రాజకీయాల్లో మాటలు ఒక్కోసారి ఆయుధాలుగా మారుతాయి. ఒకరి వ్యాఖ్యలు మరొకరి ప్రచారానికి అస్త్రాలవుతాయి. కానీ ఆ మాటల వెనుక ఉన్న మనిషి జీవితం, ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం చాలాసార్లు కనిపించవు. భోగాపురం ఎయిర్పోర్టు వ్యవహారంలో ఇప్పుడు చర్చకు వచ్చిన నరసాయమ్మ విషయంలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.
దాదాపు పదేళ్ల క్రితం భోగాపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు సర్కార్ చేపట్టిన భూసేకరణ, రైతులకు పరిహారం అంశాలను ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే..
నరసాయమ్మ తన భూమి కోల్పోతున్న ఆవేదనను వేదికపై వ్యక్తం చేసింది. ఎర్రబస్సు రాని చోటుకి ఎయిర్బస్ ఎందుకు? సర్.. అంటూ మాట్లాడింది( ఈ వ్యాఖ్యలనే జగన్ ప్రస్తావిస్తే.. జగనే ఆ మాట అన్నారని టీడీపీ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది). ఆనాడు అయ్యన్నపాత్రుడి భూముల జోలికి పోకుండా.. ప్రభుత్వం తన కుటుంబానికి ఉన్న రెండెకరాల భూమి బాబు సర్కార్ లాక్కుంటుందనే విషయం ప్రస్తావించి.. న్యాయం కావాలని జగన్ సమక్షంలో వేడుకుంది.
అయితే భోగాపురం ఘనత ఎవరిది? అనే ప్రస్తుత చర్చ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు, ప్రచారాలకు వేదికగా మారాయి. ఎయిర్పోర్టు విషయంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరి నిర్ణయాల వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లింది? ఎలా పూర్తైంది? అనే క్రెడిట్ వార్లో నరసాయమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. నరసాయమ్మ ఎక్కడ?.. ఎయిర్బస్సు వచ్చింది చూడమ్మా?.. జగన్ నీ నెత్తిన చెయ్యి పెట్టాడు.. అంటూ ఇలా ఆమెపై అభ్యంతకర సందేశాలు కనిపిస్తున్నాయి పలు పేజీల్లో.
భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో వైస్సార్సీపీ, కూటమి నేతలు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు భూసేకరణలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేశామని, పరిహారం సైతం ఇప్పించామని, శంకుస్థాపనతో పనులు ప్రారంభించిందే తమ ప్రభుత్వమని వైఎస్సార్సీపీ లెక్కలతో చెబుతుంటే.. మరోవైపు ప్రాజెక్టు ప్రతిపాదన చేసింది తమదే కాబట్టి ఎంటైర్ క్రెడిట్ తమదేనని చంద్రబాబు పార్టీ చెబుతోంది. వాస్తవానికి విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా.. బలవంతపు భూసేకరణతో రైతులకు అన్యాయం చేయడం ఎందుకని? మాత్రమే జగన్ అన్నారు. అంతేగానీ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో ఏమాత్రం కాదు. ఆ ఉద్దేశమే ఉంటే.. ఉత్తరాంధ్రను అసలు పట్టించుకునేవారే కాదు కదా!. అధికారంలోకి రాగానే భోగారం ఎయిర్పోర్ట్ భూసేకరణను తగ్గించి.. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించి.. అన్ని అనుమతులతో శంకుస్థాపన చేసే వారా?.. అయితే ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య పాపం నరసాయమ్మ సోషల్ మీడియాకు ఎక్కింది.
గతంలో తెనాలికి చెందిన గీతాంజలి ఘటనను గుర్తు చేసుకుంటే.. సోషల్ మీడియా చర్చలు, ట్రోలింగ్లు ఒక వ్యక్తి జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో అర్థమవుతుంది. వైఎస్ జగన్ వల్లే తన కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పినందుకు.. ఆమెను నెట్టింట తెగ ట్రోల్ చేశారు. అది చేసింది ఎవరో అందరికీ తెలుసు. అది తట్టుకోలేక మనస్థాపంతో బలన్మరణానికి పాల్పడిందామె. అంతకు ముందు బెండపూడి విద్యార్థిని విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు.. నరసాయమ్మను ఆ స్థాయిలోనే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక సాధారణ మహిళ మాట్లాడిన మాటలను రాజకీయ కోణంలో చూసి వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రమాదకర ధోరణి. భోగాపురం విషయంలోనూ నరసాయమ్మను ఒక రాజకీయ ప్రతీకగా మార్చకుండా.. ఆమె ఒక సాధారణ మహిళ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. రాజకీయ విమర్శలు ఉండొచ్చు.. కానీ ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం సాగకూడదు.
క్రెడిట్ కోసం ఒక మహిళను పావుగా మార్చే రాజకీయ ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, నరసాయమ్మ విషయంలోనైనా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త అవసరం.
అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే సంస్కృతి ఎంతటి పార్టీకైనా, ఏ వర్గానికైనా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తుల జీవితాలపై కాదు. రాజకీయ లాభాల కోసం ఆమెను తెరపైకి తీసుకొచ్చి, తమకు అనుకూలమైన కథనాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగితే అది మరో అన్యాయమే అవుతుంది.


