పహల్గాంకు ఉగ్రవాదులు ఎలా వచ్చారు?.. బోర్డర్‌లో భద్రత లేదా? | BJP Slams Congress Chidambaram Over Pahalgam Incident | Sakshi
Sakshi News home page

BJP Vs Congress: పహల్గాంకు ఉగ్రవాదులు ఎలా వచ్చారు?.. బోర్డర్‌లో భద్రత లేదా?

Jul 28 2025 11:20 AM | Updated on Jul 28 2025 11:28 AM

BJP Slams Congress Chidambaram Over Pahalgam Incident

ఢిల్లీ: పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌పై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది.

అయితే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో స్వదేశీ ఉగ్రవాదులే పాల్గొని ఉండవచ్చు. ఈ దాడికి పాల్పడిన హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఎక్కడ. అవి కేంద్రం, ఇంటెలిజెన్స్‌ వద్ద ఉన్నాయా?. ఉగ్రవాదుల్ని గుర్తించారా? వారు ఎక్కడ నుంచి వచ్చారు? నా ఉద్దేశ్యం ప్రకారం వారు స్వదేశీ ఉగ్రవాదులు కావచ్చు. వారు పాకిస్తాన్ నుంచి వచ్చారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దానికి ఆధారాలు లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎన్ఐఏ విచారణను ప్రభుత్వం వెల్లడించడానికి ఇష్టపడటం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్‌లో ప్రభుత్వం నష్టాలను దాచిపెట్టిందని చిదంబరం ఆరోపించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఎన్ని నష్టాలను చవిచూసినా, దానిని స్పష్టంగా చెప్పందని, యుద్ధంలో నష్టాలు అనివార్యమైనవని, ప్రభుత్వం నష్టాలను అంగీకరించాలని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు.

చిదంబరం వ్యాఖ్యలకు తాజాగా బీజేపీ నేత అమిత్ మాలవీయా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. యూపీఏ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన  చిదంబరం అపఖ్యాతి పాలైన ‘కాషాయ ఉగ్రవాదం’ సిద్ధాంతానికి మూల ప్రతిపాదకుడు. మరోసారి తనను తాను కీర్తించుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్‌కి క్లీన్ చిట్ ఇవ్వడానికి కాంగ్రెస్ తొందరపడుతోంది. కాంగ్రెస్ నాయకులకు భారతదేశ ప్రతిపక్షం కన్నా ఇస్లామాబాద్ రక్షణ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో చర్చకు ముందే కాంగ్రెస్ పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని ఘాటు విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఇమ్రాన్‌ మసూద్‌ స్పందిస్తూ.. చిదంబరం వ్యాఖ్యలు సరైనవే. పహల్గాం దాడి ఘటనలో స్వదేశీ ఉగ్రవాదులే పాల్గొన్నారు. సరే.. బీజేపీ నేతలు చెబుతున్నట్టు పాకిస్తాన్‌ ఉగ్రవాదులే ఈ దాడి చేస్తే.. మన సరిహద్దు ప్రాంతం భద్రత ప్రశ్నార్థకంగా ఉందా?. సరిహద్దులు భద్రంగా లేవా?. నిజంగా వారు సరిహద్దులు దాటి వస్తే.. సెక్యూరిటీ ఏం చేస్తోంది?. వారు ఎక్కడి నుంచి వచ్చారు.. ఎలా వెళ్లిపోయారు?. ఈ విషయం తెలుసుకునే హక్కు మాతో పాటు.. దేశ ప్రజలకు కూడా ఉంది అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement