కెనడా కార్చిచ్చు వేళ కీలక ప్రశ్న.. ఉండాలా? వెళ్లాలా? | Canada Wildfires Residents Stay And Defend Homes Story | Sakshi
Sakshi News home page

కెనడా కార్చిచ్చు వేళ కీలక ప్రశ్న.. ఉండాలా? వెళ్లాలా?

Aug 11 2026 1:27 PM | Updated on Aug 11 2026 1:40 PM

Canada Wildfires Residents Stay And Defend Homes Story

కెనడాలో కార్చిచ్చులు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో అగ్నిప్రమాదం ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇళ్లను, తమ ప్రాంతాలను వదిలి వెళ్లకుండా అక్కడే ఉండి మంటలను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇక్కడే ఉండి మంటలను ఎదుర్కొందాం’ అనే అక్కడి స్థానిక ప్రజల ఆలోచన తీరుపై కెనడాలో కొత్త చర్చ మొదలైంది.

ఉత్తర అంటారియోలోని గుల్‌ బే ఫస్ట్‌ నేషన్‌(Gull Bay First Nation) ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల హ్యూబర్ట్‌ విగ్వాస్‌ కూడా ఇలాగే తన ఇంటిని వదిలి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే, సమీపంలో కార్చిచ్చు చెలరేగడంతో ఇంటి పైకప్పుపై స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయిన వృద్ధులను భద్రతా అధికారులు పరామర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు దగర్లోని సరస్సులో నాలుగు పడవలను కూడా సిద్ధంగా ఉంచారు. కానీ ఖాళీ చేయాలన్న అధికారుల ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు సుమారు 800 కెనడియన్‌ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టుగా అక్కడి ప్రభుత్వం తెలిపింది.

ఇటీవల కెనడాలో కార్చిచ్చులు భారీగా పెరిగాయి. 2023లో నమోదైన కార్చిచ్చులు రికార్డు స్థాయిలో విధ్వంసం సృష్టించాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 750కి పైగా కార్చిచ్చులు చురుకుగా ఉన్నట్లు సమాచారం. మంటల పొగ అమెరికాలోని మిడ్‌వెస్ట్‌ ప్రాంతాలకూ చేరనుంది. దీంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు సరిపడా అగ్నిమాపక సిబ్బంది ఉన్నారా? అత్యవసర సమయంలో స్థానికులు కూడా మంటలను ఎదుర్కొనేలా శిక్షణ పొందాలనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో బ్రిటిష్‌ కొలంబియాలోని ఫోర్ట్‌ నెల్సన్‌(Fort Nelson) ప్రాంతంలో సోంజా లెవర్కస్‌ ఆధ్వర్యంలో స్థానికులకు అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే శిక్షణ ఇస్తున్నారు. గత మూడేళ్లలో 400 మందికి పైగా శిక్షణ పొందారు. చిన్న మంటలను అదుపు చేయడం, ఇళ్లను నిప్పురవ్వల నుంచి రక్షించడం, ప్రమాదకర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడే మార్గాలను గుర్తించడం వంటి అంశాలను నేర్పుతున్నారు. అయితే, మంటలు చెలరేగిన సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండి వాటిని ఎదుర్కోవడం కంటే ముందుగానే ఖాళీ చేసి ప్రాణాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మారుమూల ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను ముందుగానే అగ్ని ప్రమాదానికి తట్టుకునేలా సిద్ధం చేసుకోవచ్చు. స్థానికంగా శిక్షణ పొందిన బృందాలు కూడా అగ్నిమాపక సిబ్బందికి సహకరించవచ్చు. కానీ మంటలు చెలరేగిన సమయంలో అనుమతి లేకుండా అక్కడే ఉండటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇక తన ఇంటిని కాపాడుకోవడం కోసం అక్కడే ఉండిపోయిన విగ్వాస్‌ మాత్రం.. 'నా 58 ఏళ్ల జీవితంలో నిర్మించుకున్నదంతా ఇది. దాన్ని కాలిపోతుంటే చూస్తూ వెళ్లిపోలేను' అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనిపై అక్కడి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనున్నట్లుగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement