మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరానికి ఊరట లభించింది. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఆయన బెయిల్ లభించింది. కొన్ని కఠినమైన షరతులతో ఎర్నాకుళం జిల్లా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2022లో దర్శకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్పై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో కొచ్చిలోని ఒక అపార్ట్మెంట్లో చిత్రనిర్మాత తనతో అనుచితంగా ప్రవర్తించాడని మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది అయితే చిదంబరం మంజుమ్మెల్ బాయ్స్ తెరకెక్కించే సమయంలో ఆమెను కలిశానని.. కేవలం ఆమెను ఒక పాత్ర కోసం మాత్రమే పరిగణించారని చెప్పారు. ఆమె ప్రవర్తన తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో చిదంబరం తరఫున వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.


