న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉధృత రూపం దాల్చాయి. ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబైలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగగా.. కేరళ, ఒడిశా రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
ముంబైలో శనివారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వే కార్యకలాపాలను గంటపాటు నిలిపివేశారు. దీనివల్ల విమానాల రాకపోకల్లో సగటున 30 నుంచి 75 నిమిషాల ఆలస్యం చోటుచేసుకుంది. నగరంలో 24 గంటల్లో గరిష్టంగా 200 నుంచి 300 మి.మీ వర్షపాతం నమోదైంది.
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఒడిశాలోని అన్ని జిల్లాలను యంత్రాంగం అప్రమత్తం చేసింది. కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్నూర్, కాసరగోడ్ సహా పలు ఉత్తర జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటించారు. వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. జాతీయ రాజధాని ఢిల్లీ, జార్ఖండ్లలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: ‘కలల నగరం’ కథలే వేరు..


