న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివిదించాల్సి ఉందని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ద్విసభ్య ధర్మాసనం గురువారం తెలిపింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతోపాటు కక్షిదారులు రాతపూర్వక వాంగ్మూలాలు ఇవ్వాలని ఆదేశించింది.
2023లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకుండా ఎన్నికల కమిషనర్ నియామకం, తదితర అంశాల కోసం ఒక చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ప్రధాని, ప్రధాని ప్రతిపాదించిన కేంద్ర మంత్రి ఒకరు, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతతో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని చేపడుతుంది. ఈ చట్టాన్ని కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్తోపాటు పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వీటన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్లో ఉంచుతూ... విస్తృత ధర్మాసనం విచారణకు సిఫారసు చేస్తామని తాజాగా ప్రకటించింది.
‘‘ప్రజాస్వామ్యంపై అవిశ్వాసం తగదు’’
ఎన్నికల కమిషనర్ల నియామకపు చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గట్టిగా సమర్థించారు. ఎంపిక ప్యానెల్లో సంఖ్యాబలం ఉన్నంత మాత్రా ప్రధాని, కేంద్ర మంత్రులు ప్రజాస్వామ్యంపై అవిశ్వాసంతో వ్యవహరిస్తారని అనుకోరాదని ఆయన గురువారం సుప్రీంకోర్టులో వాదించారు. ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక పవిత్రత ఆపాదించి ఉందని, ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్యానెల్ నిర్ణయాలను శంకించడం ప్రజాస్వామ్య వ్యవస్థలపై రాజ్యాంగం ఉంచిన విశ్వాసాన్ని తక్కువ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని నిర్ణయంపై నమ్మకం లేకపోతే, అవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలని అనుకుంటే కేబినెట్ మంత్రుల ఎంపిక తరువాత కూడా మాజీ న్యాయమూర్తులనో, ఇంకొకరినో సంప్రదించాలన్న వెసలుబాటు ఎందుకు లేదు’’అని ప్రశ్నించారు.


