గుంటూరు: గుంటూరులోని తెనాలి చెంచుపేట కేంద్రంగా న్యూడ్ వీడియో కాల్స్ దందా వెలుగులోకి వచ్చింది. నిర్వాహకులైన ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ట్రిప్ టాక్ పేరుతో ఆన్లైన్ పోర్టల్ ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం నిర్వహిస్తున్న సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోర్టల్ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
వివరాల మేరకు.. తెనాలి పట్టణ పరిధి పాండురంగపేట, చెంచుపేటకు చెందిన మగ్గురు మహిళలు చెంచుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడకు మహిళలను తీసుకువచ్చి ఈ న్యూడ్ కాల్స్ చేయిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ కాల్స్ చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్లైన్లో స్ట్రిప్టాక్ పేరిట ఉన్న పోర్టల్లో లాగిన్ అయి ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం జరుపుతున్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ఏ దేశం నుంచైనా ఈ పోర్టల్లో లాగిన్ అయి న్యూడ్ కాల్స్కు నగదు చెల్లించి లైవ్లో మహిళలతో న్యూడ్ కాల్స్లో చాటింగ్ చేయవచ్చు. తెనాలి నిర్వాహకులు స్వీటీ – క్యూటీ పేరిట లాగిన్ అయి దాని ద్వారా ఇతర మహిళలతో ఈ దందా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ముందు మాస్క్ వేసుకుని చాట్ చేసి నగదు చెల్లింపు పూర్తయ్యాక న్యూడ్ కాల్స్ చేస్తుంటారని పోలీసులు తెలిపారు.
సులువుగా డబ్బు సంపాదన...
ఓ గదిలో ఉండి దుస్తులు లేకుండా వీడియో కాల్లో కనిపిస్తే రూ.500 నుంచి రూ.వెయ్యి ఇస్తామంటూ మహిళలు, యువతులను నిర్వాహకుడు సాయి.. ఈ రొంపిలోకి దించుతున్నాడు. ఇలా తెనాలిలో ఈ దందా నిర్వహిస్తున్న వారి వద్ద సుమారు 80 నుంచి 100 మంది మహిళలు ఉన్నారని, వారిలో రోజుకు ఒకరిద్దరు ఈ కాల్స్కు వచ్చి వెళ్తుంటారని సమాచారం. నిర్వాహకులైన ముగ్గురు మహిళలు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారు కావడంతో వారికి ఆన్లైన్ పోర్టల్, వాటి లాగిన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండే అవకాశం లేదు. ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టడం, న్యూడ్కాల్స్కు ఒప్పుకున్న మహిళలను కారులో అద్దె ఇంటికి తీసుకెళ్లడం వంటివి సాయి చేస్తుంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో, సాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.


