breaking news
Hyderabad News
-
తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి జాతీయ అక్రిడిటేషన్
● వైద్య సేవా ప్రమాణాల మెరుగుదలకు మరింత కృషి ● సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి సాక్షి, సిటీబ్యూరో: తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు లభించింది. నాణ్యమైన వైద్యసేవలు, రోగి ఆరోగ్య భద్రతను నిర్ధారించే దిశగా ఆసుపత్రి చేస్తున్న నిరంతర కృషికి ఇదో మైలురాయిగా నిలువనుంది. అధునాతన క్రిటికల్ కేర్ సేవలు, మాడ్యులర్ సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్లు, పూర్తిస్థాయి క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు, వివిధ రకాల చికిత్సలు తార్నాక ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఈ సదుపాయాలు రోగులకు ప్రత్యేక వైద్య సేవలను అందించడానికి సహాయపడుతున్నాయి. ఆసుపత్రి విద్యా, శిక్షణ కార్యక్రమాలను కూడా విస్తరించింది. 100 సీట్ల బీఎస్సీ నర్సింగ్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, శస్త్రచికిత్స, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్లలో డీఎన్బీ పీజీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించడం పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పి. శ్రీనివాస్ , ఇతర వైద్య బృందాన్ని ఆర్టీసీ సీఎండీ నాగిరెడ్డి అభినందించారు. వైద్యుల సమష్టి కృషి, పట్టుదల, అత్యుత్తమైన ఆరోగ్య సేవల్ని సాధించాలనే అచంచలమైన సంకల్పానికి ఇది నిదర్శనమని కొనియాడారు. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు, అర్హులైన వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతిష్టాత్మకమైన ఎన్ఏబీహెచ్ సర్టిఫికేషన్ దక్కడం సంతోషంగా ఉందని, ఇది అందరి కృషితోనే సాధ్యమైందని సూపరింటెండెంట్ శైలజామూర్తి పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు, నాణ్యత ప్రమాణాలకు ఇది ఒక గుర్తింపుగా నిలుస్తుందన్నారు. -
నేషనల్ డ్రోన్ ఇన్నొవేషన్ ఛాలెంజ్లో సార్క్స్ హవా
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ స్థాయిలో గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన నిడార్ 2026 నేషనల్ డ్రోన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో నగరానికి చెందిన సార్క్స్ (సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్స్పీడీషన్) బృందం టాప్–5లో నిలిచి సత్తా చాటింది. నగరంలోని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కి చెందిన ఈ బృందం ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం రూపొందించిన వారి డ్రోన్ పరిష్కారం, విపత్తుల సమయంలో ప్రాణాలను రక్షించే సాంకేతికత ఎలా ఉండాలనే ప్రయత్నానికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభించింది. ముగిసిన జాతీయ బాక్సింగ్ పోటీలు బొల్లారం : బొల్లారంలోని ఎల్ఆర్ఎంజీ గ్రౌండ్లో నిర్వహించిన ఓపెన్ నేషనల్ బాక్సింగ్ అండ్ సిలంబం (కర్రసాము) పోటీలు గురువారం ముగిశాయి. పోటీల్లో హరియాణ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జట్లు పాల్గొన్నాయి. మొత్తం 200కిపైగా బాలబాలికలు బాక్సింగ్ పోటీల్లో, 50 మంది సిలంబం పోటీల్లో పాల్గొన్నారు. తమిళనాడు జట్టు విజయం సాధించగా..తెలంగాణ ద్వితీయస్థానం, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. బ్లూ వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ నరసింహన్ కన్నన్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బ్లూ వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నవీన్ రాజ్, ఉపాధ్యక్షుడు జి. అరవింద్ పాల్గొన్నారు. సంతోష్నగర్: కంచన్బాగ్ డీఆర్డీఎల్ ప్రధాన రహదారిపై గురువారం కారు టైర్ ఊడిపోవడంతో అదుపుతప్పి డివైడర్ మీదుగా పల్టీ కొట్టి రోడ్డుపై పడి అటుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రోడ్డుపై చోటు చేసుకోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్నాక్స్ సెంటర్లోకి దూసుకెళ్లిన రెడిమిక్స్ వాహనం మియాపూర్: మియాపూర్ జేపీఎన్నగర్ కాలనీలో స్నాక్స్ సెంటర్లోకి రెడిమిక్స్ మిషన్ వాహనం దూసుకెళ్లింది.స్థానికులు తెలిపిన మేరకు.. గురువారం జేసీబీ వాహనానికి మిని రెడిమిక్స్ మిషన్ వాహనాన్ని వెనక భాగంలో తగిలించుకొని వెళుతున్నారు. ఈ క్రమంలో హుక్ ఊడిపోవడంతో రెడిమిక్స్ మిషన్ స్నాక్స్ సెంటర్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో లోపల ముగ్గురు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు. -
హాస్టల్, హోటల్లో అగ్ని ప్రమాదాలు
ముషీరాబాద్ గాంధీనగర్లోని ఓ హాస్టల్, బంజారాహిల్స్లోని ఓ హోటల్లో గురువారం అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిక్కడపల్లి : గాంధీనగర్లో సుధామ పీజీ ఉమెన్స్ హాస్టల్లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగినప్పడు హాస్టల్లో మ్గుగురు విద్యార్థులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అర్పి వేశారు. ప్రమాదం జరిగినపుడు మొదటి ఫ్లోర్లో ఉన్న ఇద్దరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. రెండో అంతస్తు మంటల్లో చిక్కుకున్న ఓ విద్యార్థిని ఇద్దరు యువకులు సాహసోపేతంగా బయటికి తీసుకొచ్చి రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో విద్యార్థినుల సర్టిఫికెట్లు మొత్తం కాలిపోయాయి. అగ్ని ప్రమాదం గీజర్ వల్లే జరిగిందని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య, చిక్కడపల్లి ఏసీపీ రమేష్కుమార్ తెలిపారు. యువతిని కాపాడిన ఆంజనేయులు, అరుణ్లను పోలీసులు అభినందించారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ముఠాగోపాల్ పరిశీలించారు. హోటల్లో .. బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్–3లోని లెవెంట్ హోటల్లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిమ్నీలో నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు రావడంతో స్థానికులు భయాభ్రాంతులకు గురయ్యారు. హోటల్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు.అగ్నిమాపక సిబ్బంది గంటపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. కొంత ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నాంపల్లి ఘటనతోనైనా అధికారులు మేల్కొనలేదు. బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం జరిగిన లెవెంట్ హోటల్కు ఫైర్ సేఫిటీ లేదని అధికారులు గుర్తించారు. ఎంట్రీ సరిగా లేదు. కిచెన్ పరిస్థితి భయానకంగా ఉంది. -
గల్లీగల్లీలో గస్తీ
● సైబరాబాద్లో విజిబుల్ పోలీసింగ్ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసులు విజిబుల్ పోలిసింగ్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చేతిలో లాఠీలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) హరికృష్ణా రెడ్డి సిబ్బందితో కలిసి 9 ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. అలాగే జన సమర్దం అధికంగా ఉన్న ప్రాంతాలు, అలీజాపూర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెయిన్ బో విస్టా జంక్షన్ వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అలాగే ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. నిరంతర పెట్రోలింగ్, వాహన తనిఖీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తామని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు -
చంద్రహాస్పై మరో కేసు
బంజారాహిల్స్: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు సినీహీరో చంద్రహాస్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.వెంకటేశ్వరరెడ్డి తెలిపిన మేరకు.. చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వారం క్రితం జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో నిర్వహించారు. వేడుకల్లో చంద్రహాస్ అసభ్య పదజాలంతో పాటపాడాడు. దీంతో చంద్రహాస్ ఉపయోగించిన భాష సరికాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ నితీష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని చంద్రహాస్ కోసం గాలింపు చేపట్టారు. మాదాపూర్ పీఎస్లో కూడా ఇతనిపై కేసు నమోదైంది. 12.7 తులాల బంగారు నగలు చోరీవిజయనగర్కాలనీ: ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దొంగలు 12.7 తులాల బంగారు నగలు చోరీచేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆసిఫ్నగర్ హుడా కాలనీలో నివాసముండే ప్రభాకర్ రెడ్డి (58) గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానిక విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కు వెళ్లాడు. ఓ గంట తరువాత తిరిగి ఇంటికి రాగా 2వ ఫ్లోర్లోని ఇంటి తాళం ధ్వంసమై ఉంది. లోపలకు వెళ్లి చూడగా అల్మార పగులగొట్టి అందులోని 12.7 తులాల బంగారును దొంగలు చోరీ చేసినట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక సమస్య.. విమానం ఆలస్యం శంషాబాద్: బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానం సాంకేతిక కారణాలవల్ల రెండుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్ఫర్ట్కు బయలుదేరేందుకు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ప్రయాణికులు ఎక్కికూర్చున్నారు. గురువారం తెల్లవారు జామున 3.40 గంటలకు టేకాఫ్ తీసుకునే సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మరమ్మతుల అనంతరం రెండుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. మత్తులో ఉన్న ప్రయాణికుడి దించివేత శంషాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడిని విమానంలోంచి దించివేసిన సంఘటన ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం ఢిల్లీకి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడు మద్యం మత్తులో స్పృహ లేకుండా ఉండిపోయాడు. దీంతో ఎయిర్లైన్స్ అధికారులు కిందికి దించివేశారు. లిఫ్ట్ అడిగి చోరీకి యత్నం లంగర్హౌస్: ఓ యువకుడు ద్విచక్రవాహనదారుడిని లిఫ్ట్ అడిగి చోరీకి యత్నించాడు.ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్లో నివాసముందే రాము గురువారం ఉదయం గుడిమల్కాపూర్ నుంచి ఇంటికి బయల్దేరాడు. సంగం వద్ద బీహార్కు చెందిన యువకుడు లిఫ్ట్ ఇవ్వాలని ఆపాడు. ట్రాఫిక్ పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నారని, తాను అత్యవసరంగా వెళ్లాలని రామును కోరాడు.దీంతో రాము అతనికి లిఫ్ట్ ఇచ్చాడు. ఆ తరువాత వెనుక కూర్చున్న యువకుడు రాము జేబు కట్ చేసి డబ్బు చోరీచేయబోయాడు.గమనించిన రాము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించబోయాడు. ఈ క్రమంలో ఆ దొంగ.. రాము కాళ్లు , చేతులు రక్తం వచ్చేలా కొరికి పరారయ్యాడు. దీంతో స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీ కొట్టిన టిప్పర్ ● ఆటోలో ఏడుగురు విద్యార్థులు ● పాఠశాలకు వెళుతుండగా ప్రమాదం జియాగూడ: విద్యార్థులను పాఠశాలను తీసుకెళుతున్న ఓ ఆటోను ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితోపాటు ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ రాములు తెలిపిన మేరకు.. జియాగూడకు చెందిన సందీప్ (35) గురువారం ఉదయం జియాగూడ నుండి అత్తాపూర్లోని శ్రీ చైతన్య స్కూల్కు చెందిన ఏడుగురు విద్యార్థులను ఆటోలో తీసుకువెళుతున్నాడు. ఈ క్రమంలో పాత బస్తీకి చెందిన షఫీ వేగంగా టిప్పర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆటోను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితోపాటు, డ్రైవర్ సందీప్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక పనిగంటలతో అధ్యాపకుల్లో ఒత్తిడి సాక్షి,సిటీ బ్యూరో: ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలలో బోధన, మానిటరింగ్ పేరుతో అధిక పని గంటల విధానం తొలగించాలని తెలంగాణ రెసిడెన్నియల్ డిగ్రీ కాలేజ్ ఎంపవరింగ్ అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ తట్ల సాంబలక్ష్మి, డాక్టర్ రమాదేవి డిమాండ్ చేశారు. ఉదయం 8.45 నుండి సాయంత్రం 5 గంటలు విధులు నిర్వహించడంతోపాటు పాటు వారానికి రెండు నుండి మూడు నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తోందన్నారు. రాత్రి డ్యూటీ చేసిన రోజు అధ్యాపకులు ఉదయం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నిర్విరామంగా కళాశాలలోనే ఉంటున్నారన్నారు. దీంతో 28 గంటలు ఏకధాటిగా కళాశాలలో పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్నారు. -
నల్ల చెరువు ఆక్రమణలను త్వరలోనే తొలగిస్తాం
● హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉప్పల్: రూ.20 కోట్లతో నల్ల చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ మేరకు గురువారం ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి తో కలిసి నల్ల చెరువును సందర్శించారు. నల్ల చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను ఏకకాలంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. చెరువు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామని. త్వరలోనే వాటిని తొలగించి నల్ల చెరువును రక్షిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంజయ్య, లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన
గన్ఫౌండ్రీ : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ... కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా నగదు వసూలు చేసి వాటిని ఇంటర్ బోర్డు అధికారులకు అందజేసి మాస్ కాపీయింగ్కి పాల్పడ్డారని ఆరోపించారు. సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేసి చిట్టీలు పెట్టి మరి పరీక్షలు రాయించారని మండిపడ్డారు. అనంతరం ఇంటర్ బోర్డు అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, సహాయ కార్యదర్శి మమత, జిల్లా కార్యదర్శి అశోక్రెడ్డి, పాల్గొన్నారు. -
రెండు కొత్త పైపులైన్లు
● మంజీరా పథకానికి గ్రీన్సిగ్నల్ ● వారం రోజుల్లో గండిపేటకు ఆమోదం ● తాగునీటి వృథా కట్టడికి చర్యలు సాక్షి, సిటీబ్యూరో మహానగర దాహార్తిని తీర్చే మంజీరా, గండిపేట నీటి సరఫరా పథకాల పురాతన ప్రధాన పైపులైన్లకు ప్రత్యామ్నాయంగా మరో రెండింటిని ఏర్పాటు చేసేందుకు జలమండలి సిద్ధమైంది. దశాబ్దాల కాలం నాటి ప్రధాన పైపులైన్లు శిథిలావస్థకు చేరి తరచూ పగిలిపోవడం, 30 శాతం నీరు లీకేజీలతో వృథా అవుతోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి పైపులైన్లను ఆధునికీకరించడంతో పాటు పాతలైన్ల వెంట సమాంతరంగా కొత్తవాటిని నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు (డీపీఆర్) నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సీఎం నుంచి మంజీరా పైపులైన్ పథకానికి గ్రీన్సిగ్నల్ లభించగా, మరో వారం రోజుల్లో గండిపేట (ఉస్మాన్ సాగర్) పథకం రెండో పైపులైన్కు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. తరచూ అంతరాయం.. మంజీరా నీటి సరఫరా ప్రధాన పైపులైన్ దెబ్బతింది. నెలలో కనీసం రెండు మూడుసార్లు షట్డౌన్ (నీటి సరఫరా నిలిపివేత) తప్పడం లేదు. మరమ్మతుల కారణంగా సనత్ నగర్, ఖైరతాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, నాంపల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, పటాన్చెరుు, ఆర్సీపురం, రాజేంద్రనగర్, మహేశ్వరం, కుత్బుల్లాపుర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాపై కనీసం 24 నుంచి 72 గంటల వరకు ప్రభావం పడుతోంది. శాశ్వత పరిష్కారం కోసం ప్రధాన పైపులైన్ మరమ్మతులు, సమాంతరంగా రెండో పైపులైన్ వేసేందుకు జలమండలి సిద్ధమైంది. త్వరలో టెండర్లు పిలవనుంది. కాండూట్ మార్గంలో గ్రావిటీ ద్వారా.. వందేళ్ల క్రితం గండిపేట (ఉస్మాన్సాగర్) జలాశయం నుంచి ఆసిఫ్నగర్ వరకు నేచురల్ స్లోప్తో రాతి కాలువ (కాండూట్) మార్గం ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. కాగా.. పైపులైన్ లీకేజీలతో వృథాగా నేల పాలవుతోంది. 45 ప్రాంతాల్లో లీకేజీలతో 8 నుంచి 10 ఎంజీడీలు మాత్రమే వినియోగదారులకు సరఫరా చేరుతున్నాయి. శాశ్వత పరిష్కారం కోసం గండిపేట జలాశయం నుంచి ఆసిఫ్నగర్ రిజర్వాయర్ వరకు మరో పైపులైన్ ఏర్పాటుకు జలమండలి సిద్ధమైంది. ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించింది. రెండు మూడు రోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుందని సమాచారం. గండిపేట తాగునీటి పథకం మంజీరా.. -
ఇంటిలిజెంట్ అడుగు..
నగరంలో అమలవుతున్న ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ ● కొత్త విధానంతో భవిష్యత్తులో సమస్యలకు అవకాశం ● దీంతో కేసుల విచారణపై ఏ ప్రభావమూ పడకుండాపోలీసుల కార్యాచరణ ● ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏర్పాటు ● త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానం (ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్) అమలవుతోంది. మొత్తం తొమ్మిది రకాలైన నేరాల్లో బాధితులుగా మారిన వారికి ఈ విధానం వర్తింపజేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. న్యాయస్థానంలో ట్రయల్పై ప్రభావం లేకుండా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బాధితుల ఇళ్ల వద్ద నమోదు చేసే ఎఫ్ఐఆర్ల కోసం ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే దీన్ని అమలులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కేసుకు ‘పునాది’ ఫిర్యాదే... ఏ కేసు అయినా బాధితుడి ఫిర్యాదు ఆధారంగానే నమోదవుతుంది. కేసు డైరీలు, అభియోపత్రాలకు సైతం ఫిర్యాదే పునాది. ఫిర్యాదు ఎంత పటిష్టంగా ఉంటే బాధితులకు అంత మేలు. చాలా మంది అన్యాయాన్ని పోలీసులకు వివరంగా చెప్పినా.. ఆ స్థాయిలో రాసివ్వలేరు. ఈ సందర్భాల్లో వారు ఠాణాకు వస్తే పూర్తిస్థాయిలో వినే సీనియర్ రైటర్లు, ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు తగిన సలహాలు, సూచనలిస్తారు. పకడ్బందీ ఫిర్యాదుకు సహకరిస్తారు. గస్తీ సిబ్బందికే ఆ బాధ్యతలు.. ప్రస్తుతానికి నగర పోలీసులు ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ అమలు చేస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. అనుభవం, నైపుణ్యమూ తక్కువే.. ఇప్పటి కానిస్టేబుళ్లు విద్యాధికులే అధికం. ఫిర్యాదు రూపొందించడం, కేసు నమోదుతో అనుభవం, నైపుణ్యం సైతం అవసరం. గస్తీ సిబ్బందిలో అత్యధికులు కొత్త కానిస్టేబుళ్లే ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈ అంశాలపై పట్టు లేకపోవడం, బాధితులు అంత పక్కాగా ఫిర్యాదు రాసి ఇవ్వలేకపోయే అవకాశం ఉంది. దీని ప్రభావం ఇప్పుడు కేసు నమోదుపై లేకపోయినా.. భవిష్యత్తులో కేసు విచారణ సందర్భంలో కచ్చితంగా ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోని లోపాల కారణంగా కేసులు వీగిపోయి, తప్పు చేసిన నిందితులూ బయటకు వచ్చేసే ప్రమాదం లేకపోలేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఏఐపై దృష్టి పెట్టారు. -
అల.. ప్రచార పురంలో..
శివారు మున్సిపాలిటీల్లో రంజుగా రాజకీయం సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగర శివారులోని మున్సిపాలిటీల ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. రంగారెడ్డి జిల్లాలోని మెజారిటీ స్థానాల కై వసమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు అభ్యర్థుల గెలుపునకు ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయం ఇంటింటా ప్రచారం చేసి, మధ్యాహ్నం పట్టణ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం కుల సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, కార్మిక సంఘాలతో భేటీ అవుతున్నారు. గురువారం చేవెళ్లలో డీసీసీ చీఫ్ చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన మాజీ ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్ సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ కో ఆర్డినేటర్ల నియామకం బలమైన అభ్యర్థులను బరిలోకి దించిన అధికార పార్టీ తాజాగా ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో ఆర్డినేటర్ను నియమించింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కోఆర్డినేటర్గా వి.జగదీశ్వర్గౌడ్, చేవెళ్లకు ఎన్.భూపతిరెడ్డి, మొయినాబాద్కు ఎంఏ ఫయీం, శంకర్పల్లికి బొంతు శ్రీదేవి, షాద్నగర్కు టి.ప్రకాష్గౌడ్, ఆమనగల్లు మున్సిపాలిటీకి పి.విజయారెడ్డిని ఇన్చార్జిలుగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుచరుల గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జిలను నియమించింది. వీరంతా ప్రచార రంగంలోకి దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మాజీమంత్రి సబితారెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్నగర్లో, మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆమనగల్లులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు నాలుగు రోజులే ఉండటంతో అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రచారం ముమ్మరం చేశాయి. తాయిలాలకు తెరలేపారు.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. బీజేపీ తరఫున మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్రెడ్డి గురువారం మూడు చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్ మున్సిపాలిటీల పరిధుల్లో ప్రచారం సాగించారు. గెలుపే ధ్యేయంగా పార్టీల వ్యూహం ఇన్చార్జిలను నియమించిన బీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ జాబితా ప్రకటన రంగంలోకి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు -
అపాయింట్మెంట్ లేకుండానే అందుబాటులో ఉంటా
మధ్యాహ్నం 2 తర్వాత నన్ను కలవవచ్చు: సీపీ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి సమస్య, సందేహం, ఫిర్యాదు ఉన్నా ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా తనను కలవవచ్చని నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ గురువారం ప్రకటించారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల తర్వాత బంజారాహిల్స్లోని ఐసీసీసీ భవనంలో తాను అందుబాటులో ఉంటానన్నారు. శుక్రవారం పాతబస్తీ చెత్తబజార్లోని కొత్వాల్ హౌస్కు రావాల్సి ఉంటుందని ఆయన వివరించారు. సీపీ సార్.. నేనూ పోలీసింగ్ చేస్తా.. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో గురువారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన షీల్డ్–2026 కార్యక్రమానికి నగర సీపీ సజ్జనర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన రోబోతో ఆయన సరదాగా ఇలా కరచాలనం చేశారు. తానూ పోలీసింగ్ చేస్తానని ఆ రోబో అన్నట్లు ఉంది కదూ ఈ చిత్రాన్ని చూస్తే! -
మార్కుల వేట.. అక్రమాల బాట
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులకు గరిష్ట మార్కులు తెప్పించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్నాయి. నిఘా నుంచి తప్పించుకునేందుకు యాజమాన్యాలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా ఆపేస్తుండగా, మరికొన్ని చోట్ల కెమెరా కంటికి ఆనని రీతిలో విద్యార్థులను కూర్చోబెట్టి తతంగాన్ని నడిపిస్తున్నాయి. ల్యాబ్ అసిస్టెంట్లు స్వయంగా రీడింగ్స్ రాసివ్వడం, సైగల ద్వారా సమాధానాలు చెప్పడం, రికార్డులు అందిస్తూ రాయించడం వంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు 65 శాతం మంది ఎగ్జామినర్లు ప్రైవేట్ రంగం వారే కావడంతో పరస్పర అవగాహనతో ఈ వ్యవహారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు విద్యార్థులకు జంబ్లింగ్ విధానం అమలవుతోంది. విద్యార్థులు తమ సొంత కళాశాలల్లో కాకుండా ఇతర కళాశాలలకు వెళ్లి పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లోని ల్యాబ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అన్ని జిల్లాల పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సంబంధిత విద్యాధికారికి సమాచారం అందించి నిమిషాల వ్యవధిలోనే ఫ్లయింగ్ స్క్వాడ్ను అక్కడికి పంపించేలా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికి.. నగరంలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు స్వయంగా సిబ్బందే సమాధానాలు చెప్పడం, ల్యాబ్ అసిస్టెంట్లు రికార్డులను పక్కన పెట్టుకుని రాపిస్తుండటం వంటి దృశ్యాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిఘాతో బయటపడ్డాయి. దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన 14 మంది ఎగ్జామినర్లు, ల్యాబ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించి బ్లాక్ లిస్టులో పెట్టింది. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే విద్యార్ధులతోపాటు సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమాలను అరికట్టేందుకు తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు అధికారులు చెప్పారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో మాస్ కాపీయింగ్ పట్టుబడ్డ 14 మంది ఎగ్జామినర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాయాజాలం -
చూపు ప్రసాదించారు
మూణ్నెల్ల శిశువుకు వెలుగులు ● చెక్ రిపబ్లిక్ పసికందు కళ్లకు శస్త్రచికిత్స ● విజయవంతంగా చేసిన ఎల్వీ ప్రసాద్ వైద్యులు బంజారాహిల్స్: పుట్టుకతోనే చూపులేని పసికందుకు నగరంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వెలుగులు ప్రసాదించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన ఇమాద్ అనే మూడు నెలల పసివాడు ‘పీటర్స్ అనోమలీ’ అనే అరుదైన కంటి సమస్యతో బాధపడుతున్నాడు. కనుపాపలు పూర్తిగా తెల్లబడి చూపు లేకుండాపోయింది. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల కల్లం అంజిరెడ్డి క్యాంపస్ వైద్యులు బాలుడిని పరిశీలించి.. రెండు కళ్లకూ ‘కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్న్’ (నల్ల గుడ్డు మార్పిడి శస్త్ర చికిత్స) విజయవంతంగా నిర్వహించారు. ఎడమ కన్ను మరింత క్లిష్టంగా ఉండడంతో అందులో గ్లకోమా (కంటి ఒత్తిడి) సమస్య కూడా ఉంది. దీనిని అదుపు చేసేందుకు ‘ట్రాన్స్స్కెరల్ సైక్లో ఫోటోకోగ్యులేషన్’ అనే పద్ధతిని, మందులను ఉపయోగించారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శిశువులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బాలుడు వస్తువులను గుర్తుపట్టడం, చూపును స్థిరంగా ఉంచడం వంటి సానుకూల లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు చెందిన పీడియాట్రిక్ కార్నియా నిపుణులు డాక్టర్ మురళీధర్ రామప్ప మాట్లాడుతూ.. పీటర్స్ అనోమలీ వంటి క్లిష్టమైన సమస్యల్లో ఫలితాలను కచ్చితంగా చెప్పలేమన్నారు. సరైన సమయంలో శస్త్ర చికిత్స చేయడం, నిరంతర పర్యవేక్షణ ద్వారా చూపు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు ఆనందాన్ని పంచుకుంటూ.. బిడ్డ మొదటిసారి తమను చూస్తూ కళ్లల్లో కళ్లు పెట్టి నవ్వినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేమన్నారు. -
నిర్లక్ష్యమైతే నిప్పే
● ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందే ● ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ● హైడ్రా కమిషనర్ మార్గదర్శకాలు ● నగరంలో అవగాహన కార్యక్రమాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఉదంతాలు.. సమీపిస్తున్న వేసవి.. పరిశీలనలో వెలుగులోకి వచ్చిన అంశాలు.. వెరసీ.. ఫైర్ సేఫ్టీ నిబంధనలపై హైడ్రా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. త్వరలో ఉల్లంఘనులపై చర్యలకు ఉపక్రమిస్తున్న నేపథ్యంలో నిబంధనలు, మార్గదర్శకాలను కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం విడుదల చేశారు. రాజధానిలోని వాణిజ్య భవనాలు, వ్యాపారులు వీటిని కచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న హైడ్రా బృందాలు ఉల్లంఘనులపై మార్చి నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సెల్లార్లను గోదాంలుగా మార్చకూడదు.. భవనాల సెల్లార్లు కేవలం వాహనాల పార్కింగ్ కోసమే. వీటిని గోదాంలుగా మార్చడం, అక్కడ ఉన్న వస్తువులు పోతాయనే ఉద్దేశంతో గ్రిల్స్ ఏర్పాటు చేసి తాళాలు వేయకూడదు. అక్కడ చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. సెల్లార్లలో వాచ్మెన్ల నివాసాలు, క్యాంటిన్లు, వంట గదులు ఉండకూడదు. సెల్లార్లతో పాటు ర్యాంపులు, కారిడార్లు, మెట్ల మార్గాలు ఖాళీగా ఉంచాలి. వ్యాపారాలకు సంబంధించిన వస్తువులు ఆయా చోట్ల నిలువ ఉంచకూడదు. ఏదైనా జరిగితే ఎటువైపు నుంచి సులభంగా బయటకు వెళ్లగలరనే ఎగ్జిట్ మార్గాలను సూచిస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. లిఫ్ట్లు ఉన్నా సరే.. మెట్ల మార్గాలను మూసేయకూడదు. షార్ట్ సర్క్యూట్కు అవకాశం లేకుండా... అగ్ని ప్రమాదాలకు ఎక్కువగా షార్ట్ సర్క్యూట్లే కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉన్న కరెంటు వైర్లు, స్విచ్ బోర్డులు, ప్యానెల్స్నే వాడాలి. విద్యుత్ లైన్లకు ఎర్తింగ్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. భవన విద్యుత్ వినియోగానికి తగ్గట్టు పవర్ కనెక్షన్లు తీసుకోవాలి. కరెంటు స్తంభం నుంచి వచ్చే వైర్లు, వ్యాపార సముదాయానికి విద్యుత్ను సరఫరా చేసే వైర్లను అనుసంధానం చేసే ప్యానల్ బోర్డు వద్ద పొరపాటున నిప్పురవ్వలు పడినా వెంటనే మంటలు అంటుకోకుండా కంకరతో ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయాలి. ఓవర్లోడ్, వైర్లలో జాయింట్లు లేకుండా చూసుకోవాలి. ఇప్పటికే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్న హైడ్రా.. ఇకపై శనివారాల్లోనూ ఫోన్–ఇన్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ వారం నుంచి ఇది ప్రారంభం కానున్నట్లు బుధవారం ప్రకటించింది. సెలవు రోజులు మినహా ప్రతి శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని ప్రజలు 040-29565750, 040-29565759 లకు ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం చేసే స్మోక్ డిటెక్టర్లు, మానవ ప్రమేయం లేకుండా మంటలను ఆర్పే వాటర్ స్ప్రింక్లర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అందుబాటులో ఉండాలి. అవి పక్కాగా పని చేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అక్కడ పని చేసే ప్రతి ఒక్కరికీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగం అవగాహన కల్పించాలి. ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం చేసేలా ఫైర్ అలారం రెడ్ బటన్ అందుబాటులో అమర్చాలి. షాపు అలంకరణకు ఉద్దేశించిన వైర్ల జాయింట్లు, సీరియల్ బల్బులు, ఫాల్ సీలింగ్ లైట్లు అమర్చేటప్పడు షార్ట్ సర్క్యూట్కు అవకాశం లేకుండా చూసుకోవాలి. అపార్టుమెంట్లు కింది భాగంలో కార్యకలాపాలు సాగించే సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా, ఎక్కడైనా ఫైర్ నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే.. హైడ్రా కంట్రోల్ రూం 90001 13667కు సమాచారం ఇవ్వాలి. -
దాసారం బస్తీలో ఉద్రిక్తత
సనత్నగర్: దాసారం బస్తీ గుడిసెలకు సంబంధించి కోర్టు స్టే ఆర్డర్ వచ్చిన కొద్దిరోజులకే కొందరు వ్యక్తులు అక్కడి గుడిసెవాసులపై దాడులకు తెగబడ్డారు. దీంతో తమపై దాడి చేసినందుకు నిరసగా ఇద్దరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దాసారం బస్తీ గుడిసెవాసులకు మద్దతుగా కోర్టులో స్టే ఆర్డర్ పత్రాలను ఇటీవల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ వారికి అందజేశారు. అయితే కొందరు బయటి వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున గుడిసెవాసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. తమను ఇక్కడ బతకనివ్వరా..? అంటూ ఇద్దరు వ్యక్తులు ఏకంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా నీళ్లు పోసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఆందోళనకు దిగారు. ఎస్సార్నగర్ పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే వారు దాదాపు గంటల పాటు గుడిసెల ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని.. బలవంతంగా ఖాళీ చేయించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అక్కడికి చేరుకుని గుడిసెవాసులను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గుడిసెవాసుల జోలికి వెళ్లవద్దని ఇటీవల కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన కాపీని ఇన్స్పెక్టర్కు ఎమ్మెల్యే అందజేశారు. గుడిసెవాసులపై రాళ్ల దాడి పెట్రోల్ పోసుకుని ఇద్దరి ఆత్మహత్యాయత్నం -
‘డిజిటల్ అరెస్టు’ కేసులో ఢిల్లీ వాసి!
సాక్షి, సిటీబ్యూరో: అమాయకులను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి అందినకాడికి దండుకుంటున్న ముఠాలో కీలక పాత్రధారిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో నమోదైన రూ.1.07 కోట్ల మోసం కేసులో ఇతడు నిందితుడని డీసీపీ వి.అరవింద్ బాబు బుధవారం వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఢిల్లీ నివాసి గురుదీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్ (42) ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓవృద్ధుడికి (62) గత ఏడాది అక్టోబర్ 16న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో ఫోన్ వచ్చింది. బాధితుడి ఆధార్ కార్డు వినియోగించిన కొందరు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని, దీనిపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేయనున్నామని బెదిరించారు. తీవ్రంగా భయపడ్డ బాధితుడికి వీడియో కాల్ చేసిన నిందితులు డిజిటల్ అరెస్టు చేశామని, నిరంతరం తమ పర్యవేక్షణలో ఉండాలని చెప్తారు. అరెస్ట్ ముప్పు తప్పాలంటే తాము చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి వెరిఫికేషన్ కోసం నగదు డిపాజిట్ చేయాలని నమ్మించారు. ఇలా విడతల వారిగా బాధితుడి నుంచి రూ.1.07 కోట్లు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కె.ప్రసాదరావు కేసు దర్యాప్తు చేశారు. ఈ నగదు వెళ్లిన బ్యాంకు ఖాతాలను అధ్యయనం చేసిన పోలీసులు గతంలో దీపక్ గెహ్లావత్, ప్రశాంత్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి విచారణ నేపథ్యంలోనే ఢిల్లీకి చెందిన గురుదీప్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. అక్కడ ట్రావెల్, మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారం నిర్వహించే ఇతగాడు మరికొందరితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. అమాయకులకు ఎర వేసి, వారి పేరు... వివరాలతో కరెంట్ బ్యాంక్ ఖాతాలను తెరుస్తుంటాడు. బాధితుల నుండి వచ్చే డబ్బును ఈ ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేయడం ద్వారా ప్రధాన నిందితులకు అందిస్తుంటాడు. తమ బ్యాంకు ఖాతాలను గురుదీప్కు ఇచ్చినట్లు ఇద్దరు నిందితులు చెప్పడంతో ఇతడినీ అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. నగర వ్యక్తి నుంచి రూ.1.07 కోట్లు స్వాహా రిమాండ్కు తరలించిన సైబర్ క్రైమ్ కాప్స్ -
ముగిసిన అహ్మద్ పాషా ఖాద్రీ అంత్యక్రియలు
చార్మినార్: అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ అంత్యక్రియలు బుధవారం పాతబస్తీ నూర్ఖాన్బజార్లో ముగిసాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంత్రి అజారుద్దీన్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, మీర్ జుల్ఫీకర్ అలీ, మేరాజ్ హుస్సేన్, కౌసర్ మోహియుద్దీన్, మోబిన్, ఎమ్మెల్సీలు మీర్ రియాజుల్ హసన్ హాఫంది, మీర్జా రెహ్మత్ బేగ్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. పాషా ఖాద్రీ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరయ్యారు. -
కల్లు తాగించి వృద్ధురాలి దారుణహత్య
దుండిగల్: రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధురాలి దారుణ హత్య కేసు మిస్టరీని దుండిగల్ పోలీసులు ఛేదించారు. ఓ మహిళ బంగారం కోసం వృద్ధురాలికి కల్లు తాపించి దారుణంగా హత్యచేసింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఏసీపీ శంకర్రెడ్డి వివరాలను వెల్లడించారు. చర్చి గాగిల్లాపూర్ ప్రాంతానికి చెందిన సుశీలమ్మ(85)కు ఐదుగురు సంతానం. అందరూ వివిధ ప్రాంతాల్లో ఉంటుండగా సుశీలమ్మ తన మనవడు జీవన్తో కలిసి నివాసముంటోంది. వీరికి ఐదు దుకాణాలు ఉన్నాయి. జీవన్ ఎప్పటిలాగే ఈ నెల 2న ఉద్యోగానికి వెళ్లాడు. ఆరోజ మధ్యాహ్నం ఓ యువకుడు దుకాణం అద్దెకు అడగడానికి సుశీలమ్మ ఇంటికి రాగా రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాడు. కేసు విచారణలో భాగంగా పోలీసులు స్థానికంగా ఉండే శ్రీకర్రెడ్డి తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ ఫుటేజీలో సుశీలమ్మ ఇంటికి ఓ మహిళ వచ్చి వెళ్లడాన్ని గుర్తించారు. తలను గోడకేసి బాది.. ఆపై రాయితో మోది.. అదే ప్రాంతానికి చెందిన పి.కవిత(36) గతంలో వృద్ధురాలి ఇంట్లో 15 రోజుల పాటు కూలీగా పని చేసింది. సుశీలమ్మకు కల్లు తాగే అలవాటు ఉండడంతో తరుచూ కల్లు తీసుకువచ్చి ఇస్తుండేది.ఈ క్రమంలో సుశీలమ్మ ఒంటిపై ఉన్న బంగారంపై కవిత కన్ను పడింది. ఈనెల 2న మధ్యాహ్నం కల్లు తీసుకువచ్చిన కవిత సుశీలమ్మతో కలిసి తాగింది.ఆ తరువాత సుశీలమ్మ మైకంలోకి వెళ్లగానే ఆమె తలను గోడకేసి బాదింది. అయినా ఆమె స్పృహలోనే ఉండడంతో రాయితో తలపై మోది హత్య చేసింది. అనంతరం బంగారు చెవి కమ్మలు, ఉంగరం, ముక్కుపుడక (5 గ్రాములు) తీసుకుని పరారైంది. సీసీ కెమెరా ఆధారంగా కవితను గుర్తించి రెండు రోజుల వ్యవధిలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న శ్రీకర్రెడ్డిని ఏసీపీ అభినందించారు. వీడిన హత్య మిస్టరీ బంగారం కోసం ఘాతుకం 5 గ్రాముల నగలు మాయం నిందితురాలి అరెస్ట్ -
ఇక చరిత్రలోనే..
● కాలగర్భంలో కలిసిపోనున్న మూడు వారసత్వ కట్టడాలు ● ఎంజీబీఎస్– ఫలక్నుమా వరకు మెట్రో పనులు చకచకా చార్మినార్: దారుషిఫాలోని ఓల్డ్ ఎంసీహెచ్ భవనం.. శాలిబండ క్లాక్ టవర్.. అలియాబాద్ సరాయ్.. ఈ మూడు వారసత్వ (హెరిటేజ్) కట్టడాలు కాలగర్భంలో కలవనున్నాయా? వీటి స్థానంలో మెట్రో స్టేషన్లు ఆవిర్భవించనున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఔను అనే వస్తున్నాయి. పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు తీయడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణతో పాటు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో స్టేషన్ల కోసం ఇప్పటికే స్థలాలను ఎంపిక చేశారు. ఇందులో ఈ మూడు హెరిటేజ్ కట్టడాలను తొలగించి వాటి స్థానంలో మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఈ వారసత్వ కట్టడాల చరిత్రను ఒకసారి అవలోకనం చేస్తే.. అలియాబాద్ సరాయ్.. శాలిబండ నుంచి ఫలక్నుమా వెళ్లే ప్రధాన రోడ్డులో షంషీర్గంజ్ కన్నా ముందు అలియాబాద్ సరాయ్ చారిత్రక ప్రాంతం ఉంది. హెరిటేజ్ కట్టడమైన అలియాబాద్ సరాయ్లో ప్రస్తుతం వివిధ రకాల వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మరో మెట్రో స్టేషన్ రానుంది. నిజాం కాలంలో నగరానికి ఉన్న 13 దర్వాజాల్లో అలియాబాద్ కూడా ఒకటి. ఈ దర్వాజా పక్కనే యాత్రికుల సౌకర్యార్థ్యం విశ్రాంతి గదులను నిర్మించారు. కుతుబ్ షాహీల కాలంలో నగరానికి వచ్చే యాత్రికులు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడం కోసం చార్మినార్ నుంచి 2.5 కిలో మీటర్ల దూరంలో అలియాబాద్ సరాయ్ను నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ మెకానిక్, టైలర్, గార్మెంట్స్.. ఇలా దాదాపు 60 దుకాణాల వరకు కొనసాగుతున్నాయి.చార్మినార్ నుంచి చాంద్రాయణగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో శాలిబండ ఏరియా ఉంది. ఈ ఏరియా క్లాక్ టవర్ పేరుతో ఫేమస్. ఇక్కడే మరో మెట్రో స్టేషన్ ఏర్పడనుంది. రాజా రాయ్ రాయన్స్ బహదూర్, రాజా చందూలాల్.. వీరిరువురు కుతుబ్ షాహీల కాలంలో రెవెన్యూ, అడ్మినిష్ట్రేషన్ పనులు చూసేవారు. శాలిబండ వద్ద రాజా రాయ్ రాయన్స్ ప్యాలెస్ ఉండేది. అప్పటి స్థానికుల సౌకర్యార్థం సమయం తెలియడం కోసం 1904లో యురోపియన్ స్టైల్లో ఈ క్లాక్ టవర్ నిర్మితమైంది. నలువైపులా గడియారాలను ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, రోమన్ భాషల్లో గంటల శబ్దంతో నిర్మించారు. 18వ శతాబ్దంలో మిలిటరీ క్వార్టర్స్ ఉండగా.. 19వ శతాబ్దానికల్లా నగరం విస్తరించడంతో నివాస ప్రాంతంగా రూపాంతరం చెందింది. ఎంజీబీఎస్ నుంచి మొదలయ్యే మెట్రో రైలుకు మొదటి మెట్రో స్టేషన్గా దారుషిఫాలోని పాత బల్దియా కార్యాలయాన్ని ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ ఏర్పాటుకు ముందు ఎంసీహెచ్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్)గా ఉండేది. ఎంసీహెచ్ ప్రధాన కార్యాలయం దారుషిఫాలో ఉండేది. కౌన్సిల్ సమావేశాలు ఇక్కడే జరిగేవి. జీహెచ్ఎంసీ ఏర్పడిన అనంతరం ఈ భవనాన్ని కులీకుతుబ్ షా నగరాభివృద్ది సంస్థ(కుడా)కు అప్పగించారు. పాతబస్తీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా ఏర్పడిన కుడా భవనం స్థలంలో ఇప్పుడు మెట్రో స్టేషన్ రానుంది. ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా కుడా అధికారులకు నోటీసులు జారీ చేశారు. -
బాధలు తట్టుకోలేక బలవన్మరణం
వేర్వేరుచోట్ల ఐదుగురి ఆత్మహత్యఇంట్లో గొడవలతో వివాహిత.. కీసర: ఇంట్లో గొడవల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన మేరకు.. తమిళనాడుకు చెందిన కార్తీక్, భార్య సుభాషిణి (30), ఇద్దరు పిల్లలతో కలిసి కీసరలో నివసిస్తున్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కార్తీక్ తల్లికి సుభాషిణికి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో గొడవ జరుగుతోందని భర్తకు ఫోన్ చేసినా రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుభాషిణి తన సోదరుడికి మెసేజ్ పంపింది. సోదరుడు వచ్చేలోపు ఇంట్లో ఉరివేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మియాపూర్ : పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన మేరకు.. ఉండ్రు సతీష్(31) దంపతులు మియాపూర్ బీకే ఎన్క్లేవ్ కాలనీలో నివాసముంటున్నారు. వీరితోపాటు సతీష్ తమ్ముడు వెంకటకృష్ణ కూడా ఉంటున్నాడు. సతీష్ గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు భార్య ఊరికి వెళ్లింది. బుధవారం ఉదయం 9 గంటలైనా సతీష్ బెడ్ రూమ్ తలుపులు తీయకపోవడంతో తమ్ముడు వెంకటకృష్ణ తలుపు తట్టినా స్పందించలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా సతీష్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పని ఒత్తిడి కారణంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భవనం పైనుంచి దూకి మహిళ.. కేపీహెచ్బీకాలనీ: ఓ మహిళ తాను పనిచేసే ల్యాబ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీనివాసులు, అనిత భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. ఐదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. బాచుపల్లి ప్రాంతలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసులు ఫార్మా కంపెనీలో పని చేస్తుండగా అనిత (23) కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలోని సీబీసీఐడీ కాలనీలోని ల్యాబ్లో పనిచేస్తోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ల్యాబ్ భవనం మూడో అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గమనించి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కేపీహెచ్బీ పోలీసులు భర్త శ్రీనివాసులును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనిత తల్లిదండ్రులు వచ్చిన తరువాత ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. రోజూ తమకు ఎదురయ్యే బాధలు తట్టుకోలేక ఐదుగురు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్పరిధిలో వివాహిత, మియాపూర్ పీఎస్పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి, నిరుద్యోగి, కూకట్పల్లి పరిధిలో యువకుడు, కేపీహెచ్బీ పరిధిలో ఓ మహిళ బలవన్మరణం చెందారు. గడ్డిమందు తాగి యువకుడు.. మియాపూర్: కడప జిల్లా, బద్వేల్కు చెందిన వెంకటేష్ (30) ఉద్యోగం కోసం ఈ నెల 3న మియాపూర్కు వచ్చాడు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు మియాపూర్ మాతృశ్రీనగర్ కాలనీలోని బొమ్మరిల్లు సమీపంలో గడ్డి మందు తాగాడు. ఆ తరువాత అతనే స్వయంగా 108 కు ఫోన్ చేసి చెప్పాడు. సిబ్బంది వచ్చి శ్రావణీ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం మాదాపూర్లోని ఆస్పత్రి మెయిన్ బ్రాంచ్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడు బావమరిది వెంకటసుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
అన్ని స్థాయిల్లో ప్రక్షాళన
● ఔట్సోర్సింగ్ ఆపరేటర్లకూ బదిలీలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ అవసరాలకనుగుణంగా అధికారులు, సిబ్బంది బదిలీలు చేపట్టిన కమిషనర్ ఆర్వీ కర్ణన్.. ప్రక్షాళన చర్యలకూ శ్రీకారం చుట్టారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అడిషనల్ కమిషనర్లు సహా జాయింట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్.. జూనియర్.. రికార్డు అసిస్టెంట్ల వరకు భారీ స్థాయిలో బదిలీ చేశారు. అంతేకాదు.. చివరకు ఔట్సోర్సింగ్పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను సైతం మూకుమ్ముడిగా బదిలీ చేశారు. జీహెచ్ఎంసీలోని చాలా విభాగాల్లో అధికారుల కంటే ఈ ఆపరేటర్ల ప్రభావమే ఎక్కువ. ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్లోనే నడుస్తుండటంతో అవకాశాల్ని ఆసరా చేసుకొని ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడటం గతంలో ఎన్నో సందర్భాల్లో బయటపడింది. కొందరు అధికారుల డిజిటల్ కీలు సైతం ఆపరేటర్ల వద్దే ఉంటాయి. ఆఫీసర్లు చేయాల్సిన పనుల్ని వీరే చేస్తారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లు, టెండరు నోటిఫికేషన్లను సైతం జారీ చేసే ఆపరేటర్లున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని.. అలవాటు పడిన స్థానంలో కంటే వేరే ప్రాంతానికి బదిలీచేస్తే.. కొంతకాలమైనా అక్రమాలు ఆగవచ్చనే తలంపుతో వందల సంఖ్యలో ఆపరేటర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. -
మరికొన్ని బిల్లులు కామన్
● ట్రేడ్లైసెన్స్, అడ్వర్టయిజ్మెంట్ ఫీజులు సైతం.. ● కార్యాచరణకు సిద్ధమవుతున్న యంత్రాంగం సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆలోచనకనుగుణంగా ఆస్తిపన్ను, వాటర్/డ్రైనేజీ, కరెంట్ బిల్లులు ఒకే చోట నుంచి ఒకేసారి చెల్లించే సదుపాయం కోసం ఇప్పటికే ప్రాథమిక చర్యలు చేపట్టిన అధికారులు.. మరికొన్ని అంశాలను కూడా సంబంధిత ప్లాట్ఫామ్లో పొందుపరచాలని భావిస్తున్నారు. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్)కు సంబంధించిన యజమానుల ఫోన్ నంబర్లను అప్డేట్ చేయడంతో పాటు విద్యుత్ మీటర్లకు సంబంధించిన ఫోన్నంబర్ల మ్యాపింగ్ కూడా చేయనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే ప్లాట్ఫామ్లో ఇతరత్రా చెల్లింపులకు సంబంధించిన అంశాలను కూడా చేర్చాలని భావించిన వారు జీహెచ్ఎంసీకి సంబంధించి ఇంకా దుకాణాలు నిర్వహించే వారి ట్రేడ్లైసెన్సులు, ప్రకటనల పన్నులు, ఆయా ఉల్లంఘనలకు సంబంధించి చలానాల ద్వారా విధించే పెనాల్టీలను సైతం అదే ప్లాట్ఫామ్లో చేర్చేందుకు సిద్ధమయ్యారు. దుకాణాలు నిర్వహించేవారు ట్రేడ్లైసెన్సులు తీసుకోవాలి.. అలాగే దుకాణాల ముందు ఏర్పాటు చేసే బోర్డులకు ప్రకటనల ఫీజు కూడా చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసినా విధించే పెనాల్టీలు సైతం అందులోనే పొందుపరచాలనుకుంటున్నారు. సొంత ఇళ్ల యజమానులకే పీటీఐఎన్లుండటం తెలిసిందే. అవి ఉండి నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు, పెనాల్టీలను కూడా అదే ప్లాట్ఫామ్లో పొందుపరుస్తారు. మిగతా వారి నుంచి సాధారణ పద్ధతుల్లోనే వసూలు చేస్తారు. రవాణాశాఖకు సంబంధించిన ఉల్లంఘనల పెనాల్టీలను సైతం అదే ప్లాట్ఫామ్లో చేర్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పీటీఐఎన్, విద్యుత్మీటర్ల నంబర్ల మ్యాపింగ్ ద్వారా నివాస కేటగిరీలో ఉండి వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాలను గుర్తించనున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 9.15 లక్షల విద్యుత్ మీటర్లు వాణిజ్య కేటగిరీలో ఉండగా, వాణిజ్య కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లింపులు మాత్రం ఆమేరకు లేవు. ఈ నేప థ్యంలో క్షేత్రస్థాయి సర్వే, మొబైల్ నంబర్ల మ్యాపింగ్తో నివాస కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలను గుర్తించి వాణిజ్య కేటగిరీకి మారుస్తారు. తద్వారా జీహెచ్ఎంసీకి ఎంతో ఆదాయం పెరగనుంది. -
సిటీకి ‘ఔటర్’ టచ్
పునర్వ్యవస్థీకరణ తర్వాత నగరంలోకి కొన్ని ఠాణాలు సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో హైదరాబాద్ పరిధిలోకీ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వచ్చింది. ఈ ఎక్స్ప్రెస్వే ఒకప్పుడు సైబరాబాద్, రాచకొండల్లో మాత్రమే విస్తరించి ఉండేది. తాజా మార్పుచేర్పులతో దాదాపు 50 కిలోమీటర్లు నగర కమిషనరేట్లోకి వచ్చింది. మరోపక్క కొత్తగా ఆదిభట్లలో ఓ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో పాటు ఇప్పటికే రాజేంద్రనగర్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్ను అధికారికంగా నోటిఫై చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. అలా విస్తరించి.. 2016 ఆగస్టు వరకు ఔటర్ రింగ్ రోడ్డంతా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిఽధిలోనే ఉండేది. దీని నుంచి వేరు చేస్తూ నగరానికి తూర్పు భాగంలో సైబరాబాద్ ఈస్ట్ ఏర్పడింది. తర్వాత ఇది అధికారికంగా పని చేయడం ప్రారంభమై.. రాచకొండగా పేరు మారింది. అప్పటి నుంచి ఓఆర్ఆర్ సైబరాబాద్తో పాటు రాచకొండలోనూ విస్తరించినట్లయింది. సిటీ పరిధిలోకి రావడంతో.. ‘గ్రేటర్’లోని పోలీసు కమిషనరేట్లు, ఇతర యూనిట్లను గత ఏడాది డిసెంబర్లో పునర్వ్యవస్థీకరణ చేశారు. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు సైబరాబాద్, రాచకొండల నుంచి కొన్ని ప్రాంతాలను తీసుకువచ్చి హైదరాబాద్లో కలిపారు. ఆదిభట్ల, రాజేంద్రనగర్, శంషాబాద్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్ వచ్చి నగరంలో కలిశాయి. దీంతో వీటి పరిధిలో ఉండే ఓఆర్ఆర్ నగర పరిధిలోకి వచ్చినట్లయింది. మరోపక్క ఓఆర్ఆర్ విస్తరించి ఉన్న కమిషనరేట్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు హైదరాబాద్లో కలిశాయి. ఇప్పటి వరకు ఆదిభట్ల ప్రాంతం ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఠాణా పరిధిలో ఉండేది. తాజా మార్పుచేర్పుల నేపథ్యంలో అక్కడ మరో ట్రాఫిక్ ఠాణా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అవే పాయింట్లు... అక్కడి సిబ్బందే.. రాజేంద్రనగర్లో కొన్నేళ్లుగా ట్రాఫిక్ ఠాణా ఉన్నప్పటికీ అది అధికారికం కాదు. అవసరాలకు తగ్గట్టు ఉన్నతాధికారులు సర్దుబాటుతో ఏర్పాటు చేశారు. ఈ కారణంగా దానికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిబ్బంది కేటాయించలేదు. ఇది దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు దాన్ని నోటిఫై చేయించాలని నిర్ణయించారు. అలా అధికారికంగా మారితే దానికీ పోస్టులు మంజూరై సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. ఈ రెండు అంశాలతో కూడిన ప్రతిపాదనల్ని నగర అధికారులు ప్రభుత్వానికి పంపారు. సైబరాబాద్, రాచకొండ నుంచి వచ్చి నగరంలో కలిసిన ప్రాంతాల్లోని గతంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు కొనసాగించనున్నారు. ఏ ప్రాంతం నుంచి ఈ పాయింట్ వచ్చి కలిసిందో ఆ కమిషనరేట్ నుంచే అవసరమైన సంఖ్యలో సిబ్బందినీ నగరానికి కేటాయించనున్నారు. ఇప్పటివరకు అవి సైబరాబాద్. రాచకొండ పరిధుల్లోనే.. కొత్తగా ఆదిభట్లలో పోలీసుస్టేషన్, రాజేంద్రనగర్ నోటిఫై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు -
రూ. 3,405 కోట్లు స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనుల అంచనా వ్యయం ఇది
● 12 రోజుల్లో ముగియనున్న బల్దియా పాలకమండలి గడువు ● అజెండాలో మొత్తం 53 అంశాలు చేర్చగా.. 52కు అంగీకారం సాక్షి, సిటీబ్యూరో: రూ. 3,405 కోట్లు. ఇది ఏ కార్పొరేషన్ బడ్జెటో కాదు. త్వరలో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనుల అంచనా వ్యయం. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగిసిపోనున్న తరుణంలో దాదాపు రూ.3,405 కోట్ల పనులకు గురువారం జరిగిన స్టాండింగ్కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 53 అంశాలను అజెండాలో చేర్చగా ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలం అద్దె తగ్గింపు వ్యవహారం తప్ప మిగతావాటిని ఆమోదించింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు, కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. ● పనుల్లో రూ. 3 కోట్ల కంటే ఎక్కువ విలువైన వాటిని కౌన్సిల్ ఆమోదానికి పంపించి అనంతరం ప్రభుత్వానికి నివేదిస్తారు. ● బర్కత్పురా జంక్షన్లో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఏర్పాటు. బైరామల్గూడ ఫ్లైఓవర్ సమీప రోడ్డుకు ఇటీవల మృతిచెందిన కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి పేరు. సమయం లేదు మిత్రమా.. పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులను ప్రారంభోత్సవ కార్యక్రమాలలో తప్పనిసరిగా భాగస్వాముల్ని చేయాలన్నారు. అంతుచిక్కని ఆంతర్యం.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిన మొత్తం పనుల్లో సీఆర్ఎంపీ–2 కింద రోడ్ల నిర్వహణకు రూ.3,145 కోట్లు అత్యధిక మొత్తం అంచనా వ్యయం కాగా, మిగతావి దాదాపు డజను పనుల అంచనా వ్యయం. 12 రోజుల అధికారమే ఉన్నా.. ఇన్ని పనులకు ఆమోదం వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కని రహస్యమే. పదేళ్ల కాల పరిమితి పనులకు కూడా ఆమోదం తెలపడమే విచిత్రం. రూ. కోట్ల అంచనా వ్యయమున్న పనుల్లో సీఆర్ఎంపీ కింద రోడ్ల నిర్మాణం, నిర్వహణ అంచనా భారీ మొత్తంలో ఉండగా, కోట్లలో అంచనా వ్యయమున్న వాటిలో మౌలాలీ ఆర్ఓబీ పునరుద్ధరణ, సనత్నగర్, ఫతేనగర్ ప్రాంతాల్లో వరద కాలువలు, సివరేజి లైన్లు, పటేల్నగర్ ఎస్టీపీ నుంచి డీమార్ట్ వరకు రోడ్డు వెడల్పు పనులు ఉన్నాయి. అలాగే.. హయత్నగర్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణం, అల్వాల్ సర్కిల్లోని సెలెక్ట్ టాకీస్ నుంచి మచ్చబొల్లారం వరకు రోడ్డు మరమ్మతులు, మసీదుబండ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు రహదారి అభివృద్ధి తదితర పనులున్నాయి. -
రోడ్డు భద్రత.. పిల్లలకూ బాధ్యత
రహదారి నిబంధనలపై ట్రాఫిక్ పార్కులతో పాఠాలు సాక్షి, సిటీబ్యూరో రోడ్డుపై ఎలా వెళ్లాలి? భద్రతకు సంబంధించిన నిబంధనలు ఎలా పాటించాలి? పరిమితికి మించిన వేగం వద్దు. సీట్బెల్ట్, హెల్మెట్ ధరించాలి.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దు. సిగ్నల్ జంపింగ్ చేయొద్దు. మద్యం తాగి బండి నడపొద్దు.. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.. ఇలా ఎన్నో అంశాలపై పిల్లలకు పెద్దలు రహదారి భద్రత పాఠాలు చెబుతుంటారు. కానీ.. అదే పెద్దలకు పిల్లలతో రోడ్డు భద్రత నియమాలను వివరించేందుకు రవాణా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రోడ్డు భద్రతపై పిల్లలే పెద్దలకు పాఠాలు చెప్పేలా ట్రాఫిక్ పార్కుల ఏర్పాటును చేపట్టింది. వీటితో ఒకవైపు చిన్నారుల్లో అవగాహన కల్పిస్తూనే మరోవైపు తమ ఇళ్లల్లో పెద్దలకు జాగ్రత్తలు చెప్పేలా ప్రోత్సహిస్తారు. నగరంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కు చొప్పున ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. త్వరలో నాంపల్లిలోని ఆలియా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ట్రాఫిక్ పార్కుల ఏర్పాటు కోసం విద్యాసంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ పార్కులు ఎందుకంటే.. ట్రాఫిక్ పార్కులు ఉపయోగపడతాయి. ఒకవైపు పిల్లలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు పెద్దలకు హెచ్చరిలు అందజేస్తాయి. ట్రాఫిక్ నియమాలపై ప్రయోగాత్మకంగా అవగాహన కలిగించేందుకు ట్రాఫిక్ పార్కులు దోహదం చేస్తాయి. రోడ్డు వాతావరణాన్ని ప్రతిబించేలా రూపొందించిన ట్రాఫిక్ పార్కుల్లో వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలను పాటించాలో చెబుతారు. ఆర్టీఏ, ట్రాఫిక్ విభాగాలకు చెందిన అధికారుల ద్వారా పిల్లలకు ప్రయోగాత్మక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పదో తరగతి వరకు చదువుకొని బయటకు వెళ్లే సమయానికి ప్రతి విద్యార్థికి రోడ్డు నియమాలపై అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తల్లిదండ్రుల నుంచి వాగ్దాన పత్రాలు.. రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈసారి రవాణాశాఖ మరో కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా చేపట్టింది. అమ్మానాన్న, కుటుంబసభ్యులు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని, హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరిస్తామని’ పేర్కొంటూ పిల్లల ద్వారా వాగ్దాన పత్రాల సేకరణ చేపట్టింది. ట్రాఫిక్ పార్కులో విద్యార్థులకు రహదారి భద్రతపై పాఠాలు బోధిస్తున్న ఆర్టీఏ సిబ్బంది చిన్నారులే ఇంటి పెద్దలకు జాగ్రత్తలు చెప్పేలా ప్రోత్సాహం రవాణా శాఖ అధికారుల ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ పార్కుల ఏర్పాటుకు విస్తృత కార్యాచరణఏం నేర్పిస్తారంటే... ట్రాఫిక్ నియమాలను సరదాగా, ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. రోడ్డు సూచనలు, సిగ్నల్స్, క్రాసింగ్లను అర్థం చేసుకొనేలా శిక్షణనిస్తారు. రోడ్డు దాటే సమయంలో సురక్షితంగా నడవడం, సైకిల్ తొక్కడం వంటివి అభ్యాసం చేయిస్తారు. చిన్న వయసులోనే బాధ్యతాయుతమైన రోడ్డు వినియోగదారులుగా మారేందుకు అవకాశం కల్పిస్తాయి. ట్రాఫిక్ పార్కులు ప్రతిరోజూ పిల్లలు తమను తాము రక్షించుకొనేలా, భవిష్యత్తులో సురక్షిత డ్రైవర్లుగా, పౌరులుగా తయారయ్యేందుకు దోహదపడతాయి. -
తుది దశకు ‘తరలింపు’
● ప్రభుత్వ భవనాల్లోకి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ● ‘మార్పు’పై స్థానికుల అభ్యంతరాలుసాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపు వ్యవహారం తుదిదశకు చేరుకుంది.అద్దె భవనాల భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అధికారులు కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు నాయకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. స్థానికంగానే కార్యాలయాలు ఉండాలని కోరుతున్నారు. ● ఇప్పటికే అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోకి మారనున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆఫీసులను ప్రభుత్వ భవనాల్లోకి మార్చడానికి ప్రభుత్వం విధించిన గడువు శుక్రవారంతో ముగియనుంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో కార్యాలయానికి నెలకు రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. ఇలా ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుండటంతో ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రైవేట్ భవనాలకు అద్దెలు చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో అందుబాటులో ఉన్న సర్కారీ భవనాల్లోకి ఆఫీసులను తరలిస్తున్నారు. నిరసన సెగలు స్థానికంగా అందుబాటులో ఉన్న ఆఫీసులను 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు తరలించడంపై సామాన్యులు మండిపడుతున్నా రు. ఒకవైపు స్థానికంగా అందుబాటులో ఉన్న ఆఫీసులు దూరంగా తరలించవద్దంటూ.. మరోవైపు తమ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఇబ్రహీంపట్నం కార్యాలయాన్ని మంఖాల్ తుక్కుగూడ సమీపానికి తరలించే ఆలోచనను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కిలోమీటర్ల మేర ప్రయాణం భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపు ప్రక్రియతో కొన్ని కొత్త చిరునామాలకు మారిపోయాయి. మరికొన్ని తరలింపునకు సిద్ధమవుతున్నాయి. ఎస్ఆర్ నగర్, బాలానగర్ కార్యాలయాలు వెంగళరావునగర్లోని ఆరోగ్య శాఖ భవనంలోకి మార్చారు. బంజారాహిల్స్, గోల్కొండ ఆఫీస్లను తాత్కాలికంగా షేక్పేట ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాంగణాలకు తరలించారు. పాతబస్తీలోని చార్మినార్, ఆజంపురా, దూద్బౌలి ఆఫీస్లు మలక్పేట గంజ్లోని రెవెన్యూ భవనంలోకి తరలించారు. హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నాంపల్లిలోని గృహకల్ప భవనంలోకి మారింది. మేడ్చల్ పరిధిలోని ఉప్పల్, ఘట్కేసర్ ఆఫీసులను బేగంపేటలోని పాత విమానాశ్రయం సమీపంలో ఉన్న ప్రభుత్వ భవన సముదాయంలోకి లేదా కండ్లకోయకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శేరిలింగంపల్లి, గండిపేట వంటి ఆఫీసులను గచ్చిబౌలిలోని ‘తాలిమ్’ భవనంలోకి తరలించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
నిరంతర సంస్కరణలతోనే రైల్వే మనుగడ
బన్సీలాల్పేట్: రైల్వే అభివృద్ధి, మనుగడకు నిరంతర సంస్కరణలు, నైపుణ్యాలు కీలక భూమిక పొషిస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీ వాస్తవ అన్నారు. సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్లో గురువారం దక్షిణ మధ్య రైల్వే 70వ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు ఉత్పత్తి వంటి కీలక రంగాల్లో నిర్ణీత కాల పరిమితితో కూడిన సంస్కరణలు అవసరమన్నారు. కాలానుగుణంగా సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ సంస్థ పురోభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ సందర్భంగా జీఎం ..రైల్వే ఉత్తమ సేవలందించిన సిబ్బంది,అధికారులకు సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఆశిష్ మెహ్రోత్రా పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎంసంజయ్కుమార్ శ్రీ వాస్తవ -
‘కండల ఇంజెక్షన్ల’పై నిఘా !
సాక్షి, సిటీబ్యూరో: కండల కోసం జిమ్లకు వెళ్తున్న యువతను టార్గెట్గా చేసుకుని, వైద్యుల సిఫార్సు లేకుండా, అక్రమంగా స్టెరాయిడ్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ముఠాలపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచారు. గత వారం ఓ వ్యక్తి చిక్కగా తాజాగా పశ్చిమ మండల అధికారులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ.1.20 లక్షల విలువైన 120 బాటిళ్ల మెఫెంటైర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ గురువారం వెల్లడించారు. జిర్రాకు చెందిన రషీద్ మత్లూబ్ ఖాన్ వృత్తి రీత్యా జిమ్ ట్రైనర్. ఇతగాడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బాడీ బిల్డింగ్ చేసే యువతను లక్ష్యంగా చేసుకున్నాడు. కండలు త్వరగా పెరగాలని కోరుకునే యువకులకు ఎలాంటి లైసెన్స్, డాక్టర్ సలహా, సిఫార్సు లేకుండా ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నాడు. వీటిని గుజరాత్లోని సూరత్ నుంచి ’ఇండియా మార్ట్’ ఖరీదు చేస్తున్నాడు. తన భార్య పేరుతో కొరియర్ ద్వారా నగరానికి రప్పిస్తున్నాడు. ఇతగాడు ఎక్కువగా మెఫెంటైర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నాడు. వీటిని సాధారణంగా లోబీపీ ఉన్న వారికి చికిత్స కోసం వాడతారు. యువత వీటిని బాడీ బిల్డింగ్ కోసం వాడి ప్రాణాంతకమైన గుండె, కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ యుగంధర్, ఎస్సై ఎండీ జాహెద్లతో కూడిన బృందం వలపన్ని రషీద్ను పట్టుకుంది. కొన్నాళ్లుగా ఇదే దందా చేస్తున్న ఇతడిపై అత్తాపూర్, అబిడ్స్, టప్పాచబుత్రా పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 20 ఇంజక్షన్ బాటిళ్లు స్వాధీనం.. చాంద్రాయణగుట్ట: స్టెరాయిడ్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న యువకుడిని దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, ఫలక్నుమా పోలీసులు గురువారం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నగర టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసారావు తెలిపిన మేరకు..ఫలక్నుమాకు చెందిన అబ్దుల్ గఫార్ ఖాన్(30) బార్కాస్ ప్రాంతానికి చెందిన అహ్మద్ నహదీ అనే వ్యక్తి వద్ద ‘మెఫెంటైర్మెన్ సల్ఫేట్’ అనే స్టెరాయిడ్స్ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, త్వరగా కండలు పెరగాలని కోరుకునే యువతకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.ఆదిరెడ్డి, ఎస్ఐలు ఎస్.శేషు, ఎం.మహేష్ల బృందం ఫలక్నుమా పోలీసులతో కలిసి నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.24 వేల విలువజేసే 20 ఇంజక్షన్ బాటిళ్లు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు నహదీ పరారీలో ఉన్నాడు. -
పారిశ్రామిక రంగంలో యువతకు ప్రోత్సాహం
అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం హిమాయత్నగర్: దేశ ఆర్థికాభివృద్ధికి రెండు దశాబ్దాలకు పైగా కృషి చేస్తున్న అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం (ఏఐఎవీఐఎఫ్) రజతోత్సవాలను ఫిబ్రవరి 1న నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ‘ప్రధాన్ కన్వెన్షన్’లో నిర్వహించనున్నట్లు ఏఐఎవీఐఎఫ్ అధ్యక్షుడు రాంబాబు పబ్బిశెట్టి తెలిపారు. గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 25 ఏళ్లుగా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో రానున్న రోజుల్లో యువతకు పారిశ్రామిక రంగంలో మెళకువలు నేర్పించడంతో పాటు ఎంఎస్ఏంఈలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. వేడుకలకు తెలంగాణ, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టి.జి.భరత్, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఇందులో పారిశ్రామిక రంగం పట్ల యువతలో ఆసక్తిని పెంపొందించేందుకు 50 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఫోరం నేతలు శ్రీనివాస్ బత్తుల, కాశీవిశ్వనాథం చింత, విజయ ప్రసాద్ గుంపల్లి, మంచి రాజశేఖర్, ఎర్రం బాలకృష్ణ పాల్గొన్నారు. -
సైబర్ క్రైం అధికారినంటూ మోసం
● అమాయకులనుంచి డబ్బు వసూలు ● నిందితుడి అరెస్ట్ అమీర్పేట: సైబర్ క్రైమ్ పోలీసు అధికారినంటూ అమాయకులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 44 కేసులు నమోదయ్యాయి. ఎస్ఆర్నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా పరకాల పులిగిల్లకు చెందిన జాల సాయిరామ్రెడ్డి బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్న సాయిరామ్ రాపిడో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు సైబర్ నేరాల బాట పట్టాడు.సోషల్ మీడియా కేంద్రంగా అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి యువకులకు వలవేస్తాడు. వారి ఫోన్ నెంబర్లు సేకరించి.. ఆ తరువాత సైబర్ క్రైమ్ పోలీసు అధికారినంటూ ఫోన్ చేస్తాడు. ఆన్లైన్లో అసభ్యకర పనులు చేస్తున్నారు..మీపై కేసు నమోదైందని భయపెట్టి అరెస్టు కాకుండా ఉండాలంటే ఫైన్ కట్టాలని డిమాండ్ చేసి డిజిటల్ మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఆపై డిజిటల్ ఆధారాలు దొరక్కుండా వారి ఫోన్లను రీ సెట్ చేయిస్తాడు. తాజాగా ఎస్ఆర్నగర్లో ఓ విద్యార్థిని భయపెట్టి రూ.97,540 వసూలు చేయడంతో బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన ఎస్ఆర్నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నింధితుడిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. -
జలమండలి ఎండీకి వినతిపత్రం
సాక్షి, సిటీబ్యూరో: వాటర్బోర్డు పరిధిలోని ఔట్సోర్సింగ్ మీటర్ రీడర్ల పోస్టుల మంజూరుపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. గురువారం జలమండలి ప్రధానం కార్యాలయం ముందు సుమారు 673 మంది ఔట్సోర్సింగ్ మీటర్ రీడర్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు ఎండీ అశోక్రెడ్డి, ఈడీ మాయంక్ మిట్టల్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన వారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఔట్ సోర్సింగ్జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల బాలకష్ణ రెడ్డి ,దేశపాక శ్రీనివాస్, టీజేఎస్ పార్టీ నాయకులు,రమేష్,ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఇదేం పద్ధతి.. కిందకూర్చోబెట్టి చదివిస్తారా?
బంజారాహిల్స్: ‘‘ఈ రోజుల్లో కూడా పిల్లల్ని కింద కూర్చొబెట్టి ఎలా చదివిస్తున్నారు.. అధికారులు అసలు ఏం చేస్తున్నారు?’’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఉదయ్నగర్లోని ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే దానం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలు నేలపై కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థులను చూసి చలించిపోయారు. వెంటనే హెచ్ఎంను రావాలని కోరారు. అయితే హెచ్ఎం.. సమావేవానికి వెల్లారని టీచర్లు చెప్పారు. దీంతో డీఈఓ రోహిణికి వీడియో కాల్ చేసి పిల్లల పరిస్థితిని వివరించారు. ‘‘మేడం ఈ పిల్లల పరిస్థితిని చూడండి.. కింద కూర్చొని చదువుతున్నారు’’ అని పేర్కొన్నారు. కనీసం స్కూల్లో గ్రీన్ బోర్డులు లేవు, తాగునీటి వసతి లేదు అని మండిపడ్డారు. తాను ఈ స్కూల్ గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడానని అయినా కూడా అధికారులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పిల్లలను కిందకూర్చొపెట్టి ఎలా చదువు చెబుతున్నారని.. వాళ్ళను చూస్తుంటే చాలా బాధగా ఉందని అన్నారు. వెంటనే విద్యార్థుల కోసం తాత్కాలికంగా షెడ్డు అయినా నిర్మించాలని కోరారు. అందుకు నిధుల విడుదలలో జాప్యం ఉంటే తన మిత్రులతో మాట్లాడి సీఎస్ఆర్ నిధులు కానీ లేదంటే తానే స్వయంగా ఇస్తానని అన్నారు. వెంటనే షెడ్డు నిర్మాణంతో పాటు స్కూల్లో గ్రీన్బోర్డులు, మంచినీటి కోసం ఆర్వో మిషన్ను ఏర్పాటు చేయాలని డీఈవోకు సూచించారు. డీఈవోకు వీడియో కాల్ చేసిన దానం ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం -
‘హెల్మెట్ లేకపోతే.. యమపురికే’
● రహదారి భద్రతపై ఆర్టీఏ వినూత్న ప్రచారం నాగోలు : ‘తస్మాత్ జాగ్రత్త..హెల్మెట్ లేకుండా బండి నడిపితే నేరుగా యమలోకానికే వెళ్తారు..’ సాధారణంగా రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు అక్కడక్కడా కనిపించే నినాదం ఇది. అయితే యముడి రూపంలో ఓ వ్యక్తి.. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే తీసుకెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరిస్తూ వినూత్న ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ ఆర్టీఏ నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై గురువారం అలాంటి వినూత్నమైన ప్రచారాన్ని నిర్వహించారు. డాక్టర్ గురువారెడ్డి సారథ్యంలోని సర్వేజన ఫౌండేషన్ సంస్థకు చెందిన కళాకారులు ఈ ప్రచారాన్ని నిర్వహించింది. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నాగోల్లో ఏర్పాటు చేశారు. -
తవ్వేస్తే.. తొవ్వేదీ !
ఇళ్ల ముందే గుంతలు..ఎన్నడు తీరేనో చింతలుఅంబర్పేట్ డివిజన్ నింబోలిఅడ్డాలోని రహదారి ఇది. కొన్ని నెలల క్రితమే ఇలా తవ్విపోశారు. ఇప్పటికీ మళ్లీ కొత్తగా రోడ్డు వేయలేదు. దీంతో ఈ దారిలో ఓ టిఫిన్ సెంటర్తో పాటు ఇతర దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ఉపాధి కోల్పోయామని పలువురు లబోదిబోమంటున్నారు. యూసుఫ్ గూడ గణపతి కాంప్లెక్స్ నుంచి మధురానగర్ వెళ్లే రోడ్డును మూడు నెలల క్రితం తవ్వి మరమ్మతుల మాటే మరిచారు. డ్రైనేజీ నీరు బయటకు వచ్చి ఈ రోడ్డంతా గుంతలతో అధ్వానంగా మారింది.దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ డివిజన్లోని సుకృతి హోమ్స్ పరిధిలోని రహదారిని ఏడాది కిత్రం అండర్ గ్రౌండ్ నిర్మాణం కోసం తవ్వేసి వదిలేశారు. అధికారులు పత్తా లేకుండా పోయారు. ఇళ్ల ముందే గుంతలు ఉండటంతో చిన్నారులు, మహిళలు కిందపడి గాయాల పాలవుతున్నారు. వెంటనే వీటిని పూడ్చి తమ వెతలు తీర్చాలని స్థానికులు వేడుకుంటున్నారు. దుకాణాల ఎదుట దిబ్బ.. ఉపాధిపై దెబ్బ -
24 డివిజన్లు, 73 ఠాణాలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. ప్రాథమిక జాబితాలో స్వల్ప మార్పుచేర్పులతో ఖరారైన తుది జాబితాను ఉన్నతాధికారులు గురువారం విడుదల చేశారు. సిటీలో ఏడు జోన్లు, 24 డివిజన్లు, 73 పోలీసుస్టేషన్లు ఉండనున్నాయి. ఒకప్పుడు నార్త్జోన్, ప్రస్తుతం సికింద్రాబాద్ జోన్లో మార్కెట్ ఠాణాను కొనసాగించనున్నారు. తాజా మార్పుచేర్పులతో 15 పోలీసుస్టేషన్లతో చార్మినార్ జోన్ పెద్దదిగా... 5 ఠాణాలతో శంషాబాద్ చిన్నదిగా మారింది. జోన్లు, డివిజన్లు, ఠాణాలు ఇలా... ● చార్మినార్ జోన్లో.. చార్మినార్, మలక్పేట, మీర్చౌక్, సైదాబాద్, సంతోష్నగర్ (ఐదు) డివిజన్లు... వీటి పరిధిలో చార్మినార్, హుస్సేనిఆలం, మొఘల్పుర, శాలిబండ, మలక్పేట, చాదర్ఘాట్, డబీర్పుర, మీర్చౌక్, భవానీనగర్, రెయిన్బజార్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్నగర్, ఐఎస్ సదన్, ఛత్రినాక (15) ఠాణాలు. ● గోల్కొండ జోన్లో.. ఆసిఫ్నగర్, గోషామహల్, కుల్సుంపుర, టోలిచౌకి (నాలుగు) డివిజన్లు... వీటిలో ఆసిఫ్నగర్, మెహదీపట్నం, హబీబ్నగర్, మాసబ్ట్యాంక్, బేగంబజార్, ఆఫ్జల్గంజ్, గోషామహల్, మంగళ్హాట్, గుడిమల్కాపూర్, కుల్సుంపుర, టప్పాచబుత్ర, గోల్కొండ, టోలిచౌకి, లంగర్హౌస్ (14) పోలీసుస్టేషన్లు. ● జూబ్లీహిల్స్ జోన్లో.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్సార్నగర్ (మూడు) డివిజన్లు... వీటి పరిధిలో మధురనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ఎస్సార్నగర్, బోరబండ, సనత్నగర్ (ఆరు) ఠాణాలు. ● ఖైరతాబాద్ జోన్లో.. అబిడ్స్, పంజగుట్ట, సైఫాబాద్, సుల్తాన్బజార్ (నాలుగు) డివిజన్లు... వీటిలో నాంపల్లి, అబిడ్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, లేక్, సైఫాబాద్, నారాయణగూడ, సుల్తాన్బజార్ (ఎనిమిది) ఠాణాలు. ● రాజేంద్రనగర్లో.. చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, రాజేంద్రనగర్ (మూడు) డివిజన్లు... వీటి పరిధిలో చాంద్రాయణగుట్ట, ఫలక్నుమ, బండ్లగూడ, కంచన్బాగ్, కామాటిపుర, బహదూర్పుర, కాలాపత్తర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్ (పది) ఠాణాలు. ● సికింద్రాబాద్లో.. చిక్కడపల్లి, చిలకలగూడ, గాంధీనగర్, మహంకాళి, ఉస్మానియా యూనివర్శిటీ (ఐదు) డివిజన్లు... చిక్కడపల్లి, ముషీరాబాద్, కాచిగూడ, లాలాగూడ, చిలకలగూడ, వారాసిగూడ, దోమలగూడ, గాంధీనగర్, రామ్గోపాల్పేట్, మహంకాళి, మార్కెట్, అంబర్పేట, ఓయూ, నల్లకుంట (14) ఠాణాలు. ● శంషాబాద్లో.. ఆదిభట్ల, ఆర్జీఐఏ (రెండు) డివిజన్లు... ఆదిభట్ల, బాలాపూర్, బడంగ్పేట్, పహాడీషరీఫ్, ఆర్జీఐఏ (ఐదు) పోలీసుస్టేషన్లు.నగర కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి పెద్ద జోన్గా చార్మినార్, చిన్నదిగా శంషాబాద్ -
వికేంద్రీకృత జల నిర్వహణతోనే నగర భవిష్యత్
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సాక్షి, సిటీబ్యూరో: మహా నగరానికి దీర్ఘకాలిక జల భద్రత, వరదల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వికేంద్రీకృత జల నిర్వహణ కీలకమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. గురువారం జీహెచ్ఎంసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ)తో కలిసి సీఐఐ (సోహ్రాబ్జీ గ్రీన్ బిజినెస్ సెంటర్)లో నీటి విడుదల, మురుగు నీరు, వర్షపు నీటి నిర్వహణపై స్టేక్హోల్డర్ ఇంటరాక్షన్ అండ్ బ్రెయిన్స్టార్మింగ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా జీహెచ్ ఎంసీ వరద కాలువలు, సీవరేజ్ వ్యవస్థ బలోపేతం, నాలాల అభివృద్ధిపై భారీగా నిధులు వెచ్చించిదన్నారు. పెరుగుతున్న నగరీకరణ, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మౌలిక వసతుల విస్తరణ మాత్రమే సరిపోదని వెల్లడైందని చెప్పారు. డీసెంట్రలైజ్డ్ విధానంలో నీటిని నిల్వ చేసి పునర్వినియోగం చేయడమే వరద ముప్పునకు మొదటి రక్షణ కవచం కానుందన్నారు. -
25 ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని 25 ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో టీజీఎస్ఆర్టీసీ సీఎండీ వై.నాగిరెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీలు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ గ్రేటర్ జిల్లాల్లో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని భావిస్తోంది. వీటి కోసం ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 124 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేసింది. చార్జింగ్ పాయింట్ల కోసం ఆర్టీసీ నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి, ఫిబ్రవరి 1లోగా అంచనాలు రూపొందించాలని సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు. -
‘హైదరాబాద్ వన్’.. ఈజీ జర్నీ
● లాస్ట్మైల్ కనెక్టివిటీ లక్ష్యంగా కాంబీ టికెట్ ● హెచ్ఎండీఏ అనుబంధ హుమ్టా ప్రణాళికలు ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్లకు ఒకే టికెట్సాక్షి, సిటీబ్యూరో: రైలు, బస్సు, మెట్రో ఏదైనా సరే టికెట్ మాత్రం ఒకటే. జేబులో డబ్బులున్నా.. లేకున్నా.. ఈ టికెట్ ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకై నా ఈజీగా ప్రయాణం చేయొచ్చు.అప్పటికప్పుడు ఏది అందుబాటులో ఉంటే అందులో ఎక్కేయొచ్చు. వివిధ రకాల ప్రజారవాణా సదుపాయాలను ప్రయాణికులకు సమగ్రంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన కాంబినేషన్ టికెట్ త్వరలో వినియోగంలోకి రానుంది. ‘హైదరాబాద్ వన్’ కాంబినేషన్ టికెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) కోసం టెండర్లను ఆహ్వానించనున్నట్లు హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా అధికారులు తెలిపారు. ‘హైదరాబాద్ వన్ టికెట్ ’ కాంబినేషన్గా ప్రవేశపట్టాలా లేక మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి తీసుకురావాలా? అనే అంశంపైన స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో నగరంలోని 51 ఎంఎంటీఎస్ స్టేషన్లకు సిటీబస్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మెట్రో నుంచి సిటీబస్సుల్లోకి మారేందుకు పలు స్టేషన్ల వద్ద సదుపాయం ఉన్నప్పటికీ కాంబినేషన్ టిక్కెట్ లేకపోవడంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక సదుపాయాన్ని మాత్రమే వినియోగించుకుంటున్న క్రమంలో లాస్ట్మైల్ కనెక్టివిటీ సదుపాయం లభించడం లేదు. వివిధ రకాల సర్వీసుల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు ‘హైదరాబాద్ వన్’ కాంబి టికెట్ను ప్రవేశపెడితే ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
హీటెక్కిన మీటర్..
గ్రేటర్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ వేసవి కార్యాచరణలో టీజీఎస్పీడీసీఎల్ సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో నమోదు కావాల్సిన విద్యుత్ డిమాండ్ జనవరి మూడో వారంలోనే వెలుగు చూస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఏప్రిల్ చివరి నాటికి గ్రేటర్ ఫీక్ విద్యుత్ డిమాండ్ 5 వేల మెగా వాట్లకు చేరుకోనున్నట్లు డిస్కం అంచనా వేసింది. వేసవి కార్యాచరణలో భాగంగా ఇప్పటికే ఓవర్ లోడుతో ఉన్న సబ్స్టేషన్లు/ ఫీడర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, ఆ మే రకు వాటి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రతి నెలా 35 వేల కొత్త కనెక్షన్లు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 67.95 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 55.98 లక్షల గృహ, 9.15 లక్షల వాణిజ్య, 38 వేల పారిశ్రామిక, 1.53 లక్షల వ్యవసాయ, మరో 90 వేలకుపైగా ఇతర కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ప్రతి నెలా కొత్తగా మరో 35 వేల కనెక్షన్లు ఉంటున్నాయి. ఈసారి వేసవి ఎండలు భగ్గున మండే అవకాశం ఉండటంతో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది. సబ్స్టేషన్లలోని పీటీఆర్లు, ఫీడర్లు, డీటీఆర్ల సామర్థ్యం పెంచే పనిలో నిమగ్నమైంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చూస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పష్టంచేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో చేపట్టే అదనపు పనులు జోన్ల వారీగా.. అంశం మెట్రో మేడ్చల్ రంగారెడ్డి కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 716 1483 1158 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు 36 58 69 కొత్తగా ఏర్పాటు చేయనున్న 11 కేవీ ఫీడర్లు 122 187 218 కొత్తగా ఏర్పాటు చేయనున్న 33 కేవీ ఫీడర్లు 37 28 53 తేదీ మెగావాట్లు 18 2675 19 3196 20 3345 21 3385 22 3375 -
చుక్కేశారు..చిక్కారు
● ‘స్పెషల్ డ్రైవ్’లో పట్టుబడ్డ 270 మంది సాక్షి, సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ చెప్పడానికి గత నెల 24 నుంచి 31 వరకు ఇవి కొనసాగాయి. ఈ తనిఖీల్లో చిక్కిన ‘నిషా’చరుల్లో 270 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ బి.జోయల్ డెవిస్ గురువారం వెల్లడించారు. స్పెషల్ డ్రైవ్లో చిక్కిన వారికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో (టీటీఐ) అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు 270 మందిని దోషులుగా నిర్ధారిస్తూ జైలు శిక్ష విధించింది. దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు వారిని జైలుకు తరలించారని జోయల్ డెవిస్ తెలిపారు. వీళ్లు పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, వారు విద్యనభ్యసిస్తున్న విద్యా సంస్థలకు లేఖలు రాస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి నాగోలు/జీడిమెట్ల : నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. నాగోలు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సంఘటనలు జరిగాయి. ● నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన మేరకు.. హయత్నగర్ రవి నారాయణ రెడ్డి నగర్ కాలనీకి చెందిన సిద్ధులు (34) బుధవారం రాత్రి ఆటోలో ఇంటికి వెళుతున్నాడు. భారత్ పెట్రోల్ బంక్ వద్ద గౌరెల్లి వైపు నుండి వచ్చిన మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో సిద్దులు తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఢీకొట్టిన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ● ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికి అక్కడే మృతిచెందాడు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్కు చెందిన విష్ణువర్ధన్రెడ్డి (23) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు బుధవారం రాత్రి విష్ణువర్ధన్రెడ్డి స్నేహితుడు దిలీప్రెడ్డితో కలిసి షాపూర్నగర్ నుండి చింతల్ వైపు బైక్పై వెళ్తున్నాడు. ఈక్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో విష్ణువర్ధన్రెడ్డి అక్కడికి అక్కడే మృతిచెందాడు.తీవ్రంగా గాయపడ్డ దిలీప్రెడ్డి అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటి యజమానిని గొడ్డలితో నరికి.. ● గౌడవెల్లిలో దారుణ హత్య మేడ్చల్ రూరల్: ఇంటి యజమానినే గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన గోమారం లక్ష్మారెడ్డి (42) పెయింటర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని ఇంట్లో మలిగ లింగం (50) అద్దెకు ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి ఇంట్లో మద్యం తాగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న లింగం అందుబాటులో ఉన్న గొడ్డలితో లక్ష్మారెడ్డిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కటకటాల్లోకి భార్యాహంతకుడు రహమత్నగర్: భార్యను కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని బోరబండ పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బోరబండ ఎస్హెచ్ఓ సురేందర్ గురువారం ఈ వివరాలను వెల్లడించారు. రహమత్నగర్ డివిజన్ రాజీవ్గాంధీనగర్లో సోమవారం ఆంజనేయులు అనే వ్యక్తి రోకలి బండతో కొట్టి భార్యను హత్య చేసి అదే రాత్రి షోలాపూర్ పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురితో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. షోలాపుర్ నుంచి తన సొంత గ్రామమెన చింతకుంటకు ఆంజనేయులు వచ్చాడన్న సమాచారంతో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని ఆదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆంజనేయులును గురువారం రిమాండ్ తరలించామని ఎస్హెచ్ఓ సురేందర్ వెల్లడించారు. -
నో పార్కింగ్ ప్లీజ్ !
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనుల్లో భాగంగా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు వాహనాల పార్కింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులు తమ వాహనాలను 10వ నెంబర్ వద్ద పార్క్చేయాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ సూచించారు. స్టేషన్ ప్రాంగణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఒకటో నెంబర్ వద్ద పార్కింగ్ను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ తక్కువ సమయంలో వాహన రాకపోకలను( పికప్ అండ్ డ్రాప్) సదుపాయాన్ని అనుమతించనున్నారు. పదో నెంబర్ వైపు అనధికార పార్కింగ్, వాహనాల అడ్డంకులను నివారించేందుకు యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు ప్రయాణికులకు 15 నిమిషాల వరకు ఉచిత పికప్ అండ్ డ్రాప్ సదుపాయం కల్పించారు. ఇదిలా ఉండగా మరోవైపు పదో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు బేస్మెంట్లో నాలుగు చక్రాల, ద్విచక్ర వాహనాలకు తగిన పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. డిసెంబర్ పనులు పూర్తి... ప్రస్తుతం సికింద్రాబాద్ రీడెవపల్మెంట్ పనులు 50 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులను వేగంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు మల్టీలెవెల్ కార్ పార్కింగ్, 10వ నెంబర్ వైపు బేస్మెంట్ పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి రానున్నాయి. ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద పార్కింగ్ నిలిపివేత ప్లాట్ఫామ్–10 వద్ద పార్కింగ్ సదుపాయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మార్పులు -
అడ్మిషన్స్ ఫర్ సేల్
అప్పుడే కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్ల జాతర షురూమహానగరంలో అడ్మిషన్ల జాతర మొదలైంది.. ఆఫర్లు..డిస్కౌంట్ల పేరుతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ కార్పొరేట్ పాఠశాలలు బుట్టలో వేసుకుంటున్నాయి. లక్షల రూపాయల ఫీజు చెప్పి.. ఆ తరువాత ఆఫర్ల పేరిట నామమాత్రం తగ్గిస్తూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కార్పొరేట్ మాయాజాలంలో పడ్డ అమాయక తల్లిదండ్రులు నిలువునా మోసపోతున్నారు. – సాక్షి, సిటీ బ్యూరో మహానగరంలో విద్యా వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. వార్షిక పరీక్షల సందడి మొదలవ్వకముందే వచ్చే విద్యా సంవత్సరానికి (2026–27) కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల జాతరను ప్రారంభించాయి. ‘వసంత పంచమి’ని కూడా మార్కెటింగ్ అస్త్రంగా మార్చుకుంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. అప్పుడే విద్యా సంస్థల మధ్య పోటీ పతాక స్థాయికి చేరింది. ● సాధారణంగా వేసవి సెలవుల్లో మొదలవ్వాల్సిన అడ్మిషన్ల ప్రక్రియ ఈసారి జనవరి నుంచే ముమ్మరమైంది. సిలబస్ పూర్తి కాకముందే సీట్ల వేటలో పడి తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సర ప్రారంభం కావడంతో ‘న్యూ ఇయర్ డ్రైవ్’ పేరుతో రంగంలోకి దిగిన కొన్ని విద్యా సంస్థలు, ఇప్పుడు ‘వసంత పంచమి స్పెషల్ డ్రైవ్’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నాయి. ‘నో డొనేషన్్ – ఫ్రీ అడ్మిషన్న్‘ వంటి ఆకర్షణీయమైన స్లోగన్లతో హోరెత్తిస్తున్నాయి. ఇపుడే అడ్మిషన్ పొందితే ట్యూషన్న్ ఫీజులో 20 శాతం రాయితీ ఇస్తామంటూ బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇది విద్యాబోధనలా కాకుండా, ఏదో షాపింగ్ మాల్ సేల్ను తలపిస్తోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. గుర్తింపు లేకున్నా.. ఆగని ప్రచారం ● విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొన్ని సంస్థలు చెలరేగిపోతున్నాయి. ఒక విద్యా సంస్థకు అనుమతి లేదని, అందులో ప్రవేశాలు తీసుకో వద్దని ఏకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల విధ్యాశాఖాధికారులు అధికారికంగా ప్రకటించినప్పటికీ అడ్మిషన్ల ప్రచారంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. ● నగర కూడళ్లలో భారీ హోర్డింగ్లు , ఫ్లెక్సీలు, మెట్రోరైళ్లలో ప్రకటనలు. సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో అడ్మిషన్ల ప్రకటనల వెల్లువ మాత్రం ఆగడం లేదు. నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాతే (ఏప్రిల్,మే) అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉంటుంది. ● జనవరిలో అడ్మిషన్లు చట్టవిరుద్ధం. ప్రతి పాఠశాల తన రిజిస్ట్రేషన్న్ నంబర్, గుర్తింపు పత్రాన్ని నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.’క్యాపిటేషన్న్ ఫీజు’ డొనేషన్లు వసూలు చేయవద్దు, పాఠశాల మేనేజ్మెంట్ ఏకపక్షంగా ఫీజులు పెంచకూడదు. పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు, యూనిఫాంలు కొనాలని తల్లిదండ్రులను బలవంతం చేయకూడదు. కానీ, ఇందుకు భిన్నంగానే ప్రక్రియ సాగుతోంది. ప్రై’వేటు‘ వైపే మొగ్గు ● గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 70 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ● 7,451 ప్రైవేటు పాఠశాలలుండగా అందులో 4,550 బడ్జెట్ పాఠశాలలు, 1,900 కార్పొరేట్, వాటి అనుబంద, 1,001 మిషనరీ పాఠశాలలున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థల ప్రభావంతో సాధారణ, దిగువ మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే బడ్జెట్స్కూళ్లు తగ్గు ముఖం పట్టాయి. ● ఇప్పటికే సుమారు 400 పైగా ప్రైవేటు (బడ్జెట్) పాఠశాలలు ఆర్థిక కారణాల వల్ల మూతపడగా, ఆ స్థానాలను కార్పొరేట్ స్కూళ్లు ఆక్రమిస్తున్నాయి. తల్లిదండ్రుల్లో అయోమయం ● తమ పిల్లల బంగారు భవిష్యత్తు దృష్ట్యా మంచి స్కూల్లో సీటు దొరకదేమోనన్న భయంతో చాలామంది తల్లిదండ్రులు ‘ముందస్తు అడ్మిషన్ల’ ఉచ్చులో పడుతున్నారు. ● రాయితీల ఆశతో వేల రూపాయలు అడ్వాన్సు చెల్లిస్తున్నారు. విద్యా సంవ్సత్సరం ప్రారంభమయ్యాక అదనపు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్ పేరుతో స్కూళ్లు అసలు రంగు బయటపెడుతున్నాయని బాధితులు వాపోతున్నారు. పట్టని విద్యాశాఖాధికారులు అనుమతులు లేని పాఠశాలలు ప్రచారం చేసుకుంటున్నా, నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకోకుండా, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అక్రమ అడ్మిషన్లను అడ్డుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మహానగర పరిధిలో ప్రైవేటు స్కూళ్ల వివరాలు జిల్లా పేరు మొత్తం బడ్జెట్ స్కూల్స్ కార్పొరేట్ ఇంటర్నేషనల్/మిషనరీ హైదరాబాద్ 2,885 1,800 650 435 రంగారెడ్డి జిల్లా 2,711 1,650 700 361 మేడ్చల్ – మల్కాజిగిరి 1,855 1,100 550 205 -
గంటలోపే పట్టేశారు
● స్నాచర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్: గొలుసు దొంగతనం జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు వల పన్ని స్నాచర్ను పట్టుకున్నారు. ఈ ఘటన ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహావీర్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న ఉమా(37) తన భర్తతో కలిసి గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సోమాజిగూడ నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్నారు. మెట్రో పిల్లర్ నెంబర్ ఏ–1156 వద్ద వెనుక నుంచి బైక్పై వచ్చిన ఓ యువకుడు ఉమా హ్యాండ్బ్యాగ్ను లాక్కొని పరారయ్యాడు. అందులో మొబైల్ ఫోన్తో పాటు రూ. 7,000 నగదు ఉంది. బాధితురాలు వెంటనే ఖైరతాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో డీఐ సైదులు స్పందించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి, పంజగుట్ట ఏసీపీ పి.మురళీకృష్ణ కూడా అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీసి పోలీసులకు తగిన సూచనలు జారీ చేశారు. ఖైరతాబాద్ డీఎస్ఐ ప్రణీత్తో పాటు క్రైమ్ సిబ్బంది రంగంలోకి దిగి సీసీ ఫుటేజీలు పరిశీలించి బైక్ నెంబర్ గుర్తించి నిందితుడిని కనిపెట్టారు. దీంతో గంట వ్యవధిలోనే నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు కొంతం సాయికిరణ్(22)గా తేలింది. కుషాయిగూడకు చెందిన నిందితుడు మద్యం కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచే బైక్పై తిరుగుతూ ఈ స్నాచింగ్ చేశాడని విచారణలో తేలింది. ఖైరతాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి సర్పంచులకు శిక్షణ
సాక్షి, రంగారెడ్డిజిల్లా/యాచారం: కొత్తగా ఎన్నికై న సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఐదు విడతల్లో రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని రెండు సమావేశ మందిరాలను సిద్ధం చేశారు. గ్రామ స్వరూపం, ఇంటి నిర్మాణాలకు అనుమతుల జారీ, ఆస్తి పన్ను వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, పార్కుల పరిరక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు, వాటిని సద్వినియోగం చేసుకునే అంశం, ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడటం వంటి అంశాలపై వివరించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 109 మందికి.. ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి విడతలో షాబాద్ మండల పరిధిలోని 41 పంచాయతీలు, మొయినాబాద్ మండల పరిధిలోని 19, చేవెళ్ల మండల పరిధిలోని 25, శంకర్పల్లి మండల పరిధిలోని 24 పంచాయతీల సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడతలో 103 మందికి.. మాడ్గుల మండల పరిధిలోని 34 మంది సర్పంచులు, ఆమనగల్లు మండల పరిధిలోని 13 మంది, తలకొండపల్లి మండల పరిధిలోని 32 మంది, కడ్తాల్ మండల పరిధిలోని 24 మంది సర్పంచులకు ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నిర్వహించే రెండో విడతలో శిక్షణ ఇవ్వనున్నారు. మూడో విడతలో 113 మందికి.. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు కందుకూరు మండల పరిధిలోని 35 మంది సర్పంచులు, నందిగామ మండల పరిధిలోని 19 మందికి, మహేశ్వరం మండల పరిధిలోని 30 మందికి, కేశంపేట మండలంలోని 29 మంది సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో 105 మందికి.. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు నాలుగో విడత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఫరూఖ్నగర్ మండల పరిధిలోని 47 మంది, కొత్తూరు మండలంలోని 12 మంది, కొందుర్గు మండలంలోని 22 మంది, జిల్లెడ్ చౌదరిగూడ మండల పరిధిలోని 24 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఐదో విడతలో 96 మందికి.. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు చివరి విడతగా నిర్వహించే శిక్షణ తరగతుల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని సర్పంచులకు అవగాహన కల్పించనున్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని 14 మంది సర్పంచులు, ఇబ్రహీంటపట్నం మండల పరిధిలోని 14 మంది, మంచాల మండల పరిధిలోని 23 మందికి, యాచారం మండల పరిధిలోని 24 మందికి, శంషాబాద్ మండల పరిధిలోని 21 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 27 వరకు ఐదు విడతల్లో ప్రత్యేక తరగతులు గ్రామ పంచాయతీ పాలన..పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన ముచ్చింతల్లో ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రతి ఒక్కరూ కచ్చితంగా హాజరయ్యేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి ఆయా మండలాల ఎంపీడీఓ, ఎంపీఓలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలం నుంచి అన్ని గ్రామాల సర్పంచులు హాజరయ్యే విధంగా పర్యవేక్షణ చేయడం కోసం జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ అధికారిని నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. శిక్షణ పొందనున్న సర్పంచులకు నిత్యం ఆన్లైన్ పోర్టల్లో హాజరు నమోదు, చివరి రోజు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. -
ఉత్సాహంగా సాగినసీఎం కప్ టార్చ్ ర్యాలీ
ఖైరతాబాద్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహర నుంచి తెలంగాణ సచివాలయం మీదుగా ఎల్బీ స్టేడియం వరకు సీఎం కప్ 2025–26 టార్చ్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలపై అవగాహన పెంచడంతో పాటు అన్ని గేమ్స్ పట్ల ఆదరణ పెంపొందించి, వీటి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తున్నాయని తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. టార్చ్ ర్యాలీలో జాతీయ స్థాయి స్కేటర్లు, స్విమ్మర్లు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. -
నకిలీ కరెన్సీ మార్పిడి వ్యవహారంలో ముగ్గురి అరెస్ట్
అబిడ్స్: నకిలీ కరెన్సీని మార్పిడి కేసులో ముగ్గురు నిందితులను గుడిమల్కాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ బి.రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కెన్యా దేశానికి చెందిన హవేస్ హెర్సి సలాద్ (30) నగరానికి వచ్చి టోలిచౌకీ ప్యారామౌంట్ కాలనీలో ఉంటున్నాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బాబులాల్ జట్కుక్నా (23), ధరమ్వీర్ (22)లతో ఇతడికి నకిలీ కరెన్సీ మార్పిడి వ్యవహారంపై సయోధ్య కుదిరింది. ఆదివారం రాజస్థాన్ నుంచి నకిలీ నోట్లు తెచ్చిన బాబులాల్ జట్కుక్నా, ధరమ్వీర్లు గుడిమల్కాపూర్ రింగ్రోడ్డు చౌరస్తాలో హవేస్ హెర్సి సలాద్కు ఇచ్చేందుకు పిలిపించారు. ముగ్గురి మధ్య నోట్ల మార్పిడి వ్యవహారంలో వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్డుపైనే పట్టపగలు ముగ్గురు ఒకరిపై ఒకరు దూషించుకోవడంతో స్థానికులు గమనించి వెంటనే గుడిమల్కాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో ఎస్.ఐ.నరేష్, సిబ్బందితో వెళ్లి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేయగా తొమ్మిది రూ.500 నోట్ల నకిలీ బెండళ్లను రాజస్థాన్ నుంచి తెచ్చి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. కేసును గోల్కొండ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్ పర్యవేక్షణలో గోషామహల్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గోవా విమానంలో గంజాయి పట్టివేత
శంషాబాద్: గోవా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలో సీటు కింద దాచి ఉంచిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్–2746 విమానం గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ప్రయాణికులు దిగిన అనంతరం విమానాన్ని ఎయిర్పోర్టు సెక్యూరిటీ, సిబ్బంది పరిశీలిస్తున్న సమయంలో సీటు కింద రెండు నల్లటి టేపులతో ఉన్న ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాటిని కస్టమ్స్ అధికారులకు అందించగా నార్కోటిక్ బ్యూరో అధికారులను రప్పించి పరిశీలించారు. మొత్తం 1.100 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిగా అధికారులు నిర్ధారించారు. గంజాయి విలువ 1.10 కోట్లు ఉందని తెలిపారు. గంజాయి తీసుకొచ్చిన వ్యక్తులు ఎయిర్పోర్టులో ఉన్న విస్తృత తనిఖీల కారణంగా దానిని అందులోనే వదిలి వేశారా? లేదా అదే విమానం కనెక్టివిటిలో మరో ప్రాంతానికి చేరవేసేందుకు ప్రయత్నించారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
305 మంది ‘నిషా’చరులకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వీకెండ్స్తో ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో నగర వ్యాప్తంగా చేపట్టగా... 305 మంది మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డారని ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఆదివారం వెల్లడించారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో చేపట్టారు. వీటిలో పట్టుబడిన 305 మందిలో 242 మంది ద్విచక్ర, 26 మంది త్రిచక్ర, 35 మంది తేలికపాటి వాహనాల చోదకుల అని ట్రాఫిక్ చీఫ్ పేర్కొన్నారు. వీరందరికీ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. సైబరాబాద్ పరిధిలో 231 మంది.. రాయదుర్గం: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ‘వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్’లో 231 మంది పట్టుబడ్డారు. 187 ద్విచక్రవాహనదారులు, 15 త్రీవీలర్లు, 29 నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు. ● మాదాపూర్ పీఎస్పరిధిలో 17 మంది, గచ్చిబౌలి–21, నార్సింగి–14, రాయదుర్గం–19, మియాపూర్–29, కూకట్పల్లిలో అత్యధికంగా 35 కేసులు, బాలానగర్–10, జీడిమెట్ల–10, పటాన్చెరు–29, కేపీహెచ్బీ–11, మేడ్చెల్–14, ఆర్సీపురం పరిధిలో 22 మందిపట్టుబడ్డారు. -
యువకుడి దారుణ హత్య
చాంద్రాయణగుట్ట: వైన్ షాప్ ముందు ఓ యువకుడు ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్రినాక పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. కర్ణాటకకు చెందిన సతీష్ చావ్లే (35) శంషీర్గంజ్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై శంషీర్గంజ్లోని తుల్జా భవానీ వైన్స్లో మద్యం ఆగేందుకు వచ్చాడు. మద్యం తాగే క్రమంలో మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఇద్దరు గల్లా పట్టుకొని బయటికి వచ్చారు. రోడ్డుపైకి వచ్చాక మరో వ్యక్తి తన స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో కడుపు, మెడ భాగాలలో తీవ్రంగా పొడిచాడు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైన్స్లో గుర్తు తెలియని వ్యక్తితో అనుకోకుండా గొడవ జరిగిందా...? ఏదైనా ముందస్తు పథకంలో భాగంగా జరిగిందా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
పుస్తక పఠనం ద్వారానే జ్ఞానం సాధ్యం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చంటి ప్రసన్న కేంద్రం ఆధ్వర్యంలో పలువురు రచయితలు రూపొందించిన తెలంగాణ ఉమెన్ ఎంపవర్మెంట్ పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాంతి సిన్హా మాట్లాడుతూ.. మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళల సాధికారతే దేశానికి శ్రీరమరక్ష అని చెప్పారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్. రాములు, డాక్టర్ వనమాల, నవతెలంగాణ బుక్ హౌస్ ఎడిటర్ ఆనందాచారి, డాక్టర్ అరుణ పరందాములు తదితరులు పాల్గొన్నారు. -
ప్రీ యాక్టివేషన్పై యాక్షన్
సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్లతో పాటు అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ప్రీ యాక్టివేషన్ దందాకు చెక్ చెప్పడానికి నగర పోలీసు విభాగం సిద్ధమైంది. ఇందులో భాగంగా సీసీఎస్ అధీనంలోని స్పెషల్ టీమ్ పోలీసులు నగర వ్యాప్తంగా నిఘా ఉంచారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని కడప నుంచి వీటిని తీసుకువచ్చి, నగరంలో విక్రయించడానికి ప్రయత్నించి ఇద్దరు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన 184 సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ఇకపై ఈ తరహా సిమ్కార్డుల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్.. సెల్ఫోన్ వినియోగదారు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు, వేలిముద్రలు కచ్చితంగా ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనేక మంది సిమ్కార్డుల విక్రేతలు తమ వద్దకు వచ్చే సాధారణ వినియోగదారులకు తెలియకుండా వారి నుంచి గుర్తింపులు తీసుకుంటున్నారు. వేలిముద్రల సేకరణ సమయంలో మొదటి ప్రయత్నం విజయవంతమైనా... అలా కాలేదంటే మరోసారి ఫింగర్ ప్రింట్స్ తమ వద్ద ఉండే మిషన్లో తీసుకుంటున్నారు. మొదటి ప్రయత్నంతో యాక్టివేట్ చేసినవి వినియోగదారుడికి ఇచ్చేసి పంపిస్తున్నారు. ఆపై రెండో ప్రయత్నంతో యాక్టివేట్ చేసుకున్నవి తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇద్దరు కలిసి పదుల సంఖ్యలో.. ఏపీలోని కడప జిల్లా భద్రిపల్లికి చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్ కడపలో లావణ్య ఎంటర్ప్రైజెస్ సిమ్స్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రణపల్లి సాయి ప్రదీప్ ఓ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలో సిమ్కార్డ్స్ ప్రమోటర్గా పని చేస్తున్నారు. ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డులకు ఉన్న డిమాండ్ తెలుసుకున్న ఈ ఇద్దరు దాన్ని క్యాష్ చేసుకోవాలని పథకం వేశా రు. దీంతో కొన్నాళ్లుగా లావణ్య ఎంటర్ప్రైజెస్కు సిమ్కార్డ్స్ కోసం వచ్చే వినియోగదారుల్ని టార్గెట్ చేశారు. వారికి తెలియకుండా గుర్తింపులు, వేలిముద్రలు తీసుకుని సిమ్కార్డుల్ని యాక్టివేట్ చేస్తున్నారు. వీటికి హైదరాబాద్లో డిమాండ్ ఎక్కువగా ఉందని భావించి విక్రయించడానికి వచ్చారు. దీనిపై సీసీఎస్ స్పెషల్ టీమ్కు సమాచారం అందింది. ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటేనే కట్టడి... ఏసీపీ జి.వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ డి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఆదివారం నాంపల్లి ప్రాంతంలో వల పన్ని ఈ ఇద్దరు నిందితులను పట్టుకుని 184 ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాను పూర్తి స్థాయిలో అరికట్టాలంటే సిమ్కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. పోస్ట్పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ప్రతి వినియోగదారుడూ తన పేరుతో ఎన్ని సిమ్కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. కేంద్రం అధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన అధికారిక వెబ్సైట్ (https:// tafcop. sancharsaathi. gov. in/ telecomUser) ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులోకి ప్రవేశించిన తర్వాత అక్కడ కోరిన వివరాలు పొందుపరిచి, ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరుతో ఎన్ని ఫోన్లు ఉన్నాయో కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తున్నవన్నీ మీకు సంబంధించినవి కాకపోతే ప్రీ–యాక్టివేటెడ్విగా భావించవచ్చు. దీనిపై అదే లింకులో రిపోర్ట్ చేయడం ద్వారా వాటిని బ్లాక్ చేయించవచ్చు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సైతం గ్రూప్ ఎస్సెమ్మెస్లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. సిమ్కార్డుల అక్రమ దందాపై సీసీఎస్ నజర్ వీటిని తరచూ వినియోగిస్తున్న అసాంఘిక శక్తులు ఏపీ నుంచి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన స్పెషల్ టీమ్ -
పండక్కి వెళ్లి.. సిటీకి మళ్లీ ..
సొంతూళ్ల నుంచి తిరుగు పయనంసాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లినవారు చాలావరకు ఆదివారం నగరానికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కిక్కిరిసిన రద్దీతో బయలుదేరిన బస్సులు, రైళ్లు నగరానికి చేరుకున్నాయి. మరోవైపు సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున బయలుదేరి రావడంతో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ పోటెత్తింది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా రిటర్న్ జర్నీ కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపింది. కాకినాడ, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులు కూడా ప్రత్యేక రైళ్లలో నగరానికి బయలుదేరారు. దీంతో వివిధ మార్గాల్లో రైళ్లలో రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి రాకపోకలను దృష్టిలో ఉంచుకొని సుమారు 51 రైళ్లను ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్లలో సందడి నెలకొంది. ఆర్టీసీ ఏర్పాట్లు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 6,400 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. కానీ ప్రయాణికుల డిమాండ్ మేరకు 5,375 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు. రిటర్న్ జర్నీ కోసం ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాల రద్దీ భారీగా పెరిగింది. టోల్గేట్ల వద్ద గంటల తరబడి నిలిచిపోయాయి. దీంతో ప్రయాణ సమయం విపరీతంగా పెరిగింది. మరోవైపు సోమవారం కూడా పలు జిల్లాల నుంచి రద్దీకనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చినట్లు పేర్కొన్నారు.తిరుగు ప్రయాణంలో కూడా ఆర్టీసీ బస్సులకు పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొన్నట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు సిబ్బందిని నియమించారు. సొంత వాహనాల్లోనూ.... ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు సొంత వాహనాల్లోనూ సిటీ జనులు పల్లెల నుంచి నగరానికి తరలారు. దీంతో అన్ని వైపులా రహదారులు పోటెత్తాయి. వివిధ మార్గాల్లో సుమారు 30 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు తరలివెళ్లినట్లు అంచనా. ప్రస్తుతం వారంతా నగరానికి చేరుకుంటున్నారు. మరోవైపు దూరప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకున్న వాళ్లు ఇళ్లకు చేరుకొనేందుకు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో రైళ్లలో రద్దీ కనిపించింది. రాజధానికి పోటెత్తిన నగర వాసులు ప్రయాణికులతో బస్సులు, రైళ్లు కిటకిట అదనపు సర్వీసులతో ఉపశమనం -
మారిన ఆహారపు అలవాట్లతో స్థూలకాయం
● కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ● ఉత్సాహంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ గచ్చిబౌలి: మారిన ఆహారపు అలవాట్ల కారణంగానే యువత స్థూలకాయం బారిన పడి అనేక సమస్యలు ఎదుర్కొంటోందని బొగ్గు, కేంద్ర గనుల శాఖమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా 57వ ఎడిషన్ ‘సండేస్ ఆన్ సైకిల్’ను జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ స్థూలకాయం కారణంగా యువతతో పాటు అనేక మంది ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఐటీ, ఫార్మా, హెల్త్ రంగంలో ప్రపంచంలోనే భారత్ మేటిగా ఉందన్నారు. దేశంలో స్థూలకాయం కారణంగా యువత దేశానికి సరైన సేవచేయలేకపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. స్మార్ట్ఫోన్లు యువశక్తిని నిర్వీర్యం చేస్తాయని, ఫిట్నెస్పై యువత దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ వాడకంలో పది శాతం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుఇచ్చారని కిషన్రెడ్డి గుర్తుచేశారు. ఆరోగ్య భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం 30 నిమిషాలకు మించి వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆరోగ్యవంతమైన యువత మేధస్సే దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం పలు విన్యాసాలు ప్రదర్శించారు. సైక్లింగ్లో విజేతలు, పాల్గొన్న వారికి బహమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫిట్ ఇండియా ప్రతినిధులు, క్రీడాకారులు, ఐటీ కంపెనీల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ ఢీకొని కారు బోల్తా
ఫిలింనగర్: మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్షిప్లో నివసించే బోడ సచిన్(34) ఆదివారం ఉదయం చింతల్ బస్తీ నుంచి తన ఇంటికి వెళుతున్నాడు. ఫిలింనగర్లోని శంకర్ విల్లాస్ చౌరస్తాలో కారు అదుపు తప్పడంతో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సచిన్ స్వల్ప గాయాలతో బయటపడి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్టేషన్కు తరలించారు. ఈ కారు బోడ స్వర్ణలత అనే పేరు మీద ఉండగా, సచిన్ కారు నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడు. సచిన్ను పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించగా జీరో అని వచ్చింది. అయితే కారులో మాత్రం ఆరుకు పైగా విస్కీ బాటిళ్లు లభ్యమయ్యాయి. నిందితుడు రాత్రంతా మద్యంతాగి ఆదివారం మధ్యాహ్నం పట్టుబడడంతో డ్రంకన్ డ్రైవ్లో జీరో నమోదైనట్లు తెలుస్తున్నది. కారు డివైడర్ను ఢీకొట్టిన సమయంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం, బోల్తా పడడంతో కారు నడుపుతున్న సచిన్ ప్రాణాలతో బయటపడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యానికి కారకుడైన సచిన్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
స్నాక్స్@ సర్కార్ స్కూల్..
సాక్షి, సిటీబ్యూరో: పదవ తరగతి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువులపై ఉపాధ్యాయులు దృష్టిసారించారు. ఈ క్రమంలో ప్రత్యేక తరగతులు కూడా ప్రారంభించారు. విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకుండా సాయంత్రం వేళ అల్పాహారం అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు కూడా విడుదలచేసింది. ● 19 రోజుల పాటు ... గత సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం 38 రోజుల పాటు అల్పాహారం అందించారు. అయితే ఈ ఏడాది 19 రోజులే అందించనుంది. సంక్రాంతి సెలవుల అనంతరం రెండు పూటలా తరగతుల నిర్వహణకు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ● పూటకు రూ.15 మాత్రమే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 108 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 8 వేల మంది పదోతరగతి విద్యార్థులు చదువుతున్నారు. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం ఉదయం 8.15 నుంచి 9.15 గంటల వరకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు (సెలవులు కాకుండా) మాత్రమే సాయంత్రం పూట నిర్వహించే ప్రత్యేక తరగతులకు రోజుకు రూ.15తో ఒక్కో విద్యార్ధికి అల్పాహారం అందించేందుకు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ అయ్యాయి. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో సర్కారు బడుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఉదయం అల్పాహారం తినకుండానే పాఠశాలలకు హాజరవుతున్నారు. వీరికి మధ్యాహ్న భోజనమే దిక్కవుతోంది. సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల అనంతరం ఇంటికి వెళ్లేసరికి ఆలస్యం అవుతోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు స్వచ్చంద సంస్థలు,దాతలు ముందుకొచ్చి అల్పాహారం అందిస్తే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు కూడా స్పందిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 ఖర్చు మేడ్చల్ జిల్లాలో 8 వేల మంది టెన్త్ విద్యార్థులు -
అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థులకు బంగారు భవిష్యత్
● వీసీ ఘంటా చక్రపాణి బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ– టీసీఎస్ అయాన్ జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంతో విద్యార్థుల భవిష్యత్ బంగారు బాటగా మారనుందని అంబేడ్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించిన టీసీఎస్ అయాన్–జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగాంను ఆదివారం ఆయన ప్రారంభించారు. యూనివర్సిటీ చేపట్టిన ఈ సరికొత్త ప్రోగ్రాం గురించి తెలంగాణ వ్యాప్తంగా అన్ని అధ్యయన కేంద్రాల్లో సిబ్బందికి, విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా దూరవిద్య ద్వారా ఉన్నత విద్య అభ్యసించేవారికి టీసీఎస్ అయాన్తో కలిసి ఈ కోర్సును అందించడం ఇదే మొదటిదని వెల్లడించారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులను మొదటి సెమిస్టర్ నుంచే కార్పొరేట్ కంపెనీలకు అవసరమయ్యేలా తీర్చిదిద్దుతూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ కోర్సును రూపొందించినట్లు వెల్లడించారు. ఈ కోర్సును డిగ్రీ చదువుతూనే ఏకకాలంలో పూర్తి చేయవచ్చన్నారు. వృత్తి– నైపుణ్యం–శిక్షణ కార్యక్రమాలతో విద్యార్థులకు రానున్న రోజుల్లో విస్తృత అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ పుష్పా చక్రపాణి, ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ రవీంద్రనాథ్ సాలమన్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి, టీసీఎస్ అయాన్–జాబ్ అఛీవర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీనా టిప్రే, విశ్వవిద్యాలయ అధికారులు పల్లవీ ఆబ్డే, ప్లేస్మెంట్ అధికారి వేణుగోపాల్రెడ్డి, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు, సిద్దిపేట అధ్యయన కేంద్రం ప్రిన్సిపాల్ సునీత, బానోత్ ధర్మా పాల్గొన్నారు. -
డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్టు
మూసాపేట: బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్కు చెందిన గంపా శ్రీహర్ష (31), కూన రాజు చందు(22) బాచుపల్లి మల్లంపేటలో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. శ్రీహర్ష వ్యాపారి. చందు డ్రైవర్. ఈ నెల 5న మల్లంపేట రోడ్డులోని హైరైజ్ ప్యారడైజ్ విల్లాస్లో శ్రీహర్ష ఎండీఎంఏ డ్రగ్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా చందుతోపాటు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సంజప్ప అలియాస్ నితిన్(32) డ్రగ్స్ విక్రయించినట్లు చెప్పాడు. జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న సంజప్ప బెంగుళూరు నుంచి అక్రమంగా సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకువచ్చి చందుతో కలిసి విక్రయించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 7న డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. 11.34 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు పెడ్లర్లుగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరితో సంబంధమున్న మరో ఇద్దరు ఇనావో షైజా, యశ్వంత్ పరారీలో ఉన్నారు. -
హష్ ఆయిల్ విక్రయిస్తుండగా ఇద్దరి అరెస్టు
శంషాబాద్ రూరల్: హష్ ఆయిల్ విక్రయించేందుకు యత్నిస్తుండగా ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి కథనం ప్రకారం... ఏపీలోని విశాఖపట్నం ఓల్డ్ గాజువాకకు చెందిన డింబకేశ్వర నాగప్రణవ్(26) నగరానికి వచ్చి డ్రైవర్గా పనిచేస్తూ ఊట్పల్లిలోని బంధువుల ఇంట్లో నివాసముంటున్నాడు. ఇతను కొన్నాళ్ల కిందట జైలులో ఉన్నప్పుడు గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న విశాఖపట్నం చౌడవరం నివాసి యశ్వంత్తో పరిచయం ఏర్పడింది. ప్రణవ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2024లో శ్రీకాకుళం ఇచ్ఛాపురంవాసి యెర్ర శ్రీనివాసులు(21)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పాతబస్తీలో గంజాయిని కొనుగోలు చేసి సేవించేవారు. గత డిసెంబర్ 30న యశ్వంత్ ద్వారా ప్రణవ్ గోవాకు వెళ్లి రెండు సీసాల హష్ ఆయిల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఊట్పల్లిలోని తన నివాసానికి సమీపంలో కొంతమంది గంజాయి, హష్ ఆయిల్ సేవిస్తున్నట్లు గమనించాడు. ఈ క్రమంలో ఈ నెల 7న వారి వద్దకు శ్రీనివాసులతో కలిసి వెళ్లి హ్యష్ ఆయిల్ను విక్రయిస్తామనంటూ బేరసారాలకు దిగాడు. అప్పటికే అక్కడ నిఘా వేసిన పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్టీపీల నిర్మాణంలో వేగం పెంచాలి
సాక్షి,సిటీ బ్యూరో: కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనుల్లో వేగం పెంచి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు.ఈ మేరకు గురువారం ఆయన ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అమృత్– 2.0 పథకంలో భాగంగా నిర్మించనున్న 39 ఎస్టీపీల పనుల పురోగతిపై ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఓఆర్ఆర్ పరిధిలో సుమారు రూ.3,849.10 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీ – 2 కింద నిర్మిస్తున్న ఎస్టీపీల పనుల పురోగతి గురించి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ అనుమతులు లభించిన స్థలాల్లో భూసార పరీక్షలు పూర్తి చేసి వెంటనే ఎస్టీపీ నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్న ప్రాంతాల్లో త్వరగా సమస్యలు పరిష్కరించి, అనుమతులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రతి ఎస్టీపీకి సంబంధించి 15 రోజులకు ఒకసారి చేయాల్సిన పనులపై చెక్ లిస్ట్ రూపొందించుకుని, గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. వాటి వివరాలు జలమండలి అధికారుల వద్ద, సైట్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. భూ వివాదాలుంటే... భూ వివాదాలు ఉన్న ప్రాంతాల్లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్టేట్ ఆఫీసర్కు సూచించారు. మరోవైపు భూ వివాదాలు ఉన్న ప్రాంత ఎస్టీపీల నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా భూమిని గుర్తించాలన్నారు. వివాదాలు లేకుండా భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్లను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు. స్థలాభావం ఉంటే తక్కువ స్థలంలో ఎక్కువ సామర్థ్యంతో నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. పనులు మొదలు పెట్టినప్పటినుంచి తుదివరకు ఎస్టీపీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టైం లైన్లను నమోదు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సాయిల్ టెస్టులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి -
మహీంద్రా సరికొత్త మోడల్స్ ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన రెండు ఐకానిక్ మోడళ్లు ఎక్స్యూవీ 7ఎక్స్ఓ, ఎక్స్ఈవీ 9ఎస్లను గురువారం సోమాజిగూడలోని ది పార్క్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఎక్స్యూవీ 7ఎక్స్ఓ 2021లో ప్రారంభమైనప్పటి నుంచి 3 లక్షల మందికి పైగా కస్టమర్లను సొంతం చేసుకుందని, దీని ప్రారంభ ధర రూ.13.66 లక్షలు (ఎక్స్–షోరూమ్) ఉందని నిర్వాహకులు తెలిపారు. ఎక్స్ఈవీ 9ఎస్ ప్రారంభ ధర రూ.19.95 లక్షల (ఎక్స్–షోరూమ్)తో భారతదేశపు బిగ్ న్యూ ఎలక్ట్రిక్గా అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్ఈఏఎల్ జోనల్ మేనేజర్ అభిషేక్ కుమార్, ఆటో డివిజన్ రీజినల్ మేనేజర్ స్వాతిక్, ఎమ్ఈఏఎల్ రీజినల్ మేనేజర్ నవేద్ ఖాన్తో పాటు డీలర్ భాగస్వాములు ఆటోమోటివ్ మహీంద్రా సీఈఓ నారాయణ, వీవీసీ మహీంద్రా ఎండీ వీరెన్, ల్యాండ్మార్క్ సీఈఓ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో ఫిన్నిష్ క్యాంపస్ ప్రారంభం
సాక్షి,సిటీ బ్యూరో: హోరిజన్ ఎక్స్పీరియన్సియల్ వరల్డ్ స్కూల్ సౌత్ ఇండియాలో మొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్ను గురువారం హైదరాబాద్లోని కొల్లూరులో ప్రారంభించింది. టీసీసీ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో టీ–హబ్ మాజీ సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇన్నోవేషన్ను ఒకే కాలేజీ కోర్సులో నేర్పలేమని, ప్రైమరీ స్కూల్ దశ నుంచే విద్యార్థులకు దానిపై కనీస అవగాహన ఉండాలని అన్నారు. ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సీఈఓ డా. జోహన్ స్టోర్గార్డ్ మాట్లాడుతూ ‘ఫిన్లాండ్లో పిల్లలకు సబ్జెక్టులు మాత్రమే నేర్పమని, ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తామని అన్నారు. హై–ట్రస్ట్, లో–స్ట్రెస్ వాతావరణంలో విద్యాబోధన ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టూడియో చింతల ఫౌండర్ దివాకర్ చింతల, పాంగేయా ట్రేడ్ (వైస్ ప్రెసిడెంట్ రైతా మోచెర్ల, పీడియాట్రీషియన్, డా. లావణ్య తదితరులు పాల్గొన్నారు. పెళ్లి పేరిట నమ్మించి.. డబ్బులు కాజేసి.. ఫిలింనగర్: వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని లైంగిక వేధించడంతోపాటు రూ.75 లక్షలు తీసుకుని మోసగించిన వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ సదరన్ మోగా టౌన్షిప్లో నివాసం ఉండే రాణా ప్రతాప్రెడ్డి వివాహం చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి శారీరంగా లోబర్చుకున్నాడు. వ్యాపారం కోసం ఆమె వద్ద రూ.75 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి మాట ఎత్తితే మొహం చాటేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారణాసి విమానం రద్దు.. మరొకటి వెనక్కి.. ● ప్రతికూల వాతావరణమే కారణం శంషాబాద్: వారణాసిలో ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్ విమానాశ్రయ నుంచి వెళ్లాల్సిన విమానాల్లో ఒకటి పూర్తిగా రద్దు కాగా, మరొకటి మార్గమధ్యంలోంచి తిరిగి వెనక్కి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇండిగో 6719 విమానం గురువారం సాయంత్రం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకునే ముందు వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉందనే సమాచారం వచ్చింది. దీంతో సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థ విమానాన్ని రద్దు చేసింది. ప్రయాణికులకు షెడ్యూల్ మార్పులున్నట్లు వెల్లడించింది. అర్ధాంతరంగా తిరిగి వచ్చిన విమానం.. వారణాసి బయలుదేరిన మరో విమానం మార్గమధ్యలోంచి తిరిగొచ్చింది. ఇండిగో 6ఈ–307 విమానం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 231 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం బయలుదేరింది. వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉన్న కారణంగా అర్ధాంతరంగా విమానం తిరిగి రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరింది. ప్రయాణికులకు ఎయిర్లైన్స్ వర్గాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. -
మూడోసారి..ఏమౌనోమరి!
సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల క్రితం జీహెచ్ఎంసీలో కోట్లాది రూపాయల పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టు పని కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఫ్లై ఓవర్ల సంగతి అటుంచితే.. కనీసం రహదారుల విస్తరణ పనులు కూడా ప్రారంభం కాలేదు. కొన్నింటికి కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. మరికొన్నింటికి ఇప్పటివరకూ టెండర్లు కూడా పిలవలేదు. ఇంకా కొన్ని పనులకు ఒకటి, రెండు పర్యాయాలకు మించి టెండర్లు పిలిచినా, పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అందుకు తాజా ఉదాహరణ ఓల్డ్సిటీలోని తులసీనగర్ నుంచి గౌస్ నగర్ వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు. ఈ పనుల అంచనా వ్యయం రూ.88 కోట్లు. నిధులు మంజూరు చేసినా.. ● హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలనే తలంపుతో పాతబస్తీలోనూ పలు పనులు చేసేందుకు ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసింది. ఫ్లై ఓవర్లతోపాటు ఆయా ప్రాంతాల్లో రహదారులను 100 అడుగుల వెడల్పుతో విస్తరించి అభివృద్ధి చేయాలని భావించింది. అందులో భాగంగా ఆయా పనులకు టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. తులసీనగర్– గౌస్ నగర్ వరకు పనులకు టెండర్లు ఆలస్యంగా పిలిచారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు మొదలుకాలేదు. ● ఇప్పటికే రెండు పర్యాయాలు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తాజాగా మూడోసారి టెండర్లు ఆహ్వానించారు. ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకు వస్తారో, రారో తెలియని పరిస్థితి. రహదారి అభివృద్ధిలో భాగంగా వెడల్పుగా మాత్రమే కాకుండా పాదచారులకు ఫుట్పాత్లు, మీడియన్లలో గ్రీనరీ తదితరమైనవి ఉండాలనేది లక్ష్యం. కానీ.. రెండు పర్యాయాలు ఎవరూ రాలేదు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు లేనందునే కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. పాతబస్తీలో రహదారి అభివృద్ధి పనులు ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకొస్తారా? అంచనా వ్యయం రూ.88 కోట్లు -
2027 డిసెంబర్ నాటికి గోదావరి పనులు పూర్తి
జలమండలి ఎండీ అశోక్రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్–2–3 ప్రాజెక్ట్ పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో గోదావరి నిర్మాణ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు.. అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ వరకు నిర్మించాల్సిన పైపులైన్ విస్తరణ పనులు, ఘన్ పూర్ వద్ద నిర్మించనున్న 80 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఘన్పూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల వద్ద నిర్మించే నీటిశుద్ధి కేంద్రాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్–1 కింద.. నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీరు తరలిస్తోందని, మరో రెండు దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు తరలించేందుకు పనులు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తలించే మొత్తం నీటిలో 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా.. జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. సమావేశంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చైనా మాంజాకు చెక్
ఈ దారంతో పతంగులు ఎగురవేసే వారిపై కేసులు సాక్షి, సిటీబ్యూరో ‘వినియోగదారులు ఉన్నంత వరకు విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నిషేధిత చైనా మాంజా రవాణా చేసే, అమ్మే వారితో పాటు దీంతో పతంగులు ఎగుర వేసే వారిపైనా కేసులు నమోదు చేయాలని నిర్ణయించాం’ అని నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ స్పష్టం చేశారు. దీనికోసం సంక్రాంతి ముగిసే వరకు ప్రత్యేక బృందాలతో నిఘా తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు. గురువారం బంజారాహిల్స్లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పండగ నేపథ్యంలో బృందాలుగా చేరి పతంగులు ఎగుర వేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేసే ప్రత్యేక బృందాలు వాళ్లు చైనా మాంజా వాడుతున్నట్లు తేలితే బీఎన్ఎస్తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు. వీటిలో నేరం నిరూపణ అయితే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానాలకు ఆస్కారం ఉందని కొత్వాల్ పేర్కొన్నారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు చైనా మాంజా వినియోగాన్ని పోత్సహించవద్దని ఆయన సూచించారు. నెల రోజుల ముందే అప్రమత్తం.. ● పతంగుల పండగ నేపథ్యంలో చైనా మాంజా విక్రయంపై నగర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దీని వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో, జాతీయ హరిత ట్రైబ్యునల్ 2017లో నిషేధించింది. అయినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో నెల రోజులుగా నిఘా ఉంచిన అధికారులు ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6226 బాబిన్ల మాంజా స్వాధీనం చేసుకున్నారు. ● ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ల్లో తయారవుతున్న ఈ మాంజాపై పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు ముద్రించి రవాణా చేస్తున్నా రు. దీనికి సహకరిస్తున్న పార్సిల్, కొరియర్ సంస్థల పైనా చర్యలు తప్పవని సజ్జనర్ హెచ్చరించారు. విక్రేతలతో పాటు గోదాములపైనా దాడులు చేస్తున్న స్థానిక, టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ మాంజా మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. ప్రతి ఏడాదీ మాంజా విక్రయాలపై దాడులు చేసినా పంగుల ముగిసిన తర్వాత అంతా మిన్నకుండిపోతారు. ఈసారి మాత్రం సంక్రాంతి తర్వాత కూడా ఈ కేసుల దర్యాప్తును పర్యవేక్షిస్తామని సజ్జనర్ స్పష్టం చేశారు. మాంజా బాబిన్లను చూపిస్తున్న సీపీ సజ్జనర్ తదితరులుఈ–కామర్స్ వెబ్సైట్ల ద్వారానూ అమ్మకాలు... నగర పోలీసు విభాగానికి చెందిన ఓ ఎస్సై చేపట్టిన డెకాయ్ ఆపరేషన్తో ఈ మాంజా విక్రయాలు ఈ–కామర్స్ సైట్ల ద్వారానూ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా సైట్లలోని క్రయవిక్రయాలను ఆరా తీసిన పోలీసులు కొందరికి నోటీసులు సైతం జారీ చేశారు. ప్రస్తుతం ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్మీడియా సైట్లపై నిఘా ఉంచారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ మాంజా తయారు చేస్తున్న సంస్థల వివరాలు కనిపెట్టడంతో పాటు అవసరమైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం ద్వారా వాటిని సీజ్ చేయించాలని సజ్జనర్ నిర్ణయించారు. ‘తాజా పరిణామాల నేపథ్యంలో హ్యష్ట్యాగ్ సే నో టు చైనీస్ మాంజ క్యాంపెయినింగ్ చేపడుతున్నాం. తల్లిదండ్రులూ బాధ్యతగా వ్యవహరించి నూలు దారం వినియోగాన్ని ప్రోత్సహించాలి. సంక్రాంతి ముగిసిన తర్వాత వైర్లు, రహదారులపై ఉన్న మాంజాను తొలగించడానికి జీహెచ్ఎంసీ, అటవీ అధికారులతో కలిసి పని చేస్తాం. చైనా మాంజాపై సమాచారం ఉంటే ‘100’కు కాల్ చేసి లేదా 94906 16555కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలి’ అని కొత్వాల్ సజ్జనర్ సూచించారు. నేరం నిరూపితమైతే ఐదేళ్ల వరకు జైలుశిక్ష వెల్లడించిన నగర కమిషనర్ వీసీ సజ్జనర్ -
సాగర్ తీరం.. ఆనంద రాగం!
బుద్ధ పూర్ణిమ పునరభివృద్ధికి ప్రణాళికలు సాక్షి, సిటీబ్యూరో: బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పునరభివృద్ధికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. పర్యాటకులను, సందర్శకులను ఆకట్టుకొనేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు సమగ్రమైన మాస్టర్ప్లాన్ రూపొందించనుంది. ఇందుకోసం కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు సంస్థల నుంచి ఆసక్తుల వ్యక్తీకరణకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ త్వరలో బిడ్డింగ్ వెలువరించే అవకాశం ఉంది. శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, అంబేడ్కర్ మహా విగ్రహం, తెలంగాణ అమరుల స్మారకం, బుద్ధ విగ్రహం వంటి చారిత్రక కట్టడాలతో విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్ సంస్కృతి, తెలంగాణ కళలు ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. పర్యాటకులను ఆకట్టుకొనే నైట్ బజార్ కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. ఈ ప్రణాళికలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ క్రమంలోనే బుద్ధపూర్ణిమ రీ డెవలప్మెంట్కు హెచ్ఎండీఏ తాజాగా ప్రణాళికలు రూపొందించింది. అందంగా.. ఆహ్లాదంగా.. సుమారు 1,300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న హుస్సేన్సాగర్ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం అప్పటి ఉమ్మడి ప్రభుత్వం హెచ్ఎండీఏకు అనుబంధంగా బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసింది. 2004 నుంచి బీపీపీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కు, లేక్వ్యూపార్క్, సంజీవయ్య పార్క్, ఎకోపార్క్, పీవీ జ్ఞానభూమి, పీపుల్స్ప్లాజా, ఎకో కన్జర్వేషన్ జోన్ తదితర ప్రాంతాలు ప్రస్తుతం బీపీపీలో భాగంగా ఉన్నాయి. వీటి నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తోంది. బీపీపీ పునరభివృద్ధిలో భాగంగా ఈ పార్కులు అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని, ఆహ్లాదాన్ని అందజేస్తాయి. మరోవైపు రిక్రియేషన్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా పర్యాటకులకు 24 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ లభించే నైట్బజార్ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉందని అధికారులు చెప్పారు. హుస్సేన్సాగర్ చెరువులోకి స్కైవాక్ సైకిల్ వే నిర్మించాలని హుమ్టా ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ఆనుకొని ఐమాక్స్ థియేటర్ వద్ద ఉన్న విశాలమైన స్థలం, ఎకో కన్జర్వేషన్లో ఉన్న మరికొన్ని ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవడం పునరభివృద్ధి ప్రాజెక్టు లక్ష్యం. ఈ మాస్టర్ప్లాన్ రూపకల్పనపై కన్సల్టెన్సీ ని ఎంపిక చేసేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. -
తటాక పతంగోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు ఉత్సవాలకు వేదికలు అవుతున్నాయి. గతేడాది బతుకమ్మ ఉత్సవాలు అంబర్పేటలోని బతుకమ్మకుంట వద్ద జరగ్గా.. ఈ ఏడాది సంక్రాంతి నేపథ్యంలో కై ట్ ఫెస్టివల్కు మరికొన్ని చెరువులు ముస్తాబయ్యాయి. మాదాపూర్లోని తమ్మిడికుంట, కూకట్పల్లిలోని నల్లచెరువు, పాతబస్తీలోని బుమ్రుక్ ఉద్ దౌలా చెరువులు దీనికోసం సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు, మిగిలిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. నగరంలో చెరువులు 60 శాతం వరకూ కనుమరుగయ్యాయి. మిగిలిన చెరువులు చాలా వరకు ఆక్రమణలు, వ్యర్థాలు, మురుగు నీటితో నిండిపోయాయి. దీనిపై దృష్టి పెట్టిన హైడ్రా దశల వారీగా చెరువుల్ని అభివృద్ధి చేయడంతో పాటు వాటికి పునరుజ్జీవం కల్పిస్తోంది. ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు తమ్మిడికుంట, నల్ల చెరువు, బుమ్రుక్ ఉద్ దౌలా చెరువుల వద్ద జరుగనున్న కై ట్ ఫెస్టివల్కు వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించనున్నారు. తమ్మిడికుంట వద్దకు ఐటీ ఉద్యోగులు, కూకట్పల్లి నల్లచెరువు వద్దకు సినీ ప్రముఖులు, బుమ్రుక్ ఉద్ దౌలా చెరువు వద్దకు క్రీడా కారులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో హైడ్రా పర్యాటక శాఖతో కలిసి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆక్రమణలతో 14 ఎకరాలకు కుంచించుకుపోయిన తమ్మిడికుంటను 30 ఎకరాలకు, నల్ల చెరువును 16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు, బుమ్రుక్ ఉద్ దౌలా చెరువును 4.12 ఎకరాల నుంచి 17 ఎకరాలకు విస్తరించిన హైడ్రా వీటికి పునరుజ్జీవలం కల్పించింది. హైడ్రా మొదట విడత చేపట్టిన ఆరు చెరువుల అభివృద్ధిని చేపట్టింది. వీటిలో బతుకమ్మకుంట ఇప్పటికే ప్రారంభం కాగా.. మరో మూడు సిద్ధమయ్యాయి. మాదాపూర్లోని సున్నం చెరువు, ఉప్పల్లోని నల్ల చెరువుల అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. ముస్తాబైన కూకట్పల్లి నల్ల చెరువు ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ అభివృద్ధి చేసిన చెరువుల వద్ద కై ట్ ఫెస్టివల్ ఏర్పాట్లు చేపట్టిన హైడ్రా -
హై హై.. రైజింగ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో రియల్ఎస్టేట్ మందగించిందని చెబుతున్నప్పటికీ.. జీహెచ్ఎంసీ పరిధిలో గడచిన (2025) సంవత్సరంలో హైరైజ్ (బహుళ అంతస్తుల) భవనాలు పెరిగాయి. అంతకుముందు 2024 సంవత్సరంలో జీహెచ్ఎంసీ నుంచి 69 హై రైజ్ భవనాలకు అనుమతులివ్వగా, 2025లో 103 బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిచ్చారు. ఇతర భవన నిర్మాణ అనుమతులు మాత్రం కొంత తగ్గాయి. 2024లో 11,855 భవన నిర్మాణ అనుమతులు జారీ కాగా, 2025లో 11,166 భవన నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయి. ఇవి తగ్గినప్పటికీ, హైరైజ్ భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ పెరగడంతో టౌన్ప్లానింగ్ విభాగం ఆదాయం పెరిగింది. 2024లో రూ.1,114.24 కోట్ల ఆదాయం రాగా, 2025లో రూ. 1,272.36 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం మార్చినుంచి అమల్లోకి వచ్చిన ఏఐ ఆధారిత బిల్డ్ నౌ అప్లికేషన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు.. ముఖ్యంగా భారీ భవంతులవి త్వరితంగా ఇవ్వడం సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. 2024లో కేవలం 12 లేఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులివ్వగా 2025లో 30 లేఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులిచ్చారు. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు 2024లో 2,125 జారీ కాగా, 2025లో 2,401 జారీ అయ్యాయి. భూసేకరణ పనులు.. భవన నిర్మాణ అనుమతులతో పాటు టౌన్ప్లానింగ్ విభాగం వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణలు కూడా పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వీటిలో ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ల నుంచి హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)ప్రాజెక్ట్ కింద వివిధ ఫ్లై ఓవర్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణ చేసినట్లు తెలిపింది. వీటితో పాటు గోషామహల్లో నిర్మించనున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనానికి అప్రోచ్, లింక్రోడ్లకు ప్రాధాన్యమిచ్చి భూసేకరణల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేసినట్లు పేర్కొంది. రహదారుల విస్తరణకు.. ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులకు 2024లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. ఈ పనులు త్వరితగతిన జరిగేందుకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియ జరుగుతోందని తెలిపింది. నాలుగు ప్రధాన రహదారులకు సంబంధించి 696 ఆస్తులకుగాను 134 ఆస్తుల సేకరణ పూర్తి కాగా.. మిగతా ఆస్తుల సేకరణ పనులు పురోగతిలో ఉన్నట్లు పేర్కొంది. జంక్షన్ల పనులు.. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.233 కోట్లతో 90 జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా, 74 జంక్షన్లలో పనులు చేసేందుకు ప్లాన్లను ఆమోదించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెరిగిన హైరైజ్ భవనాలు 2025లో 103 బహుళ అంతస్తులకు అనుమతులు ఆశాజనకంగా టౌన్ప్లానింగ్ ఆదాయం -
కొకై న్ తరలిస్తూ ఇద్దరు యువకులు..
మణికొండ: డ్రగ్స్తో ఇద్దరు వ్యక్తులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్(46), గోవాకు చెందిన విజయ్లు పుప్పాలగూడలోని గోల్డెన్ టెంపుల్ వద్ద డ్రగ్స్తో సంచరిస్తున్నారనే సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరపగా వారి వద్ద ఏడు గ్రాముల కొకై న్ లబించింది. ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా శ్రీనివాస్ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దాంతో వారిద్దరితో పాటు లబించిన కొకై న్, రెండు సెల్ ఫోన్లను నార్సింగి పోలీసులకు అప్పగించారు. వారు ఎవరికి కొకై న్ సరఫరా చేసేందుకు వచ్చారు..ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు, వీరితో పాటు వారి గ్యాంగ్లో మరెంత మంది ఉన్నారనే కోణంలో ఎస్ఓటీ పోలీసులతో పాటు నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఈ మార్కులు అప్పట్లో చాలా కష్టం’
● డీజీపీ శివధర్రెడ్డి, కొత్వాల్ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: ‘మా రోజుల్లో నూటికి 40, 50 శాతం రావడమే గగనమయ్యేది. ఆ స్థాయిలో మార్కులు వస్తే చాలని పరితపించే వాళ్లం. అయితే నేటి తరం విద్యనభ్యసించడంలో పోటీ పడుతోంది. అందుకే 90 నుంచి 95 శాతం మార్కులు సాధించగలుగుతోంది’ అని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్రెడ్డి అన్నారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టుల పిల్లలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం స్కాలర్ షిప్స్, ప్రశంసా పత్రాలు అందిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జలవిహార్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ‘కష్టపడి ప్రతిభను చాటిన వారికి ఇచ్చే ఇలాంటి గౌరవం వారికి మరింత ప్రోత్సాహంగా నిలుస్తుందన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులోనూ ఉన్నత విజయాలు సాధించాలని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్ చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సీఎస్బీ ఐఏఎస్ అకాడెమీ నిర్వాహకురాలు బాల లత, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్, కోశాధికారి రమేష్ వైట్లలతో పాటు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. -
ప్రతిష్టకు ఎగనామం
● మల్కాజిగిరిగా మారిన రాచకొండ కమిషనరేట్ ● గ్లోబల్ సిటీ అంటూ ఇలా పెట్టడంపై అభ్యంతరం ● సికింద్రాబాద్ పేరుతోనే కొనసాగించాలనే అభిప్రాయం ● కొత్తవాటి మధ్య సిబ్బంది విభజన సైతం ఇబ్బందే ● ప్రస్తుతానికి తాత్కాలికంగా పనులు చేసుకోనున్న పోలీస్ బాస్లుసాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మాదిరిగానే పరిపాలన సౌలభ్యం కోసం రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త జోన్లు, డివిజన్లు, పోలీసుస్టేషన్లు... పరిధులతో రూపురేఖలు మార్చింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధులు మారగా... రాచకొండ స్థానంలో మల్కాజిగిరి కమిషనరేట్ వచ్చింది. ఈ పేరుపైనే అనేక విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మేడ్చల్ పోలీసుస్టేషన్ను సైబరాబాద్ కమిషనరేట్లో కలపడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉండటం, మల్కాజిగిరి పేరుతో కమిషనరేట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మేడ్చల్ను సైబరాబాద్లో చేర్చడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ కమిషనరేట్లలో అధికారికంగా నేటి (శుక్రవారం) నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అప్పట్లోనే అనేక విమర్శలు.. ఒకప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ మాత్రమే ఉండేది. 2002లో సైబరాబాద్ కమిషనరేట్కు రూపమిచ్చిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం 2016లో సైబరాబాద్ను విడగొడుతూ నల్లగొండలోని కొన్ని ప్రాంతాలను కలిపి మరో కమిషనరేట్ ఏర్పాటు చేసింది. తొలినాళ్లల్లో దీన్ని సైబరాబాద్ ఈస్ట్ అన్నా..ఆపై రాచకొండగా మార్చారు. దీనికి ఆ పేరు పెట్టడంపై అప్పట్లో అనేక విమర్శలు సైతం వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్. రాచకొండల్లో ఉన్న ప్రాంతాలతో ఏర్పడిన కొత్త కమిషనరేట్కు మల్కాజిగిరి అని పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగమెరిగిన సికింద్రాబాదే మేలు.. దేశంలోనే కాదు.. ప్రపంచం పటంలోనే హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ పేరు సుపరిచితమే. రైల్వేస్టేషన్, మహంకాళి దేవాలయం, పరేడ్ గ్రౌండ్స్, కంటోన్మెంట్ బోర్డు, బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ ఉండటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క సికింద్రాబాద్కు బ్రిటిషర్ల కాలం నుంచీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కొత్తగా ఏర్పడిన కమిషనరేట్లో ఈ ప్రాంతాలు కూడా ఉన్నాయి. దీంతో సికింద్రాబాద్ పేరు ఖరారు చేస్తే ఉత్తమం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బృహత్ జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్, గ్రేటర్ సైబరాబాద్గా మార్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే విషయం గమనార్హం. సిబ్బంది విషయంలోనే ఇబ్బందులు.. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ మధ్య సిబ్బంది విభజన విషయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించుకుని, భవిష్యత్తులో తుది చర్యలు తీసుకోనున్నారు. ఇలా విస్తరించి ఉండటంతో... హైదరాబాద్, సైబరాబాద్ మొత్తం చార్మినార్ జోన్లో భాగం. రాచకొండ మాత్రం చార్మినార్ జోన్తో పాటు యాదాద్రిలోనూ విస్తరించి ఉంది. ఈ కమిషనరేట్ మల్కాజిగిరిగా మారే వరకు యాదాద్రి ప్రాంతం కూడా ఇందులో భాగంగానే ఉండేది. దీంతో ఈ కమిషనరేట్లో రెండు జోన్లు ఉండేవి. పునర్వ్యవస్థీకరణ తర్వాత రాచకొండలోని కొన్ని ప్రాంతాలు మల్కాజిగిరిలో, కొన్ని హైదరాబాద్లో వచ్చి కలిశాయి. దీంతో ఇక్కడి సిబ్బంది సాంకేతికంగా హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లలో పని చేస్తున్నా... వారి నియంత్రణ అధికారం మాత్రం చార్మినార్, యాదాద్రి జోన్లకు సంబంధించిన డీఐజీలకే ఉంటుంది. దీంతో భవిష్యత్తులో వీరికి పదోన్నతులు కల్పించాలంటే ఈ రెండు జోన్లకు చెందిన డీఐజీలకు జాబితా పంపి, దాని ఆధారంగానే ముందుకు వెళ్లాల్సి ఉండటంతో సీనియారిటీ జాబితా తయారీలో సాకేంతిక ఇబ్బందులు వస్తాయి. సైబరాబాద్లో కలుస్తున్న ‘జిల్లా’.. మల్కాజిగిరి కమిషనరేట్లోనూ ఇలాగే హైదరాబాద్, యాదాద్రి జోన్లకు ఎంపికై న వాళ్లు ఉన్నారు. మరోపక్క సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోకి పటాన్చెరు, అమీన్పూర్, ఆర్సీపురం తదితర ప్రాంతాలను తీసుకువచ్చి కలిపారు. కానిస్టేబుల్ స్థాయి అధికారుల రిక్రూట్మెంట్ రెవెన్యూ జిల్లా, యూనిట్ స్థాయిలో జరుగుతుంది. ప్రస్తుతం సైబరాబాద్లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు భౌగోళికంగా ఆ కమిషనరేట్కు చెందిన స్థానికులు అవుతారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన వాళ్లు అమీన్పూర్, పటాన్చెరువు, ఆర్సీపురం ఠాణాల్లో పని చేస్తూ ఉంటారు. ఈ కారణంగా వీరి సీనియారిటీ జాబితా తయారీ, పదోన్నతులు సైతం చార్మినార్ జోన్తో పాటు సంగారెడ్డిలకు పంపాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక కారణాలను అధిగమించాలంటే జోన్లను పునర్వవస్థీకరించాల్సి ఉంది. ఆ మేరకు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపి ఆ మొత్తం పొంది రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులు వెలువడాలి. దీనికి సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది విభజన చేసుకోనున్నారు. -
‘మత్తు’ దందాకు చెక్..!
నగరంలో మత్తు దందా నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్, గంజాయి కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిందితులు వారి కళ్లుగప్పి సరఫరా చేసేందుకుప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త దారుల్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. ఓ యువకుడైతే ఏకంగా బహిరంగ ప్రదేశాల్లో గంజాయి మొక్కలు పెంచుతుండగా.. మరో యువతి డ్రగ్స్ విక్రయిస్తోంది. ఇక ఇద్దరు యువకులు కొకై న్ తరలిస్తుండగా పట్టుబడ్డారు. రాజేంద్రనగర్: తన గుడారం పక్కనే గంజాయి మొక్కలను పెంచుతున్న యువకుడిని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన మేరకు.. బిహార్కు చెందిన రాజేందర్ (30) తల్లిదండ్రులు, సోదరితో కలిసి రోడ్లపై వన మూలికలను విక్రయిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలో తాత్కాలిక గూడారాలను వేసుకొని నివసిస్తున్నాడు. కిస్మత్పూర్లోని ఖాళీ స్థలంలో కొద్ది రోజులుగా గుడారాలను వేసుకొని నివస్తున్నాడు. తన గుడారం పక్కనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి. గంజాయి మొక్కలు కనిపించకుండా పరదాలను ఏర్పాటు చేశారు. ఈ విషయమై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టగా అవి గంజాయి మొక్కలుగా నిర్ధారించారు. దీంతో వాటిని ధ్వంసం చేసి రాజేందర్ను అదుపులోకి స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. డ్రగ్స్తో పట్టుబడ్డ యువతి బంజారాహిల్స్: వెకేషన్ కోసమో, హాలిడే ట్రిప్ కోసమో చాలా మంది గోవాకు వెళ్తుంటారు. అందరిలాగా హైదరాబాద్కు చెందిన ఓ మహిళ గోవాకు వెళ్లింది. అయితే ట్రిప్ ఎంజాయ్ చేసి రాలేదు. డ్రగ్ పెడ్లర్స్తో పరిచయాలు పెంచుకుని దందాలోకి దిగింది. గుట్టుచప్పుడు కాకుండా గోవా నుంచి సిటీకి డ్రగ్స్ సరఫరా చేస్తూ వ్యాపారాన్ని విస్తరించింది. న్యూ ఇయర్ కోసం చేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలిని బంజారాహిల్స్కు చెందిన హస్సాగా గుర్తించారు. గోవా నుంచి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ సరఫరా చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు నైజీరియన్ సరఫరాదారుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. హస్సా 2024 డిసెంబర్లో గోవా పర్యటనలో భాగంగా డ్రగ్స్ పెడ్లర్స్తో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాగటర్ క్లబ్లో ఎండీఎంఏ వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు చెప్పారు. 2025 మార్చి నుంచి పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హస్సా డిసెంబర్ 26న సియోలిమ్, మాపూసాలో ఎండీఎంఏ, ఎల్ఎస్డీ అందజేసినట్లు తేలింది. హైదరాబాద్కు చెందిన మరికొందరితో కలిసి డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ పోలీస్స్టేషన్లో ఎన్డీపీఎస్ కేసులో గతంలో అరెస్టయినట్లు చెప్పారు. -
ఫ్యూచర్ సిటీలోనే కమిషనరేట్!
మూడు జోన్లు, 22 ఠాణాలతో దీని స్వరూపం ● 30– 40 ఎకరాల స్థలాన్వేషణలో యంత్రాంగం ● నాలుగు నెలల తర్వాత ఫ్యూచర్కు కొత్త పోలీసు బాస్? ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్కు తొలి కమిషనర్గా జి.సుధీర్బాబును నియమించింది. ఇప్పటివరకు రాచకొండ కమిషనర్గా ఉన్న ఈయన ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భారత్ ఫ్యూచర్ సిటీకి పోలీసు బాస్గా నియమించారనే ప్రచారం జరుగుతోంది. మరో 3–4 నెలల్లో సుధీర్ బాబు పదవీకాలం ముగియనుంది. దీంతో ఫ్యూచర్ సిటీకి కొత్త పోలీసు బాస్ నియామకం అనివార్యం. ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత కూడా సుధీర్ బాబునే కమిషనర్గా కొనసాగిస్తే.. పదవీ విరమణ తర్వాత కూడా పోలీసు కమిషనర్గా కొనసాగిన తొలి కమిషనర్గా సుధీర్ బాబు రికార్డ్ సృష్టించినట్లవుతుందనే ప్రచారం జరుగుతోంది. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను పునర్ వ్యవస్థీకరించడంతో రాజధానిలో శాంతి భద్రతలను కాపాడటం, పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చడం, సమర్థమైన పర్యవేక్షణ అనివార్యమైన నేపథ్యంలో గ్రేటర్ పోలీసు విభాగాన్ని కూడా పునర్విభజించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లు ఉండగా.. కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. సైబరాబాద్, రాచకొండలోని పలు శాంతి భధ్రతలు, ట్రాఫిక్ జోన్లను వేరు చేసి.. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు బదలాయించారు. దీంతో ప్రస్తుతం ఈ కొత్త కమిషనరేట్ పరిధిలో శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం లా అండ్ ఆర్డర్ జోన్ల పరిధిలోని 22 ఠాణాలు, మాదాపూర్, ఎల్బీనగర్ ట్రాఫిక్ జోన్ల పరిధిలోని నాలుగు పీఎస్లతో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ స్వరూపం ఉంటుంది. ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టరేట్లో ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలిక కాలం పాటు ఇక్కడి నుంచే కమిషనరేట్ కార్యకలాపాలు సాగించనుంది. త్వరలోనే ప్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) పరిధిలో కమిషనరేట్కు స్థలం కేటాయించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే 30– 40 ఎకరాల స్థలం కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. కొత్త కమిషనరేట్ ఎందుకంటే? ఔటర్ రింగ్ రోడ్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత గ్రేటర్ పరిధి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి మధ్యలో ముచ్చర్ల ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు పలు బహుళ జాతి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దీంతో అంతర్జాతీయ పెట్టుబడులు, కంపెనీలకు శాంతిభద్రతలు, పెట్టుబడులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో కొత్తగా ఫ్యూచర్ సిటీ పరిధి వరకు పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సైబరాబాద్, రాచకొండలోని పలు ప్రాంతాలను వేరు చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. ఠాణాలివీ జోన్లు (3): శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం డివిజన్లు (6): శంషాబాద్, షాద్నగర్, చేవెళ్ల, నార్సింగి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఠాణాలు (22): కొత్తూరు, నందిగామ, ఆమన్గల్, తలకొండపల్లి, కడ్తాల్, శంషాబాద్/పెద్దషాపూర్, షాద్నగర్ టౌన్, కేశంపేట, కొందుర్గ్, చౌదరిగూడెం, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, మోకిల, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, కందుకూరు, మహేశ్వరం, మాడ్గుల. ఠాణాలివీ జోన్లు (3): శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం డివిజన్లు (6): శంషాబాద్, షాద్నగర్, చేవెళ్ల, నార్సింగి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఠాణాలు (22): కొత్తూరు, నందిగామ, ఆమన్గల్, తలకొండపల్లి, కడ్తాల్, శంషాబాద్/పెద్దషాపూర్, షాద్నగర్ టౌన్, కేశంపేట, కొందుర్గ్, చౌదరిగూడెం, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, మోకిల, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, కందుకూరు, మహేశ్వరం, మాడ్గుల -
న్యూ జోష్
● 2025కు వీడ్కోలు.. 2026కు స్వాగతం ● నగరంలో వెల్లువెత్తిన నూతనోత్సాహం కాల గమనంలో మరో ఏడాది కనుమరుగైపోయింది. నూతన వత్సరానికి నగరం స్వాగతం పలికింది. బుధవారం అర్ధరాత్రి నుంచి న్యూ ఇయర్ వేడుకల సంబరాలు అంబరాన్నంటేలా సాగాయి. యూత్ ఫుల్ జోష్తో ఆనంద సాగరంలో మునిగితేలింది. నగర వ్యాప్తంగా పలు రిసార్టులు, క్లబ్బులు, కేఫ్లు, ఆడిటోరియంలు కిటకిటలాడాయి. సినీ సెలబ్రిటీలు సిటిజనులతో కలిసి ఆటాపాటలతో సందడి చేశారు. తరలివచ్చిన టాప్ డీజేలు, బ్యాండ్స్, స్టాండప్ కమెడియన్స్.. వినోదాన్ని పంచారు. సాగర్ రోడ్లోని జీఎస్ఆర్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని సునీత, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్లు సంగీతం హోరులో ఓలలాడించారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ యూత్ని ఉర్రూతలూగించారు. తాజా సంగీత సంచలనం, గాయకుడు రామ్ మిరియాల కూడా ఇదే ఈవెంట్లో తన గానంతో అలరించారు. మాదాపూర్లోని క్వేక్ ఎరీనాలో నిర్వహిస్తున్న న్యూఇయర్ పార్టీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ హోస్ట్గా ఫీస్ట్ని రక్తికట్టించారు. గచ్చిబౌలిలోని ప్రిజ్మ్ క్లబ్ అండ్ కిచెన్ కార్యక్రమంలో సిటీకి చెందిన టాప్ బ్యాండ్ క్యాప్రిసియో సంగీత ప్రియులకు వీనుల విందు పంచింది. దీనికి ముంబై నుంచి వచ్చిన టాప్ లేడీ డీజే పరోమా జోరు తోడైంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని కిండ్డమ్ క్లబ్లో జరిగిన ఈవెంట్లో ముంబై డీజే అలీ మర్చంట్కు తోడుగా కయీలు సంగీతం ఆకట్టుకుంది. ఈ ఒరవడి నగరవ్యాప్తంగా కొనసాగింది. – సాక్షి, సిటీబ్యూరోహైటెక్స్లో సన్నీ లియోన్ కంట్రీ క్లబ్లో సినీ నటి ప్రజ్ఞానయన్ -
టచ్ అండ్ గో.. ఈజీ జర్నీ!
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ప్రయాణ సౌకర్యాలను విస్తృతపర్చడం, నాణ్యంగా, సత్వరంగా అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(హుమ్టా) కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడంతోపాటు లాస్ట్మైల్ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ దిశగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉన్న ఎంఎంటీఎస్, సిటీబస్, మెట్రో సేవలను సమన్వయం చేస్తూ సమగ్ర రవాణా సదుపాయాలను కల్పించేందుకు హెచ్ఎండీఏ అనుబంధ హుమ్టా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే, మెట్రో అధికారులతో ఇటీవల బస్భవన్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ మూడు సంస్థల అధికారులు పాల్గొని పలు సూచనలు అందజేశారు. ఈ మేరకు హుమ్టా ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. మలక్పేట్ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి మలక్పేట్ మెట్రోస్టేషన్ వరకు ప్రయాణికులు తేలిగ్గా రాకపోకలు సాగించేందుకు దక్షిణ మధ్య రైల్వే స్కైవాక్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇదే తరహాలో మరిన్ని చోట్ల ఎంఎంటీఎస్, మెట్రోస్టేషన్ల మధ్య స్కైవాక్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రయాణికులకు సీమ్లెస్ జర్నీ సదుపాయం అందుబాటులోకి రావడమే కాకుండా మెట్రో నుంచి ఎంఎంటీఎస్కు తేలిగ్గా మారేందుకు అవకాశం లభిస్తుంది. అధికారులు అవసరమైన చోట సిటీ బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నారు. టచ్ అండ్ గో ఇలా... ● నగరంలో 51 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతిరోజు 88 సర్వీసులు నడుస్తున్నాయి. కానీ, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు అవి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారు. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిచేవి. సుమారు 1.4 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు బాగా తగ్గారు. రోజుకు 60 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులతోపాటు ప్రయాణికుల సంఖ్యను కూడా పెంచేందుకు హుమ్టా ప్రణాళికలు సిద్ధం చేసింది. ● 51 ఎంఎంటీఎస్ స్టేషన్లలో 29 స్టేషన్లకు మాత్రమే సిటీ బస్సుల సదుపాయం ఉంది. అయితే ఈ స్టేషన్లు బస్టాపు నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. ● మరో 13 స్టేషన్లు మాత్రం బస్టాపు నుంచి కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ● రెండు కిలోమీటర్ల దూరానికి ఆటోవాలాలు కనీసం రూ.50 పైనే వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్ నుంచి సిటీబస్సుకు మారేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ● ఈ రూట్లలో సిటీ బస్సులను ఎంఎంటీఎస్ స్టేషన్ మీదుగా నడిపితే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు రకాల రవాణా సదుపాయాలను సద్వినియోగం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ● హైటెక్సిటీ, చందానగర్, నేచర్ క్యూర్ హాస్పిటల్, లింగంపల్లి, ఉందానగర్, నెక్లెస్రోడ్డు, సంజీవయ్య పార్కు, ఫలక్నుమా, యాకుత్పురా, గౌడవెల్లి, మేడ్చల్, మనోహరాబాద్, కూచవరం స్టేషన్లకు సిటీబస్సులతో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలి. ● ఇప్పటికే సిటీ బస్సులకు అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్ స్టేషన్లకు ట్రిప్పులను పెంచాలి. స్కైవాక్తో అనుసంధానం... ● మిగతా ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీపంలోని మెట్రోస్టేషన్లకు రాకపోకలు సాగించేందుకు వీలుగా స్కైవాక్లను ఏర్పాటు చేయాలి. మలక్పేట్ స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా రైల్వే అధికారులు స్కైవాక్ నిర్మాణం చేపట్టారు. ● నాంపల్లి స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మెట్రో వరకు స్కైవాక్ అందుబాటులోకి రానుంది. ● సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈస్ట్, వెస్ట్ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లు, రేతిఫైల్, గురుద్వారా బస్టాపులను కలుపుతూ స్కైవాక్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ● కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి నారాయణగూడ మెట్రోకు స్కైవాక్తో అనుసంధానం చేయాలి. ● లక్డీకాపూల్, బేగంపేట్, భరత్నగర్ ఎంఎంటీఎస్ స్టేషన్లకు కూడా మెట్రో స్టేషన్లను అనుసంధానం చేయాలని అధికారులు సూచించారు. ఎంఎంటీఎస్– సిటీబస్, మెట్రోల మధ్య కనెక్టివిటీకి చర్యలు మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్నచోట స్కైవాక్లు సమగ్ర రవాణా అభివృద్ధికి హుమ్టా ప్రత్యేక కార్యాచరణ -
ఓ బాట‘సారీ’!
నగర రహదారులపై పాదచారికి నరకమేసాక్షి, సిటీబ్యూరో: ‘పెడస్ట్రియన్ ఈజ్ కింగ్ ఆఫ్ ది రోడ్’ (పాదచారే రహదారికి రారాజు)... ఈ అంతర్జాతీయ నానుడి రాజధాని నగరంలో మాత్రం అమలుకావట్లేదు. ఈ సిటీ పెడస్ట్రియన్కు ఏమాత్రం సేఫ్ కాదని ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, కనిపించని మౌలిక వసతులే స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. ఈ ఏడాది మృత్యువాతపడిన వారి సంఖ్య 294గా ఉండగా.. వీరిలో పాదచారులే 105 మంది. అంటే.. 35.71 శాతం అన్నమాట. ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రతి ఏడాదీ పదుల సంఖ్యలో... నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమ వుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరెవరు అనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. ఈ ఏడాది పోలీసు రికార్డుల ప్రకారం 2,679 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... వీటిలో పాదచారులకు సంబంధించినవి 837 ఉన్నాయి. మొత్తం యాక్సిడెంట్స్లో 294 మంది చనిపోగా.... వీరిలో పాదచారులు 105 మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారు తున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండోస్థానం పాదచారులదే. ఈ పెడస్ట్రియన్ యాక్సిడెంట్స్తో అత్యధికం ఇన్నర్ రింగ్ రోడ్లో జరిగినవే కావడం గమనార్హం. ఈ దుస్థితికి కారణాలు అనేకం... రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... ఇటీవలే రూపుదిద్దుకుని, నానాటికీ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనూ ఇవి మచ్చుకై నా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు సరైన ప్రాధ్యానం లభించట్లేదు. ప్రణాళిక లోపం కారణంగా నగర ఫుట్పాత్ల్లో సగం ఆక్రమణకు గురికాగా... మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. జంక్షన్స్ వద్ద పెడస్ట్రియన్స్ క్రాసింగ్ కోసం ప్రత్యేకమైన చర్యలు లేవు. కీలక ప్రాంతాల్లో కనీసం రెండడుగుల వెడల్పుతో ఫుట్పాత్ ఏర్పాటు చేయాలని, దీనికి బారికేడింగ్, అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ చేసేందుకు ఓపెనింగ్స్తో కూడిన ప్రతిపాదనలకు పూర్తిస్థాయిలో అమ లు కావట్లేదు. పెలికాన్ సిగ్నల్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఇప్పటికీ అవరమైన సంఖ్యలో కనిపించవు. ఇది పెడస్ట్రియన్ ఫ్రెండ్లీ సిటీ కాదు నగరంలో రోడ్డు భద్రత, పాదచారుల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు అనేకం ఉన్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 50 శాతం పైగా పాదచారులు ఉంటున్నారు. సిటీలో చూసుకున్నా పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. దీనికి ప్రధాన కారణం రోడ్డు వినియోగం విషయంలో పాదచారుడికి అతి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే. ఇక్కడ ఏ ప్రాంతంలోనూ సరైన ఫుట్పాత్స్, పెడస్ట్రియన్ క్రాసింగ్స్తో పాటు జంక్షన్స్లోనూ అవసరమైన వసతులు లేవు. సబ్–వేల ఏర్పాటుకూ అనేక ఇబ్బందులు, భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయి. పాదచారుల భద్రత కోసం అవసరమైన ప్రతి ప్రాంతంలోనూ పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి. ఉన్న మౌలిక వసతుల్ని సైతం వినియోగించకుండా అడ్డదిడ్డంగా రోడ్డు దాటే పాదచారులకు సైతం జరిమానా విధించాలి. సింగపూర్లో ఇలా ఎవరైనా దాటితే భారత కరెన్సీ ప్రకారం మొదటిసారి రూ.20 వేలు, రెండోసారైతే రూ. 25 వేలు జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. మౌలిక వసతులతో పాటు ఇలాంటి కఠినమైన చట్టాలు సైతం రావాలి. – రహదారి భద్రత నిపుణులు అబిడ్స్లో ఫుట్పాత్ ఇలా..ఇవీ గణాంకాలు: 2023 2024 2025 మొత్తం ప్రమాదాలు 2548 3,058 2679 పాదచారులవి 906 974 837 మొత్తం మృతులు 335 301 294 వీరిలో పాదచారులు 137 118 105 మొత్తం క్షతగాత్రులు 2596 3393 2950 వీరిలో పాదచారులు 813 919 788 (2025 డేటా ఈ నెల 20 వరకు) ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత ఈ ఏడాది చనిపోయిన వారి సంఖ్య 105 మొత్తం మృతుల్లో ఇది ఏకంగా 35 శాతం పట్టనట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగాలు -
ముసాయిదా బడ్జెట్కు ఓకే
రూ.11,460 కోట్ల ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదంసాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కోసం రూపొందించిన రూ.11,460 కోట్ల ముసాయిదా బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ సమావేశం పచ్చజెండా ఊపింది. సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం రాబోయే ఆర్థిక సంవత్సరానికి(2026–27) సంబంధించిన ఈ బడ్జెట్ను ఆమోదించింది. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే పాలకమండలి సర్వసభ్య సమావేశంలోనూ దీనికి ఆమోదముద్ర వేసి, ప్రభుత్వానికి సమాచార నిమిత్తం పంపనున్నారు. మొత్తం బడ్జెట్లో పాత జీహెచ్ఎంసీకి రూ.9,200 కోట్లు కేటాయించగా, విలీనమైన 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు మిగతా రూ.2,260 కోట్లను విడిగా కేటాయించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.8,880 కోట్లు కేటాయించగా, రివైజ్డ్ చేసి రూ.9వేల కోట్లకు అప్పట్లో పెంచారు. అయితే గత అక్టోబర్ వరకు కేవలం రూ.4,020 కోట్లు ఖర్చు కావడం గమనార్హం. కార్పొరేటర్లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల బడ్జెట్ కేటాయించినప్పటికీ, ప్రస్తుత పాలకమండలి గడువు నెలన్నరలోపునే ముగిసిపోనుండటంతో ఎన్ని నిధులు ఖర్చు అవుతాయో వేచి చూడాల్సిందే. ఇతర ముఖ్యాంశాలు.. ● జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఏఐ ఆధారిత సొల్యూషన్ల అమలు, నిర్వహణ కోసం మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ ఎంపికకుగాను ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలిచేందుకు ఆమోదం. ఇందులో ఏఐ చాట్బాట్, ఆటోమేటెడ్ ఫారమ్ ఫిల్లింగ్ సొల్యూషన్లు ఉన్నాయి. ● చందానగర్ సర్కిల్లోని ఇజ్జత్నగర్ బీసీ వైకుంఠధామంలో దహన యూనిట్ ఏర్పాటు, పూజా మండపం, దింపుడు కల్లం, గ్యాలరీలు, మరుగుదొడ్లు, కలప నిల్వ గది, ఇంకుడుగుంత, ఇతర పనులకు ఆమోదం ● జాంబాగ్ వార్డు పరిధిలో 94 నెంబర్ బస్స్టాప్ దగ్గర విజయ డెయిరీ నుంచి యూనివర్సల్ బుక్స్టోర్ వరకు, ఈఎన్టీ ఆసుపత్రి క్యాంపస్ వెలుపల బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ● వాహనదారులు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించేందుకు తార్నాక జంక్షన్లో సర్వజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్సార్ కింద హెల్మెట్ శిల్పం ఏర్పాటుకు అనుమతి. వివిధ సంస్థల సీఎస్సార్ పనులకు గ్రీన్సిగ్నల్. ఇప్పటికే చేస్తున్నవాటి పొడిగింపునకు ఓకే ● దోమల్గూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్ లీజు గడువు పొడిగింపునకు అనుమతి ● మాసబ్ ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్క్ స్పోర్ట్స్’ ప్లే గ్రౌండ్ను అనధికారికంగా ఆక్రమించి, 33 ఏళ్లుగా లీజు చెల్లించని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్పై చర్యలు తీసుకునేందుకు సుముఖత ● ఎన్బీటీ నగర్ మల్టీపర్పస్ భవనం పేరును ఎన్బీటీ నగర్ కన్వెన్షన్ హాల్గా మార్చేందుకు అనుమతి ● డాక్టర్ ఏఎస్ రావు నగర్లోని జై జవాన్ కాలనీ(ఎక్స్–సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్) వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్(10) దుకాణాలు/యూనిట్ల టెండర్ కమ్ ఓపెన్ పబ్లిక్ వేలం నిర్వహణకు ఆమోదం లాస్ట్ టూర్.. బడ్జెట్పై ప్రత్యేక సమావేశం ముగిశాక, 22 అంశాలపై స్టాండింగ్ కమిటీ చర్చించింది. పదవీకాలం గడచిపోతుండటంతో స్టడీ టూర్ పేరిట కార్పొరేటర్లు అహ్మదాబాద్, చంఢీగఢ్ నగరాలను చుట్టివచ్చే అంశంతోపాటు ఇతర అంశాలకు ఓకే చెప్పింది. కార్పొరేటర్ల స్టడీ టూర్ కోసం జీహెచ్ఎంసీ దాదాపు రూ.1.50 కోట్లు ఖర్చు చేయనుంది. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్వరలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ముందుకు.. ఎవరేమనుకున్నా స్టడీ టూర్లకూ రెడీ! -
బుక్ ఫేర్ వెల్..
చివరి రోజు పోటెత్తిన సందర్శకులు ఈ సారి భారీగా తరలివచ్చిన పుస్తక ప్రియులు కిక్కిరిసిన స్టాళ్లు సాక్షి, సిటీబ్యూరో: పుస్తకప్రియులను, సందర్శకులను కట్టిపడేసిన హైదరాబాద్ 38వ పుస్తక ప్రదర్శన సోమవారం ముగిసింది. చివరి రోజు కూడా సందర్శకులు భారీగా తరలివచ్చారు. పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు ఉత్సాహంగా పుస్తక మహోత్సవంలో భాగస్వాములయ్యారు. నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. గతేడాది కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చినట్లు బుక్ఫెయిర్ కమిటీ నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. 11 రోజుల్లో కనీసం 15 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు అంచనా. వరుస సెలవులు కూడా పుస్తక ప్రదర్శనకు బాగా కలిసి వచ్చాయి. దీంతో బుక్ఫెయిర్ సందర్శకులతో కళకళలాడింది. స్టాళ్లు కిక్కిరిసిపోయాయి. నవలలు, కథల పుస్తకాలకు ఆదరణ చరిత్ర, సంస్కృతి గ్రంథాలతో పాటు నవలలు, కథల పుస్తకాలకు పాఠకులు బ్రహ్మరథం పట్టారు. ఆధ్యాత్మిక రంగానికి చెందిన పుస్తకాలు కూడా బాగానే అమ్ముడైనట్లు పలు ప్రచురణ సంస్థలు తెలిపాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో ఈ సంవత్సరం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రచయితలకు ప్రోత్సాహకంగా ప్రత్యేకంగా కొన్ని స్టాళ్లను కేటాయించారు. అన్ని రకాల పుస్తకాలతో పాటు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు, పోటీ పరీక్షలకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్కు కూడా ఆదరణ కనిపించింది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్ధులు, యువత పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈసారి వందకు పైగా కొత్త పుస్తకాలను ఆవిష్కరించారు. నవతరం రచయితలు తమ రచనలను పాఠకులకు పరిచయం చేశారు. హైదరాబాద్ సాంస్కృతిక జీవితంలో భాగంగా ప్రతి ఏడాది వందలాది పుస్తక ప్రచురణ సంస్థలు, లక్షలకొద్దీ పుస్తకాలతో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన మరోసారి అదరహో అనిపించింది. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకుల ను అలరించాయి. నచ్చిన పుస్తకాలపైన నిర్వహించిన ప్రసంగాలు సాహిత్య పరిమళాలను గుబాళించాయి. ఈ ఏడాది పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రముఖ కవి అందెశ్రీ పేరు పెట్టారు. అనిశెట్టి రజిత, కొంపెల్లి వెంకట్గౌడ్ల స్మారకార్థం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి సాహిత్య రంగానికి వారు అందజేసిన సేవలను గుర్తుచేశారు. -
సెల్ఫోన్ల కంటే పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
కవాడిగూడ: నేటితరం యువత సెల్ఫోన్ల కంటే పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం బుక్ఫెయిర్ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్ఫోన్లు, సినిమాలకు దూరంగా ఉంటూ యువత పెద్ద ఎత్తున పుస్తక ప్రదర్శనకు రావడం సమాజంలోని మేథో అంతర్మధనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికి అందుబాటులో ఉండాలని, వేదికలపై మహిళా ప్రాతినిధ్యం పెరగాలన్నారు. పుస్తకాలు కేవలం సమాచారం కోసం కాకుండా, మనిషిలో స్వతంత్ర ఆలోచనలు రేకిత్తించే సాధనాలుగా ఉండాలని ఆయన సూచించారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విశ్వ విద్యాలయాల పరిశోధన పత్రాలను ప్రజలకు చేరువ చేయాలని అన్నారు. విద్య, సాంఘిక సంక్షేమ శాఖలను పుస్తక ప్రదర్శనలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ వీసీ సూర్య ధనుంజయ్, సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి తదితరులు మాట్లాడారు. బుక్ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రమా మెల్కొటే, ప్రధాన కార్యదర్శి ఆర్.వాసు, ఉపాధ్యక్షులు బాల్రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువతకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి సూచన -
పారిశుధ్యంపై ఫోకస్ పెంచాలి
జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కర్ణన్ ఆదేశం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో పారిశుధ్యాన్ని మరింతగా మెరుగుపరచడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. సోమవారం ప్రారంభమైన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా తొలిరోజు నగరవ్యాప్తంగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిల క్లీనింగ్పై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించారు. కిస్మత్పూర్, నార్సింగి, సన్సిటీలలో కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. రానున్న రోజుల్లో ఫ్లై ఓవర్లు, రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ మీడియన్లు, చెరువులు, నాలాలు, ఫుట్పాత్లు, పార్కులు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం పక్కాగా చేపట్టాలన్నారు. -
చైనా మాంజా విక్రేతల అరెస్ట్
చాంద్రాయణగుట్ట: నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ కె.నాగేంద్ర ప్రసాద్ వర్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఉప్పుగూడ అశోక్నగర్కు చెందిన కందాడి ఉదయ్ కిరణ్, శివగంగానగర్కు చెందిన పిట్టల సుమిత్, అక్రమంగా చైనా సింథటిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ మంజా (చైనా మాంజా)లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 24 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చైనా మంజాను నిషేధించారని, దీని కారణంగా ప్రజలు, చిన్న పిల్లలు, పక్షులు, జంతువుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందని, పర్యావరణానికి హాని కలిగిస్తుందని పోలీసులు తెలిపారు. ఎవరూ చైనా మాంజాను కొనడం విక్రయించడం చేయరాదన్నారు. -
నవ వధువు మృతి
రాజేంద్రనగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన లక్ష్మయ్య కుమార్తె ఐశ్వర్య (22) రాజేంద్రనగర్ జన చైతన్య వెంచర్–2లో నివాసముండే రాజు నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజు ఓ నిర్మాణ భవనంలో పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఐశ్వర్య జూబ్లీహిల్స్లోని అమ్మగారింటికి వెళ్లింది. ఆదివారం జూబ్లీహిల్స్కు వెళ్లిన రాజు రాత్రి అక్కడే ఉండి సోమవారం ఉదయం భార్యను తీసుకుని రాజేంద్రనగర్లోని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లో వంట చేస్తూ ఫిట్స్ రావడంతో కిందపడింది. రాజు అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. భర్తే హత్య చేశాడు... తన కుమార్తె ఐశ్వర్యను భర్త రాజు హత్య చేశాడని ఆరోపిస్తూ తండ్రి లక్ష్మయ్య, అన్న వెంకటేశ్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లైన రెండు రోజుల నుంచే అదనపు కట్నం కోసం తిట్టి కొట్టేవాడని ఐశ్వర్య తనతో చెప్పిందని లక్ష్మయ్య బోరున విలపించాడు. తాను అంధుడనినని కట్నం ఇచ్చుకోలేనని బిడ్డను సముదాయించి పంపించానన్నారు. బిడ్డను చంపుతాడని అనుకోలేదని నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరాడు. ఐశ్వర్య మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో ఎలాంటి గాయాలు లేవని.. సహజ మరణంగా వెల్లడించారన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రహదారుల్నీ వదలట్లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ఖాళీ జాగాలే కాదు... రోడ్డును కూడా వదలకుండా ఎక్కడికక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇక ఆ రోడ్డుకు డెడ్ ఎండ్ ఉంటే పరిస్థితి మరింత దారుణం. ఎదుటి వారికీ దాన్ని వినియోగించుకునే హక్కు ఉందని మర్చిపోతున్నారు. ఇలాంటి అనేక సమస్యలపై నగర వాసులు హైడ్రాను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా మొత్తం 44 ఫిర్యాదులు అందాయి. వనస్థలిపురం సాహెబ్నగర్లోని శ్రీ వీరాంజనేయ కాలనీలో 18 అడుగుల రహదారిని అక్కడ ప్లాట్లు ఉన్న వారు కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. స్పష్టంగా రోడ్డు వేసి, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసినా... కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారని, స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. శేరిలింగంపల్లి మండలం, కొండాపూర్ విలేజ్లోని శ్రీ రాంనగర్ కాలనీలో సర్వే నం.202లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 1.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేయడమే కాకుండా.. తమ ఇళ్లకు దారి లేకుండా మూసేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. మచ్చబొల్లారంలోని సూర్యనగర్ బస్టాప్ వద్ద 30 అడుగుల రోడ్డును ఏడు అడుగుల మేర కబ్జా చేసేశారని, దీంతో అక్కడ బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని బాలాజీ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మహేశ్వరం మండలం, శ్రీనగర్ విలేజ్లోని సర్వే నం. 249, 248ల్లో కచ్చా రోడ్డు ఉంటే దానిని బ్లాక్ చేసి ఆ మార్గాన్ని మూసేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ మండలం ఇన్నర్ రింగురోడ్డులోని ఉప్పరపల్లిలో ఉన్న పీఎంఆర్ అపార్టుమెంట్కు చేరువలో రహదారులను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపడుతున్నారని, దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని పీఎంఆర్ అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మహేశ్వరం మండలం సర్దార్ నగర్లో హెచ్ఎండీఏ అనుమతి పొందిన లే–ఔట్లోని ప్లాట్లు రావిర్యాల చెరువులో మునిగిపోతున్నాయని, వెంటనే ఆ చెరువు ఎఫ్టీఎల్ను నిర్థారించి తమ ప్లాట్లను కాపాడాలని స్థానికులు కోరారు. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ అవసరమైన చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిటీలో ఎక్కడికక్కడ ఆక్రమణలు ప్రజావాణి ద్వారా హైడ్రాకు 44 ఫిర్యాదులు -
పల్లెలు సాహితీ మల్లెలు
– ఎమ్మెల్సీ డాక్టర్ గోరటి వెంకన్న ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణలోని ప్రతీపల్లె పద సాహిత్యాలు, భజన కీర్తనలతో విరాజిల్లుతోందని శాసనమండలి సభ్యుడు, ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ గోరటి వెంకన్న అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా తెలుగు శాఖ ‘తెలంగాణ పద సాహిత్యం – సమాలోచన‘ అనే అంశంపై సోమవారం నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల సాంస్కృతిక విశేషాలు, తాత్విక విషయాలపై, పద కవుల సాహిత్యంపై లోతైన విశ్లేషణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ పి.భాస్కరయోగి కీలకోపన్యాసం చేస్తూ విస్మరణకు గురైన ఎందరో పదకవులపై విస్తృత పరిశోధనలు జరగడం, ఆ దిశలో జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయని పేర్కొన్నారు. తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకర శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథమ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.కాశీం, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఆచార్య సైయద తలత్ సుల్తానా ప్రసంగించారు. తెలంగాణ పద సాహిత్యంపై పలువురు ప్రామాణికమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. సదస్సులో తెలుగు పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏలే విజయలక్ష్మి, తెలుగుశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు, ఆచార్య విస్తాలి శంకర్రావు, డాక్టర్ పి.సి.వెంకటేశ్వర్లు, డాక్టర్ బాణాల భుజంగరెడ్డి, డాక్టర్ యువ శ్రీ,, డా. ఇమ్మిడి మహేందర్, అవుసుల భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రావెల్ బ్యాగులో కుక్కి..గోదావరిలో పారవేసి..
మల్లాపూర్: ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి నగదు, బంగారం, కోసం ఒంటరిగా ఉంటున్న ఇంటి యజమానురాలిని దారుణంగా హత్య చేశాడు. ఆపై ఇద్దరు స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని గోదావరి నదిలో పారవేసిన సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..మల్లాపూర్ బాబానగర్కు చెందిన సూరెడ్డి సుజాత (65) కనిపించడం లేదని బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పెరవెల్లి మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన మద్దు అంజిబాబు డ్రైవర్గా పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం అతను మల్లాపూర్ బాబానగర్లో సూరెడ్డి సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. ఒంటరిగా ఉంటున్న యజమానురాలి వద్ద పెద్ద మొత్తంలో బంగారం, నగదు ఉన్నట్లు గుర్తించిన అతను వాటిని కాజేసేందుకు కుట్ర పన్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న ఆమె గొంతు నులిమి హత్య చేసి నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ట్రావెల్ బ్యాగ్లో మృతదేహాన్ని భద్రపరిచాడు. స్నేహితుల సహాయంతో గోదావరి నదిలో పారవేత.. తన స్నేహితులైన కోనసీమ జిల్లాకు చెందిన నక్కటి యువరాజు, నూకల దుర్గా రావు సహాయంతో సుజాత మృతదేహాన్ని కారులో కోనసీమ జిల్లా పరిధిలోని గోదావరి నదికి తీసుకెళ్లి కృష్ణలంక వద్ద నదిలో మృతదేహాన్ని పారవేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు.. సూరెడ్డి సుజాత మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన నాచారం పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఇంట్లో అద్దెకు ఉంటున్న మడ్డు అంజి బాబు హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా రాజోలు మండలం, పొదులాడ జంక్షన్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని, 4 బంగారు గాజులు, బంగారు గొలుసు, రెండు చెవి దిద్దులను స్వాఽధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో నక్కటి యువరాజు, నూకల దుర్గారావులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో డీసీపీ శ్రీధర్ ఏసీపీ చక్రపాణి సూచనలతో నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ హత్య కేసును చేధించారు. సీసీ కెమెరాలు, సెల్ఫోన్ టవర్ సిగ్నల్ ఆధారంగానిందితుల గుర్తింపు -
అర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చే విధంగా జీఓలో సవరింపులు చేపట్టాలని కోరుతూ టీయూ డబ్ల్యూ జే (ఐజేయూ) బృందం సమాచార శాఖ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయం లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేష్, హెచ్ యూజే అధ్యక్షుడు శిగా శంకర్, మేడ్చల్ అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా, మేడ్చల్ కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణ సమస్యను ఆమెకు వివరించారు. గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాల్లో ప్రధాన పత్రికల్లో నలుగురు నుంచి ఐదుగురు జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. నూతన జీవో 252 ద్వారా ఒక పత్రికకు మండలానికి ఒకే అక్రిడిటేషన్ పొందే అవకాశం ఉందని తెలిపారు. జర్నలిస్టుల పరిస్థితిని గుర్తించి జీవోలో సవరణలు చేసి న్యాయం చేయాలని కోరారు. దీనిపై కమిషన్ ప్రియాంక సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే మంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ప్రత్యేక రైలు
నాంపల్లి: నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అజ్మీర్లోని హజరత్ ఖాజా మొహినుద్దీన్ చిస్తీ షరీఫ్ దర్గాకు బయలుదేరిన స్పెషల్ రైలును నాంపల్లి ఎమ్మెల్యే మహ్మద్ మాజీద్ హుస్సేన్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆయన భక్తులకు వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని భక్తులను కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నాంపల్లి నుంచి నడుపుతోందని తెలిపారు. అజ్మీర్లోని దర్గాకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వేకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. -
రన్వేపై మొరాయించిన విమానం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ విమానం మొరాయించింది. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఇండిగో 6ఈ–1465 విమానంలో మొత్తం 175 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ సిద్ధమైన విమానం రన్వై పైకి వెళ్లగానే మొరాయించింది. దీంతో తిరిగి దానిని ట్యాక్సివే వద్దకు తీసుకొచ్చారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత మూడు గంటలు ఆలస్యంగా విమానం ఇక్కడి ఉంచి దుబాయ్కి బయలుదేరింది. ప్రతికూల వాతావరణంతో.. హైదరాబాద్ నుంచి మంగళవారం వారణాసి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్ –2746 విమానం రద్దు అయింది. అప్పటికే విమానంలోకి 148 మంది ప్రయాణికులు ఎక్కి కూర్చున్నారు. అయితే వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉందని, అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేదని సమాచారం అందడంతో విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. కాగా, హైదరాబాద్–పాట్నా, హైదరాబాద్–వారణాసి మధ్యన నడిచే రెండు అరైవల్, రెండు డిపార్చర్ విమానాలను ఇండిగో ఎయిర్లైన్స్ రద్దు చేసింది. ఇందుకు నిర్వహణపరమైన సమస్యలతోపాటు ప్రతికూల వాతావరణం కూడా కారణమని ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. -
ఎగ్జిబిషన్కు ఏర్పాట్లు చకచకా
జనవరి 1న ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి అబిడ్స్: ఎగ్జిబిషన్(నుమాయిష్)కు వేళ అయింది. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భద్రతా చర్యలకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్.సుఖేష్రెడ్డి మంగళవారం ఇక్కడ వివరాలు వెల్లడించారు. 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన శాల(నుమాయిష్) జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 15న ముగుస్తుందని తెలిపారు. ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు సమక్షంలో ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందన్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అనేకమంది దరఖాస్తు చేసుకోగా, అందులో నుంచి స్టాళ్ల కేటాయింపు దాదాపు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ను దాదాపు 25 లక్షల మందికిపైగా సందర్శకులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకులకు మూడంచెల రక్షణ ఏర్పాటు చేస్తున్నామని, ప్రధాన ద్వారాలైన గాంధీ భవన్, అజంతా గేట్, మాలకుంట గేట్ల ద్వారా ఎగ్జిబిషన్లోకి ప్రవేశించేవారిని మెటల్ డిటెక్టర్ల సహాయంతో తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. అంతర్గత భద్రత కోసం సబ్ కమిటీ, సీసీ కెమెరాలు, వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమ్యూజ్మెంట్ పార్క్లో సందర్శకులను కనువిందు చేసేందుకు ఈసారి ప్రత్యేకంగా రైడ్లు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. ఎగ్జిబిషన్ మైదానంలో 1.50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు వాటర్ ట్యాంక్లు, ఫైర్కు సంబంధించిన 76 హైడ్రెంట్ వాల్స్ను సిద్ధంగా ఉంచామన్నారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇదే‘నయా’ జీహెచ్ఎంసీ..!
నయా జీహెచ్ఎంసీలో ● ఒక్కో సెగ్మెంట్లో 2, 3 సర్కిళ్లు ● ఒక్కో సర్కిల్లో 4–6 వార్డులు ● మొత్తం 60 సర్కిళ్లు.. 12 జోన్లు అసెంబ్లీ నియోజకవర్గ పరిధే వార్డు హద్దు సాక్షి, సిటీబ్యూరో జీహెచ్ఎంసీలో వార్డుల (కార్పొరేటర్ డివిజన్ల) డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. రాజకీయంగా, పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవకుండా ఒక వార్డును పూర్తిగా ఒకే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ వార్డులు 150 నుంచి 300 వరకు పెరగడంతో ప్రస్తుతమున్న 30 సర్కిళ్ల సంఖ్య 60కి చేరింది. 6 జోన్లను 12 జోన్లకు పెంచారు. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు సర్కిళ్లు, మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు సర్కిళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక వార్డులు ఒక్కో సర్కిల్లో 4 నుంచి 6 వరకు ఉన్నట్లు తెలిపారు. నాలాలు, రైల్వేట్రాక్, రహదారులు వంటి వాటిని సైతం ఒకే వార్డు పరిధిలో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిపైనా పలు ఫిర్యాదులు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొన్ని వార్డుల్లో జనాభా ఎక్కువగా, కొన్నింట తక్కువగా ఉన్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధితో పెరిగిన ఇళ్ల నిర్మాణాలు, పెరగబోయే జనాభాను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదీ స్థూలంగా.. మారిన జీహెచ్ఎంసీ ముఖచిత్రం. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, తాజాగా అవి 26కు పెరగనున్నాయి. ఇవి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. -
న్యూ ఇయర్.. ప్లీజ్ హియర్!
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు ● నేటి నుంచే నగరంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ● క్షేత్రస్థాయి అధికారులతో సీపీ సజ్జనర్ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వచ్చెనని, సంబరాలు తెచ్చెనని రోడ్లపై హంగామా సృష్టించారో.. హద్దు మీరి ప్రవర్తించారో.. జర జాగ్రత్త! పోలీసులు చూస్తున్నారు.. నిఘా నేత్రం కనిపెడుతోంది! నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. నేటి నుంచి న్యూ ఇయర్ రోజు వరకు తాగి వాహనాలు నడిపే వారిపై నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ)లో మంగళవారం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై సీపీ సజ్జనర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. హాట్ స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31న రాత్రి నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఇందుకోసం 7 ప్లటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నామని చెప్పారు. పట్టుబడితే రూ.పదివేల జరిమానా.. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతోపాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష తప్పదని సీపీ హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే ’డెసిగ్నేటెడ్ డ్రైవర్’ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్లను ఆశ్రయించాలని సూచించారు. యువత రోడ్లపై రేసింగ్లు, వీలింగ్లు, ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా... డిసెంబర్ 31 రాత్రి పబ్లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ను ఉంచుతామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు సీపీ(క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు, వివిధ విభాగాల డీసీపీలు ఎన్.శ్వేత, రక్షితాకృష్ణమూర్తి, శ్రీ రూపేష్, ఆర్. వెంకటేశ్వర్లు, వి.అరవింద్బాబు, లావణ్య నాయక్ జాదవ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఔటర్ టు ట్రిపుల్..16 గ్రీన్ఫీల్డ్ రోడ్లు
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళిక(కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా ఔటర్ రింగ్రోడ్డు(ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగ్రోడ్డు(ఆర్ఆర్ఆర్) వరకు రహదారుల విస్తరణకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్యన వివిధ ప్రాంతాల్లో మొత్తం 16 గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు 41 కి.మీ. మేర నిర్మించనున్న మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ రోడ్డుతోపాటు బుద్వేల్ నుంచి కోస్గి వరకు సుమారు 81 కి.మీ. మేర నిర్మించనున్న రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డు డీపీఆర్ కోసం అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే ఈ మార్గాల్లో భూసేకరణకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండింటితోపాటు మరో 14 చోట్ల ఈ తరహా రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ మీదుగా నేరుగా ట్రిపుల్ ఆర్ వరకు చేరుకొనే విధంగా ఈ రహదారుల నిర్మాణం ఉంటుందని అధికారులు అంటున్నారు. మహానగరం అభివృద్ధి, విస్తరణకు అనుగుణంగా దశలవారీగా రోడ్ల నిర్మాణంపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. ఈ మేరకు తెలంగాణ రైజింగ్–47 నివేదికలోనూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు భారీ టౌన్షిప్ల ఏర్పాటుకు కూడా హెచ్ఎండీఏ యోచిస్తోంది. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా టౌన్షిప్లను నిర్మించనుంది. 2047 నాటికి రీజినల్ రింగ్రోడ్డు చుట్టూ సుమారు 3.5 లక్షల ఇళ్లను నిర్మించి ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే రహదారుల విస్తరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. రెండో రోడ్డుకు త్వరలో డీపీఆర్... ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుద్వేల్ నుంచి రీజినల్ రింగ్రోడ్డు వెలుపల ఉన్న కోస్గి వరకు నిర్మించనున్న రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు త్వరలోనే డీపీఆర్ తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ దీన్ని 167వ జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని 7,250 చ.కి.మీ. నుంచి సుమారు 10,050 చ.కి.మీ. వరకు ప్రభుత్వం ఇప్పటికే విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో 11 జిల్లాలకు హెచ్ఎండీఏ కార్యకలాపాలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగానే పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా హెచ్ఎండీఏ ముందుకు సాగుతోంది. సమగ్ర మాస్టర్ప్లాన్–2050లో భాంగా ఆర్థికాభివృద్ధి, సమగ్ర పట్టణ ప్రజారవాణా వ్యవస్థ, జలవనరులు, అడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మూడు ప్రణాళికలు తుదిదశకు చేరుకున్నాయి. పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్ హబ్స్ నెలకొల్పే ప్రాంతాలకు గ్రీన్ఫీల్డ్ రోడ్ల మీదుగా తేలిగ్గా రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. టీజీఐఐసీకి చెందిన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ మేరకు బుద్వేల్ నుంచి చందన్వెల్లి, పేరారం, గూడూరు, దోర్నాలపల్లి, దోమ తదితర ప్రాంతాల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం వరకు దీన్ని నిర్మించనున్నారు. సుమారు 81 కి.మీ. మేర ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డులో హెచ్ఎండీఏ పరిధి 52 కి.మీ.వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా మరికొందరు రైతులు పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని డీపీఆర్పై ముందుకు వెళ్లనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రణాళిక పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానం మౌలిక సదుపాయాలు, టౌన్షిప్ల అభివృద్ధి రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు త్వరలో డీపీఆర్ రూపకల్పన -
మహిళలకు అండగా తెలంగాణ మహిళా కమిషన్
సాక్షి, సిటీబ్యూరో: మహిళా కమిషన్ మహిళలకు అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘నారీ న్యాయ్: హియర్ హర్ ఔట్‘ అనే బహిరంగ విచారణ కార్యక్రమంలో ఉద్యోగ, గృహ హింస వేధింపులు, వివక్ష, ఆర్థిక, సైబర్ క్రై మ్ తదితర సమస్యలపై బాధిత మహిళలనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మహిళల ఆవేదనను విని వారికి న్యాయం చేకూరేలా, త్వరితగతిన అవసరమైన చర్యలు చేపట్టేందుకే ‘నారీ న్యాయ్: హెయిర్ హర్ ఔట్‘ పేరుతో బహిరంగ విచారణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గృహ హింసపై అత్యధిక ఫిర్యాదులు అందాయని, ఆయా ఫిర్యాదుల్లో నిందితులు ఎన్ఆర్ఐలు ఉన్నందున కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది పైగా మహిళల ఫిర్యాదులను అందజేశారు. బాధితుల సమస్యలు విని తగు పరిష్కారాలు సూచిస్తూ సంబంధిత శాఖల నుంచి చర్యలు, పెండింగ్ ఫిర్యాదులపై నివేదికలు కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పలని, ఉమెన్ సెఫ్టీ డీసీపీలు డా.లావణ్య, టి.ఉషా రాణి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజ, సభ్యులతో పాటు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భారతీయ భాషలు మేధో సంపదకు పునాదులు
హిమాయత్నగర్: భారతీయ భాషలు దేశ మేధో సంపదకు పునాదులని జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి అన్నారు. భారతీయ భాషలు, సాహిత్యం, బోధనా శాస్త్రం, అనువాద అధ్యయనాలు, భాషా సాంకేతికతలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆవరణలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, భారతీయ భాషా సమితి, విద్యా భారతి ఉన్నత శిక్షా సంస్థాన్ సహకారంతో మంగళవారం నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృభాషల ఆధారిత విద్య విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుందన్నారు. ఉన్నత విద్యలో భాషా సమానత్వం లేకపోతే సామాజిక అసమానతలు పెరుగుతాయని హెచ్చరించారు. భాషా సాంకేతికతలు, పరిశోధన, అనువాదం, బహుభాషావాదం పరస్పరం అనుసంధానమై ఉంటాయన్నారు. యువత తమ భాషా వారసత్వాన్ని గ్లోబల్ జ్ఞానంతో కలిపి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా పండితులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనగా, 100కు పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. అనంతరం పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ విశ్వవిద్యాలయం వీసీ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ వేదుల శాంతి తదితరులు పాల్గొన్నారు. -
సందడే.. సందడి
● హైదరాబాద్ బుక్ ఫెయిర్కు విశేష స్పందన ● ఒకవైపు పుస్తకావిష్కరణలు ● మరోవైపు పుస్తక సమీక్షలు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 38వ బుక్ ఫెయిర్ మంగళవారం ఐదో రోజు సందడిగా సాగింది. ఒక వైపు కొంపల్లి వెంకట్ గౌడ్ వేదికపై పుస్తకావిష్కరణలు మరోవైపు అనిశెట్టి రజిత వేదికపై చర్చ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకాల భవిష్యత్తు గ్రంథాలయాల పాత్ర అనే అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు, ఓయూ గ్రంథాలయ అధికారి డాక్టర్ ఎస్. యాదగిరి పాల్గొన్నారు. డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ... సమాజంలోని అజ్ఞానం అనే చీకట్లు తొలగించే జ్ఞాన దీపాలు గ్రంథాలయాలకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ... మానవ నాగరికత బుక్ కల్చర్ నుంచి రీల్స్ షాట్స్ వంటి లుక్ కల్చర్ వైపు మారుతుందని సోషల్ మీడియా ప్రభావంతో విదార్థుల్లో ఏకాగ్రత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. –కవాడిగూడ -
మాట మార్చి.. నిధులు ఏమార్చి!
● ఆరు స్వీపర్లని ఒకసారి.. రెండని మరోసారి ఆర్టీఐ కింద సమాధానం ● పీసీబీలో రూ.కోటి గోల్మాల్! మెకానికల్ రోడ్ స్వీపర్ వాహనాల కొనుగోళ్లలో అక్రమాలు సాక్షి, సిటీబ్యూరో: రోడ్లు శుభ్రం చేసే యంత్రాల పేరిట కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నిధులు ఊడ్చేసింది. స్వీపింగ్ వాహనాల కొనుగోళ్లపై బాధ్యతారాహిత్యంగా స్వీపింగ్ ఆన్సర్ ఇచ్చింది. జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం(ఎన్సీఏపీ) కింద హైదరాబాద్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. గాలి కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టింది. రాజధాని నగరంలో వాయునాణ్యతను పెంపొందించడానికి రూ.614 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలోనే రహదారులపై ఉన్న దుమ్ము, ధూళి, చెత్తను శుభ్రం చేయడానికి మెకానికల్ రోడ్ స్వీపర్(ఎంఆర్ఎస్) వాహనాలను కొనుగోలు చేయాలని పీసీబీ అధికారులు నిర్ణయించారు. అయితే వాయుకాలుష్య నియంత్రణ, గాలి నాణ్యత పెంపొందించడానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నారని ఆర్టీఐ కింద ఓ వ్యక్తి అడగ్గా రహదారులను శుభ్రం చేయడానికి 6 ఎంఆర్ఎస్ వాహనాలు కొనుగోలు చేశామని సమాధానం ఇచ్చారు. పదిరోజుల వ్యవధిలో మరోసారి సంబంధిత వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు, ఇతర వివరాలు కావాలని అడగ్గా ఆరు కాదు, రెండు వాహనాలే కొన్నామని మాట మార్చారు. ఒకదానిని పటాన్చెరు, మరోదానిని జీడిమెట్ల ఐలాకు అప్పగించామని చెప్పారు. కొల్లగొట్టింది రూ.కోటిపైనే..? పీసీబీ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం 11.9 టన్నుల సామర్థ్యం కలిగిన ఒక్కో వాహనం సుమారు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతుంది. ఆరు వాహనాలకు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లు వరకు వెచ్చించి ఉండొచ్చని సమాచారం. ఇప్పుడు ఉన్నపళంగా నాలుగు వాహనాలు లేవంటే, వాటికి వెచ్చించిన సుమారు రూ.కోటికిపైగా ఏమయ్యాయనే ప్రశ్న తలెత్తుతోంది. 2021 ఆగస్టులో రెండు వాహనాలను కొనుగోలు చేసినట్లు, వీటిని పటాన్చెరు, జీడిమెట్ల ఐలా కమిషనర్లకు అప్పగించినట్లు చూపిస్తున్నారే తప్ప, ఎన్ని నిధులు వెచ్చించారనే సమాచారం, వాహనాల రిజిస్ట్రేషన్ నెంబరు, ఇతర వివరాలేవీ పీసీబీ కార్యాలయంలో అందుబాటులో లేవు. రూ.50 లక్షలకు నో టెండర్? కాలుష్యనియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇటీవల తెలంగాణ పీసీబీ సుమారు రూ.50 లక్షలు కేటాయించింది. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రాక్టు ఇచ్చే సమయంలో ఓపెన్ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఎల్–1 (తక్కువ ధర) కోడ్ చేసిన వారికి పనులు అప్పగించాలి. అయితే నిబంధనలను పక్కన పెట్టి నిధులు కేటాయించడంపై ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయమై ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ పై నుంచి ఒత్తిడి ఉందని, అందుకే టెండర్ లేకుండా ఇవ్వాల్సి వచ్చిందని, ఇందులో తమకేం సంబంధం లేదని పేర్కొన్నారు. గతంలోనూ ఓ సంస్థకు ఇలాగే రూ.25 లక్షలు నామినేషన్ పద్ధతిలో కేటాయించడం విశేషం. అయితే దీని వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరనేది అంతుచిక్కడంలేదని సిబ్బంది అంటున్నారు. -
సింగరేణి సంస్థకు కార్మికులే బలం
నాంపల్లి: సింగరేణి సంస్థ బలం కేవలం ఉత్పత్తిలో కాదని, తరతరాల శ్రమ, క్రమశిక్షణ, పరస్పర నమ్మకంతో పనిచేస్తున్న కార్మికులేనని ఇన్ఛార్జి సీఎండీ డి.కృష్ణ భాస్కర్ అన్నారు. మంగళవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్హిల్స్లోని సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్మికుల భద్రత, సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి ప్రధాన ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను మరింత మెరుగుపరచడం, పని పరిస్థితులను మరింత సురక్షితంగా చేయడమే లక్ష్యమన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఎన్నో వాతావరణ ప్రతికూలతలు, సాంకేతిక సవాళ్లు, మార్కెట్ మార్పులు ఉన్నప్పటికీ భద్రత ప్రమాణాలను పాటిస్తూ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు సాగామన్నారు. ఈ ప్రయత్నంలో ప్రతి గని కార్మికుడు, సూపర్వైజర్, అధికారి చూపిన చొరవను ఆయన ప్రశంసించారు. రానున్న సింగరేణి భవిష్యత్పై అందరం ప్రశ్నించుకోవాలని, వాటికి సమాధానాలు వెతుక్కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ దిశలోనే ఉత్పత్తి సామర్థ్యం, సంస్థ స్థిరత్వం, భవిష్యత్తు అవకాశాల కోసం మన అనుభవం, సామర్థ్యంతో రాణించే ఇతర రంగాలపైనా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇవి ఇంకా ఆలోచన దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తును నిర్లక్ష్యం చేయకుండా ముందే సిద్ధమవ్వాలన్న భావనతోనే ప్రయత్నాలు సాగిస్తున్నామని వివరించారు. ఇంధన రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో సింగరేణి ఏ పాత్ర పోషించగలదో అన్న దానిపై కూడా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక బాధ్యతల్లో భాగంగా పరిసర ప్రాంతాల అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల విషయంలో సింగరేణి తనవంతు పాత్రను కొనసాగిస్తోందన్నారు. సింగరేణిలో మహిళా శక్తి పెరుగుతున్న తీరు, గనుల్లో, ఆపరేషన్లో, రక్షణ బృందాల్లో మహిళల భాగస్వామ్యం సింగరేణి పరిణితికి గొప్ప సూచికగా అభివర్ణించారు. రెస్క్యూ జట్టు, గనుల నిర్వహణకు జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపులతో స్ఫూర్తి పొందుతూ మన పనితీరును మరింతగా మెరుగు పరచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) బి.వెంకన్న, అడ్వైజర్ ఫారెస్ట్రీ మోహన్ పరిగెన్, జీఎం ( కో ఆర్డినేషన్ ) టి.శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
పంచవటి కాలనీలో హిట్ అండ్ రన్
మణికొండ: పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వచ్చేందుకు స్కూటీపై వెళుతున్న ఓ మహిళను ఇన్నోవా కారు ఢీ కొట్టి వెళ్లిపోయిన సంఘటన మణికొండ సర్కిల్ పరిధిలోని పంచవటి కాలనీలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కాలనీకి చెందిన భవానీ అనే మహిళ తమ పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వచ్చేందుకు స్కూటీపై కాలనీలోని 9బి వద్ద రోడ్డు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఆమెను ఢీ కొట్టింది. దాంతో ఆమె కింద పడి తీవ్ర గాయాలు కావడంతో కాలనీ వాసులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఇన్నోవా కారు ఆగకుండా వెళ్లి పోయిందని, ఇందుకు సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయినట్లు తెలిపారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్రిప్టో కరెన్సీ పేరుతో టోకరా – దృష్టి మరల్చి రూ.కోటితో పరారీ బంజారాహిల్స్: నగదుకు బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తానంటూ నమ్మించి దష్టి మరల్చి రూ.కోటి నగదుతో ఉడాయించిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. మెహెదీపట్నం ప్రాంతానికి చెందిన ఉమర్ అనే వ్యాపారవేత్తకు బంజారా శాలిబండ ప్రాంతానికి చెందిన ఎత్తెషామ్ ఆన్ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికాడు. దీంతో అతడి మాటలు నమ్మిన ఉమర్ సోమవారం సాయంత్రం రోడ్ నెంబర్ 1 లోని తాజ్ దక్కన్ హోటల్ కు వచ్చాడు.. రూ. కోటి కి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తామని చెప్పడంతో నగదు అప్పగించాడు. కొన్ని నిమిషాల్లోనే క్రిప్టో కరెన్సీ వస్తుందంటూ దృష్టి మరల్చిన నిందితుడు అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంతసేపు గడిచినా ఎతేశ్యామ్ వెనక్కి రాకపోవడం, అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు మణికొండ: లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షేక్పేట వినోదనగర్ కాలనీలో నివసించే కురుకుంట రవి (38) మేసీ్త్రగా పనిచేసేవాడు. 2018లో నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని అలకాపూర్ టౌన్ షిప్లో లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఎల్బీనగర్లోని జిల్లా 13వ అదనపు జడ్జి మంగళవారం దోషిగా నిర్దారించి 20 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధించింది. అప్పట్లో సీఐగా పనిచేస్తూ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జీవీ రమణ గౌడ్ ప్రస్తుతం నార్సింగి ఏసీపీగా పనిచేస్తున్నారు. సాక్ష్యాలు అందించడంలో కానిస్టేబుళ్లు అంజిలప్ప, జ్యోతి ఎంతో కృషి చేశారని సీఐ తెలిపారు. భార్య విడాకుల నోటీసు పంపిందని.. – మనస్తాపంతో భర్త ఆత్మహత్య ఘట్కేసర్: భార్య నుంచి విడాకుల నోటీస్ రావడంతో మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సం ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎదులాబాద్ ప్రాంతానికి చెందిన గట్టుపల్లి వెంకటేశ్ (40)కు, కీసరకు చెందిన మౌనిక అలియాస్ విజయలక్ష్మితో 2019లో వివాహం జరిగింది. మౌనిక తల్లి కీసరలోని గురుకుల్లో స్వీపర్గా పనిచేస్తోంది. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో మౌనిక ఆమెకు బదులుగా విధులు నిర్వహిస్తూ కీసరలో భర్తతో కలిసి ఉంటోంది. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వెంకటేశ్ విడాకులు ఇవ్వకపోవడంతో లాయర్ ద్వారా మౌనిక నోటీసు పంపింది. దీంతో మనస్తాపానికి లోనైన వెంకటేష్ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.స్కూటీని ఢీ కొట్టిన కారు -
ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ
సాక్షి, సిటీ బ్యూరో : రాబోయే వేసవి నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ మంగళవారం మియాపూర్ సెక్షన్ పరిధిలోని మయూరి నగర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లు, ప్రస్తుత ట్యాంకర్ డిమాండ్తో పాటు రాబోయే వేసవి కాలంలో ఉండే డిమాండ్పై అధికారులతో చర్చించి, అవసరమైన సూచనలు చేశారు. ప్రజా ఫిర్యాదులు, మెట్రో కస్టమర్ కేర్కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బల్క్ వాటర్ సప్లై కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన మియాపూర్ లోని నాగార్జున ఎన్క్లేవ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సీజీఎంలు కిరణ్ కుమార్, శ్రీనివాస రెడ్డిలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
స్కూటీని ఢీకొన్న కారు.. ఇద్దరి దుర్మరణం కీసర: కీసర సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ చదివే విద్యార్థినితో పాటు ఆమె చిన్నాన్న అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన పసుపుల కృష్ణ (38), కూతురు వరుసయ్యే పురాని జ్యోత్స్న (16)ను తీసుకుని ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి బయలుదేరాడు. కుషాయిగూడ నుంచి కీసర మీదుగా మల్యాలకు వెళ్తుండగా ఓఆర్ఆర్ దాటిన తర్వాత నీలంరెడ్డి గెస్ట్హౌజ్ సమీపంలో ఎదురుగా వేగంగా దూసుకువచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో కృష్ణ, జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణ ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయి కారు బ్యానెట్ డోర్ లోపలున్న ఇంజిన్లో ఇరుక్కుపోయిందంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జ్యోత్స్న చీర్యాల చౌరస్తాలోని ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి నాలుగేళ్ల క్రితమే ఓ ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జ్యోత్స్నకు కృష్ణ వరుసకు చిన్నాన్న అవుతాడని, అతడు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుంటాడని వారు చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్కు స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
పొద్దున్నే కుమ్మేస్తోంది
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు చలితో గజగజ వణుకుతున్న నగరవాసిని మరోవైపు గాలి కాలుష్యం కమ్మేస్తోంది. తెల్లవారుజామున గ్రేటర్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అసలే శీతాకాలం.. ఆపై వాయు కాలుష్యం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చలిగాలులు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా వాహన, పారిశ్రామిక, ధూళి వంటి గాలి కాలుష్య కారకాలు ‘మితస్థాయి’ నుంచి ‘అనారోగ్య స్థాయికి’ చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పీఎం 2.5 స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నాయి. నగరంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు 163గా ఉన్న ఏక్యూఐ.. మర్నాడు ఉదయం 4 గంటలకు 278కు పెరిగింది. అంటే కేవలం 12 గంటల వ్యవధిలోనే నగరంలో వాయు నాణ్యత దాదాపు రెట్టింపు స్థాయిలో పడిపోయింది. మధ్యాహ్నం సమయంలో నగరంలో గాలి నాణ్యత కాస్త మెరుగ్గానే ఉంటున్నా.. రాత్రి 11 గంటల నుంచి క్రమంగా క్షీణిస్తోంది. ప్రధానంగా అమీన్పూర్, ఆసిఫ్నగర్, బంజారాహిల్స్, బొల్లారం పారిశ్రామిక ప్రాంతం, సెంట్రల్ యూనివర్సిటీ, కాప్రా, కోకాపేట, కొంపల్లి, కోఠి, కూకట్పల్లి తదితర ప్రాంతాలలో గాలి నాణ్యత మరీ తక్కువగా నమోదవుతోంది. పిల్లలు, వృద్ధులపై ప్రభావం.. గాలి కాలుష్యం పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దగ్గు, ఆస్తమా, అలర్జీ, ఇతరత్రా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు ఆరుబయట తిరగకుండా ఉండాలి. పూర్తిగా సూర్యోదయం వచ్చిన తర్వాతే వాకింగ్, జాగింగ్ వంటి చేయడం ఉత్తమం. మాస్క్ లేకుండా ఔట్డోర్ వ్యాయామం చేయకూడదు. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే ఎన్–95 మాస్క్ ధరించాలి. నియంత్రణకు ఏం చేయాలంటే? కాలుష్య సవాళ్లను నియంత్రించాలంటే పట్టణ ప్రణాళిక విభాగం, విధానాల అమలు కీలకం. ప్రభుత్వ, ప్రైవేట్రంగ సంస్థలతో పాటు పౌరుల సహకారం అత్యవసరం. భూ ఉపరితలాన్ని చల్లదనంగా ఉంచేందుకు గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, పచ్చదనంతో కూడిన ఇంటి పైకప్పులు, భవన నిర్మాణాల్లో హరిత ఉత్పత్తుల వినియోగం తప్పనిసరి చేసేలా నిబంధనల సవరణలు చేపట్టాలి. వీటితో పాటు కాలుష్యం వెదజల్లే కాలం చెల్లిన వాహనాలకు స్వస్తి పలకాలి. ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణ వ్యూహాలను అమలు చేయాలి. తెల్లవారుజామున భారీగా గాలి కాలుష్యం వణికిస్తున్న చలి.. పడిపోతున్న వాయు నాణ్యత 12 గంటల వ్యవధిలోనే రెండింతల పెరుగుదల నగరంలోని పలు ప్రాంతాల్లో క్రమంగా క్షీణదశకు.. -
ఈవీతో ఆదా!
సాక్షి, సిటీబ్యూరో: ఎలక్ట్రిక్ బస్సులతో గ్రేటర్ ఆర్టీసీకి భారీ ఊరట లభించనుంది. దశలవారీగా అందుబాటులోకి రానున్న ఈవీలతో ఆర్టీసీకి రోజుకు రూ.కోటి వరకు ఆదా కానుంది. ఇంధనం కోసం వినియోగిస్తున్న ఖర్చు చాలా వరకు తగ్గనుంది. ఇప్పటికే సుమారు 300 కొత్త బస్సులు నగరంలోని పలు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. వచ్చే మార్చి నాటికి మరో 200 బస్సులు రానున్నాయి. మరోవైపు పీఎం ఈ– డ్రైవ్ పథకంలో భాగంగా నగరంలోని 25 డిపోల్లోని డీజిల్ బస్సులను తొలగించి 2000 ఈవీలను ప్రవేశపెట్టనున్నారు. దీంతో 2027 నాటికి మొత్తం 2,500 ఎలక్ట్రిక్ బస్సులు నగరంలో పరుగులు తీస్తాయి. ప్రస్తుతం ఆర్టీసీ సొంత బస్సులతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తుండగా, ఈ బస్సుల స్థానంలో రానున్న ఎలక్ట్రిక్ బస్సులన్నింటిని అద్దెప్రాతిపదికన సమకూర్చుకుంటారు. దీంతో ఈ బస్సుల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుముఖం పట్టనుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కిలోమీటర్కు రూ.65.. ప్రస్తుతం గ్రేటర్లోని సుమారు 1,050 రూట్లలో సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజూ సుమారు 5 లక్షల కిలోమీటర్ల వరకు నడుస్తున్నట్లు అంచనా. ఇప్పుడున్న డీజిల్ బస్సులపై ఆర్టీసీ ఒక కిలోమీటర్కు రూ.85 చొప్పున ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన మొత్తం బస్సులపై రోజుకు రూ.6 కోట్ల నిర్వహణ వ్యయమవుతున్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ ఆర్టీసీకి ప్రస్తుతం రూ.6.2 కోట్ల వరకు దాయం లభిస్తుండగా అందులో రూ.6 కోట్లు బస్సుల నిర్వహణకే వెచ్చించాల్సివస్తోంది. దీంతో నిత్యం కేవలం రూ.20 లక్షలు మాత్రమే మిగులుబాటవుతోంది. ఒకప్పుడు పీకల్లోతు నష్టాలతో నడిచిన గ్రేటర్ ఆర్టీసీకి ఇది ఒకింత ఊరట కలిగించేదే. కానీ.. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల మరింత ఆదాయం లభిస్తుందని పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల విద్యుత్ చార్జీలు, ఇతర అవసరాల కోసం ఒక కిలోమీటరుకు రూ.65 వరకు ఖర్చవుతుంది. దీంతో మొత్తం బస్సులపై సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇలా పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీకి ప్రతి రోజు సుమారు రూ.కోటి ఆదా అయ్యే అవకాశం ఉంది. నూతన బస్సుల కోసం 10 కొత్త డిపోలు మరోవైపు ఔటర్రింగ్రోడ్డు వరకు జీహెచ్ఎంసీ విస్తరణలో భాగంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ విస్తరణకు సైతం చర్యలు చేపట్టారు. ఈ మేరకు కొత్త జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 2000 చ.కి.మీ వరకు ఉన్న కాలనీలు, నివాస ప్రాంతాలకు ప్రజారవాణా సదుపాయాలను విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నానక్నాంగూడ, కోకాపేట్, నార్సింగి, గచ్చిబౌలి, శంషాబాద్, పటాన్చెరు, కీసర, కుత్బుల్లాపూర్, బోరబండ, అబ్దుల్లాపూర్మెట్లలో కొత్త డిపోలు రానున్నాయి. దీంతో గ్రేటర్లోని మొత్తం డిపోల సంఖ్య 35కు చేరనుంది. గ్రేటర్లో దశలవారీగా అందుబాటులోకి 2,500 ఎలక్ట్రిక్ బస్సులు రూ.6 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గనున్న నిర్వహణ భారం -
ఒంటరికి జంటగా..
● జంతువులకు తోడు కల్పించేందుకు జూ అధికారుల ప్రయత్నాలు నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల సాహచర్యం కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణుల సంతతిని పెంచేందుకు.. సాంగత్యం పంచుకునేలా ఇతర ప్రాంతాల్లోని జూలలో ఉన్న ఆడ, మగ జంతువులను ఇక్కడి జూకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా జంతువుల సంతానోత్పత్తి పెరగడంతో పాటు విరహ వేదనతో పిచ్చిగా ప్రవర్తిస్తున్న జంతువులను మచ్చిక చేసుకోవాలని భావిస్తున్నారు. అలాగే తోడులేక ఒంటరిగా ఉన్న కొన్ని వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించిన యంత్రాంగం ఈ దిశగా ఆలోచన చేసింది. బబ్లీ అనే జిరాఫీ మరణంతో సన్నీ అనే మగ జిరాఫీ ఒంటరిగా మిగిలిపోయింది. దీనికి తోడుగా ఆడ జిరాఫీని తీసుకురావడానికి జూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే మైసూర్ జూలోని ఆడ జిరాఫీని హైదరాబాద్కు తీసుకువస్తున్నట్లు జూ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం తెలిపారు. హమడ్రియాస్ బబూన్.. ఒక రకమైన కోతి ఇది. దీనికి ఆడ తోడును మైసూర్ జూ నుంచి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మగ దేవాంగ పిల్లికి ఆడ దేవాంగ పిల్లిని తీసుకువచ్చేందుకు సైతం ఇతర జూలను సంప్రదిస్తున్నారు. గ్రేటర్ రియా అనే మగ పక్షికి తిరువనంతపురం ఆడ పక్షిని తీసుకురావడానికి చర్చలు జరుపుతున్నారు. కోతి జాతికి చెందిన ఆడ మకాక్ తోడు కోసం త్రిపుర రాష్ట్రం అగర్తలా జూ నుంచి మగ మకాక్ను తీసుకువస్తామని జూ క్యూరేటర్ జె.వసంత పేర్కొన్నారు. – సాక్షి, సిటీబూరో -
నేరుగా బల్దియా ఖజానాకే..
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో విలీనమైన 20 మున్సిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఆస్తిపన్నులు, దుకాణాల ట్రేడ్ లైసెన్సుల ఫీజులు నేరుగా జీహెచ్ఎంసీ ఖజానాకు చేరనున్నాయి. ఆస్తిపన్ను, ట్రేడ్లైసెన్సు ఫీజు, వేకెంట్ ల్యాండ్ టాక్స్(వీఎల్టీ) ఫీజు కూడా జీహెచ్ఎంసీ ఖజానాలో చేరేలా జీహెచ్ఎంసీ వెబ్సైట్లో సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. వెట్సైట్లో పూర్వ పురపాలికల (ఎర్స్ట్వైల్ యూఎల్బీస్) పేరిట కొత్త విండోను అందుబాటులోకి తెచ్చారు. దాని ద్వారా జీహెచ్ఎంసీలో కలిసిన పురపాలికల్లోని వారు తమ ఆస్తిపన్నుకు సంబంధించిన పీటీఐఎన్ ద్వారా లేదా ఇంటినెంబరు ద్వారా చెల్లించాల్సిన ఆస్తిపన్ను వివరాలు చూసుకోవడంతో పాటు వెబ్సైట్ నుంచే ఆన్లైన్ ద్వారా నేరుగా సదరు పన్ను చెల్లించే సదుపాయం కల్పించారు. ఆస్తిపన్ను జాబితాలో నమోదు కాని.. కొత్త భవనాల సెల్ఫ్అసెస్మెంట్, భవన యాజమాన్య బదిలీకి సంబంధించి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంచారు. దుకాణాలకు సంబంధించి ట్రేడ్లైసెన్సుల ఫీజులు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయం కల్పించారు. జిల్లాల వారీగానూ.. జీహెచ్ఎంసీలో విలీనమైన పురపాలికలు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధుల్లో ఉండటంతో జిల్లాల వారీగా వివరాలు పొందుపరిచారు. యథాతథంగానే ఆస్తిపన్ను ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను విధింపు ఒక విధంగా ఉండగా, పురపాలికల్లో మరో విధంగా ఉంది. ఆ విధానాలు ప్రస్తుతానికి యథాతథంగానే కొనసాగనున్నాయి. ఒకే విస్తీర్ణం భవనానికి జీహెచ్ఎంసీ కంటే పురపాలికల్లో ఆస్తిపన్ను ఎక్కువగా ఉంది. అవి జీహెచ్ఎంసీలో విలీనమైనందున వాటికి తగ్గింపు ఉండదని తెలిసింది. ఎంతొస్తుందో ఏమో? జీహెచ్ఎంసీలో విలీనమైన పురపాలికల ద్వారా ఎంత ఆదాయం జీహెచ్ఎంసీ ఖజానాకు చేరనుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు అధికారులు. నాలుగు నెలల్లోపునే ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటి వరకు వాటిల్లో ఎంత ఆస్తిపన్ను వసూలైందో, ఇంకా రావాల్సింది ఎంతో తెలియదు. వాటి ఆస్తిపన్ను డిమాండ్, వసూలైన మొత్తం.. ఇంకా రావాల్సిన ఆస్తిపన్ను తదితర వివరాలు పంపించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం సంగతి ఏమోగానీ వ్యయం మాత్రం భారీగా పెరగనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎంతో వ్యయం కానుందని చెబుతున్నారు. విలీన పురపాలికల ఆదాయం చేరేలా ఏర్పాట్లు ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజు చెల్లింపులు జీహెచ్ఎంసీ వెబ్సైట్లో సదుపాయం -
ఆ 103 ఎకరాలు సర్కారువే
సాలార్జంగ్ వారసులకు సుప్రీం షాక్● గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్ భూములపై కీలక తీర్పు ● హైకోర్టు, కింది కోర్టుల ఉత్తర్వులను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం ● జాగీర్ల రద్దుతోనే ఆ భూములు ప్రభుత్వ పరమయ్యాయని స్పష్టీకరణ ● 8 వారాల్లోగా ‘రిజర్వ్ ఫారెస్ట్’ నోటిఫికేషన్ పూర్తి చేయాలని సీఎస్కు ఆదేశంసాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ–మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అసలు వివాదం ఏమిటంటే? రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం సాహెబ్నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీఖాన్ (సాలార్జంగ్–3 వారసులు) తదితరులు హక్కులు కోరుతూ వచ్చారు. 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వారు వాదించారు. 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు జాగీర్ల రద్దుతోనే సర్కారు పరం: 1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతర్భాగమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని, అప్పటి నుంచి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధీనంలోనే ఉందని పేర్కొంది. ఆ పత్రాలు చెల్లవు: సాలార్జంగ్ వారసులు చూపించిన 1954 నాటి జాగీర్ అడ్మినిస్ట్రేటర్ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం జిరాక్స్ కాపీల ఆధారంగా, అసలు రికార్డులను సరిగా పరిశీలించకుండా కింది కోర్టులు తీర్పునివ్వడం సరికాదని తప్పుబట్టింది. అధికారులు పరిధి దాటారు: టైటిల్ (యాజమాన్య హక్కుల) వివాదాలను తేల్చే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని, సమ్మరీ ఎంకై ్వరీ చేసే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్కు ఆ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని మండిపడింది. అటవీ శాఖ నిర్లక్ష్యం: ఈ కేసులో సరైన సమయంలో సరైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అటవీ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శించారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మరో అప్పీల్ కూడా కొట్టివేత ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుసీ్త్ర దాఖలు చేసిన మరో పిటిషన్ను (సివిల్ అప్పీల్ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని తేల్చినందున, ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని తేల్చిచెప్పింది. 8 వారాల్లోగా పూర్తి చేయండి.. నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. ఈ 102 ఎకరాల భూమిని ’రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పష్టం చేసింది. -
సున్నం చెరువుపై సమగ్ర విచారణ చేయండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్లోని సున్నం చెరువుకు సంబంధించిన భూ వివాదాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రత్యేకాధికారిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) హోదాలో విచారణ అధికారిని ప్రత్యేకంగా నియమించిన విషయం తెలిసిందే. హైడ్రా సహా ఉన్నతాధికారుల ప్రభావానికి లోను కాకుండా స్వతంత్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. సర్వే ప్రారంభించే ముందు పిటిషన్లతోనూ మాట్లాడాలని సూచించింది. విచారణ జరిపి నివేదిక తయారు చేయడంలో ప్రత్యేకాధికారికి రంగారెడ్డి, మెదక్ మల్కాజిగిరి జిల్లాల నీటిపారుదల, సర్వే, భూ రికార్డులు, రెవెన్యూ శాఖల అధికారులు అవసరమైన సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్కు కూడా ఇదే ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతోందంటూ ఎస్ఐఈటీ మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సహా ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో హైడ్రా తాజాగా ఓ మధ్యంతర అప్లికేషన్(ఐఏ) దాఖలు చేసింది. సున్నం చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అనుమతించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు మాదాపూర్ పోలీసుల సాయం తీసుకునేందుకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్లపై జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. బోర్లకు విద్యుత్ కనెక్షన్ తొలగించండి.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒకవైపు హైడ్రా.. చెరువు సమీపంలో తవ్వకం పనులను నిరాటంకంగా కొనసాగిస్తోందని, మరోవైపు ట్యాంకర్ల ద్వారా చెరువు నుంచి నిరంతరం కలుషితమైన నీటిని తోడి తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తోందన్నారు. హైడ్రా తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ల వాదనలు అవాస్తవం. పిటిషనర్లు తమ సొంతమని చెప్పుకుంటున్న భూమి హక్కులు, సరిహద్దులపై వివాదం ఉంది. అధికారుల విచారణలో ఎఫ్టీఎల్, బఫర్జోన్లోలో విల్లాలున్నా కూడా కూల్చివేస్తాం. చెరువు సహజ స్థితిని పునరుద్ధరించడమే లక్ష్యం. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎఫ్టీఎల్ నిర్మాణాలు చేపట్టే వారికి బోర్లు వేసుకునేందుకు అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. నల్లా, విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారని అడిగారు. కలుషిత నీటి తరలింపును నిరోధించేందుకు నిషేధిత ప్రాంతంలోని బోరుబావులకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ప్రత్యేకాధికారిని ఆదేశించారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలసిన అన్ని ఆస్తుల వివరాలను ఇంటి నంబర్లతో సహా సమర్పించాలని స్పష్టం చేశారు. నివేదికలో హైడ్రా తప్పు చేసినట్లు తేలితే, కఠిన చర్యలకు వెనుకాడబోమని తేల్చిచెబుతూ.. విచారణ వాయిదా వేశారు. ప్రత్యేక అధికారికి హైకోర్టు ఆదేశం సర్వే ప్రారంభించే ముందుపిటిషనర్లతో మాట్లాడండి ప్రత్యేకాధికారికి సహకరించాలనివివిధ శాఖలకు సూచన తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా -
నిజాయితీ, ధైర్యానికి ప్రతీక పోలీస్
● డీజీపీ శివధర్రెడ్డి గచ్చిబౌలి: పోలీసు అధికారులు, వృత్తినైపుణ్యంలో ముందుండటంతోపాటు సేవల్లోనూ మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో 8వ వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలను అందజేశారు. అంతకుముందు పోలీసుజాగిలం డీజీపీకి సెల్యూట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పోలీసుశాఖ మంచి ర్యాంకులు సాధిస్తూనే ఉందన్నారు. విధి నిర్వహణ తోపాటు దర్యాప్తులోనూ అదే స్థాయి ప్రతిభ చూపాలన్నారు. క్రీడలతో పాటు ప్రజల మనసులను కూడా గెలుచుకోవాలన్నారు. సైబరాబాద్ పోలీసులు నిజాయితీ, ధైర్యానికి ప్రతిరూపంగా నిలవాలని ఆయన సూచించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్మహంతి మాట్లాడుతూ రాష్ట్రంలో సైబరాబాద్ ఒక ప్రత్యేక కమిషనరేట్ అని అత్యధికంగా డయల్–100 కాల్స్ వచ్చే ప్రాంతాల్లో ఇది ముందంజలో ఉందన్నారు. అలాగే వీఐపీలు ఎక్కువగా సందర్శించే ప్రాంతం కూడా ఇదేనని గుర్తు చేశారు. కమిషరేట్ ప్రాంతంలో బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులు ప్రత్యేకంగా, పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు , వెల్ఫేర్ క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దివ్యాంగుల సేవాసంస్థలోసేవలందించనున్న డా.హేమనళిని
సాక్షి సిటీబ్యూరో: నగరంలోని దివిస్ ఫౌండేషన్కు చెందిన దివ్యాంగుల విభాగం వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కు కన్సల్టెంట్ డెవలప్మెంట్ పీడియాట్రిషియన్ గా ప్రముఖ వైద్యులు డాక్టర్ హేమ నళిని కాండ్రు నియమితులయ్యారు. ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరో డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్’ కి రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేసి, పీడియాట్రిక్స్ కేర్లో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. డాక్టర్ హేమ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఎఎస్డి), ఏడీహెచ్డీ, అభ్యాస ఇబ్బందులు, ఎదుగుదల లోపాలు వంటి నాడీ సంబంధిత సమస్యలను ఎదుర్కోవడంలో మరింత వృత్తిపరమైన నైపుణ్యాన్ని జత చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ట్రా‘ఫికర్’ తీర్చేందుకు ఉమ్మడి చర్యలు
● కీలక నిర్ణయాలు తీసుకున్న అధికారులు సాక్షి, సిటీబ్యూరో: సామాన్య ప్రజలకు, వాహనచోదకులకు ఇబ్బందులు కలిగించని విధంగా సిటీ బస్టాప్లు ఉండాలని, ట్రాఫిక్ జామ్స్కు కారణమవుతున్న వాటిని రోడ్డు వెడల్పు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు మార్చాలని అధికారులు నిర్ణయించారు. బంజారాహిల్స్లోని టీజీ ఐసీసీసీలో కొత్వాల్ వీసీ సజ్జనర్ నేతృత్వంలో గురువారం జరిగిన వివిధ విభాగాల ఉమ్మడి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో పోలీసు, జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి , విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ● ప్రధాన జంక్షన్లలో రద్దీని తగ్గించేందుకు రోడ్ల మరమ్మతులతో పాటు పెండింగ్లో ఉన్న జంక్షన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. వర్షం కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంపై చర్చించారు. ● మలక్పేట వంటి ప్రాంతాల్లో విజయవంతమైన ’రోబోటిక్ క్లీనింగ్’ విధానాన్ని అన్ని పాయింట్ల వద్ద అమలు చేయనున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న సులభ్ కాంప్లెక్స్లను తొలగించడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపైనా చర్చించారు. ● పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడానికి మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని... దీని కోసం మల్టీ లెవల్ పార్కింగ్ యాప్‘ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ● పురానాపూల్, బహదూర్పురా, ఎం.జె. మార్కెట్, మాసాబ్ ట్యాంక్, బేగంపేట వంటి ప్రదేశాలలో రోడ్డు మధ్యలో రెయిలింగ్ లేకపోవడం వల్ల పాదచారులు, వాహనదారులు విచ్చలవిడిగా రోడ్డు దాటుతున్నారు. దీనివల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఆయా ప్రాంతాల్లో రెయిలింగ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ● ఉస్మానియా ఆసుపత్రి తో పాటు నగరంలోని ఇతర స్థలాలలో ఆటోలను విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక స్థలాలను ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ● పోలీసు, మున్సిపల్ విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి సజ్జనర్ పేర్కొన్నారు. ‘వాటర్ బోర్డు, విద్యుత్ తదితర సంస్థలు సమన్వయంతో పనిచేయాలని... క్షేత్ర స్థాయి అధికారులకు అధికారాలను, బడ్జెట్ను బదిలీ చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ● హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ... వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపుతామని, ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ● రోడ్డు తవ్వకాలు జరిపినప్పుడు ప్యాచ్ వర్క్ ఆలస్యం కాకుండా ఉండేందుకు రెండు పనుల్నీ ఒకే కాంట్రాక్టరుకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సైబరాబాద్ సంయుక్త సీపీ గజరావ్ భూపాల్ సూచించారు. ● నగరంలోని సీవరేజ్, డ్రైజేజీ పైప్లైన్లను ఇంకా అభివృద్ది చేయడానికి చర్యలు చేపట్టామని, అన్ని శాఖలు కలిసి పని చేసినప్పుడే ట్రాఫిక్, పాదచారుల సమస్యలు తీరుతాయని జలమండలి ఎండీ అశోక్రెడ్డి అన్నారు. -
ఆ ప్రయత్నాలన్నీ విఫలమే!
సాజిద్, నవీద్ల పాస్పోర్టులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడికి లభించని సిటిజన్షిప్ 2002 నుంచి రెసిడెంట్ రిటర్న్ వీసాపై ఉంటున్న వైనం 2022లో వచ్చినప్పుడే అతడి పాస్పోర్టు పదేళ్లకు రెన్యువల్ సాక్షి, సిటీబ్యూరో: సిడ్నీలోని బాండీ బీచ్లో మారణహోమానికి తెగబడి, పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. టోలిచౌకి అల్ హనస్ కాలనీలో ఉండే అతడి కుటుంబీకులను ప్రశ్నించిన నిఘా వర్గాలు ఈ విషయం గుర్తించాయి. మరోపక్క గడిచిన 27 ఏళ్లలో అతడు నగరానికి రాకపోకలు సాగించిన అంశాల పైనా అధికారులు వివరాలు సేకరించారు. నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూం కాలేజీ నుంచి బీకాం పూర్తి చేసిన సాజిద్ 1998 నవంబర్లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. 2000లో ఇటాలియన్ వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమె ఆ దేశంలోని పర్మినెంట్ రెసిడెంట్గా (పీఆర్) ఉన్నారు. దీంతో 2001లో సాజిద్ తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నారు. ఆ దేశ పర్మినెంట్ రెసిడెంట్ను వివాహం చేసుకున్నా... వారితో చట్టబద్ధంగా సహజీవనం చేస్తున్నా ఆస్ట్రేలియా ఈ వీసాను జారీ చేస్తుంది. ఇది కలిగి ఉన్న వాళ్లకు అక్కడ ఉండే, పని చేసే, చదువుకునే, మెడికేర్ సదుపాయం పొందే హక్కులు వస్తాయి. ఆపై పీఆర్గా మారిన సాజిద్ 2002లో రెసిడెంట్ రిటర్న్ వీసా తీసుకున్నారు. పీఆర్ హోదా ఉన్న వారికి ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా వచ్చిపోయే పరిమితి ఐదేళ్ల కాలానికే ఉంటుంది. ఆ తరువాతఅవసరమైన వారు దరఖాస్తు చేసుకుని ఈ రెసిడెంట్ రిటర్న్ వీసా పొందాల్సి ఉంటుంది. ఇలా తన పీఆర్ హోదాను సాజిద్ అక్రమ్ కొనసాగించారు. ఆస్ట్రేలియాలో ఓటు హక్కు ఉండాలన్నా, ఆ దేశ పాస్పోర్టు పొందాలన్నా, విదేశాల్లో ఆస్ట్రేలియన్ రాయబార కార్యాలయం ద్వారా రక్షణ పొందాలన్నా సిటిజన్షిప్ అవశ్యం. ఈ నేపథ్యంలోనే సాజిద్ అనేకసార్లు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి ప్రయత్నించాడని, అయితే అతడి దరఖాస్తు ప్రతి సందర్భంలోనే తిరస్కరణకు గురైందని కుటుంబీకులు చెప్తున్నారు. అందుకు కారణాలను మాత్రం అతడు ఎప్పుడూ తమతో పంచుకోలేదని పోలీసులకు వివరించారు. ఇతడి కుమారుడైన మరో ఉగ్రవాది నవీద్ అక్రమ్ 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలోనే జన్మించడంతో అక్కడి పౌరసత్వం, ఆ దేశ పాస్పోర్టు లభించాయి. గడిచిన 27 ఏళ్లల్లో సాజిద్ ఆరుసార్లు, అక్రమ్ ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లారని ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రాకపోకలకు గల కారణాల పైనా స్పష్టత ఇచ్చాయి. 2001లో తొలిసారిగా తన భార్యతో కలిసి వచ్చిన సాజిద్ ఇక్కడ కుటుంబీకుల సమక్షంలో తమ సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకున్నారు. 2004లో కుమారుడు నవీద్ను టోలిచౌకీలో ఉన్న కుటుంబీకులకు చూపించడానికి తీసుకువచ్చాడు. 2009లో తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన సాజిద్... ఆ తర్వాత వచ్చి తల్లితో పాటు కుటుంబీకుల్నీ కలిసి వెళ్లాడు. వారసత్వంగా తనకు సంక్రమించిన ఆస్తి అయిన శాలిబండలోని ఇంటిని విక్రయించడానికి 2016లో వచ్చి వెళ్లాడు. ఈ డబ్బు వెచ్చించే ఆస్ట్రేలియాలోని బోనిరిగ్ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇందులో భార్య సైతం కొంత షేర్ కలిగి ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సాజిద్ తన వాటాను కూడా భార్య వెనెరా పేరుతో బదిలీ చేశాడు. 2022 ఫిబ్రవరిలో ఆఖరుసారిగా హైదరాబాద్ వచ్చిన సాజిద్ తన కుటుంబీకుల్ని కలిసి వెళ్లాడు. ఆ సందర్భంలోనే పదేళ్ల కాలపరిమితికి తన పార్ట్ను రెన్యువల్ చేయించుకున్నాడు. -
పరిశ్రమలపై విద్యుత్ బిల్లుల పిడుగు!
సాక్షి, సిటీబ్యూరో/కుషాయిగూడ: విద్యుత్ అధికారుల తొందరపాటు నిర్ణయాలు చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల పాలిట పెద్ద శాపంగా మారాయి. డిసెంబర్ నెలలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జారీ చేసిన బిల్లులు పెద్ద ‘షాక్’ ఇచ్చాయి. ఒక్కసారిగా రెట్టింపు బిల్లులు రావడంతో పరిశ్రమల నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపును నిలిపివేసి నిరసన ప్రకటించారు. సరఫరాకు, రీడింగ్కు మధ్య వ్యత్యాసం... గ్రేటర్ జిల్లాల పరిధిలో సుమారు 50 వేల చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల నిర్వాహకులు ముందే ఎంపిక చేసుకున్న ఫిక్స్డ్ లీడ్ పవర్ ఫ్యాక్టర్ రీడింగ్ ప్రకారం నెలవారీ బిల్లును చెల్లించేవారు. అయితే సరఫరాకు, మీటర్ రీడింగ్కు మధ్య కొంత వ్య త్యాసం నమోదవుతోంది. ఇప్పటి వరకు ఈ విద్యుత్ నష్టాలను విద్యుత్ సంస్థలే భరిస్తూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నష్టాలను తాము భరించలేమని పేర్కొంటూ ఈఆర్సీని ఆశ్రయించాయి. ‘లీడ్ పవర్ ఫ్యాక్టర్’కు ఉన్న లాకింగ్ వ్యవస్థను ఎత్తివేసి, ఖర్చు చేసిన ప్రతి యూనిట్ను పక్కగా లెక్కించి బిల్లు వసూలు చేయాలని ఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఈఆర్సీ ఆదేశాల మేరకు మూడు నెలల క్రితం కెపాసిటర్లు లేని ఆయా పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది. లీడ్ పవర్ ఫ్యాక్టర్ను అన్లాక్ చేసింది. సరఫరాకు, బిల్లింగ్కు మధ్య వచ్చిన వ్యత్యాసాన్ని లెక్కించి, ఆ మొత్తాన్ని పరిశ్రమల నుంచి వసూలుకు సిద్ధపడింది. దీంతో పరిశ్రమల నెల వారి విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. డిసెంబర్ నెల బిల్లులు చెల్లించే ప్రసక్తే లేదు... విద్యుత్ బిల్లులపై పారిశ్రామిక వేత్తలు మండిపడ్డారు. తమకు కనీస అవగాహాన కల్పించకుండా, ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఒక్క సారిగా రెట్టింపు బిల్లులను చేతికి ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తు న్నారు. డిస్కం తీరుతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం చర్లపల్లి సీఐఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు డీఎస్రెడ్డి, ఐలా చైర్మన్ గోవిందరెడ్డి, మాట్లాడారు. గత నెల వరకు రూ.పది వేల లోపు వచ్చిన విద్యుత్ బిల్లులు..డిసెంబర్లో ఏకంగా రూ.లక్షకుపైగా రావడం ఏమిటని ప్రశ్నించారు. నిజానికి పరిశ్రమలో కెపాసిటర్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ను ఆదా చేయడంతో పాటు నెలవారి బి ల్లును కూడా నియంత్రించుకునే వెసులుబాటు ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఇంజనీరు స్పష్టం చేశారు. ఈ విషయం తెలియక అధిక మొత్తంలో చేతికి అందిన బిల్లులను చూసి పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందు తున్నారని అభిప్రాయపడ్డారు. ‘లీడ్ పవర్ ఫ్యాక్టర్’ అన్లాక్తో భారీగా బిల్లులు.. చెల్లించలేమంటున్న నిర్వాహకులు -
రౌడీషీటర్ దారుణ హత్య
పహాడీషరీఫ్: రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్ వాదే సాల్హె హీన్ ప్రాంతానికి చెందిన ఫరూక్ కుమారుడు షేక్ అమీర్ (32) రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎం.ఎం.పహాడీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి పలు హత్య కేసులు, దొంగతనాలలో ప్రమేయం ఉండడంతో జైలు జీవితం సైతం అనుభవించాడు. ఇతనిపై అత్తాపూర్ పోలీస్స్టేషన్లో రౌడీషీట్ సైతం నమోదైంది. ఈ క్రమంలోనే పోలీసులు నగర బహిష్కరణ చేసి, స్థానికంగా ఉండకూడదని హెచ్చరించారు. ఈ నెల 13న వాదే సాల్హె హీన్లో నివాసం ఉంటున్న సోదరుడు ఫరీద్ ఇంటికి వచ్చి.. తాను రెండు నెలల కోసం రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు వెళ్తున్నట్లు, ఖర్చుల నిమిత్తం డబ్బులు కావాలని కోరాడు. సాయంత్రం సమకూరుస్తానని చెప్పడంతో తన స్నేహితులు సయ్యద్ అమన్, హుస్సేన్లో కలిసి బైక్పై బయటికి అమీర్ బయల్దేరాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో షాహిన్నగర్ ప్రధాన రహదారిలోని నహదీ హోటల్ ప్రాంతంలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్లు ధరించి అమీర్పై కత్తులతో కడుపు, వీపు భాగాల్లో ఐదుసార్లు పొడిచి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. పాత కక్షల కారణంగానే బాలాపూర్ ప్రాంతానికి చెందిన అహ్మద్ ఇమాద్ తన ఐదుగురు అనుచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పండక్కి బండేదీ!
● ప్రకటించిన ద.మ రైల్వే ● తొలి రోజే భారీగా బుకింగ్లు ● అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ ● లక్షలాది మందికి పడిగాపులే సంక్రాంతికి 41 ప్రత్యేక రైళ్లుసాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతికి సొంతూరు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న నగర వాసులను దక్షిణమధ్య రైల్వే ఉసూరుమనిపించింది. లక్షలాది మంది ప్రయాణానికి సన్నద్ధమవుతున్న తరుణంలో కేవలం 41 ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. పైగా ఈ రైళ్లకు మొదటి రోజు ఆదివారమే చాలా మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడంతో లక్షలాది మందికి నిరాశే మిగిలింది. ఉదయం 8 గంటలకు ఆన్లైన్లో బుకింగ్ తెరిచిన కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు అన్ని రైళ్లలో రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. దీంతో చాలా మంది వెయిటింగ్ లిస్టుకే పరిమితమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో ‘నోరూమ్’ దర్శనమిస్తుండగా తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు సైతం భారీ డిమాండ్ నమోదైంది. దీంతో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే తప్ప ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆ రూట్లను మరిచారెందుకో? ప్రస్తుతం కాకినాడ–వికారాబాద్ (07263/07264 ), కాకినాడ– సికింద్రాబాద్ (07279/07280), తిరుపతి– వికారాబాద్ (07265/07271), కాకినాడ–వికారాబాద్ (07272), సికింద్రాబాద్– కాకినాడ (07273 ), కాకినాడ టౌన్–లింగంపల్లి (07261/07262) నర్సాపూర్– వికారాబాద్ (07244/07245), సికింద్రాబాద్– నర్సాపూర్ (07247/07248), లింగంపల్లి– నర్సాపూర్ (07260/07259) తదితర రూట్లకే ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ ఉండే బెంగళూర్, తిరుపతి, విశాఖ, చైన్నె తదితర నగరాలకు అదనపు రైళ్లను ఏర్పాటు చేయలేదు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి ఎక్కువ మంది విజయవాడకు రాకపోకలు సాగిస్తారు. ఈ రూట్లో ఇంటర్సిటీ రైళ్లను మరిన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దూర ప్రాంతాల రైళ్లకు ఉండే డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. 30 లక్షల మంది వెళ్తారని అంచనా.. వచ్చే సంక్రాంతికి నగరం నుంచి సుమారు 30 లక్షల మందికి పైగా ఏపీలోని సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ డిమాండ్ మేరకు రైళ్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాకపోవచ్చు. కానీ రద్దీ భారీగా ఉండే రూట్లలో కూడా కేవలం అరకొర రైళ్లను నడపడం వల్ల లక్షలాది మంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. గతంలో సంక్రాంతి, దసరా, వేసవి సెలవులు వంటి ప్రత్యేక సందర్భాల్లో సుమారు 100కు పైగా అదనపు రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటు రెగ్యులర్ రైళ్లకు అదనపు బెర్తులు, బోగీలను కూడా ఏర్పాటు చేసేవారు. కొంతకాలంగా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను క్రమంగా తగ్గించడం గమనార్హం. ఒకవైపు ఏటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు రైళ్ల సంఖ్య తగ్గుముఖం పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ దారి దోపిడీ ఈ క్రమంలో రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేని ప్రయాణికులు ప్రైవేట్ బస్సులు, ట్యాక్సీలు, మినీబస్సులు వంటి వాటిని ఆశ్రయిస్తుండటంతో చార్జీలు మోయలేని భారంగా పరిణమిస్తున్నాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలను సంక్రాంతి రోజుల్లో రెట్టింపు చేస్తున్నారు. ఆర్టీసీలో సైతం ప్రతి సంవత్సరం పండుగల సందర్భంగా 50 శాతం అదనపు చార్జీలను విధించి ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. అంతిమంగా నగటు నగరవాసి సంక్రాంతి సంబరం ప్రయాణంలోనే ఆవిరవుతోంది. అందుబాటులో ఉన్న ప్రజారవాణా సదుపాయాల్లో కేవలం రైలు ప్రయాణం ఒక్కటే తక్కువ చార్జీలతో లభిస్తుంది. కానీ.. ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా రైళ్లు మాత్రం అందుబాటులో ఉండడం లేదు. -
కష్టపడతాం కనికరించండి
● పార్టీ పదవుల్లేక ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం ● కొందరు నగర బీజేపీ నేతల అంతర్మథనం సాక్షి, సిటీబ్యూరో: చిన్న పదవి ఇవ్వండి చాలు. కష్టపడి పనిచేస్తాం. సొంతంగా ఖర్చు పెట్టుకుంటాం. నిత్యం ప్రజల్లో తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం’ అంటున్నారు నగరానికి చెందిన కొందరు బీజేపీ నేతలు. మాజీ ఎమ్మెల్యేలు సహా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సైతం పార్టీపరంగా పదవులు లేకపోవడంతో అంతర్మథనం చెందుతున్నారు. ఇక కింది స్థాయి నేతల ఊసే పట్టించుకోవడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. పుష్కర కాలంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. హైదరాబాద్కు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదని, పార్టీ పదవులను ప్రకటించడంలో 15 ఏళ్లుగా పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు రాష్ట్ర పార్టీ నాయకత్వంపై రుసరుసగా ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి 12 పోస్టులు కేటాయించుకున్నారని, మిగతా నగరానికి మొండిచేయి చూపించారంటూ కొందరు నేతల తీరును తప్పును ఎత్తిచూపుతున్నారు. పార్టీ అధిష్టానం తీరుతోనే క్షేత్రస్థాయిలో పనిచేసే వారి సంఖ్య తగ్గుతోందని, దీనికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని అంటున్నారు. క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలి.. కొన్ని నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పని చేసుకుంటున్నారు. కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటువంటి సమయంలో పార్టీ నుంచి ఎలాంటి పదవి లేకపోవడంతో ఎలా ముందుకెళ్లేదంటూ పలువురు నగర బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పార్టీ పరంగా 8 జిల్లాలు ఉన్నాయి. అందులో 550 వరకు పార్టీ పదవులు అప్పగించే అవకాశం ఉంది. జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, యువ, దశిత, మహిళా, ఓబీసీ, మైనార్టీ మోర్చా కమిటీల గురించి అసలే పట్టించుకోవడం లేదని, నియోజకవర్గ స్థాయి పార్టీ పదవుల భర్తీపై నాయకత్వం దృష్టి సారించడం లేదంటున్నారు. ● ‘మాజీ ఎమ్మెల్యేలు రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లాంటి వ్యక్తులకే పార్టీ పరంగా ఎలాంటి పదవి లేకుండాపోయింది. చోటా మోటా నాయకులను పట్టించుకునేదెవరు’ అంటూ నిట్టూర్చుతు న్నారు. త్వరలో జీహెచ్ఎంసీ 150 నుంచి 300 వార్డులకు పెరగనుంది. దీంతో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. పార్టీ పదవుల విషయమై రాష్ట్ర అగ్రనేతలను నిలదీస్తే.. ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్నే బయటకు పంపించారని ఇక తామెంత అంటూ మిన్నకుంటున్నామంటున్నారు. గ్రేటర్లో అధికారంలోకి రావాలంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, పార్టీ పదవులను భర్తీ చేసి, జెండా మోసిన నాయకులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. -
వెల్లువెత్తిన చైతన్యం
ఓటేసిన ప్రముఖులుఆమనగల్లు: కడ్తాల్లో ఓటేసేందుకు క్యూకట్టిన మహిళలు ముగిసిన రెండో విడత పంచాయతీ పోరు జిల్లాలోని ఏడు మండలాల్లో ఎన్నికలు ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు 85.3 శాతం ఓటింగ్ నమోదు పల్లెల్లో పండుగ వాతావరణం గెలుపొందిన అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల జాబితా ఇలా.. మండలం మొత్తం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఆమనగల్లు 13 03 03 01 06 తలకొండపల్లి 32 09 16 02 05కడ్తాల్ 24 11 07 02 04మొయినాబాద్ 19 07 07 04 01చేవెళ్ల 25 16 03 03 03శంకర్పల్లి 24 12 07 01 04షాబాద్ 41 17 22 01 01మొత్తం 178 75 65 14 24రెండో విడతలోనూ హస్తానిదే హవా రెండో విడత పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మంచుతో పాటు చలిగాలులు వీస్తుండటంతో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 11 తర్వాత ఊపందుకుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగ నిమిత్తం నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం పెద్ద ఎత్తున స్వగ్రామాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్, కౌంటింగ్ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగిన పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. – సాక్షి, రంగారెడ్డిజిల్లా రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల పరిధిలో 178 పంచాయతీలకు, 1,540 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా, వీటిలో 13 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 165 స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 2,27,883 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,94,375 మంది తమ ఓటు హక్కు (85.3 శాతం) వినియోగించుకున్నారు. 33,508 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అత్యధిక పోలింగ్ శాతం ఆమనగల్లు మండలంలో, అత్యల్పంగా షాబాద్ మండలంలో నమోదైంది. వికారాబాద్ జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 155 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేయగా, వీటిలో 20 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 135 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 2,09,847 మంది ఓటర్లకు గాను, 1,73,594 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 82.72 శాతం ఓటింగ్ నమోదైంది. 36,253 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అత్యధిక పోలింగ్ వికారాబాద్ మండలంలో(87.77 శాతం) నమోదు కాగా, అత్యల్పంగా బంట్వారంలో (80. 25 శాతం) నమోదైంది. చేవెళ్ల మండలం ఆలూరులో 14వ వార్డు సభ్యురాలిగా పోటీ చేసిన కుమార్తె రాములమ్మకు ఓటు వేయడానికి వచ్చిన వెంకన్నగూడకు చెందిన సోలిపేట బుచ్చయ్య (68) అక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు రఽవీకరించారు. శంకర్పల్లి మండలం శేరిగూడలో దొంగ ఓటు వేయానికి వచ్చిన వ్యక్తిని పోలింగ్ ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మొయినాబాద్ మండలం కనకమామిడి, కేతిరెడ్డిపల్లిలోని పోలింగ్ కేంద్రాలు సహా చేవెళ్ల మండలం ముడిమ్యాల, షాబాద్ మండలం పోతుగల్ కేంద్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓటెత్తారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చంటిపిల్లలతో మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రంలోకి చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలుచోట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించిన అధికారులు.. తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించారు. తొలి ఫలితం మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే వెల్లడైంది. రాత్రి తొమ్మిది తర్వాత కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ కేంద్రాల ముందు గుంపులుగా చేరిన వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే హవా కొనసాగించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వీరికి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ మెజార్టీ స్థానాల్లో ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. నిజానికీ పార్టీలు, బీఫాంలు, గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. పరోక్షంగా ఆయా అభ్యర్థులకు అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. జెండాలకు అతీతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ ఎంపీపీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ వికారాబాద్ జిల్లా మర్పల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల మండలం గొల్లపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తలకొండపల్లి మం డలం ఖానాపూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి చేవెళ్ల మండలం కౌకుంట్లలో ఓటు వేశారు. -
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
మహేశ్వరం: కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ జేడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని గంగారం, మహేశ్వరం, గొల్లూరు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు, గిరిజన తండాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహాలక్ష్మీ పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ సిలీండర్ సబ్సిడీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్తో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని మెజార్టీ గ్రామ పంచాయతీలు కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు మహేశ్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కాకి ఈశ్వర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించి సభలో మాట్లాడారు. మహిళలు, యువకులు, వృద్ధులతో మాట్లాడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కవులు, రచయితలకు సాహితీ ప్రక్రియలో శిక్షణ అవసరం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలుగు రాష్ట్రాలలోని కవులు, రచయితలకు సాహితీ ప్రక్రియలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్ రాములు అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఽభారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ యశోద గొట్టిపర్తి రాసిన ‘యశోకాంక్ష కథల సంపుటి, యశో బాలానందం, శ్రీ వెంకటేశ్వర స్వామితో నేను’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ... రచయిత్రి ఎంతో అంకిత భావంతో సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఈ పుస్తకాలు రాశారని అన్నారు. ఈ పుస్తకాలు సాహితీ చరిత్రలో అక్షర దీపాలుగా మిగిలిపోతాయన్నారు. కళారత్నా డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.విజయలక్ష్మీ పండిట్, డాక్టర్ వి.డి రాజగోపాల్, రామకృష్ణ చంద్రమౌలి, డాక్టర్ రాధా కుసుమ, డాక్టర్ కోగంటి ఉషారాణి, డాక్టర్ శాంతి శ్రీ, పద్మ శ్రీలత, జల్ది విద్యాధర్ పాల్గొన్నారు. -
460 మంది ‘నిషా’చరులకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వీకెండ్స్తో ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తున్నారు. గడిచిన మూడు దఫాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 535, 552, 474 చొప్పున కేసులు నమోదు కాగా..గత వారాంతమైన శుక్ర, శనివారాల్లో నగర వ్యాప్తంగా చేపట్టగా..460 మంది డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డారని ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఆదివారం వెల్లడించారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో చేపట్టారు. వీటిలో పట్టుబడిన 460 మందిలో 350 మంది ద్విచక్ర, 25 మంది త్రిచక్ర, 85 మంది తేలికపాటి వాహనాల చోదకుల అని ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ పేర్కొన్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్ ఉండే అది ఉల్లంఘన. దీన్ని సాంకేతికంగా బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ)అంటారు. నగర వ్యాప్తంగా ఈ స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తామన్నారు. వీటిలో చిక్కిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.● డ్రంక్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ ● వెల్లడించిన సిటీ ట్రాఫిక్ చీఫ్ -
నగరాభివృద్ధిలో మౌలిక వసతుల రూపకల్పనే కీలకం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగరాభివృద్ధిలో సవాళ్లను అధిగమించాలంటే మౌలిక వసతుల రూపకల్పన ఎంతో ముఖ్యమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జన సాంద్రతకు అనుగుణంగా రవాణా, తాగునీరు, మురుగు నీరు, విద్యుత్, శాంతిభద్రతల వ్యవస్థలు పెరగాలన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే క్రమంలో ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను, ప్రజాభిప్రాయాలను కచ్చితంగా అధికార పార్టీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని ఆదివారం బంజారాహిల్స్లోని ఒక హోటల్లో నిర్వహించారు. రిటైర్డ్ ఐఏఎస్లు ఎస్కే జోషి, ఎల్వీ సుబ్రమణ్యం, ఎక్స్పర్ట్ మహీప్ సింగ్ థాపర్, సెక్యూరిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ కె.రమేష్ బాబు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు తదితరులు పాల్గొన్నారు. ఎస్.కె.జోషి మాట్లాడుతూ.. భారీ జనాభా ఉన్న నగరాల్లో ఢిల్లీ, కోల్కత్తా, ముంబై, చైన్నె తరువాత హైదరాబాద్ ఉందన్నారు. కొత్తగా చేరిన పురపాలికలతో ఇప్పుడు నగర విస్తీర్ణం చాలా పెరిగిందన్నారు. దాదాపు రెండు వేల కిలోమీటర్లలో నగరం విస్తరించనుందన్నారు. అయితే సాంకేతికతను, ఏఐను వినియోగించుకోవడంతోపాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గ్రీన్ ఏరియాలను పెంచడంతోపాటు వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ డెవలవర్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో వక్తలు -
పోలింగ్ సరళి పరిశీలించిన కలెక్టర్
చేవెళ్ల/షాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదివారం పరిశీలించారు. డివిజన్లోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలకు నేరుగా వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమంలో సరి చూసుకొని ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఓటింగ్ శాతం నమోదు చేయాలని స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్లు కృష్ణయ్య, అన్వర్, ఏసీపీ కిషన్, ఎంపీడీఓలు హిమబిందు, అపర్ణ, మండల ప్రత్యేకాధికారులు వెంకటేశ్వర్రావు, మధుసూదన్ తదితరులు ఉన్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త్ నిర్వహించారు. శంకర్పల్లిలో డీసీపీ శంకర్పల్లి: మహాలింగాపురం గ్రామంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
‘సాక్షి’ స్పెల్ బీకి విశేష స్పందన
గచ్చిబౌలి: ‘సాక్షి’ స్పెల్ బీ సెమీఫైనల్స్–2025కు విశేష స్పందన లభించింది. ఆదివారం గోపన్పల్లిలోని విస్టా ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన స్పెల్ బీ సెమీఫైనల్స్కు వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు హజయ్యారు. బుడి బుడి నడకలతో వచ్చి రెండో సంవత్సరం విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం గమనార్హం. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు 700 మంది విద్యార్థులు స్పెల్ బీ పోటీకి హాజరయ్యారు. ‘సాక్షి’ లైవ్కాస్ట్ ద్వారా అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ కేటగిరీలలో పరీక్ష నిర్వహించారు. తెలంగాణలో జరిగిన సెమీఫైనల్స్ అనంతరం ప్రతి కేటగిరీ నుంచి 20 మంది చొప్పున మొత్తం 80 మంది విద్యార్థులను ఫైనల్స్కు ఎంపిక చేస్తారు. విస్టా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. డ్యూక్స్ వాఫీ, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ స్పాన్సర్గా వ్యవహరించారు. చిన్నారుల్లో జోష్ 700 మంది విద్యార్థులు హాజరు స్పెల్ బీతో నాయకత్వ లక్షణాలు స్పెల్ బీ ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచుకునేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. అనర్గలంగా మాట్లాడేందుకు ఆ స్కిల్స్ ఉపయోగపడతాయి. నేను బాగా మాట్లాడగలనే ఆత్మవిశ్వాసం అబ్బుతుంది. దీంతో బహిరంగ సభలు, సమావేశాలు, స్కూల్ ప్రోగ్రామ్స్లో బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్పెల్ బీ ద్వారా నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. – శాంతి ప్రియ, ప్రిన్సిపాల్, విస్టా ఇంటర్నేషనల్ స్కూల్ హ్యాపీగా ఉంది.. నా కూతురు భారతీయ విద్యా భవన్లో సెకండ్ క్లాస్ చదువుతోంది. ‘సాక్షి’ ఇచ్చిన బుక్తో స్పెల్బీకి ప్రిపేర్ అయ్యింది. సెమీ ఫైనల్స్కు చేరుకోవడం చాలా హ్యపీగా ఉంది. సాక్షి అందించే మ్యాథ్స్ బీ, స్పెల్ బీ బుక్స్ ఎక్సలెంట్గా ఉంటున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించే విధంగా బుక్స్ను తయారు చేశారు. – అనూప్ మాధవ్, పేరెంట్ ఇలాంటి పరీక్షలను ప్రోత్సహించాలి ఇంగ్లిష్ అనేది ఒక ఆర్డర్లో ఉండదు. ఒక్కో సందర్భంలో ఒక విధంగా పదాలను వాడతారు. అనేక రకాలుగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సి ఉంటుంది. నా కుమారుడు ‘సాక్షి’ అందచేసిన బుక్తో ప్రాక్టీస్ చేసి విస్టా ఇంటర్నేషనల్ స్కూల్లో స్పెల్ బీలో టాపర్గా నిలిచాడు. సాక్షి స్పెల్ బీలో సెమీఫైనల్స్కు చేరుకున్నాడు. ఫైనల్స్కు చేరుకుంటాడని ఆశిస్తున్నాం. పోటీ తత్వాన్ని పెంచే ఈలాంటి పరీక్షల్లో పాల్గొనే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి. – మేఘా శుక్లా, పేరెంట్ క్రమం తప్పకుండా పాల్గొంటున్నాం ప్రతి యేటా ‘సాక్షి’ నిర్వహించే స్పెల్ బీ పోటీల్లో మా విద్యార్థులు క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం ఏకంగా వివిధ కేటగిరీల్లో 18 మంది విద్యార్థులు సెమీఫైనల్స్కు చేరుకున్నారు. స్పెల్ బీ–2024లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో మా విద్యార్థులు నిలిచారు. ఈసారి కూడా ఫైనల్స్లో విజేతలుగా నిలుస్తారనే నమ్మకం ఉంది. – మందన, వైస్ ప్రిన్సిపాల్, మౌంట్ బేసిల్ హైస్కూల్, మహబూబ్నగర్ -
రాచకొండ పోలీసులకు డీజీపీ అభినందనలు
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినందుకుగాను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, సిబ్బందిని డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. ఎలాంటి లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారని, వారికి సహకరించిన ఇతర పోలీసు అధికారులను డీజీపీ ప్రశంసించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం ఉదయం కోల్కతాలో జరిగిన ఘటనతో అప్రమత్తమై, అక్కడ జరిగిన లోపాలు తెలుసుకుని, ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. అభిమానులు ఎవరూ గ్రౌండ్ లోపలికి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ఫుట్బాల్ క్రీడాభిమానులు, మెస్సీ అభిమానులకు డీజీపీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు వ్యక్తుల రిమాండ్ మల్లాపూర్: గుట్టు చప్పుడు కాకుండా పాపిస్ట్రా డ్రగ్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం నుంచి చిలుకానగర్కు వెళ్లే దారిలో వాహనాల తనీఖీలు చేస్తుండగా రాజస్థాన్కు చెందిన రమేష్ కుమార్, సురేష్కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీపులు వారి వద్ద ఉన్న బ్యాగ్ను సోదా చేయగా పాపిస్రా డ్రగ్ను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నగరానికి వలసవచ్చి చెంగిచర్లలో ఉంటూ రేలింగ్ పని చేస్తున్నట్లు తెలిపారు. మంగళ్రామ్ అనే వ్యక్తి నుంచి 14.7 కిలోల పాపిస్ట్రాను కోనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి 14.7 కిలోల పాపిస్ట్రా డ్రగ్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ముగిసిన గ్లోబల్ సమ్మిట్
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా పూర్తయింది. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 8, 9 తేదీల్లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమ్మిట్ నిర్వహించింది. 10 నుంచి 13వ తేదీ వరకు ప్రాంగణాన్ని సందర్శించడానికి విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలకు అనుమతిచ్చింది. ప్రధాన వేదిక పక్కన ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శనివారం ముగింపు సందర్భంగా ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, స్పీడీ సీఈఓ ఈవీ నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. భవిష్యత్ శ్రేయస్సుకు వర్తమాన పద్ధతులు, రైతుల ఆదాయాన్ని పెంచడానికి అరుదైన వ్యూహ్యం అనే అంశంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సెంటర్ ఫర్ సస్టేయినబుల్పై అగ్రికల్చర్ డైరెక్టర్ జీవి రామాంజనేయులు, విశ్రాంత ఐఏఎస్ ఎంవీ రెడ్డి, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎస్డీ శిఖామణి, పార్మర్స్ కార్పొరేషన్ ఫౌండర్ సీఎస్ రెడ్డి, అగ్రి బిజినెస్, అగ్రిటెక్ నిపుణుడు విజయ్ నడిమింటి తదితరులు చర్చించారు. గ్రామీణ తెలంగాణను పట్టణ ప్రాంతానికి అనుసంధానించడం అనే అంశంపై వీసీ డి.రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్.నర్సింహారెడ్డి తదితరులతో చర్చా గోష్టి నిర్వహించారు. రైతు సంఘం నాయకులు అన్వేష్రెడ్డి, నల్ల వెంకటేశ్వర్లు, ఆదర్శ మహిళా రైతు లావణ్య తదితరులు వ్యవసాయంపై నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొన్నారు. గాయని మంగ్లీ పాటలతో అలరించగా, కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. చివరిరోజు తరలివచ్చిన సందర్శకులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు -
ఉప్పల్.. ఉర్రూతల్
అభిమానుల కేరింతలతో హోరెత్తిన స్టేడియం సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం మెస్సీ మంత్రం జపించింది. గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది. దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్ స్టేడియం ఉర్రూతలూగింది. గోట్ పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్కు వచ్చిన మెస్సీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొ న్నా రు. అనంతరం ఆయన ఉప్పల్ స్టేడియానికి వచ్చా రు. అభిమాన క్రీడాకారుణ్ని ఒక్కసారైనా దూరం ను ంచైనా చూడాలని అభిమానులు పోటెత్తారు. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ఉప్పల్ స్టేడియంలో తన ఆటతో మైమరిపించారు. వీవీఐపీలు, ఫుట్బాల్ ప్రేమికులు, మెస్సీ అభిమానులు దిగ్గజ క్రీడాకారుణ్ని చూసేందుకు పోటీపడ్డారు. స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకుల కేరింతల మధ్య కోలాహలంగా సాగింది. మ్యూజిక్.. మ్యాజిక్.. ఫుట్బాల్ మ్యాచ్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకుడు రాహుల్ సిప్లీగంజ్, గాయని మంగ్లీ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఆస్కార్ పాట నాటు.. నాటు పాట పాడుతూ సిప్లీగంజ్ అభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీతో పాటు వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఈ పాటకు ఊగిపోయారు. ఎన్నడూ లేనివిధంగా స్టేడియంలో లైట్లు, లేజర్ షో ఏర్పాటు చేశారు. ఈ షో ఆదంత్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఫోక్ సాంగ్స్ తో మంగ్లీ మెస్మరైజింగ్ షో అదరగొట్టింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీతారలు సైతం స్టేడియంలో సందడి చేశారు. ఫలించిన పోలీసుల వ్యూహం.. ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ రాక సందర్శంగా శనివారం మధ్యాహ్నం నుంచే ఉప్పల్ స్టేడియం దారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. టికెట్, పాస్లున్న వారిని స్డేడియంలోనికి మూడు గంటలు ముందుగానే అనుమతించడంతో పొలీసులు వ్యూహం ఫలించింది. మ్యాచ్ను తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. కాగా.. గతంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను సమర్థంగా నిర్వహించిన రాచకొండ పోలీసులు అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ తదితర వ్యూహాలు ఫలించాయి. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషం. రాచకొండ సీపీ సుధీర్ బాబు పిలుపు మేరకు అభిమానులు క్రమశిక్షణతోనే మెలిగారు. పాసులు లేనివారు స్టేడియం వైపు రాకపోవడం గమనార్హం. స్టేడియంలోకి అభిమానులంతా దాదాపుగా మెస్సీ టీ షర్ట్ను ధరించి వెళ్లడం కనిపించింది. మెస్సీ పర్యటన సాగిందిలా.. సాయంత్రం 4:35 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన మెస్సీ 5:28: ఫలక్నుమా ప్యాలెస్కు రాక ● 7:31: ఫలక్నుమా నుంచి ఉప్పల్కు.. ● రాత్రి 8.33 పెనాల్టీ షూట్ అవుట్ ● 8.38: మైదానంలో మెస్సీ పరేడ్ వాక్.. పాల్గొన్న రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడాకారులు ● 8.48 : వేదికపై మెస్సీతో ప్రముఖుల పరిచయం ● 8.51: మెస్సీతో ఫొటో సెషన్ ● 8.53 ముగిసిన మ్యాచ్.. విజేతకు బహుమతి ప్రదానం చేసిన మెస్సీ ● 8.54: మెస్సీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన సత్కారం ● 8.55– ఇతర క్రీడాకారులకు సన్మానం, కార్యక్రమం ముగింపు ● 9:26: తాజ్ ఫలక్నుమాకు చేరుకున్న మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానులుస్టేడియంలో లేజర్ షో వెలుగు జిలుగులుమెస్సీ, సీఎం ఫ్రెండ్లీ మ్యాచ్ దిగ్విజయం ఫుట్బాల్ ఆటతో అలరించిన ద్వయం ప్రేక్షకుల ఉత్సాహంతో ఆద్యంతం కోలాహలం -
మన పబ్బులెంత భద్రం.?
బంజారాహిల్స్: నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ నెల 31న జరగనున్న ఈ వేడుకల కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 150కి పైగా పబ్లు, క్లబ్లు, నైట్ క్లబ్లు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశాయి. ఇప్పటికే కలర్ఫుల్ థీమ్లతో ఆకట్టుకునే కార్యక్రమాలతో ఉర్రూతలూగించే బ్యాండ్తో హైలెట్గా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. సెలబ్రిటీలు, అంతర్జాతీయ డీజేలను రప్పించి ఈ వేడుకలకు సరికొత్త ఆకర్షణ తీసుకొచ్చేందుకు వీరు సిద్ధమయ్యారు. అయితే వారం రోజుల క్రితం గోవాలోని ఓ నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగి 25 మంది మృతి చెందారు. అక్కడ ఫైర్ ఎక్విప్మెంట్ లేకపోవడంతో పాటు భద్రతాపరంగా లోపాలు ఈ ప్రమాదానికి కారణమని నిపుణులు నిర్థారించారు. మరి గ్రేటర్ పరిధిలోని మన పబ్లు, నైట్క్లబ్లు ఎంత వరకు భద్రంగా ఉన్నాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రూ.లక్షలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించే పబ్లు, నైట్ క్లబ్ల నిర్వాహకులు తమ ప్రాంగణాల్లో మాత్రం ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవడంలో చేతులెత్తేస్తున్నారు. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్లు, ఎకై ్సజ్ పోలీసులు మద్యం లైసెన్స్లు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేడుకలకు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటుండగా పబ్లు, నైట్ క్లబ్లలో భద్రతపై మాత్రం దృష్టి సారించడం లేదు. పలు పబ్లలో ఇప్పటికీ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోకపోవడం గమనార్హం. ఏదైనా ఘటన జరిగితే చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గోవా ఘటన జరిగినప్పుడే అధికారులు మేల్కొని ఆయా పబ్లు, క్లబ్లలో తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికీ వాటి ఊసెత్తడం లేదు. సుమారు 80 శాతం పబ్లలో ఫైర్ ఎక్విప్మెంట్స్ లేనట్లు సమాచారం. వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్వాహకులు ముందుకు రావడం లేదు. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి ఇచ్చే ముందు ఫైర్, ఎకై ్సజ్,జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల నుంచి అనుమతుల పత్రాలు, ఎన్ఓసీలు చూపించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో శాఖ ఒక్కో అనుమతి పత్రం ఇస్తుండటంతో నిర్వాహకులు తెలివిగా తప్పించుకుంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడే సంబంధిత అధికారులకు నిబంధనలు గుర్తుకు వస్తున్నాయి. హడావిడిగా వెళ్లి అనుమతులు పరిశీలిస్తున్నారు. అంతస్తులను బట్టి అనుమతులు.. అవుటర్ రింగ్ రోడ్ లోపల 15 మీటర్ల ఎత్తు నిర్మాణాలకు హైడ్రా ఫైర్ స్టేఫ్టీ అనుమతులు ఇస్తోంది. అంతకుమించి ఉంటే నేరుగా ఫైర్ డిపార్ట్మెంటే అనుమతి ఇవ్వాల్సి ఉంది. దీనిని సాకుగా చూపి సదరు పబ్ల నిర్వాహకులు తప్పించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా అన్ని పబ్లు, నైట్ క్లబ్లు వేలాది మంది యువతను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గోవా తరహా సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక వైపు హైడ్రా, ఇంకో వైపు పోలీసు, మరో వైపు ఫైర్ అధికారులు వీటిపై తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫైర్ ఎక్విప్మెంట్తో పాటు ఫైర్ లైసెన్స్ లేని పబ్లను సీజ్చేయాల్సిన అవసరం ఉంది. ఒక వేళ అగ్ని మాపక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోతే వెంటనే వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటూ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.80 శాతం పబ్లకు లేని ఫైర్ సేఫ్టీ పట్టించుకోని అధికారులు చేతులెత్తేస్తున్న పోలీసులు, ఇష్టానుసారంగా అనుమతులు -
కొత్తబండికీ కొర్రీలు
దళారుల ద్వారా వస్తే సరే...లేదంటే వెనక్కిసాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరికి చెందిన సదానంద్ రెండు రోజుల క్రితం తన కొత్త ద్విచక్ర వాహనం శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఉప్పల్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో సంప్రదించారు. నిబంధనల మేరకు స్లాట్ నమోదు చేసుకుని వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలతో వెళ్లారు. కానీ బండి నమోదుకు అవసరమైన మొత్తం పత్రాలు లేవంటూ తిప్పి పంపించారు. దాంతో అతడు మరోసారి షోరూమ్లో సంప్రదించాల్సి వచ్చింది. వాహనానికి సంబంధించిన తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)పత్రాలతో పాటు ఇన్వాయీస్, బీమా పత్రాలు సహా అన్నింటిని మరోసారి పరిశీలించుకుని ఆధార్, పాన్కార్డుతో పాటు చిరునామా ధృవీకరణ కోసం వంటగ్యాస్ కనెక్షన్ పత్రాలను కూడా తీసుకుని మరోసారి ఉప్పల్ ఆర్టీఏకు వెళ్లారు. వంట గ్యాస్ పత్రాలు ఒరిజినల్ కావాలంటూ మరోసారి మెలిక పెట్టి వెనక్కి పంపించారు. ఇది ఒక్క ఉప్పల్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మాత్రమే కాదు, గ్రేటర్ హైదరాబాద్లోని చాలా చోట్ల ఇదే పరిస్థితి. అన్ని రకాల డాక్యుమెంట్లతో స్వయంగా వెళ్లే వాహనదారులను ఆర్టీఏ సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏజెంట్లు, దళారుల ద్వారా వెళ్లేవారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. పాన్కార్డు, ఆధార్ వంటి బలమైన ధృవీకరణ పత్రాలు ఉన్నప్పటికీ ఏదో ఒక నెపంతో కొర్రీలు వేసి వేధింపులకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన కొత్త వాహనాలకు ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. షోరూమ్లలోనూ చేతివాటమే... ఆర్టీఏ కార్యాలయాల్లోనే కాకుండా వాహనాల షోరూమ్లలోనూ కొత్త బండ్లపైన చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హ్యాండ్లింగ్ చార్జీల పేరిట, యాక్సెసరీస్ పేరిట బైక్లు, కార్లు, తదితర వాహనాలపై రూ.5000 నుంచి రూ.20 వేల వరకు అదనపు దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణంగా వాహనం కొనుగోలు సమయంలోనే జీవితకాల పన్నుతో పాటు, ఆర్టీఏ కార్యాలయంలో బండి శాశ్వత నమోదు ఫీజులను కూడా షోరూమ్లోనే చెల్లిస్తారు. మరో రూ.3000 అదనంగా వసూలు చేసి షోరూమ్ నుంచి ఏజెంట్ను ఏర్పాటు చేస్తారు. నిజానికి కొత్త వాహనానికి అన్ని పత్రాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఏజెంట్ల అవసరం ఉండదు. వాహనదారులు బండి కొనుగోలు చేసిన తర్వాత నెల రోజుల వ్యవధిలో తమకు వీలైనప్పుడు స్లాట్ నమోదు చేసుకుని ఆర్టీఏ అధికారులను సంప్రదించవచ్చు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి సదరు వాహనం చాసీస్ నెంబర్, ఇంజన్ నెంబర్, తదితర వివరాలను, డాక్యుమెంట్లను పరిశీలించి శాశ్వత నమోదుకు అవకాశం కల్పించాలి. షోరూమ్ ఏజెంట్లు లేదా దళారులకు రూ.3000 నుంచి రూ.5000 వరకు చెల్లించి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. కానీ ఏజెంట్లతో కాకుండా స్వయంగా వెళ్లే వాహనదారులకు మాత్రం ఏదో ఒక పత్రం లేదంటూ (అన్నీ ఉన్నా) వేధించి వెనక్కి పంపిస్తారు. దీంతో సదరు వాహనదారుడు అనివార్యంగా ఏజెంట్ను లేదా దళారిని ఆశ్రయించాల్సి వస్తుంది. సిటీలో 2500 నుంచి 3000 లకు పైగా వాహనాలు నమోదవుతున్నాయి. అన్ని రకాల పత్రాలున్నా ఏదో ఒక సాకుతో వేధింపులు గ్రేటర్లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఇదే దందా... షోరూమ్లలో శాశ్వత నమోదుకు అవకాశం లేకపోవడమే కారణం... షోరూమ్ రిజిస్ట్రేషన్లు ఏమైనట్లు.. కేంద్రం అమల్లోకి తెచ్చిన రహదారి భద్రతా చట్టంలో కొత్త వాహనాలకు షోరూమ్లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలని సూచించారు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో నాలుగైదేళ్లుగా షోరూమ్లలోనే వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్ను కూడా అమర్చి బండిని కొనుగోలుదారుడికి అప్పగిస్తున్నారు. ఒకసారి వాహనం కొనుగోలు చేసిన తరువాత పదే పదే ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఈ సదుపాయాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.కొన్ని రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణలోనూ నాలుగేళ్ల క్రితమే రవాణా అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచకపోవడం గమనార్హం. -
నడక దారుల కోసం..
ఆధునిక సాంకేతికతతో అధ్యయనం ● సీఆర్ఎంపీ రెండో దశలో 3,805 లేన్ కిలోమీటర్ల పనులు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కాంట్రాక్టు ముగిసి దాదాపు ఏడాది కావస్తోంది. తిరిగి కాంట్రాక్టు ఏజెన్సీని నియమించలేదు. రెండో దశ కింద ప్రధాన రహదారుల్లోని రోడ్లే కాక, ఇతరత్రా ముఖ్యమైన రోడ్లను సైతం కలిపి అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అందుకయ్యే వ్యయం, తదితరాలను పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ అనుమతి రాగానే తిరిగి కాంట్రాక్టు కోసం ఏజెన్సీలను ఆహ్వానించనున్నారు. ఈసారి ప్రధాన రహదారుల్లోని బీటీ రోడ్లే కాక సీసీ, వీడీసీసీ ఇతరత్రా రోడ్లను సైతం సీఆర్ఎంపీ కిందకు తేనున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలకు రహదారులతో పాటు పాదచారులు నడిచేందుకు నడకదారులు కూడా బాగుండాలనే తలంపుతో ఉన్నారు. అందుకుగాను రోడ్ల పనులు చేపట్టేనాటికే నడకదారుల సామర్థ్యం తదితరమైవి తెలుసుకోవడంతో పాటు కొత్తగా నడకమార్గాలు వచ్చే ప్రాంతాల్లోనూ నేల స్వభావం తదితరమైనవి తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతికత వినియోగంతో సర్వే చేయాలని భావిస్తున్నారు. సర్వే నిర్వహించేందుకు ముందుకొచ్చే సంస్థల కోసం ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలం మన్నికగా ఉండేలా.. సర్వే కోసం నెట్వర్క్ సర్వే వె హికల్ (ఎన్ఎస్వీ–3డీ) ఫాలింగ్ వెయిట్ డిఫ్లెక్టోమీటర్(ఎఫ్డబ్ల్యూడీ), గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) వంటి ఆధునిక సాంకేతికత వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దీర్ఘకాలిక నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేయాలనేది లక్ష్యం. నగరంలో వాహన రద్దీ పెరిగిపోవడం, వివిధ యుటిలిటీల కోసం రోడ్లను తరచూ తవ్వుతుండటం వంటి పనులతో రోడ్లు, నడకమార్గాలు కూడా తరచూ దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో రోడ్ల పరిస్థితులను కూడా అంచనా వేసి దీర్ఘకాలం మన్నిక ఉండేలా నడకమార్గాలు నిర్మించేందుకు సాంకేతిక సర్వేకు సిద్ధమయ్యారు. దాదాపు 3,805 లేన్ కిలోమీటర్ల మేరకు నడక మార్గాల కోసం ఆధునిక సాంకేతికతతో సర్వే జరిపించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
రెండో విడతకు రె‘ఢీ’
● చేవెళ్ల, కందుకూరు డివిజన్లలో ఎన్నికలు ● పోలింగ్, కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి నేడు రంగారెడ్డి జిల్లాలో మలిదశ పంచాయతీ పోరు ఆమనగల్లు/చేవెళ్ల: రెండో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. కందుకూరు డివిజన్లోని 3 మండలాలు, చేవెళ్ల డివిజన్లో 4 మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల పరిధిలోని 61 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆమనగల్లు మండలంలో 13 సర్పంచ్ స్థానాలకు గాను ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా మిగిలిన 12 చోట్ల 40 మంది అభ్యర్థులు, 112 వార్డులకు 20 ఏకగ్రీవం కాగా 92 స్థానాలకు 258 మంది పోటీలో ఉన్నారు. కడ్తాల్ మండలంలో 24 సర్పంచ్ స్థానాలకు నాలుగు ఏకగ్రీవం కాగా 20 సర్పంచ్ స్థానాలకు 59 మంది, 210 వార్డులకు 52 వార్డులు ఏకగ్రీవం కాగా 158 స్థానాలకు 453 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. తలకొండపల్లి మండలంలో 32 పంచాయతీలకు 3 ఏకగ్రీవం కాగా మిగిలిన 29 సర్పంచ్ స్థానాలకు 85 మంది, 272 వార్డులకు గాను 49 వార్డులు ఏకగ్రీవం కాగా 223 వార్డులకు 567 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చేవెళ్ల డివిజన్ పరిధిలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండలాల్లో 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చేవెళ్ల మండలంలో 25 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 23 పంచాయతీలకు 68 మంది అభ్యర్థులు, మొయినాబాద్ మండలంలో 19 పంచాయతీ సర్పంచ్లకు 59 మంది, షాబాద్లో 41 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా 40 గ్రామాల్లో 111 మంది అభ్యర్థులు, శంకరపల్లి మండలంలో 24 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 22 చోట్ల సర్పంచ్ పదవికి 64 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చేవెళ్ల మండలంలో 183 వార్డులకు 469 మంది అభ్యర్థులు, మొయినాబాద్ మండలంలో 157 వార్డులకు 434 మంది, షాబాద్ మండలంలో 305 వార్డులకు 794 మంది, శంకర్పల్లి మండలంలో 188 వార్డులకు 463 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద శనివారం సిబ్బందికి అధికారులు సామగ్రి అప్పగించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈమేరకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కడ్తాల్: ఎన్నికల సిబ్బందికి సామగ్రి అందజేస్తున్న అధికారులు ఎన్నికలు జరగనున్న మండలాలు: 7 మొత్తం సర్పంచ్ స్థానాలు: 165 మొత్తం వార్డు స్థానాలు: 1,306 బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 499 పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు: 3,508 పోలింగ్ సమయం: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు -
మెట్లబావిలో తాబేళ్ల మృత్యువాత
కాలుష్యమయంగా మారిన పురాతన బావి ● పట్టించుకోని ఉద్యాన శాఖ అధికారులునాంపల్లి: పబ్లిక్ గార్డెన్లోని అతి పురాతన మెట్లబావి కాలుష్యమయంగా మారింది. తాబేళ్లకు ప్రాణ సంకటమైంది. అయినా ఉద్యాన శాఖ అధికారుల్లో చలనం లేకుండాపోయింది. సంరక్షణ చర్యలు చేపట్టడంలో ఈ శాఖ విఫలమైంది. తెలంగాణ శాసన మండలి ప్రవేశ ద్వారం సమీపంలోని మెట్ల బావి ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో నిండి ఉండేది. ప్రస్తుతం ఈ బావిలో మురుగునీరు వచ్చి చేరింది. మంచినీటి ఊట బావిలో లక్డీకాపూల్ నుంచి వచ్చే మురుగునీటి కాల్వ నీరు మెట్లబావిలోకి వచ్చి చేరుతోంది. ఈ కాలుష్యంతో గత ఏడాది పబ్లిక్ గార్డెన్ చెరువులో సుమారు 70 చేపలు, 22 తాబేళ్లు చనిపోయాయి. ప్రస్తుతం పదుల సంఖ్యలో తాబేళ్లు చనిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. తాబేళ్లు చనిపోవడాన్ని చూసిన వాకర్లు, సందర్శకులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాల్సిన ఉద్యాన శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కార్యాలయం పక్కనే ఉన్న మెట్ల బావిని కూడా పరిరక్షించలేని స్థితిలో ఉన్నారని విమర్శిస్తున్నారు. వీటికి తోడు పార్కులో ప్రవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది బస్సులు పార్కింగ్ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చేశారు. ఈ విషయములో ఉద్యాన శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాబేళ్ల మృత్యువాత ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. -
సబ్సిడీ.. ‘గ్యాసేనా’
అర్హత సాధించినా రాయితీ వర్తించని వైనం సాక్షి, సిటీబ్యూరో: సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే రూ.500కు ఎల్పీజీ సిలిండర్ వర్తింపు ఉత్తుత్తి ‘గ్యాస్’గా తయారైంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్హత సాధించినా.. సబ్సిడీ సిలిండర్ మాత్రం వర్తించడం లేదన్న ఆవేదన పేద కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. దీంతో బహిరంగ మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ రీఫిల్ కొనుగొలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనకు రెండేళ్లు కావస్తున్నా.. కొందరికే సబ్సిడీ భాగ్యం కలుగుతోంది. మరోవైపు కొన్ని కుటుంబాలకు సబ్సిడీ వర్తించినా సబ్సిడీ నగదు మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ మూణ్నాళ్ల ముచ్చటగా తయారవుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం స్లాబ్కు పరిమితమై కేవలం రూ.40.71 మాత్రమే నగదు బదిలీగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. మహాలక్ష్మి పథకం వర్తిస్తే.. ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద అర్హత సాధించిన కుటుంబాలకు మాత్రం సిలిండర్ ధరలో రూ.500, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తూ అవుతోంది. తాజాగా సిలిండర్లపై కొద్ది మందికి మాత్రమే సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. మిగతా వారికి జమ కావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పష్టత కరువు.. వంట గ్యాస్ సబ్సిడీ నగదు జమ కొన్ని లబ్ధి కుటుంబాలకు నిలిచిపోవడంపై పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. సిలిండర్ల వినియోగం దాటడమే సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తింపజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడేళ్ల పాటు వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గరిష్టంగా ఏటా ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. లబ్ధిదారుల సిలిండర్ల సంఖ్య ఎనిమిది పరిమితి దాటనప్పటికి.. గతంలో వినియోగించిన సంఖ్యను తక్కువగా ఉంటే దాటి ప్రకారమే సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు సమాచారం. ఆరు లక్షలు మించలే.. మహా హైదరాబాద్ పరిధిలో సుమారు 40 లక్షలపైగా గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో ఆరు లక్షల కుటుంబాలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం కనెక్షన్దారుల్లో సుమారు 24 లక్షల కుటుంబాలు ప్రజాపాలనలో రూ. 500కు వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 12 లక్షల వరకు దరఖాస్తులు అర్హత సాధించినా.. వర్తింపు మాత్రం 50 శాతం మించలేదు. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్ వర్తిస్తునప్పటికీ.. వంటగ్యాస్ సబ్సిడీ మాత్రం అందని ద్రాక్షగా మారింది. కొంత మందికే వంటగ్యాస్ సిలిండర్ మిగతా వారికి మూణ్నాళ్ల ముచ్చటగానే.. సంబంధిత అధికారులకూ స్పష్టత కరువు ఇదీ ఆరు గ్యారంటీల లబ్ధిదారుల పరిస్థితి త్రిశంకు స్వర్గం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం -
12 జోన్లు.. 60 సర్కిళ్లు
డీలిమిటేషన్పై ఆందోళనలు.. కొనసాగుతున్న అభ్యంతరాలు సాక్షి, సిటీబ్యూరో ఇటీవల విలీనమైన స్థానిక సంస్థలు సహా హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ను 300 వార్డులు (కార్పొరేటర్ డివిజన్)గా డీలిమిటేషన్కు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన అధికార యంత్రాంగం, తదుపరి దశలో చేయాల్సిన సర్కిళ్లు, జోన్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 వార్డులుండగా, 30 సర్కిళ్లు, 6 జోన్లు ఉండటం తెలిసిందే. వార్డులు 150 నుంచి 300కు పెరిగి రెట్టింపు కాగా, సర్కిళ్లు, జోన్లు సైతం రెట్టింపు కానున్నాయి. మొత్తం 60 సర్కిళ్లు, 12 జోన్లుగా జీహెచ్ఎంసీ పరిపాలన సాగనుంది. ఈమేరకు కసరత్తు జరుగుతోందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. ఆందోళనలు.. అభ్యంతరాలు విస్తరించిన జీహెచ్ఎంసీని 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరిస్తూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్పై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా వచ్చిన వార్డుల్లో కొన్నింట్లో వార్డు పేరు తప్ప ఆ ప్రాంతం లేదంటూ బాకారం వార్డును ప్రస్తావించారు. కొందరు కాచిగూడ బదులు వార్డు పేరు బర్కత్పురా కావాలని కోరినట్లు తెలిసింది. ఇంకొందరు సరిహద్దులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న వార్డులకు సంబంధించిన మ్యాపులు లేకపోవడం. వార్డుల వివరాలు కూడా ఆంగ్లంలో తప్ప తెలుగులో లేకపోవడంతో అందరికీ అర్థం కావడం లేదని నిరసనలు వ్యక్తం చేశారు. కమిషనర్ కర్ణన్ను కలిసిన కమలం నేతలు వార్డుల విభజనపై బీజేపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్ర బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతమ్రావు, ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, పార్టీ నేతలు సి.కృష్ణయాదవ్, చింతల రామచంద్రారెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి తదితరులు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. విలీనం, డీలిమిటేషన్ అత్యంత తొందరపాటుతో పారదర్శకత లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్లోని 300 వార్డుల మ్యాపులను వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్కు ఏ విధానం అనుసరించారో పబ్లిక్ డొమైన్లో లేకపోవడం తగదని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా జరగాల్సిన ప్రక్రియ అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. అధికార పార్టీ అండదండలతో ఒకపార్టీ నేతలు ప్రభావం చూపారని ఆరోపించారు. ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు కమిషనర్ పాలకమండలి అభ్యంతరాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా నిబంధనలున్నప్పటికీ, పాటించలేదని, వార్డులవారీగా జనాభా, ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు ఇవ్వాలని కోరారు. 16న పాలకమండలి ప్రత్యేక సమావేశం శివారు స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ విస్తరణ, కలిసిన పరిధి మేరకు వార్డుల పునర్విభజన అంశాలకు సంబంధించి జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యుల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకునేందుకు ఈ నెల 16న పాలకమండలి ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈమేరకు సభ్యులకు సమాచారం పంపారు. వార్డుల మ్యాపులు, తెలుగులో వివరాలు లేకపోవడంపై నిరసనలు వార్డు పేరు మార్పు కోసం వినతులు జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసిన బీజేపీ నేతలు -
పొల్యూషన్ కంట్రోల్ తప్పుతోంది
నగరంలో మూడేళ్ల గరిష్టానికి వాయు కాలుష్యం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వాయు కాలుష్యం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారుతోంది. ఈ ఏడాది 12 శాతం వాయు కాలుష్యం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. పీఎం 10, పీఎం 2.5 ధూళి కణాల సంఖ్య నగరంలోని ఏ ప్రాంతంలో చూసినా కనీసం 150 నుంచి 265 మధ్య కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ గాలి పీల్చడం వల్ల రోజుకు 4.4 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు సంతాన సమస్యలకు కారణమవుతోందని పేర్కొంటున్నారు. విమర్శల పాలవుతున్న పీసీబీ.. నగరంలో వాయు కాలుష్య నివారణకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ)లో భాగంగా 2019 జనవరిలో రూ.614 కోట్లు మంజూరయ్యాయి. 2017తో పోల్చితే 2026 నాటికి గాలిలో పీఎం 10 ధూళి కణాలు కనీసం 40 శాతం తగ్గించాలన్నది ఈ పథకం లక్ష్యం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) రూ.561 కోట్ల నిధులు ఖర్చు చేసినా సాధించిన పురోగతి మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. 2020లో నగర వాయు నాణ్యత సూచీ 100 (ఏక్యూఐ) ఉండగా 2025లో ఏక్యూఐ 100గానే నమోదు కావడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డిసెంబర్ నెల ఏక్యూఐ 178గా నమోదైంది. గతంలో 2021 డిసెంబరులో 155గా నమోదు కావడమే గరిష్టంగా ఉండేది. ఆ రికార్డులను చెరిపేస్తూ వాయు వేగంతో గాలి కాలుష్యం దూసుకెళుతోంది. దీంతో రూ.వందల కోట్ల నిధులు వృథాగా గాలిలో కలిపేసినట్లైందన్న విమర్శలను పీసీబీ మూటగట్టుకుంటోంది. ● కాలుష్య నియంత్రణ మండలి గాలి నాణ్యత లెక్కలకు రహదారిపై వెళ్లే మోటారు సైకిల్, ఆటో, బస్సు ప్రయాణికులు, నడిచి వెళ్లే వ్యక్తులు పీల్చిన గాలిలో ఉన్న ధూళి కణాల (పీఎం 2.5, పీఎం10) లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. అధికారులు రహదారికి కొంత దూరంలో యంత్ర పరికరాలు అమర్చుతున్నారు. దీంతో రహదారిపై ప్రయాణించే సగటు ప్రయాణికుడు పీల్చే గాలి నాణ్యతకు కొలమానం లేకుండా పోయింది. రహదారిపై వాహనాలు రాకపోకలు సాగించే క్రమంలో గాలిలో ఎగిరిన ధూళి కణాలు పీసీబీ అమర్చిన సీఏఏక్యూఎంఎస్ వరకు వెళ్లేసరికి వాటి సాంద్రత గణనీయంగా తగ్గిపోతోంది. రహదారి పక్కనే వాయు నాణ్యత కొలిచే పరికరాలు అమర్చినట్లైతే భయంకరమైన గణాంకాలు వెలుగు చూస్తాయని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. పీసీబీ అధికారులు మాత్రం పరిసర ప్రాంతాల వాయు నాణ్యతను కొలవడానికి ఇలా ప్రశాంతమైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నామని సమర్థిచుకుంటున్నారు. అయితే.. కొన్ని కేంద్రాల్లో పీఎం 10, మరికొన్ని కేంద్రాల్లో పీఎం 2.5 గణాంకాలు నమోదు కావడం లేదు. కొన్ని ప్రాంతాలకే పరిమితం.. నగరంలో పీసీబీకి 14 ప్రాంతాల్లోనే వాయు నాణ్యత కొలిచే వ్యవస్థ ఉంది. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా అది లెక్కలోకి రావడంలేదు. పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల సంఖ్య, నిర్మాణ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. సికింద్రాబాద్– మెహిదీపట్నం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్ –విజయవాడ, ఉప్పల్– వరంగల్, హైదరాబాద్– బీజాపూర్, ఇతర జాతీయ రహదారులపై గాలి నాణ్యత కొలిచే పరిస్థితి కనిపించడం లేదు. మణికొండ, బండ్లగూడ జాగీర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్ ఇతర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉంటోంది. ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యత కొలిచే పరిస్థితి కనిపించడం లేదు. రూ.వందల కోట్లు కరుగుతున్నా ఫలితం శూన్యం ప్రమాదకర స్థితిలో గాలి నాణ్యత సూచీ ఈ ఏడాది 12 శాతం పెరుగుదల నమోదు రూ.561 కోట్లు ఖర్చు చేసినా లక్ష్యసాధనలో వెనకబాటే.. సంవత్సరాల వారీగా వాయు నాణ్యత సూచీ ఇలా.. సంవత్సరం ఏక్యూఐ 2020 100 2021 105 2022 104 2023 95 2024 89 2025 100 నగరంలో ప్రాంతాలవారీగా ఇటీవల నమోదైన కాలుష్య వివరాలు ప్రాంతం పీఎం 2.5 పీఎం 10 మలక్పేట్ 264 135 బొల్లారం 190 154 పటాన్చెరు 187 155 సనత్నగర్ 185 ––– నాచారం 185 ––– సోమాజిగూడ 170 150 జూపార్క్ 157 153 -
హెచ్ఎండీఏ డీలా..
జీహెచ్ఎంసీ విస్తరణతో ప్రతిష్టంభనసాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ విస్తరణతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఐదంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించే భవనాలు, హైరైజ్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, భారీ వెంచర్లు తదితర నిర్మాణరంగ అనుమతులన్నీ హెచ్ఎండీఏ నుంచే అందజేస్తున్నారు. త్వరలో ఈ అధికారాలన్నీ జీహెచ్ఎంసీకి బదిలీ కానున్నాయి. దీంతో హెచ్ఎండీఏ ఆదాయం భారీగా పడిపోనుంది. అధికారులు, ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలు సహా హెచ్ఎండీఏ చేపట్టే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నిర్మాణ రంగానికి ఇచ్చే అనుమతులపైనే హెచ్ఎండీఏకు ప్రతి ఏటా దాదాపు రూ.1200 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. కొన్ని సందర్భాల్లో రూ.1500 కోట్లకు పైగా కూడా లభించింది. ఇలా ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంతోనే ఉద్యోగుల జీతభత్యాలతో పాటు పార్కులు, రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఔటర్ రింగ్రోడ్డు నుంచి రీజినల్రింగ్ రోడ్డు వరకు చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లతో పాటు, ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు, సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్లను సైతం హెచ్ఎండీఏ సొంతంగానే చేపట్టింది. ఈ ప్రాజెక్టులకన్నింటికీ నిధుల కొరత తలెత్తే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రియల్ భూమ్ అంతా అక్కడే.. విస్తరణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధి 650 చ.కి.మీ. నుంచి సుమారు 2000 చ.కి.మీ.లకు పైగా పెరగనుంది. దీంతో ఇప్పటి వరకు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ తదితర జోన్లలోని కీలకమైన ప్రాంతాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్తాయి. రియల్ ఎస్టేట్ వర్గాలు, నిర్మాణరంగ సంస్థలు మొదలుకొని సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు జీహెచ్ఎంసీ నుంచే అన్ని రకాల అనుమతులు పొందవచ్చు, మరోవైపు ఉప్పల్ భగాయత్, మేడిపల్లి, బాచుపల్లి, హయత్నగర్, తొర్రూరు తదితర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ సొంత భూముల్లో వేసిన లేఅవుట్లకు సైతం భారీ స్పందన లభించింది. ఇలా అన్ని విధాలుగా వచ్చిన ఆదాయ మార్గాలన్నీ హెచ్ఎండీఏ నుంచి జీహెచ్ఎంసీకి మారనున్నాయి. జీత భత్యాలు కష్టమే.. ‘హెచ్ఎండీఏలోని వివిధ విభాగాల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా సుమారు రూ.70 కోట్లకు పైగా జీతభత్యాలు, ఇతర ఖర్చుల చెల్లింపులకే వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పుడు 90 శాతానికి పైగా జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లడంతో జీతభత్యాల చెల్లింపు ఒక సవాల్గా మారనుంది’అని ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధికి వెలుపల అంటే సుమారు 2000 చ.కి.మీ దాటిన తర్వాత చేపట్టే నిర్మాణాలు మాత్రమే హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఆ దిశగా నిర్మాణరంగం విస్తరించేందుకు మరో 5 నుంచి 10 ఏళ్లు పట్టవచ్చు’ అని ఆయన వివరించారు. హెచ్ఎండీఏ వద్దనే డెలిగేషన్ పవర్స్.. జీహెచ్ఎంసీ విస్తరణ, డివిజన్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఒక వైపు వేగంగా కొనసాగుతున్నాయి. కానీ నిర్మాణ అనుమతులు, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన డెలిగేషన్ పవర్స్ మాత్రం ఇంకా హెచ్ఎండీఏ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన హెచ్ఎండీఏ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగిన తర్వాతనే అధికారాల బదిలీ జరగనుందని అధికారులు తెలిపారు. వార్డుల సంఖ్య పెరగడంతో భారీగా పడిపోనున్న ఆదాయం నిర్మాణ అనుమతులపై ఏటా రూ.1200 కోట్లు ఈ రాబడికి సైతం గండిపడే అవకాశం ఉద్యోగుల జీతభత్యాలకూ గడ్డు కాలమే -
వరకట్న వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
ఉప్పల్: వరకట్న వేధింపుల కారణంగా ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది..ఉప్పల్ పోలీసులు తెలిపిన మేరకు.. సూర్యపేట జిల్లా తిరుమలగిరి ప్రాంతానికి చెందిన శ్రీహరి కూతురు శ్వేతశ్రీ (28) వివాహం జూన్ నెల జనగాం జిల్లా దేవరుప్పల ప్రాంతానికి చెందిన దామెర శ్రీనివాస్తో వివాహాం జరిగింది. వివాహ సమయంలో రూ.10 లక్షల కట్నం ఇచ్చారు. దంపతులు రామంతాపూర్ ఆర్టీసి కాలనీలో నివాసముంటున్నారు.కొంత కాలం నుంచి శ్రీనివాస్ అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే విషయాన్ని శ్వేత తల్లిదండ్రులకు చెప్పి బాధపడేది.ఈ క్రమంలో ఈ నెల 10న ఇంట్లోని హాల్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వచ్చి స్థానికుల సహకారంతో కిందికు దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తన అల్లుడి వరకట్న వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
చలి వేళ.. మూగజీవాలకు వెచ్చగా!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో జంతువులకు వెచ్చదనం కలిగించేలా నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలి నుంచి జంతువులను రక్షించడానికి హీటర్లు, షేడ్ నెట్లు, చెక్క పలకలు, ఇన్సులేటెడ్ షెల్టర్లు, అత్యధిక వెలుగునిచ్చే బల్బులు ఏర్పాటు చేశారు. బయటి ఉష్ణోగ్రతల కంటే జూలో 3–5 డిగ్రీలు తక్కువగానే ఉంటుంది. ఇటీవల జూలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గది హీటర్లు సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పనిచేసేలా ఏర్పాటు చేశారు. కొన్ని ఎన్క్లోజర్ల చుట్టూ మందపాటి గోనెసంచులను చుట్టి వుంచారు. కొన్నింట్లో చెక్క పలకలపై జంతువులు విశ్రాంతి తీసుకునేలా చూస్తున్నారు. నిత్యం వైద్యపరీక్షలు చలి ప్రభావం నుంచి తట్టుకునేలా జంతువులు ఉండే ఎన్క్లోజర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జూ డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరీ మహ్మద్ అబ్దుల్ హకీం బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. వ్యప్రాణులకు అందించే ఆహారం, పానీయాలలోనూ మార్పులు చేసినట్లు చెప్పారు. రెగ్యులర్గా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. నిమోనియా వంటి వ్యాధులు సోకకుండా బీ కాంప్లెక్స్, కాల్షియం మందులు ఇస్తున్నట్లు తెలపారు. -
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ నెల 13న జరిగే ఫుట్బాల్ పోటీలో ప్రఖ్యాత ప్లేయర్ మెస్సీతోపాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటుండటంతో గురువారం డీజీపీ శివధర్ రెడ్డి,రాచకొండ సీపీ సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపులు, రవాణ సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, డీజీ స్వాతి లక్రా పాల్గొన్నారు. -
అపార్ట్మెంట్లో భారీ చోరీ
రూ. 70 లక్షల నగదు, నగలు మాయం మలక్పేట: ఓ కుటుంబం విహార యాత్రకు వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళాలు పలుగొట్టి లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేశారు. అల్మారాలోని రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు, బంగారు అభరణాలు 15 తులాలు, 4 కిలోల వెండిని దోచుకెళ్లారు. ఈ సంఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..అక్బర్బాగ్ డివిజన్ ప్రొఫెసర్స్ కాలనీలోని మానస అపార్ట్మెంట్లో మంత్రవాది వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.గతనెల 13న కుటుంబం విహార యాత్రకు వెళ్లి ఈనెల 10న రాత్రి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లిన తరువాత చోరీ జరిగినట్లు గమనించారు. వెనుకవైపు బాల్కనీ తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బాధితుడు బీరువాలో చూడగా పగులగొట్టి ఉంది. అల్మారాలో ఉన్న రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు 10 తులాలు, బంగారు గాజులు 2 తులాలు, బంగారు నాణేలు 3 తులాలు, 4 కిలోల వెండి కన్పించలేదు. దీంతో మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. వాచ్మెన్పై అనుమానం.. నేపాల్కు చెందిన అర్జున్ ఐదు నెలలు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేశాడు. భార్య నిర్మల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోదరి ఇంటికి వెళ్తున్నామని చెప్పి భార్యభర్తలు కలిసి బయటికి వెళ్లారు. భార్య అక్కడే ఉండి పోయింది. ఆ తరువాత వచ్చిన అతను నవంబర్ 25 తేదిన వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. నేపాల్కు వెళ్లిపోతున్నాని చెప్పి మరో వ్యక్తిని వాచ్మెన్గా కూడా పెట్టాడని అపార్ట్మెంట్ వాసులు పేర్కొంటున్నారు. అతడే దొంగతనానికి పాల్పడి ఉంటాడని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. -
అఖిలేష్ సభ కోసం..ఇదేం పని ?
సాక్షి, సిటీబ్యూరో: సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిల్యాదవ్తో సభ నిర్వహణకు షెడ్ వేసేందుకు ఆదర్శ్నగర్లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్లో చెట్లను తొలగించారు. ప్రజాప్రతినిధులు బస చేసే ఎమ్యెల్యే క్వార్టర్స్లో ఎవరైనా తెలియక చెట్లు నరికితే వారించాల్సింది పోయి.. సభా కార్యక్రమం కోసం చెట్లను నరికివేశారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో పారిశుద్ధ్య, ఇతరత్రా పనులు చేయించారు. షెడ్డు ఏర్పాటుకు అడ్డుగా ఉన్నందున కొమ్మలు తొలగించాల్సిందిగా కోరితే.. తాము కొమ్మలు మాత్రమే తొలగించామని.. పనులు చేశాక తమ సిబ్బంది వెళ్లిపోయాక ఒక చెట్టు మొదలు వరకు నరికినట్లు తమ దృష్టికి వచ్చినట్లు సంబంధిత యూబీడీ విభాగం అధికారి తెలిపారు. దీంతో సంబంధిత ఫారెస్ట్ విభాగానికి తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ఇద్దరు కాదు ఐదుగురు!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడిగా ఉన్న డాక్టర్ పి.వినయ్కుమార్ తదితరులను రూ.23.1 కోట్ల మేర మోసం చేసి, టాస్క్ఫోర్స్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పలపాటి సతీష్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తొలుత సతీష్తో పాటు ఆయన భార్య శిల్ప బొండ మాత్రమే నిందితులుగా ఉన్నారు. అయితే వీరి అరెస్టు తర్వాత వెలుగులోకి వచ్చిన పరిణామాలతో మరో ముగ్గురినీ ఆ జాబితాలో చేరుస్తూ సీసీఎస్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సతీష్ సోదరిలతో పాటు బావను నిందితులుగా చేరుస్తున్నట్లు సీసీఎస్ అధికారులు నాంపల్లి కోర్టుకు సమాచారం ఇచ్చారు. వీరిలో సతీష్, శిల్పలతో పాటు హిమబిందులను ఇప్పటికే అరెస్టు చేసిన సీసీఎస్ అధికారులు త్వరలో మరికొందరి పైనా చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. పథకం ప్రకారం షెల్ కంపెనీలు ఏర్పాటు... సతీష్ 2018లో పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, ఆ తర్వాత మూసేశాడు. సతీష్ తన సోదరి హిమబిందు, భార్య శిల్ప, స్నేహితుడు పువ్వల ప్రసేన్ కుమార్తో కలిసి భారీ స్కామ్కు కుట్ర పన్నారు. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా అనేక షెల్ కంపెనీలను తెరిచారు. 2019లో సతీష్, శిల్ప, ప్రసేన్కుమార్ పథకం ప్రకారం డాక్టర్ వినయ్కుమార్ను కలిసి తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని, కచ్చితంగా భారీ లాభాలు పంచుతామని చెప్పారు. నమ్మడంతో నట్టేట ముంచేసి... ఈ విషయం నమ్మిన వైద్యుడితో పాటు మరో ముగ్గురు ఆయన కుటుంబీకులకూ కలిపి విజయ్ శ్రావ్య ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు.వారు రూ.15.21 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ సంస్థలో వీరితో పాటు మరో ఇద్దరూ రూ.6.5 కోట్లు, రూ.1.39 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఈ బాధితుల నుంచి ప్రసేన్, శిల్పలు రూ.23.1 లక్షలు పెట్టుబడులు పెట్టించారు. బాధితుడితో పాటు ఆయన కుటుంబీకులకు ప్రసేన్, శిల్పలు 2023 జనవరి వరకు లాభాలు పంచారు. ఆపై ఎలాంటి సమాచారం లేకుండా ఆపేయడంతో వీరికి సందేహం వచ్చింది. ప్రసేన్ కుమార్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే సమాచారం బాధితుడికి అందింది. దీంతో ఆ ఏడాది ఏప్రిల్లో ఆయన్ను చూడటానికి బాధితుడు వెళ్లారు. ఆ సమయంలో ప్రసేన్ కుమార్ బాధితుడితో మాట్లాడుతూ శిల్ప బండతో పాటు సతీష్ ఉప్పలపాటి కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని, పథకం ప్రకారం తమ పెట్టుబడులను వాటిలోకి మళ్లించారని చెప్పాడు. సహకరించిన సోదరిలు, బావ... ఎట్టకేలను తాను మోసపోయానని గుర్తించిన వినయ్ కుమార్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సతీష్, శిల్పలపై కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన శిల్ప, సతీష్ను అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు స్కామ్లో హిమబిందు పాత్రను గుర్తించారు. గత నెల 8న ఆమెను అరెస్టు చేశారు. సతీష్, శిల్ప తప్పించుకోవడానికి, న్యాయపోరాటానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలూ మాధవితో పాటు బిందు భర్త భాగవతుల వెంకటరమణ అందించారు. కారు డ్రైవర్ శివానందంను బెదిరిస్తూ, అతడి ఫోన్ తమ ఆధీనంలో ఉంచుకుని సతీష్, శిల్పలు అనేక రాష్ట్రాల్లో తిరిగారు. చివరకు గత నెల 20న వీరి కదలికల్ని కర్ణాటకలో ఉన్న ధార్వాడలో గుర్తించిన సీసీఎస్ అధికారులు అరెస్టు చేసి తీసుకువచ్చారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే వీరి ఎస్కేప్తో పాటు మోసాల్లోనూ మాధవి, వెంకట రమణ పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో వీరినీ నిందితులుగా చేరుస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చారు. అంతు చిక్కని ‘విషం’ మిస్టరీ.. ప్రసేన్ కుమార్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే సమాచారం తెలిసిన డాక్టర్ వినయ్కుమార్ 2023 ఏప్రిల్లో వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంలోనే ప్రసేన్... సతీ ష్, శిల్పలు ఉద్దేశపూర్వకంగానే ఈ మోసానికి పాల్పడ్డారని, అంతేకాకుండా వాళ్లిద్దరే తనకు విషం పెట్టారని వివరించాడు. అదే నెల 24న ప్రసేన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అదే ఏడాది జూన్లో సతీష్ను కలిసిన వినయ్ కుమార్ తన డబ్బు విషయం ఆరా తీశారు. అప్పుడు నిధులను వివిధ షెల్ కంపెనీల్లోకి మళ్లించి, సొంతానికి వాడుకున్న విషయాన్ని సతీష్ అంగీకరించాడు. తన డబ్బు కోసం బాధితుడు ఒత్తిడి తీసుకురాగా.... చట్టపరంగా ముందుకు వెళ్లాలని చూస్తే ప్రసేన్కు పట్టిన గతే పడుతుంది బెదిరించాడు. ఈ అంశాలను సీసీఎస్ పోలీసులు తమ కేసులో ప్రస్తావించారు. సతీష్, శిల్పల వాంగ్మూలాల్లోనూ ప్రసేన్ విష ప్రయోగంతో చనిపోయారనే విషయం పొందుపరిచారు. ఆ విషం అతడికి ఇచ్చింది ఎవరు? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అనే అంశాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. శిల్ప, సతీష్ ( ఫైల్)ఉప్పలపాటి సతీష్ కేసులో పెరిగిన నిందితులు ఇప్పటికే సూత్రధారులు సహా ముగ్గురు అరెస్టు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిటీ సీసీఎస్ త్వరలో మరికొందరి పైనా చర్యలకు సన్నాహాలు -
భద్రతా వలయంలోభారత్ ఫ్యూచర్ సిటీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తిగా భద్రతా వలయంలో వెళ్లింది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025’ మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. దేశ, విదేశాలకు చెందిన ఫార్ూచ్యన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వెయ్యి సీసీ కెమెరాలతో 2,500 మంది పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక చుట్టూ వెయ్యి మంది పోలీసులతో మూడంచెల భద్రత, మరో 1500 మందితో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టనున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం ఉదయం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు పరిశీలించారు. విద్యుత్, మంచి నీరు, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ సహా ఏసీలు, 3డీ ఎల్సీడీ ప్రొజెక్టర్లు, లైటింగ్, సౌండ్ సిస్టం సహా రిసెప్షన్ కౌంటర్, ప్రధాన వేదికకు వచ్చిపోయే మార్గాలను పరిశీలించారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన మూడు హెలీప్యాడ్లు సహా వచ్చి పోయే మార్గాలను మరోసారి చెక్ చేశారు. ఇదే వేదికగా తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కృతం కాబోతున్న నేపథ్యంలో నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. సచివాలయం, అసెంబ్లీ సహా ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన మార్గాలు, మెట్రో పిల్లర్లతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల ముందు వీటిని ఏర్పాటు చేశారు. ఇటు శంషాబాద్ నుంచి తుక్కుగూడ, శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా మీర్ఖాన్పేట వరకు భారీ పోలీసు బందోబస్తును సిద్ధం చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు.. ప్రత్యామ్నాయ మార్గాలు సాక్షి, సిటీబ్యూరో: మీర్ఖాన్పేటలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు వచ్చే మార్గాల్లో సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఈమేరకు ఆయా మార్గాల్లో అతిథులు, ప్రముఖుల వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా పలు రహదారుల మళ్లింపులు, క్లోజ్లు ఉంటాయి. సాధారణ ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో ప్రధానంగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్హెచ్–765)లో వీడియోకాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ, నెహ్రూ ఔటర్ రోటరీ (ఎగ్జిట్ నంబరు–14), హర్షాగూడ, మహేశ్వరం గేట్, కొత్తూర్ క్రాస్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కొత్తూర్ క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ, ఔటర్ ఎగ్జిట్–15 మధ్య ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కాబట్టి వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఔటర్ నుంచి ఎన్హెచ్–765 మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్ (ఎగ్జిట్ నంబరు–14) వద్ద కాకుండా పెద్ద గోల్కొండ, ఓఆర్ఆర్ (ఎగ్జిట్–15) వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు. స్కాన్ చేసి.. పార్కింగ్ చేయ్.. భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద ఏడు ప్రాంతాల్లో పార్కింగ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ పార్కింగ్ ఏరియాకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కేటాయించారు. కోడ్ను స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రాంతం రహదారి మార్గాన్ని సూచిస్తుంది. రోడ్లకు ఇరువైపులా అనధికారికంగా వాహనాలను పార్కింగ్ చేయకూడదు. విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తు శంషాబాద్: గ్లోబల్ సమ్మిట్కు అతిథుల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తును సిద్ధం చేశారు. అతిథులను ఆహ్వానించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్, లాంజ్ ఏర్పాటు చేశారు. ఆర్జీఐఏ ఔట్పోస్టు ఇన్స్పెక్టర్ కనకయ్య ఆధ్వర్యంలో 24 గంటల పాటు అన్ని పాయింట్ల వద్ద బందోబస్తు కొనసాగుతోంది. అతిథుల కోసం ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. సిటీ ముస్తాబు మహా హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ముస్తాబైంది. సమ్మిట్కు హాజరయ్యే దేశ, విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ హంగులు, తెలంగాణ సాంస్కృతిక ఆకర్షణల, రంగురంగుల జెండాలు మేళవింపుతో నగరం స్వాగతం పలకనుంది. చారిత్రక కట్టడాలు, పర్యటక ప్రదేశాలు, చెరువులు, ప్రధాన రహదారులు. కూడళ్లు తదితర అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, కటౌట్లు, ఫ్లెక్సీలు, హైటెక్ ప్రొజెక్టర్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో నగరం తళతళా మెరిసిపోతోంది. ప్రధానంగా అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనం.. ఇలా నగరమంతటా ప్రత్యేక లైటింగ్తో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. హాజరు కానున్న దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సమాలోచనలు, సదస్సులు -
ఫుట్బాల్ మ్యాచ్కు సర్వం సిద్ధం
ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన ఉప్పల్: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి– 11.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనిల్ మెస్సీ–11 జట్లు ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర క్రీడల శాఖ చైర్మన్ శివసేనా రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకు రానున్న క్రీడాకారుడు మెస్సీకి భారీ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రాచకొండ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మెస్సీ రాకతో అనేక ఖండాల నుంచి దిగ్గజాలు వస్తున్నందున అదే తరహాలో భద్రత ఏర్పాట్లు ఉంటాయన్నారు. ప్రేక్షకులు ముందుగానే స్టేడియానికి వచ్చి సీట్లలో కూర్చోవాలని, తద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తొక్కిసలాటకు తావుండదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మెస్సీని చూడటానికి అవకాశం వచ్చినందున అందరూ సహకరించాలని సూచించారు. మంత్రుల వెంట హెచ్సీఏ ప్రతినిధి దిల్జీత్ సింగ్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, గోవింద్ రెడ్డి తదితరులున్నారు. -
కబళించిన పొగమంచు
● దారి కానరాక డివైడర్ను ఢీకొన్న కారు ● లాలాపేటలో ఇద్దరు యువకుల దుర్మరణం అడ్డగుట్ట: క్రికెట్ ప్రాక్టీస్ చేసేందుకు తెల్లవారుజామునే కారులో బయలుదేరిన నలుగురు యువకుల్లో ఇద్దరిని పొగమంచు రూపంలో మృత్యువు కాటేసింది. దట్టంగా ఆవరించిన పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో డివైడర్ కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం లాలాగూడ ఠాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. ఇన్స్పెక్టర్ రఘుబాబు చెప్పిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన ఆశ్రిత్రెడ్డి (22), బాలాజీ మణికంఠ శివసాయి (23), రాహుల్ (23), శ్రీకాంత్ (24)లు స్నేహితులు. వృత్తిరీత్యా ఐటీ ఉద్యోగులు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు మిత్రులు కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు తార్నాకలోని గ్రౌండ్కు కారులో బయలుదేరారు. ఆశ్రిత్రెడ్డి కారు నడుపుతుండగా పక్క సీటులో బాలాజీ మణికంఠ శివసాయి, వెనుక సీట్లలో రాహుల్, శ్రీకాంత్లు కూర్చున్నారు. మౌలాలి నుంచి తార్నాక వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున 6 గంటల సమయంలో భారీగా పొగమంచు కమ్ముకుంది. లాలాపేట ధోబీఘాట్ వద్ద కల్వర్ట్పై ఉన్న డివైడర్ పొగ మంచు కారణంగా కనిపించలేదు. దీంతో మౌలాలి బ్రిడ్జిపై నుంచి వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవ్ చేస్తున్న ఆశ్రిత్రెడ్డితో పాటు ముందు సీటులో కూర్చున్న బాలాజీ శివసాయి మణికంఠ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లలో కూర్చున్న రాహుల్, శ్రీకాంత్లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక లాలాగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. స్వల్ప గాయాలైన మరో ఇద్దరు మల్కాజిగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదాలకు నెలవుగా లాలాపేట కల్వర్టు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే లాలాపేట కల్వర్టు రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కల్వర్టుపై ఉన్న డివైడర్ సరిగా కనబడకపోవడంతో గతంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ, ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. ఇప్పటికై నా ట్రాఫిక్ పోలీసులు డివైడర్కు సరైన సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే బారికేడ్లయినా ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ప్రజలు సూచిస్తున్నారు. తద్వారా బ్రిడ్జిపై నుంచి వచ్చే వాహనాలు నెమ్మదిగా వస్తాయని, అప్పుడు ప్రమాదాలు కూడా తగ్గుతాయని పలువురు చెబుతున్నారు. లాలాపేట కల్వర్టుపై డివైడర్ను ఢీకొన్న కారుఆశ్రిత్రెడ్డి (ఫైల్) బాలాజీ శివసాయి మణికంఠ (ఫైల్) -
బాంబు.. బూచీ!
● ఈ ఏడాది ఆర్జీఐఏకి 18 సార్లు ఈ–మెయిళ్లు ● అత్యధికంగా గత నవంబర్, ఈ నెలలో పదిసార్లు ● ప్రయాణికులు, వైమానిక భద్రతాధికారులు బెంబేలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు బూటకపు బెదిరింపులుశంషాబాద్: బూటకపు బాంబు బూచీలు అటు వైమానిక భద్రతాధికారులు.. ఇటు విమాన ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడచిన ఏడాది కాలంగా ఇలాంటి సందేశాల సంఖ్య ఇంతకింతకూ రెట్టింపవుతుండటంతో ప్రయాణికులతో పాటు వైమానిక యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు 18 హాక్స్ (బూటకపు) మెయిల్స్ రావడంతో సైబరాబాద్ పోలీసు యంత్రాగం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. ఇప్పటి వరకు నలుగురిని రిమాండ్కు తరలించింది. ఎవరు.. ఎందుకు..? శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చే బాంబు బెదిరింపు ఈ– మెయిళ్లపై చేపడుతున్న దర్యాప్తులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తిగత సమస్యను కాస్తా భయాందోళనగా మార్చే ఉద్దేశాలు కొందరివైతే.. సమస్యను మరో వ్యక్తిపై నెట్టేందుకు యత్నించిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బాయ్ ఫ్రెండ్ పెళ్లికి అంగీకరించలేదని ఓ టెకీ ఏకంగా అతడి మెయిల్స్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ఎయిర్పోర్టులు. క్రీడా మైదానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ చేసింది. గుజరాల్ ఎయిర్ ఇండియా ఘటన సైతం తన ప్రియుడిపై మోపేందుకు చేసిన ఈ మెయిల్ గుట్టును గుజరాత్ పోలీసు యంత్రాంగం గుర్తించిన కేసులో శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు కూడా సదరు యువతిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వ్యక్తిగత ద్వేషాలతోనూ.. అదేవిధంగా ఎయిర్లైన్స్ ఉద్యోగులు తనతో సరిగా ప్రవర్తించలేదని ఒకరు. మతి స్థిమితం లేని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఓ మైనర్ బాలుడు.. ఇలా తమ వ్యక్తిగత ద్వేషాలను సంతృప్తి చేసుకునేందుకు కూడా ఇలాంటి థ్రెట్ మెయిల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ మెయిల్స్ ద్వారా కాకుండా వీటిని ప్రత్యేక యాప్ల ద్వారా పంపిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్బాల్లో ఇలాంటి మెయిల్స్ విదేశాల నుంచి కూడా పంపుతున్నారు. వరసగా వస్తున్న థ్రెట్స్ మెయిల్స్లో ఇటీవల ఒకే ఐడీతో పలుమార్లు వచ్చిన సందర్భాలను కూడా పోలీసులు శోధిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు ఇప్పటికే నాలుగు కేసుల్లో నలుగురిని రిమాండ్కు కూడా తరలించారు. విమానాలు వెనక్కి.. బెదిరింపు ఈ మెయిళ్ల ప్రభావం ఎంతగా ఉందంటే టేకాఫ్ తీసుకుని మార్గంమధ్యలో ఉన్న విమానాలు కూడా వెనక్కి మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొన్నింటిని సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు సైతం మళ్లించాల్సి వస్తోంది. తాజాగా ఈ నెల 6న మూడు అంతర్జాతీయ విమానాలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో కువైట్ విమాన్ని తిరిగి కువైట్కు తిప్పి పంపారు. నవంబర్ ప్రారంభం నుంచి ఇప్పటికు మొత్తం పదికిపైగా బాంబు థ్రెట్స్ మెయిల్స్ ఆర్జీఐఏ కస్టమర్ సపోర్ట్కు అందాయి. సుమారు ఆరుదేశీయ విమానాలు కూడా పక్కవిమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చింది. ఈ పరిణామాలు అటు ప్రయాణికులకు గంటల కొద్దీ ప్రయాణ భారంతో పాటు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటి కారణంగా ఎయిర్లైన్స్ సంస్థలు కూడా తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బెదింపులు వస్తే.. ఉరుకులు పరుగులే.. బాంబు థ్రెట్ మెయిల్స్ అందిన వెంటనే విమానాశ్రయంలోని భద్రతాధికారులు వెంటనే బీటీఏసీ (బాంబు థ్రెట్ అసెస్మెంట్ కమిటీ) డిక్లేర్ చేసి విస్తృతమైన తనిఖీలు షురూ చేస్తారు. బాంబు, డాగ్ స్క్వాడ్లతో అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని థ్రెట్ మెయిల్స్ ఉన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. బాంబు థ్రెట్ మెయిల్స్ను తీవ్రంగానే పరిగణిస్తున్నాం. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే నలుగురిని రిమాండ్కు తరలించాం. సైబర్క్రైమ్, ఇంటలిజెన్స్ విభాగాల సమన్వయంతో అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రక్రియ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికు వరకు దర్యాప్తు చేపట్టిన వాటిలో వ్యక్తిగత కారణాలు, మానసిక కారణాలతో కొందరు ఇలాంటి మెయిల్స్ పంపినట్లు గుర్తించాం. – బి.రాజేష్, శంషాబాద్ డీసీపీ -
ఓఆర్ఆర్పై లారీ, కారు ఢీ..
● తండ్రి, కూతురు మృతి ● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు పటాన్చెరు టౌన్: మేడ్చల్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ విజయ్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీశైలం, భార్య లక్ష్మి, కూతురు సుభిక్ష (4)తో పాటు వీరి దూరపు బంధువు తిరుపతి, అతడి భార్య జ్యోతిలక్ష్మి, వీరి కూతుర్లు శశిక, ధూవిక మొత్తం ఏడుగురు షిఫ్ట్ కారులో శనివారం రాత్రి మేడ్చల్ నుంచి తిరుపతి బయలుదేరారు. ఈ క్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు ఎగ్జిట్ – 2 సమీపంలో ఓఆర్ఆర్పై అదే మార్గంలో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుభిక్ష అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీశైలంను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. శ్రీశైలం భార్య లక్ష్మి, తిరుపతి, అతడి భార్య జ్యోతిలక్ష్మి, వీరి ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (ఇన్ సెట్లో) మృతులు శ్రీశైలం, సుభిక్ష (ఫైల్) -
సమాజ ఉన్నతికి జర్నలిజం తోడ్పడాలి
● మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి హిమాయత్నగర్: జర్నలిజం అనేది సామాజిక ధృక్పథం కలిగి ఉండి..సమాజం ఉన్నతికి తోడ్పడాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యక్షుడు ములుగు రాజేశ్వర్ రావు రచించిన ‘నేను–బహువచనం(ఆత్మకథ)’, ‘అధినాయక జయహే(కవితా సంకలనం)’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం సంఘం అధ్యక్షులు దాసు కేశవరావు అధ్యతక్షన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రాజేశ్వర్రావు రచనలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ తరపున 12 మంది ప్రముఖ జర్నలిస్టుల పుస్తకాలు ఆవిష్కరించనున్నట్లు శ్రీనివాస్రెడ్డి చెప్పారు. పత్రికలకు సంబంధించిన సుమారు 5 లక్షల పేజీలను ఆన్లైన్లో చూసేందుకు ఆకాడమీ ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.మోహన్ కందా మాట్లాడుతూ సమాజంలో మీడియాదే కీలక పాత్ర అని, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవర్లు, సీనియర్ జర్నలిస్టు జి.వల్లీశ్వర్, ఎమెస్కో సంపాదకులు డి.చంద్రశేఖర్ రెడ్డి, సంఘం కార్యదర్శి కె.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
నాలా ఆక్రమణలు తొలగించిన హైడ్రా
మియాపూర్: మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య విద్యాసంస్థ ప్రాంగణంలో ఉన్న నాలా ఆక్రమణలను హైడ్రా అధికారులు ఆదివారం తొలగించారు. నాలాను అక్రమించి నాలాలో పోసిన మట్టిని హైడ్రా సీఐ బాలగోపాల్ పర్యవేక్షణలో మియాపూర్ పోలీస్ బందోబస్తు మధ్య డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో తొలగించారు. నాలా విస్తరణకు అడ్డుగా ఉన్న క్రీడా మైదానంలో వాకింగ్ ట్రాక్ను కూడా తొలగించారు. మియాపూర్ పటేల్ చెరువు నుండి గంగారం చెరువుకు వెళ్లే నాలాను శ్రీ చైతన్య విద్యాసంస్థ అక్రమించి..మరో వైపు నుండి నాలాను మళ్లించి ప్రాంగణంలో ఉన్న నాలాలో మట్టి నింపారని ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు ఆదివారం ఆక్రమణలు తొలగించారు. ఈ క్రమంలో ఇది తమ స్థలమని, గతంలో నాలాకు దారి ఇచ్చామని, దానిని మరో పక్కకు మార్చి ఈ నాలాను పూడ్చామని చైతన్య కళాశాల యాజమాన్యం హైడ్రా సిబ్బందిని అడ్డుకున్నారు. ఎస్ఎన్డీపీ ధీరజ్, హైడ్రా సీఐ బాలగోపాల్, కళాశాల యాజమాన్యానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మియాపూర్ పీఎస్లో కేసు నమోదు నాలా ఆక్రమణకు పాల్పడిన శ్రీ చైతన్య విద్యాసంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులు శనివారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
లంగర్హౌస్: లంగర్హౌస్ పరిధిలోని టిప్పుఖాన్ వంతెనపై కారు పల్టీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్లో నివాసముండే జనార్దన్ వృత్తిరీత్యా రియల్ఎస్టేట్ వ్యాపారి. థార్ కారు కొని సంవత్సరం పూర్తి కావడంతో ఆదివారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుని దర్శనానికి వెళ్లాడు. అనంతరం స్నేహితులతో మద్యం తాగి నగరంలో వారిని వదిలి..లంగర్హౌస్ మీదుగా సాయంత్రం వికారాబాద్కు బయలుదేరాడు. టిప్పుఖాన్ బ్రిడ్జి పైకి రాగానే ముందు బ్రిడ్జి దారి చిన్నగా ఉండటంతో గమనించి కారును పక్కకు తిప్పే ప్రయత్నంలో పల్టీ కొట్టింది. దీంతో జనార్దన్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108కు ఫోన్చేయగా అంబులెన్స్తో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కాగా ఈ సమయంలో బాధితుడికి, 108 సిబ్బందికి చిన్న వాగ్వాదం జరిగింది. తన తల్లికి ఫోన్ చేయాలని బాధితుడు కోరగా..ముందు అంబులెన్స్ ఎక్కాలని సూచించారు. బాధితుడు తమ మాట వినడం లేదని 108 సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మాటమార్చి ఇది హైదరాబాద్ వాహనం కాదని, రంగారెడ్డి జిల్లా వాహనం అంటూ అక్కడి నుండి వాహనం తీసుకొని వెళ్లిపోయారు. చివరకు లంగర్హౌస్ పోలీసులు అక్కడకు చేరుకొని బాధితుడిని గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆటోలో తరలించారు. పల్టీ కొట్టిన కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన 108 సిబ్బంది స్థానికుల ఆగ్రహం -
పోలీస్ రవాణా విభాగంలో మెరుగైన వసతులు : డీజీపీ
అంబర్పేట: పోలీస్ రవాణా విభాగంలో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం అంబర్పేట సీపీఎల్లో ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన పెట్రోల్ పంపు నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ పోలీస్ సేవల్లో రవాణా వసతులు ఎంతో కీలకమన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ విభాగంలో ఉన్న రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.51 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. పోలీస్ విభాగం వాహనాలతో పాటు పోలీస్ సిబ్బందికి ఇక్కడ నిర్మించనున్న పెట్రోల్ పంపు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐజీ డాక్టర్ ఎం.రమేష్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధులు పియూష్ మిట్టల్, బద్రినాథ్, ముత్తుకుమారన్ తదితరులు పాల్గొన్నారు. -
యాక్సిస్ బ్యాంక్కు రూ.11.74 కోట్లు టోకరా
సాక్షి, సిటీబ్యూరో: వ్యాపార విస్తరణ కోసమంటూ యాక్సిస్ బ్యాంక్ నుంచి టర్మ్ లోన్ తీసుకున్న కీర్తి శ్రీనివాస సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్ఎస్పీఎల్) సంస్థ అందులో భారీ మొత్తాన్ని దారి మళ్లించింది. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఈ విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సదరు సంస్థతో పాటు డైరెక్టర్లుగా ఉన్న టి.బాలాజీ, పి.అనిల్ కుమార్లపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేఎస్ఎస్పీఎల్ సంస్థకు హైదరాబాద్లోని బేగంపేటలో కార్యాలయం ఉండగా... బెంగళూరులో మూడు రెస్టారెంట్లు ఉండేవి. యాక్సిస్ బ్యాంక్ ఈ సంస్థకు 2017లో రూ.14.15 కోట్ల టర్మ్ లోన్ మంజూరు చేసింది. ఇందులో కొంత మొత్తాన్ని ఆ సంస్థ చెల్లించినా... రూ.11.74 కోట్లు బకాయి పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్యాలయంతో పాటు రెస్టారెంట్లు మూతపడినప్పటికీ రుణానికి సంబంధించిన చెల్లింపులు కొనసాగాయి. ఏప్రిల్ 16 నుంచి కేఎస్ఎస్పీఎల్కు సంబంధించిన ఖాతా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ జాబితాలోకి వెళ్లిపోయింది. దీంతో యాక్సస్ బ్యాంక్ ఈ సంస్థ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది. ఈ నేపథ్యంలోనే కేఎస్ఎస్పీఎల్ సంస్థ ఎస్ఎస్ఎస్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్, శ్రీ రాధే ట్రేడర్స్తో లావాదేవీలు జరిపినట్లు నకిలీ ఆధారాలు చూపినట్లు తేలింది. ఆ లావాదేవీల్లో భాగంగా ఈ రెండు సంస్థలకు చెందిన ఖాతాల్లోకి బదిలీ చేసిన రూ.6.26 కోట్లు, రూ.64 లక్షలు తిరిగి కేఎస్ఎస్పీఎల్ డైరెక్టర్లుగా ఉన్న టి.బాలాజీ, పి.అనిల్కుమార్లకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లినట్లు తేలింది. కేఎస్ఎస్పీఎల్ సంస్థ నకిలీ ఇన్వాయిస్లతో మరో రూ.4.16 కోట్లను బోగస్ సంస్థల పేరుతో మళ్లించినట్లు బయటపడింది. దీంతో కేఎస్ఎస్పీఎల్ సంస్థకు అనేక నోటీసులు జారీ చేసిన యాక్సస్ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు అందించాల్సిందిగా కోరినా స్పందించలేదు. ఎట్టకేలకు మోసం జరిగినట్లు నిర్థారించిన యాక్సిస్ బ్యాంక్ పోలీసులను ఆశ్రయించడానికి నిర్ణయించింది. బేగంపేటలోని మెగా హోల్సేల్ బ్యాంకింగ్ సెంటర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వరుణ్ కుమార్ కేఎస్ఎస్పీఎల్ సంస్థతో పాటు డైరెక్టర్లుగా ఉన్న టి.బాలాజీ, పి.అనిల్ కుమార్లపై సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గత వారం కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ గుర్రం అనిల్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఇది గుర్తించిన అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో ఫిర్యాదుతో కేసు నిందితుల జాబితాలో ఇద్దరు డైరెక్టర్లు సైతం -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని దుర్మరణం
మేడిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సిరిసిల్ల పట్టణం శివానగర్కు చెందిన దాసరి భాస్కర్ కుమార్తె హాసిని (18) ఘట్కేసర్ మండల పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతూ..హాస్టల్లో ఉంటోంది. శనివారం తన స్నేహితుడు అక్షయ్తో కలిసి బైకుపై ఉప్పల్కు వెళ్లారు. తిరిగి రాత్రి రెండు గంటల సమయంలో ఘట్కేసర్ వైపు వస్తుండగా నారపల్లి సమీపంలో బైకు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న హాసిని కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్పగాయాలైన అక్షయ్ని సికింద్రాబాద్లోని ఓ ప్రయివేట్ అసుపత్రిలో చేర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గప్‘చిప్’ దోపిడీ!
ఎలక్ట్రానిక్ కాంటాల్లో ‘రిమోట్’ కంట్రోల్ ఇప్పటి వరకు పెట్రోల్ బంకుల్లోని ఫ్యూయల్ డిస్పెన్సింగ్ యంత్రాల్లో స్మార్ట్, ఎలక్ట్రానిక్ చిప్లను అమర్చి రిమోట్తో తూకం కొలతలను కంట్రోల్ చేస్తుండగా.. తాజాగా పండ్ల, చేపల మార్కెట్లలో కొందరు వ్యాపారులు ఎలక్ట్రానిక్ డిజిటల్ తూకంలో సైతం సరికొత్త రిమోట్ విధానం అవలంబిస్తున్నారు. మార్కెట్లలో చిన్న ఎలక్ట్రానిక్ కాంటా నుంచి వేయింగ్ యంత్రాల వరకు తూకంలో కనీసం 50 గ్రాముల నుంచి 10 కేజీల వరకు తూకంలో వ్యత్యాసం వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: వినియోగదారులు తప్పుడు తూకంతో నిత్యం నిలువు దోపిడికి గురై మోసపోతూనే ఉన్నారు. సాధారణంగా వీధిలో గల చిన్న కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్కో వెళ్లి ఏది కొన్నా.. తక్కువ తూకమే. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసుపై తూకం వేసి ఇవ్వడంతో కళ్ల ముందు కనిపించే రీడింగ్ డిస్ప్లే చూసి అంతా సవ్యంగానే ఉందనుకుంటాం. కానీ ఇక్కడే కనిపించని మోసానికి గురికాక తప్పడం లేదు. అసలు సాధారణ త్రాసుల కన్నా ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసులతో మరింత సులువుగా తక్కువ తూకం అందించి దోచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే ఆప్షన్లు మార్చే విధానాన్ని ప్రయోగించిన అక్రమ బడా వ్యాపారులు తాజాగా చేతివాటం బయట పడకుండా సరికొత్త రిమోట్ కంట్రోల్ మోసానికి తెరలేపడం విస్మయానికి గురిచేస్తోంది. మదర్బోర్డులో చిప్స్ అమర్చి ఎలక్ట్రానికి కాంటాల మదర్ బోర్డులో చిప్లను ఏర్పాటు చేయించి రిమోట్ ద్వారా తూకం బరువును హెచ్చు తగ్గులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వినియోగదారుడికి అనుమానం వచ్చి బరువు పెట్టి పరిశీలించినా తూకం మోసం బయట పడకుండా రిమోట్తో బరువును మెయింటెన్ చేస్తున్నారనే ఆరోపణలు వినివస్తున్నాయి. హైదరాబాద్ బాచుపల్లి కేంద్రంగా ఒక ముఠా అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక చిప్లు దిగుమతి చేసుకొని ఎలక్ట్రానికి డిజిటల్ వేయింగ్ మిషన్ మదర్బోర్డులో చిప్లు అమర్చి డిస్ప్లే మీటర్ను రిమోట్తో కంటోల్ చేసేలా ట్యాంపరింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పండ్ల, చేపల మార్కెట్ వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలను ట్యాంపరింగ్ చేసుకొని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి కిలోకు 100– 150 గ్రాములు ఎక్కువగా.. ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ కాంటాపై పది కిలోల బరువు గల బాట్ వేసి తూకం పెట్టి పరిశీలిస్తే..11 కిలోల డిస్ప్లే అయ్యేది. వాస్తవంగా ఎలక్ట్రానిక్, డిజిటల్లో ఉన్న నాలుగు ఆప్షన్లలో ఒకదానిలో కిలోకు 100 నుంచి 150 గ్రాములు తక్కువగా సెట్టింగ్ చేసేవారు.. ఉదాహరణకు ఆ ఆప్షన్న్ నొక్కి ఎలక్ట్రానిక్ మిషనన్పై 850 నుంచి 900 గ్రాముల బరువు పెడితే 1000 గ్రాములు (కిలో) తూకం డిస్ప్లే అవుతోంది. అదే మిషన్పై వాస్తవంగా కిలో బరువు పెడితే 1100 నుంచి 1150 గ్రాములు డిస్ప్లే అవుతోంది. అంటే ప్రతి కిలోకు 100 నుంచి 150 గ్రాముల వరకు చేతివాటానికి పాల్పడుతున్నారన్నమాట. 5 కిలోలు తీసుకుంటే 500 నుంచి 750 గ్రాముల వరకు కత్తెర వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. వినియోగదారులకు అనుమానం వచ్చి సమాన బరువు పెట్టి పరిశీలిస్తే మాత్రం ఎక్కువ బరువు డిస్ప్లేపై కనిపించి చేతివాటం బయటపడుతుండటంతో రిమోట్ మోసానికి తెర లేపినట్లు అవగతమవుతోంది. ఈ విషయంపై తూనికలు, కొలతల అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రెటో బంకుల తరహాలో డిజిటల్ మదర్బోర్టులో ప్రత్యేక చిప్ మార్కెట్లలో చిన్న ఎలక్ట్రానిక్ డిజిటల్ త్రాసు నుంచి వేయింగ్ మిషన్ వరకు 50 గ్రాముల నుంచి 10 కేజీల వరకు తూకం మోసాలు అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక చిప్ల దిగుమతి బాచుపల్లి కేంద్రంగా ఎలక్ట్రానిక్ త్రాసుల ట్యాంపరింగ్


