సాక్షి, వైఎస్సార్ జిల్లా: సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించడం లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన అనుభవాన్ని ఊరారా తప్పుడు ప్రచారాన్ని చేయడానికే వినియోగిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
‘‘దేశంలో నాకంటే సీనియర్ లేడని చెప్పుకునే చంద్రబాబు.. అబద్ధాలపైనే బతకాల్సిన పరిస్థితి. ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఓటుగా మార్చుకోవాలని చంద్రబాబు చూస్తాడు. అందుకే ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చెప్పుకోడానికి ఏమీ లేని పరిస్థితి. ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు అన్నాడు. వైఎస్సార్సీపీని మిగిలిన వారికి దూరం చేయాలని దుష్ప్రచారానికి దిగాడు. సుప్రీం కోర్టు చెప్పినా ఇంకా అదే దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడు.
..చివరికి మండలి చైర్మన్ కులాన్ని ప్రశ్నించే స్థాయికి మీ పార్టీ దిగజారింది. లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నాడు. మా నాయకుడు వైఎస్ వివేకా అంశంలోనే ఇదే తరహా రాజకీయం చేశాడు. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం కుటిల రాజకీయం చేశాడు. పాశవికంగా చంపిన వారీని దగ్గర పెట్టుకుని విషప్రచారం చేశాడు. నేడు సుప్రీం కోర్టులో వాస్తవలేంటి అనేది అందరికీ తెలిసిపోయింది. చంపిన వారు చంద్రబాబు ప్రభుత్వంలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు
..ఆనాడు 14 లక్షల కోట్ల అప్పు అన్న వ్యక్తి.. ఇప్పుడు 3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నాడు. నేడు రెండేళ్లలోనే మా ఐదేళ్లలో చేసిన అప్పులు చేశాడు. ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది ఎవరో ప్రజలు గమనించాలి. అన్ని అంశాల్లో మోసంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిరుద్యోగ భృతి నుంచి సూపర్ సిక్స్ గురించే కేటాయింపులు లేవు. చివరికి కేబినెట్పై కూడా పట్టు కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ నిన్నటి కేబినెట్ మీటింగ్కు రాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునే బిజీలో ఉన్నాడు. రాష్ట్రంలో రైతులు నానా తంటాలు పడుతుంటే వీళ్లు సినిమా ప్రమోషన్లో ఉన్నారు
..గత ఏడాది రైతులు అన్ని విధాల మోసం పోయారు. మళ్ళీ ఈ ఏడాది కూడా అదే తీరు. అన్నీ నేనే చేశాను అంటాడు. ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ అయినా నువ్వు చేసావా బాబు..?. నేడు రాయలసీమ లిఫ్ట్ ఫణంగా పెట్టిన నువ్వు రాయలసీమను ఉద్ధరిస్తావా?. ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతున్న నీకు దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. నేడు పాలల్లో, నెయ్యిలో ఎక్కడ చూసినా అన్నిటా కల్తీ. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సప్లై చేసి కోట్లు కొల్లగొట్టవ్. హెరిటేజ్కి ఎన్ని రాయితీలు తీసుకున్నావో ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. వివేకా కేసులో విచారించి వాస్తవాలెంటో తేల్చండి. ఎవరు తప్పు చేసినా మీరే చర్యలు తీసుకోండి’’ అంటూ శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు.


