సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో క్రూరమైన కాల్ మనీ మాఫియా మళ్లీ విజృంభిస్తోందని.. ఈ మాఫియాలో ఎంపీ కేశినేని చిన్ని, అతని ప్రధాన అనుచరుడు మూల్పూరి కిషోర్ పాత్ర ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు.
‘‘విజయవాడకు చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రీ రూ.5 కోట్లు అప్పు తీసుకుని.. అసలు-వడ్డీ కలిపి మొత్తం రూ. 21 కోట్లు పూర్తిగా తిరిగి చెల్లించింది. అయినా ఎంపీ కేశినేని చిన్ని, ఆయన ప్రధాన అనుచరుడు ముల్పూరి కిశోర్లు వేధిస్తున్నారు. బాపులపాడు మండలంలోని ఆమెకు చెందిన 11 ఎకరాల విలువైన భూమిని ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా కబ్జా చేయడానికి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
..బాధితురాలి ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేసిన నిందితులపై మాచవరం పోలీస్ స్టేషన్ లో FIR No. 174/2026 నమోదైనప్పటికీ, ఎంపీ కార్యాలయం అండతో పోలీసులు నిందితులను ముట్టుకోవడానికి భయపడుతున్నారు. సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులను ప్రైవేట్ గూండా సైన్యంగా మార్చుకుని అమాయక విజయవాడ పౌరులపై అర్ధరాత్రి వేళల్లో వేధింపులకు పాల్పడుతున్నారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న హ్యాబిచువల్ అఫెండర్ కిశోర్పై తక్షణమే "పీడీ యాక్ట్" ప్రయోగించి జైలుకు పంపి విజయవాడ ప్రజలకు భోరోసా కల్పించాలి
2015 నాటి కాల్ మనీ వ్యవహారం తరహాలోనే సీఎం తక్షణమే ఈ అధికార గర్వంతో సాగుతున్న మాఫియా సామ్రాజ్యాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలి. బాధితురాలి కుటుంబానికి, ఆమె ఆస్తికి రౌండ్-ది-క్లాక్ పోలీస్ రక్షణ కల్పించాలి. విజయవాడ పౌరుల ఆస్తులకు, ప్రాణాలకు భద్రత కల్పించే వరకు సామాన్యుల తరఫున నా ఈ పోరాటం ఆగేది లేదు’’ అని కేశినేని నాని లేఖలో పేర్కొన్నారు.


