పెల్లెట్‌ గన్స్‌ను నిషేధించలేం  | Pellet guns cannot be prohibited, Says Supreme Court | Sakshi
Sakshi News home page

పెల్లెట్‌ గన్స్‌ను నిషేధించలేం 

Jul 31 2026 5:25 AM | Updated on Jul 31 2026 5:25 AM

Pellet guns cannot be prohibited, Says Supreme Court

మార్గదర్శకాలు అనుమతిస్తున్నంత కాలం వాటిని ఉపయోగించవచ్చు  

సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ  

బాధితులకు చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశం  

కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌ఏఎఫ్‌ ఐజీకి నోటీసులు  

ఆర్‌ఏఎఫ్‌ మందుగుండు సామగ్రి వివరాలను భద్రపరచాలని వెల్లడి  

న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడానికి వీల్లేదని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, పెల్లెట్‌ గన్స్‌ను నిషేధించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భద్రతా సంస్థలు అసాధారణ పరిస్థితుల్లో జన సమూహాన్ని అదుపు చేయడానికి పెల్లెట్‌ గన్‌లను ఉపయోగించవచ్చని ప్రస్తుత మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయని పేర్కొంది.

 ఈ మార్గదర్శకాలు అమల్లో ఉన్నంతకాలం వాటిపై నిషేధం విధించలేమని స్పష్టం చేసింది. కానీ, పెల్లెట్‌ గన్స్‌ దుర్వినియోగానికి సంబంధించిన నిర్దిష్ట ఆరోపణలను ఒక్కో కేసును బట్టి పరిశీలించవచ్చని సూచించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనల సమయంలో మెటాలిక్‌ పెల్లెట్‌ గన్‌ల ప్రయోగాన్ని సవాలు చేయడంతోపాటు వీటిని పూర్తిగా నిషేధించాలని కోరుతూ మాజీ కేంద్ర సమాచార కమిషనర్‌ యశోవర్దన్‌ ఆజాద్, మరో ఇద్దరు బాధితులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

దీనిపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. జంతర్‌మంతర్‌ వద్ద మోహరించిన రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌ఏఎఫ్‌)కు సంబంధించిన మందుగుండు సామగ్రి వివరాలను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(బీపీఆర్‌డీ) మార్గదర్శకాల ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్‌ గన్స్‌ ఉపయోగించే అధికారం పోలీసులకు ఉందని ధర్మాసనం వెల్లడించింది. వీటి వినియోగంపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లోని అభ్యర్థన అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. 

అసాధారణ సందర్భాల్లో పోలీసు నిబంధనలు పెల్లెట్‌ గన్‌ల వాడకాన్ని అనుమతిస్తాయని గుర్తుచేసింది. ఒకవేళ పెల్లెట్‌ గన్స్‌ను దశలవారీగా తొలగించాలని భావిస్తే.. అది ఆరి్టకల్‌ 21(జీవించే హక్కు)కి విరుద్ధంగా ఉందని పేర్కొంటూ పోలీసు నిబంధనలను సవాలు చేయాల్సి ఉంటుందని తెలియజేసింది. జూలై 20న ఢిల్లీలో పెల్లెట్‌ గన్‌ గాయాలకు గురైన ప్రశాంత్‌ కుమార్, షేక్‌ ఇర్షాద్‌ మన్సూరీ, ఇతరులకు తగిన చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌ఏఎఫ్‌ ఐజీకి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో నిరసనకారులపై పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించడం పట్ల సమాధానం చెప్పాలని పేర్కొంది. పెల్లెట్‌ గన్స్‌ వంటి ఆయుధాల వాడకాన్ని అనుమతించే పోలీసు నిబంధనలను సవాలు చేయకుండా.. గుంపును చెదరగొట్టడానికి పెల్లెట్‌ గన్‌ల వాడకంపై నిషేధం విధించాలన్న అభ్యర్థన అస్పష్టంగా ఉందని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement