ఢాకా: భారత్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే, నేరుగా కోర్టు ముందు లొంగిపోయే అవకాశం రాకముందే మాజీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను అరెస్టు చేసే అవకాశం ఉందని బంగ్లాదేశ్ న్యాయ మంత్రి ఎం.అసదుజ్జామాన్ గురువారం చెప్పారు. ప్రాణాలకు ముప్పు ఉందనే భయం ఉన్నప్పటికీ డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్కు తిరిగి రావాలనే సంకల్పంతో ఉన్నానని హసీనా చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హసీనా ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ.. "నన్ను చంపేయవచ్చు. నన్ను అరెస్టు చేయవచ్చు. నన్ను జైలుకు పంపవచ్చు. నా భవితవ్యం నాకు పూర్తిగా తెలుసు. అయినా నేను తిరిగి వెళ్లాలనుకుంటున్నా. ఎందుకంటే నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు" అని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఆమె పార్టీ సహచరులతో ఈ ఏడాది చివరి నాటికి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లే అవకాశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
హసీనాకు తిరిగి వచ్చే హక్కు ఉందని అసదుజ్జామాన్ చెప్పారు. అయితే "చట్టం తన పని తాను చేస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించే పని మేం ఏదీ చేయం" అని అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. "మరణ శిక్ష పడిన వ్యక్తి అయినప్పటికీ, బంగ్లాదేశ్ పౌరురాలిగా చట్టాన్ని గౌరవిస్తూ స్వదేశానికి వచ్చి లొంగిపోవాలనుకుంటే, అలా చేసే అవకాశం రాకముందే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉంది. చట్టం మాకు ఇచ్చిన అధికారాన్ని వినియోగిస్తాం" అని చెప్పారు.
తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాస్పోర్ట్ను రద్దు చేసిన తర్వాత ఆమె ఎలా తిరిగి వస్తారని అడగగా, మంత్రి స్పందిస్తూ "అది ఆమె సమస్య, నాది కాదు" అని చెప్పారు. "అయితే ఆమె మా భూభాగంలోకి ప్రవేశించిన క్షణం, చట్టం నాకు అప్పగించిన అధికారాన్ని అమలు చేస్తా" అని అన్నారు.
బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన హింసాత్మక వీధి నిరసనల తర్వాత 2024 ఆగస్టులో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్కు వెళ్లిపోయారు. తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఉగ్రవాద నిరోధక చట్టం కింద జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుతో ఆమె పార్టీ అవామీ లీగ్ను ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. 2025 నవంబర్లో, 2024 విద్యార్థి నిరసనలను అణచివేసిన ఘటనలో ఆమె దోషిగా తేలడంతో, అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ ఈ విచారణలను "లోపభూయిష్టం" అని పేర్కొన్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం వాటి న్యాయబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తింది.


