breaking news
Taslima Nasrin
-
తీవ్రవాదుల గుప్పిట్లో యూనస్ ప్రభుత్వం
తిరువనంతపురం: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు, నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్పై ప్రవాస రచయిత్రి తస్లీమా నస్రిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం మత ఛాందసవాదులతో చేతులు కలిపిందని ఆరోపించారు. ఆ దేశంలో విభజన శక్తులకు అధికారాన్ని కట్టబెడుతోందని ఆమె మండిపడ్డారు. కేరళ శాసనసభ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తకోత్సవంలో ‘శాంతి కోసం పుస్తకం’అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నోబెల్.. శాంతికి కొలమానం కాదు ‘నోబెల్ శాంతి బహుమతి అనేది శాంతికి కొలమానం కాదు.. అధికారం మాత్రమే దాన్ని నిర్ణయిస్తుంది’.. అని తస్లీమా వ్యాఖ్యానించారు. గతంలో హెన్రీ కిసింజర్, ఆంగ్ సాన్ సూకీ వంటి వారు నోబెల్ పొందినా, వారి హయాంలోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. సూకీ మానవత్వం కంటే అధికారానికే ప్రాధాన్యమిచ్చి రోహింగ్యాల ఊచకోతను అడ్డుకోలేకపోయారని విమర్శించారు. బంగ్లా మైనారిటీల దుస్థితిపై ఆవేదన బంగ్లాదేశ్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, ముస్లిం మత ఛాందసవాదులు మైనారిటీలపై (ముఖ్యంగా హిందువులపై) దాడులు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులర్ విద్యాసంస్థలు, సైన్స్ అకాడమీలను నిర్మించాల్సింది పోయి, కేవలం ఓట్ల రాజకీయం కోసం గత ప్రభుత్వాలు మసీదులు, మదరసాలను భారీగా నిర్మించాయని విమర్శించారు. ఇవే జిహాదీలను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఆమె దుయ్యబట్టారు. రక్షణ లేని హిందూ మహిళలు బంగ్లాదేశ్లో హిందూ మహిళలకు కనీస చట్టపరమైన రక్షణ లేదని, బహుభార్యాత్వం, విడాకులు, ఆస్తి హక్కుల విషయంలో వివక్ష కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. దీని కోసం ఉమ్మడి పౌర స్మృతి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ను నిషేధించి, జమాత్–ఏ–ఇస్లామీ వంటి శక్తులు పుంజుకోవడం ఆందోళనకరమన్నారు. జమాత్ అధికారంలోకి వస్తే ‘షరియా చట్టం’అమలవుతుందని, అప్పుడు మహిళలు, మైనారిటీల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తస్లీమా హెచ్చరించారు. భారత లౌకికత్వం భేష్ భారతదేశంలో మైనారిటీల పరిస్థితి బంగ్లాదేశ్పై ప్రభావం చూపుతోందా?.. అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘భారత్కు దీంతో సంబంధం లేదు. 1947 నుండి బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారత్ ఇప్పటికీ లౌకిక దేశంగానే ఉంది, కానీ బంగ్లాదేశ్ 1980లలోనే ఇస్లాంను అధికారిక మతంగా మార్చుకుని లౌకికత్వాన్ని కోల్పోయింది’.. అని ఆమె స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో మతాతీత రాజకీయాలు మళ్లీ రావాలంటే.. రాబోయే ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, లౌకికవాద పారీ్టలే అధికారంలోకి రావాలని తస్లీమా నస్రిన్ ఆకాంక్షించారు. -
'లివ్-ఇన్ రిలేషన్, పెళ్లి కాదు.. మగాళ్ల మనస్తత్వంలోనే అసలు సమస్య..'
శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఆమెను 35 ముక్కలు చేసిన అత్యంత క్రూరమైన ఈ అనాగరిక చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది. లివ్-ఇన్ రిలేషన్ల కారణంగానే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ గురువారం అన్నారు. చదువుకున్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, లివ్ ఇన్ రిలేషన్ల జోలికి వెళ్లకుండా నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలకు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నజ్రీన్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో ఈ విషయంపై స్పందిస్తూ ఓ సందేశం రాసుకొచ్చారు. 'లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఓ వ్యక్తి తన గర్ల్ఫ్రెండ్ను హత్య చేస్తే.. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి.. లివ్ ఇన్ రిలేషన్ల వల్లే నేరాలు జరుగుతున్నాయని మీరు చెబుతున్నారు. కానీ పెళ్లైన పురుషులు తమ భార్యలను చంపినప్పుడు.. పెళ్లిళ్ల వల్లే నేరాలు జరుగుతున్నాయి, అందుకే పెళ్లి చేసుకోవద్దు.. లివ్ ఇన్ రిలేషన్లే ఎంచుకోండి అని ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిళ్లు, లివ్ ఇన్ రిలేషన్లు కాదు.. అసలు సమస్య మగాళ్ల మనస్తత్వంలోనే ఉంది.' అని నజ్రీన్ రాసుకొచ్చారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. When a man kills his girlfriend in a live-in relationship,u ask girls to get married coz live-in encourages crimes. But when men kill their wives,u don't ask girls to go for live-in relationships coz marriage encourages crimes!! Not marriage or live-in,problem is men's mentality. — taslima nasreen (@taslimanasreen) November 17, 2022 మరోవైపు కౌషల్ కిశోర్ వ్యాఖ్యలపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కౌషల్ కిశోర్ను పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇలాంటి హేయమైన నేరాళ్లో మహిళలనే నిందించడం క్రూరం, నిర్దాక్షిణ్యంగా అభివర్ణించారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
'బీఫ్ తిన్నారని చంపడం క్రూరమైన నేరం'
తిరువనంతపురం: బీఫ్ తిన్నారని చంపడం అసహనం కాదని, అత్యంత క్రూరమైన నేరమని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలతో భారత్లో అసహనం పెరిగిపోయిందని భావించరాదన్నారు. కొందరు ఎక్కడున్నా అసహనం సృష్టిస్తారు.. చట్టం పక్కాగా అమలైతే ఆ పదానికి చోటు ఉండదని చెప్పారు. అసహనంపై పెద్దెత్తున లౌకికవాదులు నిరసన వ్యక్తం చేయడం మంచి పరిణామమేనని తస్లీమా పేర్కొన్నారు. తాను భారత్ పౌరసత్వం కోరుకుంటే మోదీ ప్రభుత్వం తటస్థంగా, లౌకికవాదంతో పనిచేస్తుందని చెబుతానని ఆమె వివరించింది. -
'దీదీ.. చిదంబరాన్ని చూసి నేర్చుకో'
ఢిల్లీ: సల్మాన్ రష్దీ పుస్తకాన్ని నిషేధించడం తప్పేనంటూ చిదంబరం ప్రకటించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రిన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చురకలంటించారు. చిదంబరాన్ని చూసైనా నేర్చుకోవాలని దీదీకి హితవు పలికారు. తస్లిమా రచించిన ఓ టీవీ సీరియల్ తమ మనోభావాలకు విరుద్ధంగా ఉందంటూ ముస్లిం సంస్థలు అభ్యంతరం తెలపడంతో ఆ సీరియల్ ప్రసారంపై మమత ప్రభుత్వం నిషేధం విధించింది. చిదంబరాన్ని చూసైనా సీరియల్పై నిషేధాన్ని ఎత్తివేయాలని తస్లిమా కోరారు. తస్లిమా రచించిన 'ద్విఖండితో' పుస్తకాన్ని బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం నిషేధించింది. చిదంబరం మాదిరిగా బుద్ధదేవ్ భట్టాచార్య కూడా తన తప్పును ఎప్పుడు అంగీకరిస్తారని ఆమె ప్రశ్నించారు. -
రచయితలపై తస్లీమా ఫైర్
దేశంలో అసహనం పెరిగిపోతున్నదని నిరసన వ్యక్తం చేస్తూ సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చేసిన రచయితల సంఖ్య 30కి చేరింది. ఒకవైపు రచయితలు వరుసపెట్టి తమ పురస్కారాలను వాపస్ ఇస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం వారి నిరసన కల్పితమైనదని కొట్టిపారేసింది. ఈ వివాదంపై తాజాగా భారత్లో ప్రవాసముంటున్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా స్పందించారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారతీయ రచయితలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆమె విమర్శించారు. తనపై దాడి జరిగినప్పుడు వారు ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. అవార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా అన్యాయాలపై నిరసన తెలియజేయడం తప్పేమీ కాదన్నారు. ఇది కల్పిత నిరసన అని ప్రభుత్వం చేస్తున్న వాదనతో తాను ఏకీభవించడం లేదని, రచయితలు రాజకీయంగా, సామాజికంగా స్పృహ కలిగిన వ్యక్తులని పేర్కొన్నారు. 'నా పుస్తకం పశ్చిమ బెంగాల్లో నిషేధించినప్పుడు, నాపై భారత్లో ఐదు ఫత్వాలు జారీచేసినప్పుడు, బెంగాల్ నుంచి నన్ను వెళ్లగొట్టినప్పుడు, ఢిల్లీలో నెలపాటు నన్ను గృహనిర్బంధంలో ఉంచినప్పుడు చాలామంది రచయితలు మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ జీవించడానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ఈ విషయంలో రచయితలు మౌనంగా ఉండటమే కాకుండా.. సునీల్ గంగూలీ, శంఖా ఘోష్ వంటి రచయితలు నా పుస్తకాన్ని నిషేధించాలని అప్పటి సీఎం బుద్ధదేవ్ భట్టచార్యకు కోరారు కూడా' అని తస్లీమా పేర్కొన్నారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారత రచయితలవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించారు. ఇక్కడ లౌకికవాదమూ సమస్యే! భారత్లో లౌకికవాదం అనుసరించే విధానంలోనూ సమస్య ఉందని, చాలామంది లౌకికవాదులు ముస్లింలకు అనుకూలంగా, హిందూ వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారని తస్లీమా పేర్కొన్నారు. వారు హిందూ ఛాందసవాదుల చర్యలను నిరసిస్తారు.. అదేసమయంలో ముస్లిం ఛాందసవాదుల దారుణమైన చర్యలను సమర్థిస్తారని తెలిపారు. -
ఇస్లాంను ఎప్పడూ విమర్శించలేదు: తస్లీమా
న్యూఢిల్లీ: 'లజ్జ' పుస్తకంలో ఇస్లాంపై తాను ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని వివాదస్పద రచయిత తస్లీమా నస్రీన్ అన్నారు. గతంలో లజ్జ పుస్తకం వివాదస్పదమైన మారిన నేపథ్యంలో తస్లీమాపై ఫత్వా విధించిన సంగతి తెలిసిందే. తాను లజ్లలో ఇస్లాంను విమర్శించలేదని, దాంతో బంగ్లాదేశ్ లో ముస్లిం సాంప్రదాయవాదులు ఫత్వా జారీ చేశారని తస్లీం అన్నారు. ఇస్లాంను విమర్శించారనే అంశంలో వాస్తవం లేదన్నారు. ఓ నిరసనకు లజ్జ ప్రతిరూపం. హింసపై తాను నిరసన వ్యక్తం చేశా. ప్రాంతం పేరుతో హత్యలు చేయడం దారుణం అని తస్లీన్ అన్నారు. తాజాగా లజ్జను ఇంగీష్ లోకి అనువదించి..20వ ఎడిషన్ గా ప్రచురిస్తున్నారు. -
తస్లీమా నస్రీన్పై మరో వివాదం
కోల్కతా: బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్పై మరో వివాదం తలెత్తింది. కొత్తగా ప్రారంభమైన బెంగాలీ చానల్ ‘ఆకాశ్ ఆఠ్’ గురువారం నుంచి ప్రసారం చేయదలచిన ‘దుస్సహబాస్’ (కడగండ్ల బతుకు) సీరియల్ తమ మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందంటూ ముస్లిం ఛాందసవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సీరియల్ ప్రసారం నిరవధికంగా వాయిదా పడింది. సీరియల్లోని కథకు మతంతో ఎలాంటి సంబంధం లేదని రచయిత్రి తస్లీమా, సీరియల్ను ప్రసారం చేసే టీవీ చానల్ యాజమాన్యం స్పష్టం చేసినా ముస్లిం ఛాందసవాదులు తమ పట్టు వీడలేదు. అయితే ఛాందసవాదులు సీరియల్ చూడకుండానే అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తస్లీమా తప్పుబట్టారు.


