వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుపై చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన రహస్య చర్చల ఫలితంగా కుదిరిన శాంతి ఒప్పందం చివరి దశలో ఉండగా, లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి.. మొత్తం ప్రక్రియను దాదాపు పట్టాలు తప్పించిందని ట్రంప్ ఆరోపించారు. నెతన్యాహు చాలా కఠినమైన వ్యక్తి అంటూ మండిపడ్డారు. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు దాదాపు చెడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నెతన్యాహూ చాలా కఠినమైన వ్యక్తి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చల ప్రక్రియను మరింత క్లిష్టం చేశాయి’ అని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇజ్రాయెల్కు బలమైన మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన ట్రంప్ నేరుగా నెతన్యాహూను విమర్శించడం విశేషంగా మారింది.
అయితే, ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి గనుక అణ్వాయుధం చిక్కి ఉంటే, రెండు గంటల్లో ఇజ్రాయెల్ భూమిమీద లేకుండా ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కాగా.. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పంద చర్చల్లో ఇజ్రాయెల్ ప్రత్యక్ష భాగస్వామిగా లేకపోవడం గమనార్హం. దీంతో ఒప్పందంలోని కొన్ని అంశాలను ఇజ్రాయెల్ అంగీకరించడం కష్టమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా-ఇరాన్ ఒప్పందంపై వార్తలు వెలువడిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ఇరాన్, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై కొనసాగుతున్న పోరాటాన్ని నిలిపివేయడానికి నెతన్యాహుపై అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
అమెరికా–ఇజ్రాయెల్ మధ్య విభేదాలా?
ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలపై కొత్త చర్చ మొదలైంది. ఇరాన్ అంశంలో ఇరు దేశాల తుది లక్ష్యం ఒకటే అయినప్పటికీ, దాన్ని సాధించే మార్గాల విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దౌత్య చర్చలు, ఒప్పందాలు, ఆంక్షల సడలింపులతో సమస్య పరిష్కారం చేయాలని అమెరికా భావిస్తుండగా.. కఠిన భద్రతా చర్యలు, సైనిక ఒత్తిడి, ముందస్తు దాడుల ద్వారా ఇరాన్ను నియంత్రించాలని ఇజ్రాయెల్ అనుకుంటోంది. ఈ రెండు విధానాల మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.


