సాక్షి, విజయనగరం: భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్కే దక్కుతుందని.. ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు తేల్చి చెప్పారు. గురువారం.. వైఎస్ జగన్ విశాఖ మీదగా శ్రీకాకుళం వెళ్తున్న సందర్భంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ వద్ద ‘థ్యాంక్యూ జగన్ సార్’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భోగాపురం అభివృద్ధి ఏవిధంగా జరిగిందో తెలిపారు. అసలేం జరిగిందో భూములిచ్చిన తమకు తెలుసన్నారు. వైఎస్ జగన్ కృషితోనే ఇది జరిగిందన్నారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ కష్ట ఫలితం.. కానీ చంద్రబాబు మేం చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మరన్నారు. ఆనాడు రైతులను మోసం చేయడానికి 15 వేల ఎకరాలు తీసుకుంటానని చంద్రబాబు చెప్పితే.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2500కి తగ్గించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పునరావాసం కల్పించి.. అన్నివిధాలుగా ఆదుకున్నారన్నారు.
‘‘సౌకర్యాలు కల్పించి రైతులకు వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం దారుణం. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కారణం ఎవరో? ఏం జరిగిందో? భూములిచ్చిన రైతులకు తెలుసు’’ అని స్థానికులు పేర్కొన్నారు.


