ప్రియాంకా గాందీకి 215 మంది విద్యావేత్తల లేఖ
న్యూఢిల్లీ: ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి గోమూత్ర నిపుణుడు అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా చేసిన ఆరోపణలపై 215 మందికి విద్యావేత్తలు, ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమెను బహిరంగ లేఖ రాశారు. హేతుబద్ధమైన చర్చకు ఎగతాళి ప్రత్యామ్నాయం కాదని తేల్చిచెప్పారు. పలువురు వైస్ ఛాన్సలర్లు, మాజీ వైస్ ఛాన్సలర్ల ఈ లేఖపై సంతకం చేశారు.
‘‘ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి గోమూత్ర నిపుణుడు అంటూ మీరు(ప్రియాంక) అభివరి్ణంచినట్లు వచ్చిన వార్తలపై నిరాశ వ్యక్తం చేస్తున్నాం. అది వ్యంగ్యంగా చేసినా లేక రాజకీయ వాక్చాతుర్యంతో చేసినా అటువంటి వర్ణన సరైంది కాదు. ప్రొఫెసర్ కామకోటి మన దేశంలో అగ్రశ్రేణి శాస్త్రీయ, సాంకేతిక సంస్థల్లో ఒకటైన విద్యాసంస్థకు అధిపతిగా పని చేస్తున్నారు. ప్రతి విద్యావేత్తలాగే ఆయనకు కూడా తన అభిప్రాయాలు చెప్పడానికి, సాంప్రదాయ జ్ఞానా న్ని చర్చించడానికి, శాస్త్రీయ సంభాషణలో పాల్గొనడానికి హక్కు ఉంది.
ఒక విద్యావేత్త అభిప్రాయాల్లోని సారాంశాన్ని పరిశీలించకుండా, కేవలం ఒక ముద్ర వేసి కొట్టిపారేయడం సమంజసం కాదు. ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని మన రాజ్యాంగం సూచిస్తోంది. అలాంటి దృక్పథాన్ని తప్పుపట్టకూడదు’’అని లేఖలో స్పష్టంచేశారు. నీట్ లీక్ వివాదం తర్వాత పరీక్షల సంస్కరణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్లో ప్రొఫెసర్ వి.కామకోటి కూడా సభ్యుడే. మంగళవారం లోక్సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ఈ టాస్క్ ఫోర్స్లో మాజీ ఐబీ చీఫ్, ఒక ఐటీ కంపెనీ యజమాని, ఇంకా ఒక గోమూత్ర నిపుణుడు ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు.


