సాక్షి, హైదరాబాద్: ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ వ్యయంపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. విమానాశ్రయం అంచనా వ్యయంలో కొంత మాత్రమే నిర్మాణ సంస్థ వెచ్చించిందని ఆరోపించారు. మిగిలిన మౌలిక వసతులన్నీ ఏపీ ప్రభుత్వమే సమకూర్చిందని గుర్తు చేశారు. సుమారు 2 వేల ఎకరాల భూమి రైతుల దగ్గర సేకరించి ఉచితంగా నిర్మాణ సంస్థకు ఇచ్చిందని, దీనికి పూర్తిస్థాయిలో డబ్బు చెల్లించలేదని ఆరోపించారు.
నిర్మాణ సంస్థకు భారీగా రాయితీలు కల్పించి పెట్టుబడి ముసుగులో యూజర్ డెవలప్మెంట్ ఫీజును ప్రయాణికుల నుంచి వసూలు చేయడానికి అనుమతిచ్చిందని దుయ్యబట్టారు. ఈ స్థాయిలో లబ్ధి చేకూర్చడం వెనుక ఏపీ మంత్రి లోకేష్ వర్గం ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రయాణికులపై మోపిన అదనపు చార్జీలను తక్షణమే తొలగించి, సామాన్యులకు ఉపశమనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


