ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా (78) తన ప్రాణాలకు ముప్పు ఉన్నా డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి రావాలని దృఢంగా నిర్ణయించుకున్నానని మీడియాకు తెలిపారు. "నన్ను చంపేయొచ్చు. నన్ను అరెస్టు చేయొచ్చు. నన్ను జైలుకు పంపొచ్చు. నా భవిష్యత్తు ఏంటో నాకు పూర్తిగా తెలుసు. అయినా నేను తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు" అని చెప్పారు.
విద్యార్థుల నేతృత్వంలో 2024 ఆగస్టులో జరిగిన తిరుగుబాటుతో హసీనా పదవి కోల్పోయారు. ఆమె నివాసాన్ని జనాలు చుట్టుముట్టడంతో హెలికాప్టర్లో భారతదేశానికి వచ్చేశారు. అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో జరిగిన అణచివేత చర్యల్లో 1,400 మంది వరకు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.
నవంబర్లో ఢాకా కోర్టు హసీనాను మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన నేరాల కేసులో దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును ఆమె "చట్టం రూపంలో కనిపిస్తున్న రాజకీయ ప్రతీకారం"గా అభివర్ణించారు. భారతదేశంలో రహస్య ప్రదేశంలో నివసిస్తున్న హసీనా తాను తిరిగి బంగ్లాదేశ్కు రావాలనే నిర్ణయంపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.
హసీనా పదవి కోల్పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తాత్కాలిక ప్రభుత్వ హయాంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తారిక్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి కాస్త స్థిరపడింది. హసీనాను అప్పగించాలని ఢాకా అధికారికంగా కోరింది. ఆ అభ్యర్థనను పరిశీలిస్తున్నామని భారత్ తెలిపింది.
అయితే తన తిరుగు ప్రయాణ నిర్ణయానికి ఆ అంశంతో సంబంధం లేదని హసీనా చెప్పారు. తాను భారతదేశంలో గౌరవప్రదంగా ఉంటున్నానని అన్నారు. "నన్ను అప్పగించే అంశంపై భారత అధికారులు నాతో చర్చించలేదు. నా దేశానికి తిరిగి రావాలని నేనే నిర్ణయించుకున్నాను" అని తెలిపారు.
ప్రత్యర్థుల హత్యలు, ప్రతిపక్ష పార్టీల అణచివేత, పక్షపాత న్యాయస్థానాలు, ఏకపక్ష ఎన్నికలు వంటి అనేక దుర్వినియోగాలకు హసీనా ప్రభుత్వం పాల్పడిందని మానవ హక్కుల సంస్థలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్లో చాలా వరకు "రాజకీయంగా సృష్టించిన ప్రచారాలు" అని హసీనా సమర్థించుకున్నారు.
తన పదవి కోల్పోవడానికి దారితీసిన విద్యార్థుల నిరసనల సమయంలో అధిక బలప్రయోగానికి తానే అనుమతి ఇచ్చానన్న ఆరోపణలను కూడా హసీనా ఖండించారు. "నా ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో సహనాన్ని ప్రదర్శించింది. విద్యార్థుల ఉద్యమాన్ని శాంతియుత పరిష్కారం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది" అని ఆమె చెప్పారు. ఆ తిరుగుబాటు కేవలం సాధారణ విద్యార్థుల నిరసన కాదని ఆమె వ్యాఖ్యానించారు.
"అది రహస్య ఆదేశాలు, వ్యవస్థీకృత హింస, ప్రచారం, ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే లక్ష్యంతో నడిచిన ప్రణాళికాబద్ధ చర్యగా మారింది" అని ఆమె అన్నారు. భారత విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించేందుకు భారతదేశ వ్యాప్తంగా జరిగిన నిరసనలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు.


