సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. లిఫ్ట్లో జరిగే ప్రమాదాలకు తయారీ సంస్థ, నిర్వహణ (మెయింటెనెన్స్) ఏజెన్సీ, భవన యజమాని/యాజమాన్యం సంయుక్తంగా బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. లిఫ్ట్లోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి తన భద్రతను పూర్తిగా ఆ వ్యవస్థపై నమ్మి అప్పగిస్తాడని, అందువల్ల ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం ఈ మూడు వర్గాల ప్రాథమిక బాధ్యత అని పేర్కొంది.
జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. లిఫ్ట్ను ‘కామన్ క్యారియర్’ (ప్రజా రవాణా సాధనం)గా పరిగణిస్తూ, ప్రయాణికుల భద్రత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసింది. పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లిఫ్ట్లు ప్రజల రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారాయని, కాబట్టి భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ తీర్పు 2003లో ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదానికి సంబంధించిన కేసులో వెలువడింది. మాజీ దౌత్యవేత్త విపిన్ హండా లిఫ్ట్లో చిక్కుకుని మరణించిన ఘటనలో, ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు రూ.3.01 కోట్ల పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే 2003 మార్చి 20 నుంచి వార్షిక 9 శాతం వడ్డీతో పరిహారం చెల్లించాలని, 90 రోజుల్లో చెల్లించకపోతే 12 శాతం వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ కేసులో లిఫ్ట్ తయారీ సంస్థ ఓటిస్ ఎలివేటర్ (ఇండియా) ప్రమాదానికి రెస్క్యూ ఆపరేషన్లో జరిగిన మానవ తప్పిదమే కారణమని వాదించింది. అయితే లిఫ్ట్లో చాలాకాలంగా సాంకేతిక లోపాలు ఉన్నాయని తెలిసినా, దానిని వినియోగానికి అనర్హమని ప్రకటించకపోవడం, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కంపెనీ నిర్లక్ష్యమేనని సుప్రీంకోర్టు తేల్చింది.
అలాగే నిర్వహణ పనులను పర్యవేక్షించిన మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని, భవనాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వ విభాగం కూడా వరుస ఫిర్యాదులు వచ్చినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని కోర్టు పేర్కొంది. దీంతో పరిహారం చెల్లింపులో ఓటిస్ ఎలివేటర్ కంపెనీ 70 శాతం, ఎంఈఎస్ 25 శాతం, సంబంధిత ప్రభుత్వ శాఖ 5 శాతం బాధ్యత వహించాలని ధర్మాసనం ఆదేశించింది.
అదే సమయంలో బాధితులు పరిహారం కోసం ఎవరి తప్పెంతో నిరూపించాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రమాదానికి బాధ్యులైన వారిలో ఎవరినైనా ఆశ్రయించి పూర్తి పరిహారం కోరవచ్చని, అనంతరం సంబంధిత సంస్థలు తమ మధ్య బాధ్యతల వాటాను నిర్ణయించుకోవచ్చని తెలిపింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా లిఫ్ట్ల భద్రత, నిర్వహణ ప్రమాణాలు, భవన యాజమాన్యాల బాధ్యతల విషయంలో కీలక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా నివాస, వాణిజ్య, ప్రభుత్వ భవనాల్లో లిఫ్ట్ల నిర్వహణపై మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ తీర్పు స్పష్టం చేసింది.


