వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్
19 ఏళ్ల తరువాత మళ్లీ కోల్కతా రాక
ఆగస్టు ఒకటిన సీఎంతో కలిసి వేదికపై హాజరు!
కోల్కతా: వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు రెండు దశాబ్దాల తరువాత భారత్ తిరిగి రానున్నారు. 2003 తస్లిమా నస్రీన్ రాసిన పుస్తకం ‘ద్విఖండిత’పెద్ద వివాదానికి కారణమైంది. ముస్లింల మనోభావాలను దెబ్బతీశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, నిరసనలకు దిగడంతో ప్రభుత్వం 2007లో ఆ పుస్తకాన్ని నిషేధించడంతోపాటు తస్లీమా దేశం వదిలి వెళ్లేలా చేసింది.
అయితే.. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కోల్కతా రావడంపై ఆమె గురువారం మాట్లాడుతూ, ‘‘నా సొంత దేశానికి వచ్చినట్లే’’అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తన తాజా పర్యటన భావ ప్రకటన స్వేచ్ఛ, భిన్న గళాలకు రక్షణ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేందిగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేవారు. తస్లీమా ఆగస్టు ఒకటవ తేదీ కోల్కతాలో జరిగే ఒక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రసిద్ధ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయలతో కలిసి పాల్గొననున్నారు.
తస్లీమా నస్రీన్ జన్మతః బాంగ్లాదేశీ. అయితే 1994లో ఆమె రాసిన పుస్తకం ‘లజ్జ’పై కూడా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. బాబ్రీ మసీదు ధ్వంసం నేపథ్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై దౌర్జన్యం జరగిందని తస్లీమా తన పుస్తకంలో రాసుకొచ్చారు. దీనికి ఆగ్రహించిన అక్కడి మతఛాందసవాదులు నిరసనలకు దిగడంతో 1997లో కోల్కతాకు వచ్చారు. పదేళ్లు ఇక్కడే గడిపిన తరువాత మరో వివాదం కారణంగా మళ్లీ బాంగ్లాదేశ్కు మకాం మార్చాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆమె కోల్కతా రావడం ఇదే మొదటిసారి.
ఈ నేపథ్యంలో తస్లీమా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కోల్కతా కేవలం పదేళ్లు ఉన్న నగరం మాత్రమే కాదని, తనదన్న సొంత భావనను అందించినదని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లు దూరంగా ఉన్నా పశ్చిమ బెంగాల్తో తన అనుబంధం మాత్రం కొనసాగిందని చెప్పారు. ‘‘నా మనసులో బెంగాల్ ఎన్నడూ ముళ్లకంచెలతో కూడిన సరిహద్దులతో విడిపోలేదు. బెంగాల్ తూర్పు దిక్కున తలుపులు నాకు ఎప్పుడూ మూసే ఉంటాయి. అందుకే నాకు ఈ వైపు బెంగాల్ ఇల్లు అయిపోయింది’’అని వ్యాఖ్యానించారు.
కోల్కతా తిరిగి వస్తూండటం తనకు దుఖంతో కూడిన ఆనందాన్ని ఇస్తోందని, పంతొమ్మిదేళ్లు నన్ను నా మిత్రులు, పాఠకులు, సొంతమనే భావనను దూరం చేశారని, ఈ కాలాన్ని ఎవరూ తిరిగి ఇవ్వలేరని భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘అలాగని తాను ఏదో అతిథిలానో, అపరిచితురాలి మాదిరిగానో రావడం లేదు. బెంగాల్లో ఒక భాగమనే విశ్వాసంతోనే వస్తున్నా’’అన్నారు. ఆ మాటకొస్తే తాను కోల్కతా వదిలింది కూడా ఇష్టపూర్వకంగా కాదని, ఏదో ఒక రోజు ఇక్కడకు తిరిగి వస్తానన్న నమ్మకం తనకు ఉండిందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగానే కాకుండా.. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కోసం జరిగిన పోరాటానికి తన రాక ప్రతీక అని వ్యాఖ్యానించారు.
‘‘ఛాందసులు నొక్కేసేందుకు ప్రయత్నించిన గొంతుక తిరిగి వస్తోంది. స్టేజీపై నా ఉనికి ఫత్వాలు, బెదిరింపులు ఒక రచయితను కొంతకాలం ప్రవాసానికి పంపవచ్చునేమో కానీ ఆమె ఆలోచనలను తుడిచివేయలేరు అనేందుకు నిదర్శనంగా నిలుస్తుంది’’అని అన్నారు. అసౌకర్యంగా ఉన్న అభిప్రాయాలకూ రక్షణ కల్పించడమే భావ ప్రకటన స్వేచ్ఛకు కొలమానమని అన్నారు. ‘‘ఒక రచయిత స్వేచ్ఛ ప్రభుత్వ దయపై, లేదా ఒక పార్టీ సిద్ధాంతంపై లేదా మత సంస్థల అనుమతులపై ఆధారపడకూడదు. ప్రాథమిక హక్కులా ఉండాలి’’అన్నారు.
భారతీయ పౌరురాలు కానప్పటికీ తనకు ఇక్కడ ఆశ్రయం దక్కడంపై కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ రచయితలు స్వేచ్ఛగా మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం కల్పిస్తోందని, అదే సమయంలో బెదిరింపులు అందుకేనేందుకూ కారణమవుతుందోని చెప్పారు. యువత ప్రతి విషయాన్ని ప్రశ్నించాలని, మతం, సంప్రదాయం, అధికారం, రాజకీయాలు మాత్రమే కాకుండా... వారికిష్టమైన ఆలోచనలనూ ప్రశ్నించాలని, ఎవరి భావాలనో తమవిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని, వాటిని తమ నమ్మకాలుగా స్వీకరించవద్దు అని పిలుపునిచ్చారు.


