నిపా కలకలం: క్షీణించిన బాధితుడి ఆరోగ్యం.. అబ్జర్వేషన్‌లో 100 మంది ! | Nipah Terror in Kerala 100 Under Watch as Patient Fights for Life | Sakshi
Sakshi News home page

నిపా కలకలం: క్షీణించిన బాధితుడి ఆరోగ్యం.. అబ్జర్వేషన్‌లో 100 మంది !

Jun 14 2026 11:58 AM | Updated on Jun 14 2026 12:45 PM

Nipah Terror in Kerala 100 Under Watch as Patient Fights for Life

కోజికోడ్‌: కేరళను మరోసారి నిపా వైరస్ వణికిస్తోంది. కోజికోడ్‌లో నిపా పాజిటివ్‌గా తేలిన 43 ఏళ్ల వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్ర అప్రమత్తమైంది. బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య నిపుణులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 

వెంటిలేటర్‌పై బాధితుడు.. మెడికల్ బోర్డ్ భేటీ
ఫారూఖ్ కాలేజీ ప్రాంతానికి చెందిన ఈ బాధితుడికి ప్రస్తుతం చికిత్సా ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన అన్ని రకాల మందులను అందజేస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 48 గంటల తర్వాత బాధితుడి ఆరోగ్య పరిస్థితిని మెడికల్ బోర్డ్ నిశితంగా సమీక్షించనుంది. ఆ తర్వాతే ఆయనకు రెండో డోస్ ‘మోనోక్లోనల్ యాంటీబాడీ’ చికిత్సను అందించాలా వద్దా అనే దానిపై వైద్యులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

కొత్తగా ఇద్దరు స్నేహితులు చేరిక
మరోవైపు బాధితుడికి అత్యంత సమీపంగా ఉన్న భార్య, కుమారుడు, సోదరిల నుంచి సేకరించిన నమూనాల పరీక్షల్లో నిపా నెగెటివ్‌గా తేలడం కాస్త ఊరటనిచ్చే అంశం. శనివారం నాడు మరో నలుగురు లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా, ప్రస్తుతం మొత్తం ఏడుగురు అనుమానితులు కోజికోడ్ మెడికల్ కాలేజీలో అబ్జర్వేషన్‌లో ఉన్నారు. బాధితుడితో పరిచయం ఉన్న ఇద్దరు స్నేహితులకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వారిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. అలాగే బాధితుడు వెళ్లిన రెడ్ క్రెసెంట్ ఆసుపత్రిని సందర్శించిన 9 ఏళ్ల చిన్నారికి కూడా జ్వరం, దగ్గు రావడంతో ఐసోలేషన్‌కు తరలించి నమూనాలను పరీక్షలకు పంపారు.

100కి చేరిన నిఘా జాబితా
వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్‌ను ముమ్మరం చేశారు. కొత్తగా మరో 13 మందిని ఈ జాబితాలో చేర్చడంతో, ప్రస్తుతం నిఘాలో ఉన్న వారి సంఖ్య 100కు పెరిగింది. ఇందులో అత్యంత ప్రమాదకర విభాగం (వెరీ హై-రిస్క్)లో నలుగురు, హై-రిస్క్ విభాగంలో 14 మంది, తక్కువ ప్రమాదం (లో-రిస్క్) ఉన్న విభాగంలో 82 మంది ఉన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement