న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర కాంగ్రెస్ నేతలు లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చేతులు కట్టేసుకుని వారు నిరసన తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేతలను పోలీసులు కోరుతున్నారు. సీజేపీ ర్యాలీ వేళ భద్రతా బలగాలు విద్యార్థులపై ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ఈ నిరసన చేపట్టింది.
లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ మాట్లాడుతూ.. "మమ్మల్ని అత్యంత దారుణంగా అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న ఢిల్లీ పోలీసులు మా విద్యార్థులపై దారుణంగా వ్యవహరించినందుకు నిరసన తెలిపేందుకు ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్నాం. ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కేంద్ర హోంమంత్రి కూడా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ప్రధానమంత్రి నోరు కూడా విప్పడం లేదు" అని అన్నారు.
అదుపులోకి తీసుకున్న తర్వాత పంజాబ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ చరణ్జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ.. "ఇది బీజేపీ ఉగ్రవాదం. వారు విద్యార్థుల మాట వినడం లేదు..." అని ఆరోపించారు.


