిన చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు చర్చ సమయంలో వాకౌట్ చేశాయి.
ఎగువ సభలో చర్చకు సమాధానమిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. దేశ గౌరవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడమే ఈ బిల్లు ఉద్దేశమన్నారు. వందే మాతరాన్ని భారత స్వాతంత్య్ర పోరాటానికి, జాతీయ చైతన్యానికి ప్రతీకగా అభివర్ణించారు.
ఈ బిల్లును జూలై 24న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జూలై 29న రాజ్యసభ, జూలై 30న లోక్సభ ఆమోదించాయి. నీట్ ప్రశ్నపత్ర లీక్ అంశంపై రెండు సభల్లోనూ వారం రోజులకుపైగా కొనసాగుతున్న అంతరాయాల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది.


