న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) రీ-ఎగ్జామ్ హాల్ టికెట్ల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు, జూన్ 14, 2026న రీ-నీట్ అడ్మిట్ కార్డలను అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో విడుదల చేయనుంది. జూన్ 21న జరగబోయే ఈ ప్రతిష్టాత్మక పరీక్ష కోసం అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను సిద్ధం ఉంచుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష హాల్లోకి అనుమతించాలంటే అడ్మిట్ కార్డ్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరి.
పరీక్ష సమయంలో మార్పులు.. మారిన నిబంధనలు
రీ-నీట్ పరీక్ష విధానంలో ఎన్టీఏ కొన్ని కీలక మార్పులు చేసింది. విద్యార్థులకు ఊరటనిస్తూ పరీక్ష సమయాన్ని 195 నిమిషాలకు పెంచింది. జూన్ 21న మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ పొడిగించిన సమయంలోనే తప్పనిసరి అధికారిక ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే రఫ్ వర్క్ చేసుకునేందుకు గతంలో ఇచ్చిన 2 పేజీల స్థానంలో ఈసారి 4 పేజీలను కేటాయించారు. క్వశ్చన్ బుక్లెట్ ప్రారంభంలో రెండు, చివర్లో రెండు పేజీలను ఉంచుతారు. ఈ సదుపాయం తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల పేపర్లలోనూ అందుబాటులో ఉంటుంది.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండిలా..
అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ను సులువుగా డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inని సందర్శించాలి. హోంపేజీలో కనిపించే 'NEET Re-Exam Admit Card 2026' లింక్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ నంబర్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. స్క్రీన్పై కనిపించే అడ్మిట్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోవాలి. హాల్ టికెట్లు పోస్ట్ ద్వారా పంపరు. అడ్మిట్ కార్డ్పై ఉన్న పేరు, రోల్ నంబర్, పరీక్ష కేంద్రం, ఫోటో, సంతకం వంటి వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులుంటే వెంటనే అధికారులను సంప్రదించాలని ఎన్టీఏ తెలిపింది.
నెగెటివ్ మార్కింగ్ జాగ్రత్త.. లీక్ వార్తలపై క్లారిటీ
ఈ పరీక్ష మొత్తం 720 మార్కులకు జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీల నుండి 45 చొప్పున, బయాలజీ నుండి 90 చొప్పున మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి +4 మార్కులు లభిస్తాయి. తప్పు సమాధానానికి -1 మార్కు కట్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మరోవైపు, సోషల్ మీడియాలో రీ-నీట్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. టెలిగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లో తిరుగుతున్న ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, అభ్యర్థులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని స్పష్టం చేసింది.


