ప్రశ్నపత్రాల రూపకల్పన, అనువాదంలో ఒకే వ్యక్తులు
ప్రశ్నల నిధి పేరిట తుది ప్రశ్నలు అమ్మకం
మనీషా వాఘ్మారే ద్వారా చేతుల మారిన నీట్ ప్రశ్నపత్రం
దర్యాప్తులో గుర్తించిన సీబీఐ
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, అనువాదంలో ఒకే బృందంలోని వ్యక్తులు పాలుపంచుకోవడం నీట్ పేపర్ లీకేజీకి గల కారణాల్లో ఒకటని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ లోపాలను అనధికారికంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి తెలియజేశామని, తమ అధికారిక సిఫార్సుల్లో కూడా ఈ అంశాన్ని చేర్చే అవకాశం ఉందని వెల్లడించాయి.
నీట్–యూజీ 2026 అవకతవకలు 2024 నాటి అక్రమాలకు పూర్తిగా భిన్నమైనవి పేర్కొన్నాయి. 2024లో ఒక పరీక్ష కేంద్రం ఇన్చార్జ్ పేపర్ లీక్ ముఠాతో కుమ్మక్కై ప్రశ్నపత్రాల దొంగతనానికి, వ్యాప్తికి సహకరించాడని దర్యాప్తులో పాల్గొన్న అధికారులు తెలిపారు. 2024 నాటి కేసులో దర్యాప్తు అనంతరం ప్రశ్నపత్రాల రవాణా, నిర్వహణ, పరీక్షకు సంబంధించిన వ్యవస్థాగత మార్పులపై సీబీఐ ఎన్టీఏకు పలు సూచనలు చేసిందని తెలియజేశారు. ఈ సూచనలను 2025, 2026లో నీట్ నిర్వహణలో ఎన్టీఏ అమలు చేసిందని, అందువల్ల సాంకేతికంగా ఎటువంటి ‘లీక్’జరగలేదని చెప్పారు.
2026లో ఎన్టీఏ ప్యానెల్లోని ప్రశ్నపత్రాల రూపకర్తలు, వాటిని మరాఠీ భాషలోకి అనువాదం చేసిన పి వి.కుల్కారీ(కెమిస్ట్రీ), మనీషా గురునాథ్ మంధారే(ఫిజిక్స్), మనీషా సంజయ్ హవల్దార్(బయాలజీ) పుణెలో తమ ట్యూషన్ తరగతుల్లోని విద్యార్థులతో తుది ప్రశ్నలను కంఠస్థం చేయించారని సీబీఐ అధికారులు తెలిపారు. ఆ ప్రశ్నలతో ఒక ప్రశ్నల నిధిని తయారుచేసి, ఎంపిక చేసిన విద్యార్థులకు ఇచ్చారని చెప్పారు.
నీట్ ప్రశ్నపత్రాల రూపకర్తలతో పరిచయం ఉన్న స్థానిక బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే ఆ విద్యార్థుల నుంచి ఈ ప్రశ్నల సమాచారాన్ని సంపాదించింది, ధనంజయ్ నివృత్తి లోఖండే అనే వ్యక్తికి విక్రయించిందని పేర్కొన్నారు. అతడు ఆ పేపర్ను ఇతర మధ్యవర్తులకు అందించాడని తెలియజేశారు. ఆ తర్వాత నీట్ ప్రశ్నలు పలు రాష్ట్రాల్లో పంపిణీ అయ్యాయని స్పష్టంచేశారు. మనీషా వాఘ్మారే గనుక ఈ వ్యవహారంలోకి రాకపోయి ఉంటే ప్రశ్నపత్నం ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు చేరి ఉండేది కాదని, ఈ లీకేజీ ఉదంతం వెలుగులోకి వచ్చేది కాదని వివరించారు. లోఖండే లక్షలాది రూపాయలకు నీట్ పేపర్లు విక్రయించాడని చెప్పారు.


