హాస్టల్, హోటల్లో అగ్ని ప్రమాదాలు
ముషీరాబాద్ గాంధీనగర్లోని ఓ హాస్టల్, బంజారాహిల్స్లోని ఓ హోటల్లో గురువారం అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిక్కడపల్లి : గాంధీనగర్లో సుధామ పీజీ ఉమెన్స్ హాస్టల్లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగినప్పడు హాస్టల్లో మ్గుగురు విద్యార్థులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అర్పి వేశారు. ప్రమాదం జరిగినపుడు మొదటి ఫ్లోర్లో ఉన్న ఇద్దరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. రెండో అంతస్తు మంటల్లో చిక్కుకున్న ఓ విద్యార్థిని ఇద్దరు యువకులు సాహసోపేతంగా బయటికి తీసుకొచ్చి రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో విద్యార్థినుల సర్టిఫికెట్లు మొత్తం కాలిపోయాయి. అగ్ని ప్రమాదం గీజర్ వల్లే జరిగిందని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య, చిక్కడపల్లి ఏసీపీ రమేష్కుమార్ తెలిపారు. యువతిని కాపాడిన ఆంజనేయులు, అరుణ్లను పోలీసులు అభినందించారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ముఠాగోపాల్ పరిశీలించారు.
హోటల్లో ..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్–3లోని లెవెంట్ హోటల్లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిమ్నీలో నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు రావడంతో స్థానికులు భయాభ్రాంతులకు గురయ్యారు. హోటల్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు.అగ్నిమాపక సిబ్బంది గంటపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. కొంత ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నాంపల్లి ఘటనతోనైనా అధికారులు మేల్కొనలేదు. బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం జరిగిన లెవెంట్ హోటల్కు ఫైర్ సేఫిటీ లేదని అధికారులు గుర్తించారు. ఎంట్రీ సరిగా లేదు. కిచెన్ పరిస్థితి భయానకంగా ఉంది.


