బహ్రైచ్: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)అధినేత అసదుద్దీన్ ఒవైసీ సరికొత్త కలకలం రేపారు. బహ్రైచ్ జిల్లాలోని మటేరా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు పార్టీని వీడటంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఓవైసీ సంధించిన ప్రశ్న ఇప్పుడు యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
అఖిలేష్ యాదవ్కు సూటి ప్రశ్న
బహ్రైచ్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓవైసీ స్థానిక సమాజ్వాదీ పార్టీ ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. ‘మీరు ఓట్లేసి గెలిపించిన ఎస్పీ నాయకులు ఈ ప్రాంతానికి ఏం చేశారు? కనీసం ఒక ఆస్పత్రి కూడా నిర్మించలేదు’ అని ఆరోపించారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నుండి ఎంపీలు పార్టీలు మారిన ఉదాహరణను గుర్తు చేస్తూ.. ‘అఖిలేష్ యాదవ్.. మమతా బెనర్జీకి చెందిన 20 మంది ఎంపీలు పార్టీని ఎందుకు వీడి వెళ్లారో చెప్పండి? దీనిపై విపక్షాలు ఎందుకు మాట్లాడవు?’ అని ఒవైసీ ప్రశ్నించారు.
గౌరవప్రదమైన కూటమికే మొగ్గు
బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఒవైసీ స్పష్టం చేశారు. అయితే ఏ కూటమి అయినా 'గౌరవం, సమానత్వం' ఆధారంగానే సాగాలని, కేవలం ఎవరి కిందో ఉండి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సీట్ల పంపకాలు, రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో సమాన వాటా గురించే చర్చలు జరగాలన్నారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని, అధికారంలో భాగస్వామ్యం ఇవ్వని ఎస్పీ తీరును ఆయన తప్పుపట్టారు.
యోగీ ప్రభుత్వంపై ఎన్కౌంటర్ల అస్త్రం
యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. శాంతిభద్రతల పేరుతో రాష్ట్రంలో అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, పాలన అనేది చట్టబద్ధంగా సాగాలని హితవు పలికారు. సంభల్, వారణాసి మసీదు వివాదాలను ప్రస్తావిస్తూ.. ఇలాంటి చర్యల వల్ల ఏ సమాజపు విశ్వాసం బలహీనపడదని అన్నారు. రాబోయే 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దళిత-ముస్లిం ఐక్యత కోసం బీఎస్పీతో పొత్తు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఒవైసీ సంకేతాలిచ్చారు.
ఇది కూడా చదవండి: కేరళ: 3,125 బస్సుల్లో ఉచిత సేవలు షురూ!


