న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) ఎంపీ సాయోని ఘోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఆందోళన కారణంగా ప్రజా సమస్యలను ప్రస్తావించలేకపోతున్నామని అన్నారు. వరుస అంతరాయాల కారణంగా ప్రజా ధనం వృధా అవుతోందని పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సజావుగా సాగేందుకు అధికార, విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
''పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. ప్రతిరోజూ సభకు అంతరాయం కలుగుతోంది, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అవుతోంది. ప్రశ్నోత్తరాల సమయంలో గానీ, జీరో అవర్లో గానీ మా నియోజకవర్గ సమస్యలను లేవనెత్తలేకపోతున్నాం. ఇది చాలా బాధాకరం, ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను వినిపించాలని మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సభను సజావుగా పనిచేయనివ్వాలని అభ్యర్థిస్తున్నాను. బయట మీరు ఏమైనా చేసుకోండి, కానీ సభ లోపల పార్లమెంటును సజావుగా నడపడం అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరి బాధ్యత''ని ఎంపీ సాయోని ఘోష్ (Saayoni Ghosh) అన్నారు.
సాయోని ఘోష్పై విమర్శలు
కాగా, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ మారిన సాయోని ఘోష్పై తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు మండిపడుతున్నారు. మమతా బెనర్జీ నెత్తిన పెట్టుకుంటే ఆమెపైనే తిరుగుబాటు చేసి పార్టీ ఫిరాయించిందని ఫైర్ అవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాపై విమర్శలు చేసిన ఆమె.. ఇప్పుడు అదే పని చేయడాన్ని తప్పుబడుతున్నారు. కష్టకాలంలో మమతకు అండగా నిలబడాల్సింది పోయి, వెన్నుపోటు పొడుస్తావా అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబడుతున్నారు.
చదవండి: ఇథనాల్ పెట్రోల్ స్కామ్ను బయటపెడతా


