ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కోటా ఒకేసారి
నెలంతా తెరిచి ఉండనున్న చౌకధరల దుకాణాలు
సాక్షి, హైదరాబాద్: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో శనివారం నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని లబ్దిదారులకు అందజేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా చౌకధరల దుకాణాలు ఆగస్టు నెల మొత్తం పనిచేయనున్నాయి. రాష్ట్రంలో సుమారు 1.06 కోట్ల రేషన్ కార్డులపై 3.41 కోట్ల మంది లబ్దిదారులు ఈ పంపిణీ ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
మూడు నెలల కోటాను ఒకేసారి అందించేందుకు దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో లబ్దిదారులు ఈ–పోస్ యంత్రాల ద్వారా మూడు విడతల బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే రేషన్ బియ్యం అందజేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది.
అధికారులు అన్ని చౌకధరల దుకాణాల్లో తగిన బియ్యం నిల్వలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ నిర్వహించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వం గతంలో కూడా ఇదే విధానంలో మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయడం తెలిసిందే.


