మంత్రివర్గ విస్తరణ, పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాలే ఎజెండా
ప్రతిపక్షాల విచ్ఛిన్నతను అనుకూలంగా మార్చుకోవడంపైనా చర్చ
నేడు ఎన్డీఏ మంత్రుల సమావేశం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య విరాళాల చోరీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో, దీన్ని తిప్పికొట్టాలని అధికారపక్షం ఎన్డీఏ సిద్ధమవుతోంది. ఈనెల 21న అత్యంత కీలకమైన పార్లమెంటరీ సమావేశం నిర్వహించనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (జూలై 20 నుంచి ఆగస్టు 13) సందర్భంగా ఈ భేటీ జరగనుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మోదీ ప్రభుత్వం తన శాసన, పరిపాలనాపరమైన ఎజెండాను నిర్దేశించడానికి ఎన్డీఏ సమావేశం దోహదం చేయనుంది.
జోరుగా ప్రచారం సాగుతోన్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఈ ఎజెండాలో అన్నింటి కంటే ముఖ్యంగా ఉంటుందనే ఊహగానాలు సాగుతున్నాయి. ప్రతిపక్ష పారీ్టల్లో ఇటీవల వచ్చిన చీలికలు, పెరిగిన సంఖ్యాబలం నేపథ్యంలో తమ ప్రతిష్టాత్మక బిల్లులను ఆమోదింపజేసుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సన్నద్ధతలో భాగంగానే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈనెల 17న ఎన్డీఏ మంత్రుల వ్యూహాత్మక సమావేశం జరగనుంది. అలాగే, 19వ తేదీన అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఆ బిల్లును గట్టెక్కించేందుకు..
ఏప్రిల్ జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (నియోజకవర్గాల పునరి్వభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లు)ను కొన్ని మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్సభ స్థానాల సంఖ్యను దాదాపు 850కి పెంచడం, అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా ప్రతిపాదన తేవడం ద్వారా ప్రాంతీయ పారీ్టల మద్దతు కూడగట్టాలని భావిస్తోంది. ఇటీవల టీఎంసీలోని 20 మంది ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)గా చీలిపోయి ఎన్డీఏకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు లోక్సభ ఎంపీలు షిండే వర్గంలో చేరారు. రాజ్యసభలో ముగ్గురు టీఎంసీ ఎంపీలు, ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలోకి చేరారు. ఈ కొత్త సమీకరణలతో పార్లమెంటు ఉభయ సభలలో బలం పుంజుకున్న ఎన్డీఏ ఈసారి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును గట్టెక్కించాలని చూస్తోంది.


