భారత్లో అధికారిక రుణ వ్యవస్థ గత కొన్నేళ్లలో వేగంగా విస్తరించిందని ట్రాన్స్యూనియన్ సిబిల్ (TransUnion CIBIL) విడుదల చేసిన తాజా నివేదిక 'అన్లాకింగ్ యాక్సెస్: జర్నీ ఆఫ్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండియా' వెల్లడించింది. 2017లో లోన్ తీసుకోవడానికి అర్హత కలిగిన వారిలో కేవలం 35 శాతం మంది మాత్రమే కనీసం ఒక్కసారైనా లోన్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ సంఖ్య 2026 నాటికి 74 శాతానికి చేరింది. అంటే.. గత తొమ్మిదేళ్లలో భారతీయులు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది.
లోన్స్ తీసుకునే వారిలో మహిళలు, యువత, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం కూడా వేగంగా పెరుగుతోంది. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు వంటి సంప్రదాయ మార్కెట్లతో పాటు.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో కూడా రుణాల వృద్ధి వేగంగా నమోదవుతోంది.
ప్రజల్లో క్రెడిట్పై అవగాహన కూడా పెరిగిందని నివేదికలో వెల్లడైంది. 2018లో తమ క్రెడిట్ స్కోర్ను పరిశీలించే వారి సంఖ్య కేవలం 1 శాతం ఉండగా, 2026 నాటికి అది 35 శాతానికి పెరిగింది. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాల వినియోగం కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. అయితే.. కొత్తగా రుణాలు తీసుకునే వారి సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఇంకా అధికారిక రుణ వ్యవస్థలోకి రాని వ్యక్తులు, చిన్న వ్యాపారాలను చేర్చుకునేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని ట్రాన్స్యూనియన్ సిబిల్ అభిప్రాయపడింది. డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, ఫిన్టెక్ సేవల విస్తరణతో దేశంలో రుణాల లభ్యత మరింత పెరిగిందని సంస్థ పేర్కొంది.


