మిస్సోరీ: అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అక్కడ జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 11 మంది స్కైడైవర్లు, ఒక పైలట్ సహా మొత్తం 12 మంది దుర్మరణం పాలయ్యారు. బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కైడైవింగ్ కోసం ప్రయాణికులను తీసుకెళ్తున్న పసిఫిక్ ఎయిరోస్పేస్ పీ-750ఎల్(Pacific Aerospace P750XL) సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సమస్యలను ఎదుర్కొంది. విమానం అవసరమైన ఎత్తుకు చేరుకోకముందే అకస్మాత్తుగా ఎడమవైపు తిరిగింది. అనంతరం రన్వేకు సుమారు 300 గజాల దూరంలో నేలపై కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. విమానాన్ని నిర్వహిస్తున్న Skydive Kansas City సంస్థ ఒక ప్రకటనలో ప్రమాదంలో ఉన్న 12 మందీ మరణించినట్లు ధృవీకరించింది. మృతుల్లో 11 మంది స్కైడైవర్లు కాగా, మరో వ్యక్తి పైలట్ అని వెల్లడించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతే మృతుల పేర్లను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదాన్ని పలువురు కుటుంబ సభ్యులు తమ కళ్లముందే చూసినట్లు బేట్స్ కౌంటీ షెరీఫ్ చాడ్ ఆండర్సన్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.
🚨😭 12 killed in plane crash near Butler, Missouri. A skydiving plane went down shortly after takeoff from Butler Memorial Airport this morning, with all 11 skydivers and the pilot perishing in the crash.
Our deepest condolences go out to all the families and loved ones… pic.twitter.com/mU8EdLrmrZ— The Watchdog (@TheWatchdoggs) June 14, 2026
బేట్స్ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డైరెక్టర్ డెన్నిస్ జాకబ్స్ ప్రాథమిక అంచనా ప్రకారం.. పైలట్ సమీపంలోని రహదారిపై అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నించి ఉండొచ్చని ఆయన తెలిపారు. అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, అధికారిక కారణం ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో విమానం ఇంకా తక్కువ ఎత్తులోనే ఉండటంతో స్కైడైవర్లలో ఎవరూ దూకే అవకాశం పొందలేదని అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో పూర్తిగా పరిశీలించినప్పటికీ ఎలాంటి ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు కనిపించలేదని తెలిపారు.
ఈ ఘటనపై ఏవిషేయన్ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. విమానం నిర్వహణ చరిత్ర, సాంకేతిక పరిస్థితి, పైలట్ వివరాలు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించే తుది నివేదిక రావడానికి 12 నుంచి 24 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఎన్టీఎస్బీ పేర్కొంది. ఈ ఘటనతో మిస్సోరీ రాష్ట్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్కైడైవింగ్ కోసం ఉత్సాహంగా బయలుదేరిన 12 మంది జీవితాలు క్షణాల్లో ముగియడంతో స్థానిక సమాజం శోక సంద్రంలో మునిగిపోయింది.


