సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈసారి విస్తరణలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కీలక రాష్ట్రాల వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్కు కేంద్ర కేబినెట్లో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లు ఢిల్లీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. పంజాబ్కు చెందిన సీనియర్ నేత అయిన తరుణ్ చుగ్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా సిక్కులు, స్థానిక వర్గాలను ఆకట్టుకోవచ్చని మోదీ–షా ద్వయం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన ఎంపీ రాఘవ్ చద్దాకు సైతం మోదీ కేబినెట్లో బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది.
హైకమాండ్కు నమ్మకస్తుడిగా పేరొందిన చుగ్.. పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 సీట్లు కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించినట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకును పెంచడం, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకోవడంలోనూ ఆయన ప్రమేయం ఉందని చెబుతున్నాయి.


