చెన్నై–ఆంధ్ర జాలర్ల వివాదంపై ఏపీతో చర్చలు | Discussions with AP regarding the Chennai-Andhra fishermen dispute | Sakshi
Sakshi News home page

చెన్నై–ఆంధ్ర జాలర్ల వివాదంపై ఏపీతో చర్చలు

Jul 17 2026 5:15 AM | Updated on Jul 17 2026 5:15 AM

Discussions with AP regarding the Chennai-Andhra fishermen dispute

మత్స్యకారుల ఇబ్బందులపై తమిళ సర్కారు చర్యలు

నెల్లూరులో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల భేటీ

సమస్య పరిష్కారానికి ఏపీతో సమన్వయం చేసుకుంటున్నట్లు వెల్లడి

సాక్షి, చెన్నై : సముద్రంలో చేపల వేటకు సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల మధ్య తరచూ సాగుతున్న వివాదాలను పరిష్కరించి, మత్స్యకారులు ప్రశాంత వాతావరణంలో వేట సాగించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు 50 ఏళ్లుగా ఇక్కడి జాలర్లు కాశిమేడు, తిరువొతి్తయూరు, తదితర ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి చెన్నైకి తూర్పున బంగాళాఖాతంలోని లోతైన సముద్ర ప్రాంతాల వరకు వెళ్లి చేపల వేట సాగిస్తున్నారు. దాదాపు 200 చెన్నై మత్స్యకార మెకనైజ్డ్‌ బోట్లు ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాల్లో చేపల వేట సాగిస్తున్నాయి.

అయితే, తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరంలో వేట సాగించడంవల్ల తమ ప్రాంతంలో మత్స్య సంపద తగ్గిపోతుందేమోనన్న ఆందోళన అక్కడి జాలర్లలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. పొరుగు రాష్ట్ర బోట్లు తమ సముద్ర ప్రాంతంలో వేట సాగించడాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులు ఇటీవల ఆందోళనలు చేపట్టారు. దీనివల్ల అక్కడ శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయి. ఫలితంగా.. ఏపీ అధికారులు ఇండియన్‌ మారిటైమ్‌ జోన్‌ యాక్ట్, 1976 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిగా ఉన్న 12 నాటికల్‌ మైళ్ల లోపల వేట సాగిస్తున్న చెన్నై మత్స్యకార బోట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన ఏడు మెకనైజ్డ్‌ బోట్లను సీజ్‌చేసి జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌లో ఉంచారు.

సామరస్య పూర్వకంగా..
ఇలా తరచూ ఏపీ జాలర్లతో సమస్యలు ఎదురవుతుండడంతో చెన్నైలోని జాలర్ల సంఘాల ప్రతినిధులు ఆ శాఖ మంత్రి శ్రీనాథ్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచి్చంది. ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు.. చెన్నై జిల్లా కలెక్టర్‌ స్థాయిలోనే కాకుండా, మత్స్యశాఖ మంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి ఆధ్వర్యంలో చెన్నై మత్స్యకార సంఘాల ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. 

అంతేకాక.. నెల్లూరులో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశంలో.. అదుపులోకి తీసుకున్న చెన్నై బోట్లను విడుదల చేయాలని, చెన్నై మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని, వారిని ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్‌ సముద్ర ప్రాంతాల్లో వేటాడేందుకు అనుమతించాలని తమిళనాడు అధికారులు కోరినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement