సంవత్సరానికి రూ.5,220 ఫీజు
ఎన్.ఎన్. ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్కు అప్పగిస్తూ ఉత్తర్వులు
కోట్ల విలువైన స్థలం అతి తక్కువ మొత్తానికే లీజుకివ్వడంపై అనుమానాలు
వక్ఫ్ బోర్డు తర్వాత ఉర్దూ అకాడమీ వంతు అనే ఆరోపణలు
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ బోర్డు ఆస్తుల ధారాదత్తం వ్యవహారం ఇంకా సద్దుమణగకముందే ఇప్పుడు తెలంగాణ ఉర్దూ అకాడమీ భూముల పందేరం మొదలైంది. కోట్ల రూపాయల విలువైన అకాడమీ స్థలాన్ని ఎలాంటి పబ్లిక్ నోటీసు లేకుండా ప్రైవేట్ కంపెనీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజకీయంగా తీవ్ర వివాదం రేగింది. ఉర్దూ అకాడమీ స్థలాన్ని ప్రైవేటుకు ఇవ్వడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపాదనలు అందడమే ఆలస్యం!
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, దర్గా హుస్సేన్ షా వలి గ్రామం, సర్వే నం.29లో ఉన్న తెలంగాణ ఉర్దూ అకాడమీకి చెందిన 1.04 ఎకరాలు (5,220 చదరపు గజాల )విలువైన భూమిని హైదరాబాద్కు చెందిన ఎన్.ఎన్. ఇన్ ఫ్రా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 30 సంవత్సరాల పాటు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీవోటీ) పద్ధతిలో లీజుకు ఇచ్చా రు. ఈ స్థలంలో ఉర్దూ ఘర్–షాదీఖానా–కమర్షియల్ కాంప్లెక్స్‘ నిర్మించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నిర్మాణ ఖర్చు మొత్తం లీజుకు తీసుకున్న కంపెనీయే భరించాలని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీవుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్, డైరెక్టర్ ఈ లీజు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా..అక్కడి నుంచి ప్రతిపాదనలు రావడమే ఆలస్యం అన్నట్లుగా ఆఘమేఘాల మీద ఫైలు కదలడం, లీజు ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం.
అనుమానాలు, ఆరోపణలు
ఈ ఆస్తిని అమ్మడం, తనఖా పెట్టడం, సబ్ లీజుకు ఇవ్వడం చేయకూడదని, భవనం పైభాగంలో ‘ఈ భూమి తెలంగాణ ఉర్దూ అకాడమీకి చెందినది‘ అని రాయాలని షరతులు విధించారు. అయితే ఎన్.ఎన్. ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్కు కేటాయించిన స్థలాన్ని సంవత్సరానికి రూ.5,220కే లీజుకివ్వడం గమనార్హం. కాగా కోట్ల విలువ చేసే 5,220 చ.గజాల స్థలానికి అతి తక్కువ లీజు ఫీజునే నిర్ణయించడంపై అనే క అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఎలాంటి పబ్లిక్ నోటీసు ఇవ్వకుండా నేరుగా ఒకే కంపెనీకి అప్పగించడంపై ఆరోపణలు విని్పస్తున్నాయి.
కార్యదర్శికి ఆ అధికారం లేదు: ఒవైసీ
ఈ వ్యవహారంపై హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం కార్యదర్శికి లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం, పబ్లిక్ నోటీసు ప్రక్రియను బైపాస్ చేశారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి‘ అని సీఎం రేవంత్రెడ్డిని ట్యాగ్ చేసి డిమాండ్ చేశారు. కొద్ది నెలల క్రితం మురికివాడల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా మరో ఉర్దూ సంస్థకు భూమి ఇవ్వడంపై వివాదం ఏర్పడిన విషయం విదితమే. కాగా ఇప్పుడు మళ్లీ అకాడమీ ఆస్తులను ప్రైవేట్ చేతులకు ఇవ్వడంతో ఉర్దూ అకాడమీ ఆస్తులు కూడా కాజేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల సంక్షేమం పేరుతో ఉన్న ఆస్తులను కార్పొరేట్ చేతులకు అప్పగిస్తున్నారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.


